- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి సన్నిహితుడిగా భావించే మిఖాయిల్ షాట్స్కీ హత్య చేయబడ్డాడు. ఇతను రష్యన్ మిస్సైల్ డెవలపర్గా ఉన్న ఇతడిని మృతదేహాన్ని మాస్కోలో కనుగొన్నారు. కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన క్షిపణులను డెవలప్ చేసిన రష్యన్ కంపెనీ మార్స్ డిజైన్ బ్యూరో డిప్యూటీ జనరల్ డిజైనర్గా, సాఫ్ట్వేర్ అధిపతిగా షాట్స్కీ ఉన్నారు. రష్యన్, ఉక్రెయిన్ సోర్సెస్ ప్రకారం.. మాస్కో రీజియన్లోని క్రెమ్లిన్కి ఆగ్నేయంగా 8 మైళ్ల దూరంలో ఉన్న కోటెల్నిలోని కుజ్మిన్స్కీ ఫారెస్ట్ పార్కులో గుర్తుతెలియని వ్యక్తి షాట్స్కీని కాల్చి చంపాడు. రష్యన్ స్పేస్, మిలిటరీ పరిశ్రమ కోసం ఆన్బోర్డ్ నావిగేషన్ వ్యవస్థని రూపొందించే, ఉత్పత్తి చేసే కంపెనీలో కీలకంగా ఉన్నారు. డిసెంబర్ 2017 నుంచి స్టేట్ కార్పొరేషన్ రోసాటమ్ విభాగంలో భాగంగా ఉంది. రష్యాలో Kh-59 క్రూయిజ్ క్షిపణిని Kh-69 స్థాయికి అప్గ్రేడ్ చేయడంలో కీలకంగా ఉన్నాడు. ఉక్రెయిన్పై వీటితోనే రష్యా దాడి చేస్తోంది.

సంగారెడ్డి జిల్లా లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. మొగుడంపల్లి మండలం మాడిగి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద డీఆర్ఐ, నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ బృందాలు నిర్వహించిన తనిఖీలలో రూ.50కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో అధికారుల తనిఖీలు చేపట్టగా..లారీలో తరలిస్తున్న డ్రగ్స్ పట్టుబడ్డాయి. లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పట్టుబడిన డ్రగ్స్ ను ఏపీలోని కాకినాడ ఓడరేవు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను చిరాగ పల్లి పోలీస్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హీరోయిన్ కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్ ఇన్స్టాలో సందడి చేస్తోంది. రేపు తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటిల్ తో గోవాలో పెళ్లి పీటలు ఎక్కబోతోందీ మహానటి. వీళ్ల వివాహానికి సంబందించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు డిసెంబర్ 20న హిందీలో కీర్తి సురేష్ డెబ్యూ మూవీ ‘బేబీ జాన్' రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ గ్లామరస్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బాలీవుడ్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి ఆమె ఫేస్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ప్రత్యేక ఫోటో షూట్ చేయించుకుంది. ఈ ఫోటోలని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫోటోషూట్లో ఎంబ్రాయిడరీ లెహంగాలో కీర్తి లుక్స్ స్టన్నింగ్గా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఈ లుక్స్ లో కీర్తి చాలా గ్లామరస్ గా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.. క్రమంగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతోంది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. ఈ రోజు ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అన్నమయ్య , నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. కొన్ని చోట్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుసే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. రైతులను అలర్ట్ జారీ చేశారు.. పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. మరోవైపు.. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్.. ఇంకోవైపు.. అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాల్లో.. ముఖ్యంగా రైల్వే కోడూరులో రాత్రి నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తుండి.. తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండగా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..

కెనడాలో మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. చదువుకుంటూ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న హర్షన్దీప్సింగ్ను ఎడ్మాంటన్లోని అతడి అపార్ట్మెంట్లోనే దుండగులు కాల్చి చంపారు. హత్యకు పాల్పడ్డ ముగ్గిరిలో ఇవాన్ రెయిన్,జుడిత్ సాల్టియాక్స్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుండగులు తొలుత హర్షన్దీప్సింగ్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. అతన్ని ఫ్లాట్లో నుంచి లాగి మెట్ల మీదకు నెట్టేస్తూ వెనుక నుంచి కాల్పులు జరిపారు.
కాల్పుల సమాచారం అందుకుని తాము అపార్ట్మెంట్కు చేరుకునే సరికే హర్షన్దీప్సింగ్ స్పందించడంలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతడి మృతిని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిందని చెబుతున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. హత్య వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఇటీవలే అల్పాహారం విషయంలో గొడవ జరిగి స్నేహితుడి చేతిలో భారతీయ విద్యార్థి ఒకరు హత్యకు గురైన విషయం తెలిసిందే.

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్కు చెందిన వంశీగౌడ్, దినేష్, హర్షగా గుర్తించగా.. మరొకరిని గుర్తించాల్సి ఉంది. భూదాన్ పోచంపల్లి వైపు వెళ్తున్న కారు జలాల్పురం శివారులో అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతులంతా హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి జేసీబీ సాయంతో మృతదేహాలను చెరవులోంచి బయటకు తీశారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పెద్ద పులి కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చెన్నాపూర్ శివారులోని ఓ పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు వినిపించాయి. దీంతో రైతులు, కూలీలు బెంబేలెత్తిపోయారు. గ్రామ శివారులోని చేనులోకి పులి రావడంతో పత్తి ఏరుతున్న కూలీలు పరుగులు పెట్టారు. పులిని చూసిన ఇద్దరు కూలీలు చెట్టెక్కి ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. చెట్టు పైనుంచే కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి పెద్ద శబ్దాలు చేశారని, తరువాత పులి తెనుగుపల్లి వైపు వెళ్లిందని చెప్పారు. పెద్దపులి సంచార విషయం తెలుసుకున్న కుశ్నపల్లి, తాండూరు అటవీ అధికారులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పత్తి సేకరణ పనులు జోరుగా నడుస్తుండగా చేలల్లోకి పెద్దపులి రావడంతో రైతులు, కూలీలు భయాందోళనకు గురవుతున్నారు.

వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుల అరెస్టు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏ రాజా సహా 11 మంది నిందితులను అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 11 మంది వంశీ అనుచరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. విజయవాడ రూరల్, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరి కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నేతలు దాడి చేసి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపర్చి వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కార్యాలయ ఆపరేటర్ సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..సీసీ కెమేరాలు, వీడియోల ద్వారా 71 మంది దాడికి పాల్పడినట్లుగా నిర్ధారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగం పెంచడంతో నిందితులుగా ఉన్న చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఈ కేసులో నిందితులను దఫదఫాలుగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

: కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో అంతుచిక్కని ఓ వింత వ్యాధి దాదాపు 150 మందిని బలిగొంది. ఫ్లూ వంటి లక్షణాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. నవంబర్ 10 నుంచి 25 మధ్య పాంజీ హెల్త్ జోన్లో దాదాపు 150 మంది ఈ అంతుచిక్కని వ్యాధి బారిన పడి మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వ్యాధికి గురైన చాలా మంది రోగులు తమ ఇళ్లలోనే మరణిస్తున్నారన్నారు. రోగుల నుంచి నమూనాలు సేకరించేందుకు ఒక వైద్య బృందం పాంజీ హెల్త్ జోన్ చేరుకుంది. తీవ్ర జ్వరం, భరించరాని తలనొప్పి, దగ్గు, నీరసం వంటివి ఈ గుర్తు తెలియని వ్యాధి లక్షణాలని ప్రొవిన్షియల్ ఆరోగ్య మంత్రి అపొల్లిరేర్ యుంబా తెలిపారు.

మాజీ మంత్రి, BRS నేత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేయద్దని ఆదేశించింది. అయితే పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని, దీనికి హరీష్ రావు సహకరించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కాగా, తన ఫోన్ ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్, హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ప్రశ్నిస్తే కేసులు.. అరెస్టులు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. పాలనలో లోపాలను గుర్తు చేసినా, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలించినా.. ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరించినా కేసులు పెడుతున్నారు. సూట్కేసులు మీకు.. అరెస్టులు మాకా" అంటూ ఎద్దేవా చేశారు.

ఖగోళ పరిశోధనల్లో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైంది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3 మిషన్ శాటిలైట్లను నింగిలోకి పంపనున్నది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం సాయంత్రం 4.06 గంటలకు పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నది.
ప్రోబా-3 మిషన్లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్ స్పేస్క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్క్రాఫ్ట్) ఉంటాయి. మొత్తం దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడం ప్రోబా-3 లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి.

బిగ్ బాస్ -5 కంటెస్టెంట్ శ్వేతావర్మ తన తల్లి మరణించింది అంటూ ఓ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'డిసెంబర్ 2, తెల్లవారుజామున 2 గంటల 35 నిమిషాలకు నా తల్లిని పోగొట్టుకున్నాను. ‘జీవితం నువ్వు లేకుండా ఇదివరకటిలా ఉండదు అమ్మా. నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ఎమోషనల్ కామెంట్స్ తో ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టింది. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అందరూ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో 'నో మెసేజెస్ జస్ట్ ప్రే(ప్రార్ధించండి)' అన్నట్టు మరో పోస్ట్ పెట్టింది. వాస్తవానికి శ్వేతా వర్మ తల్లి చనిపోయింది 2017 డిసెంబర్ 2న అని తెలుస్తుంది. కానీ ఈరోజు డిసెంబర్ 2 కావడంతో.. ఆమె తల్లిని గుర్తుచేసుకుంటూ పెట్టిన పోస్ట్.

ఫెంగాల్(ఫెయింజాల్) తూఫాన్ శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పడిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. కోత దశలో ఉన్న వరిపంట నేల వాలడంతో అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిక్కోలు జిల్లాలో దాదాపు మూడు వేల హెక్టార్లలో వరి పంట నీటి ముంపునకు గురైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చినట్టే వచ్చి నీటి పాలయ్యిందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ పంట నష్టపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలోనే చాలామంది వరి పంట కోతలు నిలుపుదల చేసినప్పటికీ వందలాది మంది రైతులు ముందుగానే కోతలు చేయడంతో పొలాల్లో ఉన్న పంట పూర్తిగా నీటిపాలైంది. పొలాల్లో నీటి ముంపు కారణంగా ధాన్యం తడిసి ముద్దయింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దాదాపు 53వేల క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. గడిచిన మూడు రోజులుగా పడిన వర్షాలకు పొలాల్లో ఉన్న పంటతో పాటు ఆరుబయట ఆరవేసిన ధాన్యం రంగు మారి తడిచి ముద్దైంది. విక్రయానికి వీలు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులుగా 10 మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్(ఫెయింజాల్) తుఫాన్ దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తోంది. ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణ, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలలో అయ్యప్పస్వామి కొలువైన పతనంతిట్ట జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కాలినడక వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరు వర్షంలోనే అయ్యప్ప స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు.
పంబ, సన్నిధానంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం విపత్తు నిర్వహణ సహాయక బృందాలను రంగంలోకి దించింది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, రాపిడ్ యాక్షన్ టీం, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని..పతనంతిట్ట కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో, నదులు, అడవులు ఉన్న ప్రాంతాల్లో భక్తులను అనుమతించరాదని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

