మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీతా రెడ్డి నివాళులర్పించారు. తన భర్త రాజశేఖర్రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లిన సునీత ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు కడపలోని జయరాజ్ గార్డెన్లో నేడు వివేకా వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివేకా ఆత్మీయులు హాజరుకానున్నారు.
వైఎస్ వివేకానంద 5వ వర్ధంతి సందర్భంగా నేడు ఆయన కూతురు సునీత కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వివేకా ఆత్మీయులతో ఇవాళ భేటీ కానున్నారు. సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల బరిలో నిలుస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం జగన్పై సౌభాగ్యమ్మ ఓ ఇంటర్వ్యూలో విమర్శించారు. వివేకా హత్య గురించి ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జగన్కు ఓటేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.