Nimmala Ramanaidu: జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం: మంత్రి నిమ్మల
పనులు అప్పగించి, అవి పూర్తికాకుండానే నిధులు కట్టబెట్టారని విమర్శ;
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు విషయమై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు హడావిడిగా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని విమర్శించారు. పనులు అప్పగించి, అవి పూర్తికాకుండానే నిధులు కట్టబెట్టారని ఆరోపించారు. 10 క్యూసెక్కులు కూడా లేకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్సవం అంటూ ఊదరగొట్టారని మండిపడ్డారు. ఒక్క గ్రామానికి కూడా పునరావాస కాలనీలు నిర్మించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత టీడీపీ పాలనలో ప్రాజెక్టుకు రూ. 1,373 కోట్లు కేటాయించి, రూ.1,319 కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ ప్రాజెక్టుకు వెళ్లినా జగన్ విధ్వంసమే కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారు..
మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. వెలిగొండ పూర్తయితే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, తాను అధికారంలోకి వస్తే ఏడాదిలోగా వెలుగొండ పూర్తి చేస్తానన్న జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, పరిహారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం చేసి జిల్లా ప్రజల్ని జగన్ మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014 -19 లోనే మెజార్టీ పనులు పూర్తి చేశామని, జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. ‘వెలిగొండ ప్రారంభించింది సీఎం చంద్రబాబు నాయుడే.. పూర్తి చేసేది చంద్రబాబు నాయుడే’ అని అన్నారు. త్వరితగతిన వెలిగొండ పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, ప్రకాశం జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.