- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

పవన్ కళ్యాణ్తో విడాకుల అనంతరం తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం చేసుకోలేదని రేణు దేశాయ్ తెలిపారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ‘నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నా. కానీ అటు ఆ రిలేషన్షిప్కి, ఇటు పిల్లలకి న్యాయం చేయలేనని గ్రహించా. నా కూతురు ఆద్యకు ప్రస్తుతం 15 సంవత్సరాలు . బహుశా ఆమెకు 18 సంవత్సరాలు వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తానేమో’ అని పేర్కొన్నారు. ఇక మొత్తానికైతే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆలోచనను అభిమానులతో పంచుకోవడంతో చాలామంది అభిమానులు రేణూ దేశాయ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. సింగిల్ పేరెంట్ గా ఇద్దరు పిల్లల బాధ్యతలు తీసుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడిన వెంటనే మీరు మీ వ్యక్తిగతంగా ఆలోచించండి.. మీకంటూ ఒక తోడును వెతుక్కోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని ఒక నైట్ క్లబ్ పైకప్పు కూలిన ప్రమాదంలో వంద మందికి పైగా మరణించగా, 155 మంది గాయపడ్డారు. ప్రమాదంలో 124 మంది మరణించారని, మృతులలో ఇద్దరు మేజర్ లీగ్ బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మంగళవారం ఒంటి గంటకు ఒక బ్యాండ్ ప్రదర్శనను తిలకిస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో క్లబ్లో 300 మంది ఉన్నారు. ప్రదర్శన ఇస్తున్న మెరెంగ్యూ కళాకారుడు రూబీ పెరెజ్ జాడ కూడా తెలియరాలేదు. మృతులలో ఆయన కూడా ఉండి ఉంటారని భావిస్తున్నారు.

అమెరికాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులు ట్రంప్ విధానాలతో గజగజ వణుకుతున్నారు. ఎప్పుడు ఏ కారణంతో వీసా రద్దు చేసి ఇంటికి పంపుతారో తెలియక దినదిన గండంగా గడుపుతున్నారు. గతంలో ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఇప్పుడు దానికి వీసా రద్దు చేయడం ద్వారా శిక్ష విధిస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వార్తా సంస్థ మంగళవారం వెల్లడించింది.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు పెరిగినట్టు పలు అమెరికన్ కాలేజీలు వెల్లడించాయి. వీసా రద్దయిన విద్యార్థుల్లో భారతీయులు కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలతో సంబంధం లేని వారి వీసాలు కూడా రద్దవుతున్నట్టు తెలిపాయి. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, యూసీఎల్ఏ, ఒహాయో స్టేట్ సహా పలు ప్రముఖ యూనివర్సిటీల అధికారులు తాము ఫెడరల్ ఇమిగ్రేషన్ డాటాబేస్ను చూసిన తరువాత ఈ విషయం తెలిసిందని అన్నారు.

గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 905 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాతో కలిపి మొత్తం 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ధ్రువపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు. గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు.

పెళ్లి, డేటింగ్ విషయాలపై క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను సింగిలే కానీ, సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్గా డేట్స్కి వెళ్లను. ప్రస్తుతం నేను వివాహం అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే, నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేశా’ అని ఓ పాడ్కాస్ట్లో ఆమె చెప్పుకొచ్చారు.
‘‘నా జీవితంలోకి ఏ అబ్బాయి అయితే వస్తాడో.. అతనే ఏకైక వ్యక్తి అవుతాడు. అతడే నాకు స్నేహితుడు. అతనే నా ప్రియుడు. అతనే నా భర్త. నా జీవితం అతడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నాకు అవసరం లేని వ్యక్తులు వద్దు. ఆ సమయంలో నేను ఇతర అబ్బాయిలతో మాట్లాడలేను’’ అని వీడియోను మహ్వశ్ షేర్ చేసింది. దానికి చాహల్ లైక్ చేశాడు. దీంతో ఓ అభిమాని స్పందిస్తూ.. ‘‘యుజీ భాయ్ ఆ మూల నుంచి నవ్వుతున్నాడు’’ అంటూ కామెంట్ పెట్టాడు. ‘ప్రతిదీ తాత్కాలికమే. చాహల్ ఇచ్చిన లైక్ శాశ్వతం’ అంటూ మరొకరు స్పందించారు.

ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో 500 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ గా విధులు నిర్వర్తిస్తున్న వీరిని ఉద్యోగం ఇచ్చిన సంవత్సరంలోగానే తొలగించింది. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (జడ పీ) పేరుతో సంవత్సరం క్రితం ఫుడ్ డెలివరీ స్టాట్ఫామ్ నియామకాలు చేపట్టింది. కస్టమర్ సపోర్ట్ విభాగం కింద 1500 మందిని నియమించింది. వీరిలో చాలా మంది పనితీరు ఆశించన మేర లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం. వంటి కారణాలు చూపి నోటీస్ పీరియడ్ ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించింది. తొలగించిన వారికి నెలరోజుల వేతనం పరిహారంగా ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కస్టమర్ సపోర్ట్ విధానాలను ఆటోమేట్ చేయడంతో పాటు, ఖర్చులను నియంత్రించుకునేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవాలని జొమాటో నిర్ణయించింది. ఇందులో భాగం గానే జొమాటో లేఆఫ్ు చేపట్టింది. జోమా టో చర్య మూలంగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ డెలివరీ వ్యాపారంలో మందగమనం నెలకొందని జొమాటో ప్రకటించింది. క్విక్ కామర్స్ విభాగంలో పెరుగుతున్న పోటీ మూలంగా జొమాటో అనుబంధ సంస్థ బ్లింకిట్ నష్టాలను ఎదుర్కొంటోంది.

రానున్న అయిదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధ, గురు వారాల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడనుందని చెప్పింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో 40 నుంచి 50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభా వంతో వర్షాలు కురవనున్నాయని అధి కారులు తెలిపారు.
వడగండ్ల వాన కురవనున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరాత్వాడ మరియు దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు మధ్య మహారాష్ట్ర మరియు దాని పరిసర ప్రాంతాల్లో అదే ఎత్తులో కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి మరాత్వాడ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగిన ద్రోణీ మంగళవారం దక్షిణ ఛత్తీస్ గడ్ నుండి మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం వరకు అదే ఎత్తులో కొన సాగుతోందని పేర్కొంది. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా.. వర్షాల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుండి నాలుగు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తున్న హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ ప్రయోగ పరీక్షను ఓ సరస్సులో నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలు విజయవంతమైనట్లు సామాజిక మాధ్యమాల ద్వారా డీఆర్డీవో వెల్లడించింది. భూ ఉపరితలంపై, నీటిలోనూ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ పరీక్షలో వెహికల్ సోనార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది. భూతల, సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్, శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని చెప్పింది. 6 టన్నులు బరువు ఉండే ఈ వాటర్ డ్రోన్ పొడవు 9.75 మీటర్లని తెలిపింది. గరిష్ఠంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యమున్న ఇది 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 02న లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆగస్టు 2024లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన ఈ బిల్లు, లోక్సభ ముందుకు రాబోతోంది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు బీజేపీ సీనియర్ మంత్రులు ఇండియా కూటమి నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బిల్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ బిల్లు ద్వారా ముస్లింల హక్కుల్ని హరిస్తున్నారంటూ ఆ వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇన్నా్ళ్లు వక్ఫ్ బోర్డుల ఇష్టారాజ్యానికి, అపరిమిత అధికారాలకు ఈ బిల్లు ద్వారా అడ్డుకట్ట వేస్తామని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 04తో ముగియనున్నాయి. అయితే, ఈ బిల్లు చట్టంగా మారాలంటే లోక్సభ, రాజ్యసభ రెండూ ఆమోదించాలి.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చి వేస్తామని, సముద్రంలో పడేస్తామని అన్నారు. అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా తెలంగాణ హిందువులు వెళ్తారని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబ్, బాబర్ వారసులు ఆందోళనకు గురవుతున్నారని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారని, ఎంఐఎం ఆదేశంతోనే అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. ఈసారి అనుమతి కోసం దరఖాస్తు కూడా వేయలేదని తెలిపారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత, ఔరంగజేబు, బాబర్ వారసులు పరేషాన్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ ఇటీవల డిమాండ్లు కొనసాగాయి. ఆ ప్రాంతంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేసింది. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది.

రుణ భారంతో కుదేలైన మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా (విఐ)లో వాటాను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే కంపెనీలో 22.6 శాతం వాటాతో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉండగా, కంపెనీ బకాయిపడిన స్పెక్ట్రమ్ వేలం మొత్తాన్ని తన వాటాగా మార్చుకోనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం దాదాపు రూ.37 వేల కోట్ల విలువైన షేర్లను సొంతం చేసుకోనుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 48.99 శాతానికి బలపడనున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా పేర్కొంది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 2021 టెలికాం రంగ సంస్కరణలు, మద్దతు ప్యాకేజీకి అనుగుణంగా వేలం బకాయిలను ఈక్విటీ షేర్లుగా మార్చుకునేందుకు నిర్ణయించినట్లు టెలికాం మంత్రిత్వ శాఖ ఫైలింగ్లో వెల్లడించింది.

ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని దర్శించిన ప్రధాని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్కి, ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కలిసి ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో పాటు ప్రధాని మోడీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ బౌద్ధాన్ని తీసుకున్న దీక్షాభూమిని సందర్శించారు. అంబేద్కర్ని నివాళులు అర్పించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని మెట్రో రైల్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. మెట్రో రైల్ చివరి రైలు సమయాన్ని పొడిగించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బదులుగా 11:45 నిమిషాలకు బయలుదేరేలా మార్పు చేశారు. ఈ మార్పు వల్ల రాత్రివేళ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు మెట్రో సేవలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. విద్యార్థులు మెట్రో సేవలను మరింతగా వినియోగించుకునేలా 20 ట్రిప్పుల టికెట్ కొనుగోలు చేస్తే 30 ట్రిప్పులు ప్రయాణించే ఆఫర్ను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రజా రవాణా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తోందని హెచ్ఎంఆర్ఎల్, ఎండి,శ్రీ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతడి భార్య ఆతియా శెట్టి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రాహుల్, ఆతియా జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వీరికి అభిమానులు, సినీ ప్రముఖులు,క్రికెటర్ల నుంచి భారీ స్థాయిలో అభినందనలు వెలువెత్తాయి. రాహుల్, ఆతియా జంటకు సోషల్ మీడియాలో అందరూ శుభకాంక్షలు తెలుపుతున్నారు. రాహుల్ భారత క్రికెటర్కాగా.. ఆతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ హీరో సునిల్ శెట్టి కూతురు. వీరిద్దరూ 2023లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ జంటకు పండంటి పాప పుట్టింది. ఇక ఐపీఎల్-2025 సీజన్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆతియా ప్రసవానికి సిద్ధంగా ఉండటంతో రాహుల్ సోమవారం ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు.

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కో-సీఈవో హాన్ జోంగ్-హీ (63) గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. శామ్సంగ్లోని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ & మొబైల్ డివైజెస్ విభాగానికి హాన్ బాధ్యత వహిస్తుండగా, మరో కో-సీఈవో జున్ యంగ్-హ్యూన్ చిప్ బిజినెస్ను పర్యవేక్షిస్తున్నారు. స్మార్ట్ఫోన్ మార్కెట్లో, అలాగే దాని టీవీ మరియు ఇతర వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలలో చైనా ప్రత్యర్థుల నుండి శామ్సంగ్ పెరుగుతున్న పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో హాన్ మరణ వార్త వెలువడింది. ఉదయం ట్రేడింగ్లో శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్థిరంగా ఉన్నాయి. హాన్ 2022లో శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ఛైర్మన్ మరియు CEOగా, కంపెనీ బోర్డు సభ్యులలో ఒకరిగా నియమితులయ్యారు.

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ (63) కన్నుమూశారు. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా కంపెనీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. హాన్ జోంగ్-హీ శామ్సంగ్ వినియోగదారు ఎలక్ట్రానిక్స్, మొబైల్ పరికరాల విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఆ కంపెనీ మరో సహ-CEO జున్ యంగ్-హ్యూన్ దక్షిణ కొరియాలోని అతిపెద్ద కంపెనీలో కీలకమైన భాగమైన చిప్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
కంపెనీ మరో సహ-CEO జున్ యంగ్-హ్యూన్ సెమీకండక్టర్ (చిప్) వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. హాన్ 2022లో శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ఛైర్మన్ మరియు CEOగా నియమితులయ్యారు. ఆయన కంపెనీ బోర్డు సభ్యుడు కూడా.స్మార్ట్ఫోన్, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో చైనా కంపెనీల నుండి శామ్సంగ్ గట్టి పోటీని ఎదుర్కొంటున్న సమయంలో హాన్ మరణం సంభవించింది. ఇటీవలి కాలంలో, స్మార్ట్ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ తన మొదటి స్థానాన్ని ఆపిల్కు కోల్పోయింది.

