ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఉన్నారు. టీటీడీ జేఈవో గౌతమి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికారు. నిన్న ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు తిరుమలకు వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
నిన్న రాత్రి శ్రీవారి సన్నిధిలో బసచేసిన చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు ఈరోజు స్వామి వారిని దర్శించుకోనున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబుకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రాకతో తిరుపతి, తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది. తిరుపతి వీధుల్లో ఎటు చూసినా పసుపు జెండాలే దర్శనం ఇచ్చాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తిరుపతికి రావడంతో కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు నీరాజనం పట్టారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా విజయవాడ వెళ్తున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకోనున్నారాయన. అనంతరం ఈ సాయంత్రం ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే కీలక హామీలపైఆయన సంతకాలు చేస్తారని సమాచారం.