అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తొలుత సీఎం చాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. అక్కడే కూర్చుని సీఎం క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అయితే మార్షల్స్ వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు. దీంతో అసెంబ్లీ ముందు కూర్చుని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సభ నుంచి వాకౌట్
అంతకుముందు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో తమకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని అందరికి మైక్ ఇస్తాం కానీ ఎస్సీ వర్గీకరణపై మాత్రమే మాట్లాడాలని కోరారు. దీంతో వి వాంట్ జస్టిస్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.