YCP: ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతున్న వైఎస్సార్ ఆత్మీయులు
జగన్ వైఖరి భరించలేక వరుస రాజీనామాలు.... జగన్పై సన్నిహితుల తిరుగుబావుటా;
సన్నిహితులు, కుటుంబ సభ్యుల్లా మెలిగినవారు, వైఎస్ఆర్కి ఆత్మీయుల్లాంటి నేతలు ఒక్కొక్కరుగా....జగన్ వైఖరిని భరించలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీని వీడారు. పవన్కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టికెట్ విషయంలో జగన్ నుంచి హామీ రాకపోవడంతో పాటు పార్టీలో గుర్తింపు లేకపోగా... అవమానిస్తుండటంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జగన్పై తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి సరసన బాలశౌరి చేరారు. తొలుత YS విజయమ్మను కలిసి... ఆ తర్వాతే పార్టీని వీడాలనుకున్నారు. శనివారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడంతో రాజీనామా విషయంలో ఆయన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తేనే......జనసేన తరపున పోటీ విషయంపై స్పష్టత ఇచ్చేందుకు అవకాశం ఉందని పవన్ కల్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే బాలశౌరి రాజీనామా నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయంతో జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్యాదవ్, గాదె వెంకటేశ్వరరావు గుంటూరులో ఆయన నివసానికి శనివారం రాత్రి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఢిల్లీలో విందు ఇచ్చారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి తప్ప మిగిలిన వారు ఈ విందుకు హాజరయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం జగన్...బాలశౌరి పట్ల అవమానకరంగా మాట్లాడినట్లు వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. సహచర ఎంపీలుగా ఆహ్వానిస్తే వెళ్లామని... పైగా అన్ని పార్టీల ఎంపీలు వచ్చారని, తాను వ్యక్తిగతంగా వెళ్లలేదని బాలశౌరి చెప్పేందుకు ప్రయత్నించినా జగన్ వినిపించుకోలేదని సమాచారం. అదే రేవంత్రెడ్డి మంత్రివర్గంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయవాడకు వస్తే మాత్రం సీఎం జగన్ ఎంపీ మిథున్రెడ్డిని ఆయన వద్దకు పంపి... అతిథి మర్యాదలు చేయించి వీడ్కోలు పలికారు.
సిట్టింగ్ ఎంపీ బాలశౌరి ఉన్నా.. ఆయనతో సంబంధం లేకుండా మచిలీపట్నం లోక్సభ స్థానానికి కొత్త సమన్వయకర్తను తీసుకువచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీను వీడకముందు ఆయన్ను మచిలీపట్నానికి వెళ్లాలని చెప్పారు. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో బాలశౌరి కొంతకాలంగా అసంతృప్తితో వైసీపీలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అలాగే మచిలీపట్నం ఎంపీగా బాలశౌరికి, స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానికి మధ్య విభేదాలున్నాయి. కమ్యూనిటీహాలు పనుల పరిశీలనకు ఎంపీ వెళ్లినప్పుడు ఆయన్ను నాని మనుషులు అడ్డుకుని రచ్చ చేశారు. ఎమ్మెల్యే వర్గీయులు ఎంపీపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేశారు. కానీ విభేదాలు వీధికెక్కినా వైసీపీ అధిష్ఠానం స్పందించలేదు.
చంద్రబాబు, పవన్కల్యాణ్లను బూతులూ తిట్టాలి.. వ్యక్తిగత విమర్శలూ చేయాలని నరసరావుపేట, ఒంగోలు ఎంపీలకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లే...... బాలశౌరికీ సీఎం జగన్ టార్గెట్ పెట్టారట. అంతేకాక...తిట్టిన వీడియోలను ఎప్పటకప్పుడు తన కార్యాలయంలో సమర్పించాలని చెప్పారని తెలిసింది. పైగా ఎప్పుడు ఎక్కడ ఎదురుపడినా ఏంటి నువ్వు ఇంకా తిట్టలేదు.. అలాంటి వీడియోలేవీ రాలేదు.. అని నేరుగా జగనే నిలదీస్తున్నారని తెలిసింది. బాలశౌరి ప్రతిపక్ష నాయకులను తిట్టకపోయేసరికి జగన్కు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. జగన్ జైల్లో ఉన్నపుడు, ఆయన పాదయాత్ర సమయంలో పూర్తిగా వెన్నంటి ఉండడమే కాకుండా పార్టీ బలోపేతానికి ఆర్థికంగానూ బాలశౌరి తోడ్పాటునందించారు.