YS Jagan: మాజీ సీఎం జగన్కు భారీ స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ
తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి 30 మంది సెక్యూరిటీ సిబ్బంది;
ఏపీ మాజీ సీఎం జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అధికారం కోల్పోవడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వ పరంగా జగన్కు భద్రత కుదించే అవకాశం ఉండడంతో ఆయన ప్రైవేటుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పాదయాత్ర సమయంలో ప్రైవేటు భద్రతా సిబ్బందిని పెద్ద సంఖ్యలో జగన్ నియమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి జగన్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి స్థాయిలోనే భద్రతను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మాజీ అవడంతో పాటు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆయన పార్టీకి దక్కలేదు. ఇకపై జగన్ ఓ మాజీ ముఖ్యమంత్రిగా, సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆయన భద్రతలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ప్రైవేటు సిబ్బందిని జగన్ సిద్ధం చేసుకున్నారు. కాగా, జగన్ సీఎంగా ఉన్న సమయంలో తనకు, తన ఫ్యామిలీకి భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూపును ఏర్పాటు చేస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.