Firecracker Explosion in Puri : పూరీలో బాణాసంచా పేలి.. ఒకరు మృతి, 15మందికి గాయాలు
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో బాణాసంచా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో 15 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో నిర్వహించిన జగన్నాథుడి చందన జాతర కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
జాతరలో భాగంగా కొందరు భక్తులు పటాసులు పేల్చారు. ప్రమాదవశాత్తు ఆ నిప్పురవ్వలు సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన ప్రాంతంలో పడ్డాయి. దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆధికారులను ఆదేశించారు.