నేడు ఏపీ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ వర్షం పడుతున్నప్పుడు బయటకు రావొద్దని హెచ్చరించింది. అదేవిధంగా విజయనగరం,శ్రీకాకుళం,విశాఖ,మన్యం, రాయలసీమ,తూర్పుగోదావరి తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, పల్నాడు జిల్లాలోని అమరావతి, పెదకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 73 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.