AP Rains Alert: ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు
పలు చోట్ల రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు;
ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అప్రమత్తం చేశారు. నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో వానలు పడతాయని చెప్పారు.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మంగళవారం లోగా అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గుర్తించింది. తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ దిశగా కదులుతుందని, తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, నిన్న ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయి.