ఏపీ సీఎం జగన్ను మహాత్మా గాంధీతో పోల్చడంపై నెల్లూరులో నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ నెల్లూరు నగర ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి... నగరంలోని గాంధీ విగ్రహాన్ని సుగంద ద్రవ్యాలతో శుద్ధి చేశారు. గాంధీ బొమ్మకు పొర్లు దండాలు పెట్టి మన్నించు మహాత్మా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులు, మంత్రులపై మండిపడ్డారు. మహాత్మా మళ్లీ పుట్టారు అనడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లా రామకృష్ణా రెడ్డి మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరుతున్నానని ఆయన చెప్పారు. గాంధీ జాతిపిత... జగన్ అవినీతి పితా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అక్రమాల కేసుల్లో జగన్ ఏ1 ముద్దాయి అని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. జగన్ పాలనలో రైతులు హాహాకారాలు పెడుతున్నారని, మద్యం రేట్లు పెంచి డబ్బు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.