TS : 13 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-05-15 05:32 GMT

లోక్‌సభ ఎన్నికల్లో 6-7 స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌‌కు 13 స్థానాలు వస్తాయని ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నారు. సికింద్రాబాద్‌లో గతం కంటే పోలింగ్ మెరుగైందన్న సీఎం.. తమ అభ్యర్థి దానం నాగేందర్‌కు కనీసం 20వేల మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కేంద్రంలో బీజేపీకి 220కు పది అటో, ఇటో వస్తాయని రేవంత్ అంచనా వేశారు.

ఇక రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్నటితో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయన్న ఆయన.. రేపటి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానన్నారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, సన్నబియ్యం పంపిణీపై సమీక్షిస్తానని చెప్పారు. ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా రుణం పొంది రుణమాఫీ చేస్తామని సీఎం వివరించారు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారితో సత్సంబంధాలే ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇరు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News