ఇండియన్ స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తా సాయిని ఆమె పెళ్లి చేసుకోనుంది. ఈ నెల 22న ఉదయ్పూర్లో వీరి వివాహం జరగనుంది. ఈ విషయాన్ని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. ఈ నెల 20 నుంచి మ్యారేజ్ ఈవెంట్స్ ప్రారంభంకానున్నాయి. 22న ఉదయ్పూర్లో వివాహం జరగనుండగా.. 24న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నెల 22న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే సీజన్ సింధుకు చాలా ముఖ్యమైనది. త్వరలోనే ఆమె శిక్షణ మొదలుపెట్టనుందని ఆమె తండ్రి తెలిపారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సింధు బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నిరీక్షణకు తెరదించారు. ఆదివారం సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ విజేతగా నిలిచింది. మరుసటి రోజే సింధు మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్కు చెందిన వెంకట దత్తా సాయిని పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. పోసిడెక్స్ టెక్నాలజీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన పని చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న దీర్ఘకాలిక డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ మేరకు ‘కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు ( నుంచి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోషియేషన్ కు భూకేటాయింపు జరిగింది. స్టేడియం నిర్మాణానికి మొత్తం 41 ఎకరాల భూమిని కేటాయించారు.ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇవాళ ఉదయం తుమకూరులో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. మొత్తం 41 ఎకరాల్లో నిర్మించనున్న ఈ స్టేడియాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మొత్తం రూ.150 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. స్టేడియం పూర్తయితే ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి.

పేదలపై కరెంట్ బిల్లు భారం తప్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తోంది. దీంతో ఆయా కుటుంబాలకు కరెంట్ బిల్లు చెల్లించే అవసరం తప్పింది. ఆమేరకు కుటుంబాలపై భారం తగ్గింది. ఈ పథకంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.
పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద కేవలం హైదరాబాద్ లోనే 10.52 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని సీఎం చెప్పారు. ఈ పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగలు దాడి చేశాయి. మధ్యప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది… జ్యోతిరాదిత్య సింధియాను సురక్షితంగా తప్పించారు. మాధవ్ నేషనల్ పార్క్లోని చాంద్పాతా సరస్సు దగ్గర ఆకస్మిక రెస్క్యూ యాక్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివపురిలో ఓ కార్యక్రమానికి సింధియా హాజరయ్యారు. సభావేదిక మాధవ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా డ్రోన్లను వినియోగించారు. ఈ క్రమంలో తేనెతుట్టె కదిలింది. వెంటనే తెనేటీగలు అక్కడున్న వారిపై దాడి చేశాయి. కేంద్ర మంత్రి భద్రత సిబ్బంది వలయంగా ఏర్పడి.. సింధియాను అక్కడి నుంచి తీసుకెళ్లారు. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

మెగా హీరో రాంచరణ్ తేజ్.. కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. శంకర్ డైరెక్షన్ లో వస్తుండటంతో సినామా బాక్సఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా నుండి మూడో సింగిల్ సాంగ్ గా 'నానా హైరానా' అనే మెలోడీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం మెలోడీ ట్యూన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ పాటకు 24 గంటల వ్యవధిలోనే 35 మిలియన్స్ పైగా వ్యూస్ దక్కినట్లు మేకర్స్ తెలిపారు. 'గేమ్ ఛేంజర్'లోని పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో
ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జనవరి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

అమెరికాలో తుపాకీ తూటాకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. షికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26) అనే విద్యార్థి చనిపోయాడు. సాయితేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే యూఎస్ వెళ్లాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. సాయితేజ మృతితో అతని స్వస్థలం రామన్నపేటలో విషాదం అలకుముంది. అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది. నర్సింగ్ విద్యార్ధినులు పరీక్షలు రాసేందుకు కళాశాలకు వెళుతుండగా వారి బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థకు చెందిన బస్సులో విద్యార్థినులు పరీక్షలు రాసేందుకు గుంటూరుకు వెళుతుండగా, విద్యుదాఘాతంతో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ముందుగానే పొగను గుర్తించి విద్యార్థినులు బస్సు నుంచి దిగిపోయారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. విద్యార్థినులు దిగిపోయిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు స్పందించి నీళ్లు చల్లినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. రేపల్లె అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.

