మొన్నటివరకు అధికారపక్షంగా ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావటంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా సాధించలేదు. దీంతో శాసన సభలో సీన్ పూర్తిగా మారింది. ప్రతిపక్ష నేతగా కూడా మాజీ సీఎం జగన్ కు అవకాశం దక్కలేదు. దీంతో గతంలో టీడీపీ నుంచి వైసీపీకి మద్దతిచ్చిన వారికి కేటాయించిన సీట్లనే ప్రస్తుతం వైసీపీకి కేటాయించారు.
అప్పట్లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. జనసేన ఒక స్థానం గెలుచుకోగా అప్పట్లో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ నుంచి ఇరువురు, జనసేన తరపున గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీకి మద్దతు పలికారు. అయితే టీడీపీకి 21 మంది సభ్యులు ఉండటంతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఐతే.. 2024 లెక్కల ప్రకారం.. ప్రస్తుత సభలో వైసీపీకి మాట్లాడే అవకాశం కూడా తక్కువే.
ప్రధాన ప్రతిపక్షంగా 21 సీట్లతో జనసేన ముందుంటే తరువాత వైసీపీ, ఆపై 8 సీట్లతో బీజేపీ వరుస స్థానాల్లో ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశీనులయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాజీ సీఎం జగన్ సీటును కైవసం చేసుకున్నారు. ప్రస్తుత సభలో ప్రమాణ స్వీకారానికి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు రాలేదు. మంత్రుల తరువాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశమివ్వాలని కోరిన జగన్.. ప్రక్రియ ముగిసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు.