అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ‘మాకేమీ అక్కర్లేదు.. మీ ప్రేమ చాలని చెప్పిన మనిషి కేసీఆర్. విద్యుత్పై రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక విధానమే లేదు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసింది. గత ప్రభుత్వ పరిపాలనలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మీరేం చేశారో చూశాకే ప్రజలు తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ కు అసెంబ్లీలో వచ్చిన మెజార్టీ లోక్సభ ఎన్నికల్లో రాలేదు. లోక్సభలో గుండుసున్నా దక్కినా తీరు మారకుంటే ఎలా?ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మాట్లాడాలని కోరుతున్నా’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను సమర్థిస్తున్నట్లు తెలిపారు. ‘విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడాం. మోదీ సర్కారుపై తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశాం. రాష్ట్ర హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతాం. యాచిస్తే ఏమీ రాదు.. శాసించి సాధించుకోవాలి. ఢిల్లీ తత్వం ఇంతకాలానికి కాంగ్రెస్కు తెలిసి వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకేం ఇబ్బంది? . బీజేపీతో మాకు చీకటి ఒప్పందాలు ఏమి లేవు. కేంద్ర వివక్షను ఎండగట్టడంలో మేం సహకరిస్తాం. గతంలో కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశాం. రేవంత్ రెడ్డి కష్టపడే ఈ స్థాయికి చేరుకున్నారు. చిన్నవయసులోనే సీఎం అయ్యారు. కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకూ మేం మద్దతివ్వలేదు. కేసీఆర్ను కాదు.. ధైర్యముంటే మోదీని తిట్టండి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుంటే మేమేం చేస్తాం?’ అని కేటీఆర్ తెలిపారు.