నాగాలాండ్ లో భూకంపం సంభవించింది. కిఫిర్ నగరంలో గురువారం ఉదయం 7:22 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. కిఫిర్ ప్రాంతం చుట్టూ భూమికి 65 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, భవనాలు ఊగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

బ్రహ్మోస్ ఏరోస్పేస్ కొత్త సీఈఓగా ప్రముఖ క్షిపణి రంగ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ రాఘవేంద్ర జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ, ఎండీ అతుల్ దిన్కర్ రాణే పదవీకాలం ముగియడంతో ఈ స్థానంలో జోషిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. భారత్కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో), రష్యాకు చెందిన మషినోస్ట్రోయెనియా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏర్పాటు చేశాయి. న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ బ్రహ్మోస్ క్షిపణులను తయారుచేస్తున్నది.

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర (ఎస్వీ) జూలో మధు అనే రాయల్ బెంగాల్ టైగర్ ప్రాణాలు కోల్పోయింది. ఈ టైగర్ రెండు నెలల నుంచి తగిన ఆహారం, నీరు తీసుకోవడం లేదని.. సోమవారం చనిపోగా.. ఎస్వీ వెటర్నరీ కళాశాల పాథాలజీ విభాగం డాక్టర్ల టీమ్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించినట్లు క్యూరేటర్ సెల్వం తెలిపారు. ఈ టైగర్ వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారన్నారు.
ఈ టైగర్ను 2018లో 11 ఏళ్ల వయసున్నప్పుడు కర్ణాటకలోని బన్నేరుగట్ట పార్క్ నుంచి ఇక్కడికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి దాదాపు ఏడేళ్లపాటు జూ సంరక్షణలో ఉందని.. ఈ టైగర్ వృద్ధాప్యం కారణంగా రెండేళ్లుగా సందర్శకుల ప్రదర్శనకు దూరంగా ఉంచినట్లు తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ గుండె నొప్పి రావడంతో హుటాహుటిన చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. దీంతో సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుంది.. ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. అయితే, శక్తికాంత దాస్ ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. కానీ, తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన తమిళనాడు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పని చేశారు. కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా పని చేసిన శక్తికాంత దాస్.. 2018లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమితులయ్యారు.

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదయింది. ఎర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్టు చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. తన కుమార్తెపై అత్యాచారం జరిగినట్టు చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారని... చెవిరెడ్డి కారణంగా తమ కుటుంబం ఎంతో మానసిక వేదన అనుభవించిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

ఉక్రెయిన్పై యుద్ధం కోసం రష్యా కిరాయి సైన్యాన్ని నియమించుకుంటున్నది. ఓ ప్రముఖ మీడియా సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, యెమెన్ నుంచి వందలాది మంది యువతను అక్రమ మార్గాల్లో రప్పిస్తున్నది. దీనికోసం హౌతీకి అనుబంధంగా ఉన్న ఓ కంపెనీ సేవలను వినియోగించుకుంటున్నది. భారత్, నేపాల్ యువతను ప్రలోభపెట్టినట్లుగానే వీరిని కూడా అనేక ఆశలు చూపించి తీసుకొస్తున్నది. రష్యన్ పౌరసత్వంతోపాటు అత్యధిక జీతాలు ఇస్తామని చెప్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్, దాని మద్దతుగల ఉగ్రవాద సంస్థలతో రష్యాకు సాన్నిహిత్యం పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది.

