ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ నేత సి.రామచంద్రయ్య ( C. Ramachandraiah ), జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లు ఫిక్స్ అయ్యాయి. వీరిద్దరూ రేపు నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. జూలై 2 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 12న ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది.
ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్య, ఇక్బాల్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సభలో టీడీపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో సులువుగా ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంది. అయితే, ఈ రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది కూటమి పార్టీల మధ్య విస్తృత చర్చకు దారితీసింది.
మరోవైపు ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలను అధికారిక విప్లుగా నియమించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను విప్లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు.