వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో చేరిన మహిళ పరిస్థితి విషమించి చనిపోయింది. ఇందుకు ఇంజక్షన్ వికటించడమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. బెల్లంపల్లిలోని రడగంబాల బస్తీకి చెందిన మంతెన భాగ్యలక్ష్మి (40)కి బుధవారం ఉదయం నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్, సిబ్బంది భాగ్యలక్ష్మికి ట్రీట్మెంట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత రెండో డోస్ ఇంజక్షన్ ఇచ్చారు. తర్వాత భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా మారడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. దీంతో భాగ్యలక్ష్మి మృతదేహాన్ని తిరిగి బెల్లంపల్లి హాస్పిటల్కు తీసుకొచ్చారు. భాగ్యలక్ష్మి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ రేణుకుంట్ల ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు హాస్పిటల్కు చేరుకొని సూపరిండెండెంట్ రవికుమార్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బెల్లంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ అఫ్జలొద్దీన్, టూ టౌన్ ఎస్సై డి. రమేశ్ సైతం హాస్పిటల్ వద్దకు వచ్చారు. బెల్లంపల్లి హాస్పిటల్లో పోస్ట్మార్టం చేయొద్దని మృతురాలి బంధువులు పట్టుబట్టడంతో మంచిర్యాల హాస్పిటల్కు తీసుకెళ్లారు. భాగ్యలక్ష్మి భర్త లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఇన్స్పెక్టర్ అఫ్జలొద్దీన్ తెలిపారు.