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోనీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని నటుడు అలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఎక్మామిడి గ్రామపంచాయతీ సెక్రటరీ శోభారాణి నటుడు అలీకి నోటీసులు జారీ చేయగా, పనివారికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫాం హౌస్లో నిర్మాణాలు ఎలా చేపట్టారు, వివరణ ఇవ్వాలని నోటీసులలో అధికారులు పేర్కొన్నారు. ఇటీవల వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ నటుడు అలీ రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామంలో నటుడు అలీకి వ్యవసాయ భూమి ఉంది. వీలు ఉన్నప్పుడు అలీ తన కుటుంబంతో కలిసి సరదాగా అక్కడికి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తన భూమిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అలీ నిర్మాణాలు చేపట్టారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అలీ ఫాం హౌస్ నిర్మించాడని అధికారుల దృష్టికి రావడంతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి అక్రమ నిర్మాణాల అంశంపై నటుడు అలీకి నోటీసులు జారీ చేశారు. నవంబర్ 5న తొలిసారి నోటీసు ఇవ్వగా నటుడు అలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో నవంబర్ 22న అధికారులు రెండోసారి నటుడు అలీకి నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఫాం హౌస్లో పనిచేసే వారికి నోటీసులు అందించి, అలీకి సమాచారం చెప్పాలని చెప్పినట్లు పంచాయతీ సెక్రటరీ వెల్లడించారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్లో మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పార్లమెంట్కు చేరుకున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను కోరనుంది. కాగా పార్లమెంట్ వింటర్ సెషన్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు తదితర అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ తన చర్యలతో హల్చల్ చేస్తున్న అఘోరీ... కర్నూలు జిల్లాలో పెట్టుడు గడ్డం, మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేశారు. అఘోరీని చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా.. తాను దిష్టి తీస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. అఘోరీ గడ్డం, మీసాలతో కనిపించడం చర్చనీయాంశమైంది. సనాతన ధర్మం, మహిళల రక్షణ, హిందూ దేవాలయాల పరిరక్షణ లక్ష్యంగా హిమాలయాల నుంచి జన సంచారంలోకి రావడం జరిగిందంటున్న అఘోరీ వ్యవహారం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. సనాతన ధర్మం, మహిళల రక్షణ, హిందూ దేవాలయాల పరిరక్షణ లక్ష్యంగా హిమాలయాల నుంచి జన సంచారంలోకి వచ్చానని అఘోరి ప్రకటించడం కూడా సంచలనంగా మారింది. అఘోరి సనాతన ధర్మ రక్షణకు, లోక కల్యాణం కోసం జనంలోకి వచ్చానంటు చెప్పుకుంది. మంచిర్యాల జిల్లా కుష్నపల్లికి చెందిన అఘోరీ తను మహిళనని చెప్పినప్పటికి తర్వాత అమె తల్లి దండ్రుల కథనం మేరకు ట్రాన్స్జెండర్ గా మారిన శ్రీనివాస్ అని తేలింది. చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లి అఘోరీ, నాగసాధువుగా మారింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నగ్నంగా సంచరిస్తున్న అఘోరీ దేవాలయాలను సందర్శిస్తూ హల్చల్ చేస్తోంది.

వైసీపీ అధినేత జగన్ పై.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి సంచలన విమర్శలు చేశారు. ఆదానీ అక్రమాస్తుల్లో జగన్ లంచాల వాటా ఎంతా అని షర్మిల ప్రశ్నించారు. అదానీ- జగన్ అవినీతి బండారం బయట పడిందన్న ఆమె... లంచం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ను తాకట్టు పెట్టేస్తారా అని మండిపడ్డారు. రాజకీయ అవినీతిపరుడిగా జగన్ పేరు బహిర్గతమైందన్న షర్మిల.. ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్ గా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు. పోర్టులను అప్పనంగా అదానీకి జగన్ అప్పగించారని షర్మిల మండిపడ్డారు. జగన్ అవినీతి అమెరికాలో బయటపడిందన్న షర్మిల.. జగన్ హయాంలో జరిగిన అవినీతి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్, ఐశ్వర్య విడాకులపై గతకొంతకాలంగా సోషల్ మీడియాలో రూమర్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ నో కామెంట్స్ అంటూ సైలెంట్ గా ఉండటం ఇదికాస్త చినికి చినికి గాలి వానగా మారింది. తాజాగా అమితాబ్ తన కుటుంబ వ్యవహారాలపై తన బ్లాగ్ లో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
గతకొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై వస్తున్న వార్తలపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. తన బ్లాగ్లో ఆయన సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. తన కుటుంబం గురించి చాలా అరుదుగా మాట్లాడతాడని, వారి గోప్యతను కాపాడుకోవడానికి తాను ఇష్టపడతానని అని రాసుకోచ్చారు అమితాబ్. ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలను ఎలా రాస్తారంటూ రూమర్స్ ను స్ప్రెడ్ చేసే వ్యక్తుల మనస్సాక్షిని అమితాబ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తన కుటుంబ వ్యక్తిగత గోప్యతకు తాను భంగం కలిగించకూడదు కాబట్టి.. తను ఫ్యామిలీ గురించి పెద్దగా మాట్లాడనని తన బ్లాగ్ లో తెలిపారు బిగ్ బీ.
కాగా బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ఎక్కడా ఈ విషయమై బహిరంగంగా కామెంట్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. తాజాగా తన కూతురు ఆరాధ్య బచ్చన్ 13వ ఏట అడుగుపెట్టిందని తల్లి,కూతురుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఐశ్వర్య . కానీ ఈ వేడుకల్లో ఐష్-అభిషేక్ కలిసి కనిపించకపోవడం చూస్తుంటే ఇవాళ కాకపోతే రేపైనా విడిపోతారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే తన కూతురు టీనేజ్ పార్టీకి తండ్రైనటువంటి అభిషేక్ బచ్చన్ ని ఆహ్వానించలేదని కామెంట్స్ చేస్తున్నారు.