ఏప్రిల్ నెలలో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదు. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు మూఢాలు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరగనున్నాయి. ఏప్రిల్ నెలలో 13వ తేదీ నాటికి మూఢాలు వెళ్లిపోతాయి. సూర్యుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఏప్రిల్ నెలలో 13 తేదీ వరకు అంటే దాదాపు సగం రోజులు పెళ్లి ముహూర్తాలు లేవు. కానీ ఆ తర్వాత మరో సగం రోజుల్లో అంటే కేవలం 16 రోజుల్లో 9 ముహూర్తాలు ఉన్నాయి.

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోతున్న మణిపుర్లో త్వరలో మంచిరోజులు వస్తాయని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే అభివృద్ధి చెందుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తిరిగి శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు ప్రజలంతా కలిసి పని చేయాలని ఆయన కోరారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రతినిధుల బృందం శనివారం మణిపుర్ రాజధాని ఇంఫాల్లో పర్యటించింది. ఈ బృందంలో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ఉన్నారు. తమ పర్యటనలో భాగంగా అల్లర్లలో నిర్వాసితులైన వారిని శనివారం న్యాయమూర్తులు పరామర్శించారు. చురాచాంద్పుర్ జిల్లా లమ్కాలో ఉన్న మినీ సచివాలయం నుంచి పలు న్యాయ, వైద్య శిబిరాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ‘‘భిన్నత్వంలో ఏకత్వానికి మన దేశం ప్రతీక. మీరు క్లిష్ట సమయంలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. రాజ్యాంగంపై నమ్మకం ఉంచండి. తప్పకుండా మణిపుర్లో శాంతి నెలకొంటుంది’’ అని అన్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూకీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఛార్జీల పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ ముందు టారిఫ్ ప్రతిపాదనలను ఉంచిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు.ఇవాళ విద్యుత్ నియంత్రణ భవన్లో ఈఆర్సీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ డి. నాగార్జున అధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. ఈ సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని తెలిపారు. టీజీపీఎస్సీ డీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. విద్యుత్ సంస్థల నిర్ణయంతో ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల్లో పెరుగుదల లేకపోవడం సామాన్య ప్రజలపై భారం తగ్గించనుంది.

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మెుక్కను లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. దోమలు, కీటకాలు వంటివి ఇంట్లోకి రాకుండా రక్షణ కల్పిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఉంటే పాజిటివ్ ఎనర్జీ. తులసి ఆకుల్ని నమిలితే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు ఉపశమనం లభించడంతో పాటు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, తద్వారా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. వీటి వాసన పీల్చుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యం, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆయుర్వేదంలో కూడా తులసిని ఎన్నో ఔషధాలలో వాడతారు. ముఖ్యంగా తులసి రోజుకి 20 గంటలు ఆక్సీజన్ని విడుదల చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులని గ్రహిస్తుంది. ఇండోర్ గాలిని కూడా శుద్ధి చేయడానికి చాలా మంచిది.

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఆయనతో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలను ఏకం చేయడంలో క్రికెట్ను మించినది లేదంటూ క్రిస్టోఫర్ లక్సన్ ట్వీట్ చేశారు. తాను క్రికెట్ ఆడిన ఫొటోలను పంచుకున్నారు.
కాగా, తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను న్యూజిలాండ్ ప్రధాని కలిశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ , క్రిస్టఫర్ లక్సన్ సోమవారం దిల్లీలో విస్తృత స్థాయి చర్చలు కూడా జరిపారు.

గుజరాత్లో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో కిలోల కొద్దీ బంగారం, డబ్బుల కట్టలు చూసి అధికారులు, పోలీసులు షాక్కు గురయ్యారు. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్ పల్దీ ప్రాంతంలో ఆవిష్కార్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్పై అధికారులు దాడులు చేపట్టగా, దాదాపు 90 కోట్ల రూపాయల విలువ జేసే బంగారం కడ్డీలు, ఆభరణాలు, నగదు లభ్యమైనట్టు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. ఈ దాడులకు సంబంధించి మేఘ షా, అతడి తండ్రి మహేంద్ర షాలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. డీఆర్ఐ, ఏటీఎస్ అధికారులు ఫ్లాట్కు చేరుకునే ముందు, ఫ్లాట్కు తాళం వేసి నిందితులు ఇద్దరూ అక్కడ్నుంచి పారిపోయారని పోలీసులు చెప్పారు. బంగారం మూలాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ‘సుమారుగా 95.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.60-70 లక్షల నగదు సీజ్ చేశాం. నిందితులు అక్రమంగా తరలించిన బంగారం, భారీగా నగదును ఫ్లాట్లో దాచిపెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి’ అని ఏటీఎస్ అధికారి ఎస్ఎల్ చౌదరీ చెప్పారు.

ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాజా పై టెల్అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. కాల్పుల విరమణ ముగియడంతో సోమవారం ఇజ్రాయెల్ దళాలు… హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకరమైన దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 44 మంది చనిపోయారు. అలాగే దక్షిణ సిరియాపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 19 మంది గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిత్తూరులో కాల్పులు కలకలం రేపాయి. గాంధీరోడ్డులోని లక్ష్మీ సినిమా హల్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి దుండగులు చొరబడి రెండు తుపాకులతో కాల్పులు జరిపారు. అయితే యజమాని అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. యజమాని నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ యజమాని ఇంట్లో కాల్పులు జరిపిన ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

క్రికెటర్ చాహల్, ఆయన భార్య ధనశ్రీ విడిపోతున్నట్లు గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో చాహల్తో ఉన్న ఫొటోలను ఇన్స్టా నుంచి హైడ్ చేసిన ధనశ్రీ తాజాగా వాటిని రిస్టోర్ చేశారు. దీంతో వీరు విడిపోవట్లేదా? లేదా తాను ఇంకా అతని భార్యనేనని ఆమె గుర్తు చేస్తున్నారా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చాహల్ ఇటీవల RJ మహ్వాష్తో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి.
“మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషన్లో ఉంటుంది!” అంటూ సోమవారం, ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక రహస్యమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ పోస్టు హల్చల్ రేపడంతో, నెటిజన్లు దీన్ని యుజ్వేంద్ర చాహల్ తో అనుసంధానించారు. అయితే, కొంతమంది మాత్రం ఇది ఆమె సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్కు స్పందన అని అభిప్రాయపడ్డారు.
చాహల్, ధనశ్రీ వర్మ 2020లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల బంధం తర్వాత గతేడాదే వీళ్లు విడాకులకు అప్లై చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇద్దరూ విడిపోయి ఉంటున్నారని తెలిసింది. ఈ విషయంపై ఇద్దరూ మౌనం వహిస్తూనే వచ్చారు.

