కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పులివెందుల అసెంబ్లీ స్థానానికి సీఎం జగన్ (CM Jagan) పోటీలో ఉండగా, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల (Sharmila) బరిలో నిలిచారు. వీరిద్దరిలో విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఆమె ఎవరి తరఫునైనా ప్రచారం చేస్తారా? లేదా సైలెంట్గా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో కలిసి పనిచేసిన అన్నాచెల్లెళ్లు ఈసారి వేర్వేరు పార్టీల తరఫున బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
2009 ముందు వరకు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009లో వైఎస్ జగన్ మొదటిసారి కడప ఎంపీగా గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే. ఆ తరువాత కడప లోక్సభ వైసీపీకి కంచుకోటగా మారింది. ఆమాటకొస్తే.. కడప జిల్లాలో ఇప్పటికీ వైఎస్ కుటుంబానికే పట్టు ఉంది.
ఇక మరోవైపు షర్మిల ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాసినాయన మండలం ఆమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభిస్తారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుండటంతో అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.