జార్ఖండ్లో ఇవాళ రెండో దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్నది. అయితే ఆ ఎన్నికలకు ముందే.. మావోయిస్టులు అయిదు ట్రక్కులకు నిప్పు పెట్టారు. లతేహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హెరాంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న లాత్ అటవీ ప్రాంతంలో రాత్రి 1.30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. లతేహర్లో బొగ్గు ప్రాజెక్టు వద్ద రవాణా కోసం వాహనాలకు నిప్పు పెట్టారు. బొగ్గును ఖాళీ చేసి తిరిగి వస్తున్న ట్రక్కులకు నిషేధిత జార్ఖండ్ ప్రస్తుతి కమిటీ నిప్పు పెట్టినట్లు తెలిసింది. ఘటన పట్ల విచారణకు ఆదేశించారు. వాహనాలను దగ్దం చేసిన కేసులో తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ కుమార్ గౌరవ్ తెలిపారు. సంఘటనా స్థలం వద్ద కరపత్రాలను వదలి వెళ్లారు. ట్యూబ్డ్ కోల్ ప్రాజెక్టు వద్ద పనులు సాగాలంటే తమతో చర్చలు జరపాలని ఆ కరపత్రంలో మావోయిస్టులు పేర్కొన్నట్లు ఎస్పీ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది.. అయితే, సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు శనివారం కన్నుమూసిన విషయం విదితే.. దీంతో, ఢిల్లీ, మహారాష్ట్రల్లో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు.. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామం నారావారిపల్లె వెళ్లారు. రామ్మూర్తినాయుడి పార్థివ దేహానికి ఆదివారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక, ఈ రోజు సాయంత్రం వరకు సీఎం చంద్రబాబు అక్కడే ఉంటారు. ఈ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.. ఇవాళ్టికి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు.. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. నవంబర్ 20వ తేదీన వెలగపూడిలోని ఏపీ సచివాలయం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అవుతుందని ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్..

అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. సఖి డిపో పేరున ఏర్పాటు చేసిన సరోజినీనగర్ డిపోను రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ శనివారం ప్రారంభించారు. ఈ డిపోలో సుమారు 225 మంది సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. కాగా దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపోను ప్రారంభించడం మంచిదే అయినా.. ప్రస్తుతం రవాణా రంగంలో పని చేస్తున్న తమకు సరైన సౌకర్యాలు లేవని మహిళా ఉద్యోగులు మంత్రికి తెలియ చేశారు. స్థిర వేతనం, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అప్లికేషన్లో తప్పులను సవరించే అవకాశం కల్పించింది. గతంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు www.schooledu.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా చెయ్యొచ్చు. అదనపు సమాచారం కావాలంటే.. అభ్యర్థులు 7032901383, 9000756178 నెంబర్లను సంప్రదించవచ్చని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ సూచించింది. దరఖాస్తులకు ఈ నెల 20 చివరి తేదీగా నిర్ణయించింది. జనవరి 1 నుంచి 20 వరకూ టెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించనుండగా.. ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com



