JAWAN: దేశ రక్షణలో తెలుగు జవాన్ వీర మరణం
పోరాడుతూ వీర మరణం పొందిన మురళీనాయక్;
భారత్-పాకిస్థాన్ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ దాయాది దేశం బరి తెగిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేశాయి. అయితే జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విషాదం నెలకొంది. పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు. మురళీనాయక్ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా. నేడు ఆ వీరుడి పార్థివ దేహం సొంత ఊరికి తీసుకురానున్నారు. మురళీ నాయక్ మరణంతో తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీ బాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మురళీనాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పుట్టి పెరిగారు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివారు. మురళి మరణంతో కుటుంబంలో, సొంత ఊరిలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. మురళీ నాయక్ మృతిపై ఇండియన్ ఆర్మీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
వీరుడా వందనం...
తెలుగు జవాన్ మురళినాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ' దేశ రక్షణలో మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. 'ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మురళి నాయక్ వీరమరణం పొందడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం.” అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. తెలుగు జవాన్ మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దేశ భద్రతలో ప్రాణాలను పణంగా పెట్టిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలే మన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కూడా మురళీ నాయక్కు నివాళులు అర్పించారు.