మట్టి కుండలలో వంట చేసే సంప్రదాయం పురాతన కాలం నుండి ఉంది. కానీ తరాలు మారుతున్న కొద్దీ వాటి వాడకం కూడా కనుమరుగైంది. కానీ మళ్లీ ఇప్పుడు మట్టి కుండల వాడకం బాగా పెరిగింది. కుండలలో వండిన ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఐస్ క్రీం, బిర్యానీ, లస్సీ సహా అనేక ఇతర ఆహార పదార్థాలను మట్టి కుండలలో అమ్ముతున్నారు. అదేవిధంగా మట్టి కుండలో పెరుగు తయారు చేసి తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? వేసవిలో పెరుగును మట్టి కుండలో ఎందుకు చేయాలనేదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో వడదెబ్బను నివారించడానికి.. చల్లని పెరుగు భోజనం మరింత రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎండా కాలంలో మన మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడానికి పెరుగు ఒక గొప్ప ఎంపిక. కానీ మీరు ఎంచుకునే పాత్రలు కూడా చాలా ముఖ్యమైనవి. దీనికి సరైన కంటైనర్ ఉపయోగించినప్పుడు మాత్రమే.. అది మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి :
మట్టి కుండలలో తయారుచేసిన పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. స్టీల్, గాజు వంటి పాత్రలలో తయారు చేసిన పెరుగు కంటే మట్టి కుండలలో తయారు చేసిన పెరుగులో ప్రోబయోటిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
పెరుగు పెరుగుగా మారడానికి సహాయపడుతుంది;
మట్టి కుండలో తయారుచేసిన పెరుగునే చాలా మంది తినడానికి ఇష్టపడతారు. నిజానికి మట్టి పాత్రలు సహజంగా నీటిని గ్రహిస్తుంది. ఇది పెరుగు బాగా గడ్డకట్టడానికి సహాయపడుతుంది. అదనంగా మట్టి కుండలో నిల్వ చేసిన పెరుగు ఇతర పాత్రలలో నిల్వ చేసిన పెరుగు కంటే భిన్నంగా ఉంటుంది. మట్టి పాత్ర యొక్క సహజ లక్షణాలు పెరుగు యొక్క సహజ రుచిని నిలుపుకుంటాయి. ఇది ఈస్ట్ చాలా పుల్లగా మారకుండా నిరోధిస్తుంది. అందుకే మట్టి కుండలలో ఉంచిన పెరుగు చాలా రుచిగా ఉంటుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908లో న్యూయార్క్లో ఓటు హక్కు, మెరుగైన జీతాల కోసం 15 వేల మంది మహిళలు నిరసనకు దిగారు. ఆ రోజును దృష్టిలో పెట్టుకుని USలోని సోషలిస్టు పార్టీ 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఆ తర్వాత క్లారా జెట్కిన్ 1910లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8ను మహిళా దినోత్సవంగా గుర్తించింది.
సమాజంలో మహిళలకూ పురుషులకున్న హక్కులు ఉంటాయని, అన్ని రంగాల్లోనూ వారికి సమాన అవకాశాలు కల్పించాలనే మాట ప్రతి రాజకీయ నాయకుడి నోటి నుంచి వస్తుంటుంది. రాజ్యాంగం వీరికి 33% రిజర్వేషన్ కల్పించినా ఎంత మంది రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు? ఎంత మంది మహిళా మూర్తులకు మంత్రుల పీఠం దక్కింది? ప్రైవేటు ఉద్యోగాల్లో ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారు? వారి హక్కులను వారు పొందినప్పుడే నిజమైన ‘ఉమెన్స్ డే’.

