SC: సుప్రీంకోర్టు తీర్పులో ఏముందంటే...?
ద్విసభ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు.... జస్టిస్ బోస్.. జస్టిస్ త్రివేది తీర్పు ఏంటంటే;
స్కిల్ కేసులో ఏపీ సీఐడీ నమోదు చేసిన FIRను కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్లింది. గవర్నర్ అనుమతి తీసుకోకుండా నమోదుచేసిన ఈ కేసును..కొట్టివేయాలన్న చంద్రబాబు పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది. C.I.D 17A నిబంధనలు ఉల్లంఘించిందని జస్టిస్ బోస్ తీర్పు వెలువరించగా చట్టసవరణ తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే 17A వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు.
స్కిల్ కేసులో ఏపీ సీఐడీ నమోదుచేసిన కేసును కొట్టివేయాలన్న తన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలుచేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది. గత ఏడాది అక్టోబర్లో విచారణ జరిపి అదే నెల 17న తీర్పు రిజర్వ్చేసిన జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది వేర్వేరు తీర్పులను వెలువరించారు. అవినీతి నిరోధక చట్టం-1988కి 2018లో సవరణ ద్వారా సెక్షన్ 17A తీసుకొచ్చారని, ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత విచారణ అందుకు అనుగుణంగానే జరపాలని జస్టిస్ బోస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి తప్పుచేశాడని భావిస్తే అవినీతి నిరోధక చట్ట ప్రకారం తగిన అనుమతులు తీసుకుని దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందన్నారు. అలా జరగని పక్షంలో అది చట్ట విరుద్దం అవుతుందన్నారు. చట్ట ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోనందున చంద్రబాబుపై ఆయా సెక్షన్ల కింద తదుపరి చర్యలు తీసుకునే అధికారం లేదని జస్టిస్ బోస్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తు చేసుకుని అందుకు తగిన అనుమతి పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10న ట్రయల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయడానికి నిరాకరించారు.రిమాండ్ ఆర్డర్ను జారీ చేసే అధికారం ట్రయల్ కోర్టుకు ఉందన్నారు. FIRలో IPC సెక్షన్ల కింద పెట్టిన కేసుల విచారణార్హతను సవాలు చేస్తూ ట్రయల్ కోర్టు ముందు దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛను చంద్రబాబుకు ఇస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ను.... పాక్షికంగా అనుమతిస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు.
జస్టిస్ బోస్ తీర్పుతో ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది విభేదించారు. సెక్షన్ 17A నిబంధన చంద్రబాబు విషయంలో వర్తించదని అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టానికి 2018లో భారీ సవరణలు చేశారని తెలిపారు. సవరించిన., కొత్తగా చేర్చిన సెక్షన్ల ప్రకారం 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ 17A వర్తిస్తుందని పేర్కొన్నారు. సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతి ఆవశ్యకతను విధానపరమైన స్వభావంతో కాకుండా వాస్తవికంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా చట్టానికి సవరణలు చేసినప్పుడు ఆ చట్టం అమలు తేదీ ఖరారు అవుతుందని, ఆ తర్వాత జరిగే నేరాలకు మాత్రమే అది వర్తిస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన వాటికి కూడా అన్వయించుకోవడం సరికాదన్నారు.
హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ చంద్రబాబు పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు ఇవ్వడంతో ఈ కేసులో తదుపరి చర్యల కోసం..చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ముందుకు పంపాలని ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ద బోస్ రిజిస్ట్రీని ఆదేశించారు.