AP: పాస్టర్ మృతి.. సీఎం కీలక ఆదేశాలు
సమగ్ర విచారణకు ఆదేశించిన చంద్రబాబు... రోడ్డు ప్రమాదమే కారణమన్న లోకేశ్;
పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సీఎం మాట్లాడారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. రాజమండ్రి దివాన్ చెరువు- కొంతమూరు హైవేలో నాలుగో బ్రిడ్జి దగ్గర ప్రవీణ్ రోడ్డు పక్కన మృతి చెందారు. బైక్ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు తొలుత భావించినా మృతదేహంపై ఉన్న గాయాలతో బంధువులు దీన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు.
ప్రవీణ్ మృతికి కారణం అదే: మంత్రి లోకేశ్
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై మంత్రి లోకేశ్ ‘X’లో క్లారిటీ ఇచ్చారు. ‘పాస్టర్ ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తాం. ’ అని ఆయన ట్వీట్ చేశారు.
సంచలనం రేపుతున్న "పాస్టర్" మృతి
క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు - కొంతమూరు రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని గుర్తించారు. ఇది కుట్ర పన్ని చేసిన హత్య అని ఆయన అనుచరులు ఆరోపించారు. దీంతో క్రైస్తవులు, వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మరోపక్క పాస్టర్ ప్రవీణ్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
క్రైస్తవుల ఆందోళన
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై క్రైస్తవ సంఘాలు నిరసన చేస్తున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు క్రైస్తవులు చేరుకుని నిరసన చేశారు. పాస్టర్ మృతిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.