ప్రధాని మోడీ ఈరోజు, రేపు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, గుజరాత్లో పర్యటించనున్నారు. దాద్రా, నాగర్ హవేలి, డామన్, డయ్యు, గుజరాత్లో మోడీ పర్యటించనున్నారు. సిల్వాసాలో రూ.2,580 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కొత్త ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సిల్వాసాలో నమో ఆస్పత్రి ఫేజ్-1ను మోడీ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవ్సరిలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. నవ్సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకకు పూర్తిగా మహిళా పోలీసులతోనే భద్రత ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తిగా మహిళా పోలీసులతో పహారా చేపట్టనున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన ప్రముఖ గాయని కల్పన నిజాంపేటలోని హోలిస్టిక్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై బుధవారం డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నా వేగంగా కోలుకుంటున్నారని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్లే అపస్మారకంలోకి వెళ్లినట్లు వివరించారు. లంగ్స్లో వాటర్ చేరడంతో వెంటి లేటర్ అవసరం అయిందని, ఇప్పుడు వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారని వైద్యులు పేర్కొన్నారు. 24 గంటలలో డిశ్చార్జి చేస్తామని హోలిస్టిక్ వైద్యులు తెలిపారు. కల్పన ఆత్మహత్యయత్నానికి కుటుంబ కలహాలే కారణమన్న కోణంలో పోలీసులు భావిస్తున్నారు.
ఆసుపత్రిలో ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. కేరళలో చదవుకుంటున్న పెద్ద కూతురిని హైదరాబాద్ రమ్మని కోరానని, ఆమె మాత్రం కేరళలో ఉంటానని పట్టుబట్టిందని, దీంతో మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగానని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కల్పన చెప్పినట్లు తెలుస్తోంది.
కల్పన పెద్ద కూతురు దయా ప్రసాద్ కేరళ నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూశారు. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న కథనాలను తోసిపుచ్చారు. ఒత్తిడి గురవడంతో వైద్యులు ఇన్సోమ్నియా టాబ్లెట్ రాశారని, ఓవర్ డోస్ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని తెలిపారు. తమ కుటుంబం లో ఎటువంటి కలహాలు లేవని, మీడియా అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరింది.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. కాగా విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను తీశారని వర్మపై గతంలోనే సీఐడీకి ఫిర్యాదులు అందాయి. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆర్జీవీ సినిమా తీశారంటూ పలు చోట్ల సీఐడీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి సీఐడీ నోటీసులు పంపింది. అయితే, ఆయన దీనిని హైకోర్టులో సవాల్ చేశారు.
సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేశారని, ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా పిటిషన్లో పేర్కొన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని, తదుపరి చర్యలన్నింటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తమిళనాడులో దారుణం జరిగింది. అన్లైన్ రమ్మీ ఆటకు ఓ కుటుంబం బలి అయింది. భార్య మోహన ప్రియా, ఇద్దరు చిన్నారులు ప్రణీత, రాజీ ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. కరూర్ సమీపంలోని పశుపతిపాళయం దగ్గర రైలు కిందపడి ప్రేమ్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు. భార్య, ఇద్దరి పిల్లలను చంపిన తర్వాత ప్రేమ్రాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్లైన్ రమ్మీలో అప్పులు చేసి… ఆట ఆడినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో ప్రేమ్రాజ్ పేర్కొ్న్నాడు. ప్రేమ్రాజ్.. స్థానికంగా ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ప్రముఖ గాయని, బిగ్ బాస్ ఫేమ్ కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నిజాంపేటలో ఉంటున్న కల్పన మోతాదు కు మించి నిద్రమాత్రలు మింగడంతో అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా ఇంటి తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో తలుపు తెరిచిన అపార్ట్మెంట్ వాసులు అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కల్పనకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిజాంపేట్ వర్టెక్స్ ఫ్రీ విల్లాలో కల్పన నివాసం ఉంటున్నట్టు పోలీసులు చెప్పారు. ప్రముఖులు కల్పనను పరామర్శించారు. ఆమె సూసైడ్ అటెంప్ట్ కు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండో భర్తను ప్రశ్నించారు. ఇంట్లో గొడవలు లేవని ఆయన చెప్పినట్టు సమాచారం. ఫోన్లను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మన ఫోన్లో బ్యాటరీ అయిపోయిన వెంటనే ఛార్జింగ్ పెడుతుంటాం.. అయితే కొన్ని సార్లు ఎంత సేపు ఛార్జింగ్ పెట్టినా ఫోన్ ఛార్జ్ అవ్వదు. అలాంటప్పుడు వెంటనే దాన్ని రిపేర్ చేయించడానికి తీసుకెళ్తాం.. అలాకాకుండా దాన్ని మీరే రిపేర్ చేసుకునేలా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూద్దాం...
పోన్ ఎప్పుడైనా ఛార్జ్ కానట్లయితే మొదటగా చేయాల్సిన పని రీస్టార్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఛార్జింగ్ కాకపోవడానికి కారణమైన సాప్ట్వేర్ లోపాలు అదుపులోకి వస్తాయి. అదేవిధంగా ఫోన్లోని ప్రధాన భాగాలన్ని రిఫ్రెష్ అవుతాయి. ఫోన్లోని కొన్ని యాప్లు కూడా ఛార్జింగ్ సమస్యలకు కారణం కావచ్చు. కావున ఇటీవల డౌన్లోడ్ చేసిన యాప్స్లో ఒకటి మీ ఛార్జింగ్ సమస్యలకు కారణం అవచ్చు ఏమో అనేది ఓసారి చూసుకోండి. దాని వల్ల సమస్యే అనిపిస్తే వెంటనే వాటిని అన్ఇన్స్టాల్ చేయాలి. అలాగే వాటిలో ఉపయోగించని యాప్లనూ కూడా డిలీట్ చేయాలి.
కొన్ని సార్లు ఛార్జర్ పిన్ బాగలేకపోవడం వల్ల కూడా ఛార్జ్ కాకపోవచ్చు. ఛార్జింగ్ పెట్టే సమయంలో కేబుల్లోని తీగ వదులుగా ఉండవచ్చు, అడాప్టర్లో కూడా లోపాలు ఉండవచ్చు. మనం ఉపయోగించే కేబుల్ మంచిదా కాదా అని తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఫోన్ను యుఎస్బి ద్వారా డెస్క్ టాప్కు కనెక్ట్ చేయడం. ఒక వేళ మీ ఫోన్ను కంప్యూటర్ ఛార్జ్ చేస్తే, అడాప్టర్ లేదా సాకెట్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి.
మెుబైల్ ఛార్జ్ అవకపోవడానికి మరో సమస్య ఛార్జింగ్ పోర్ట్ వద్ద పేరుకుపోయిన ధూళి కణాలు విద్యుత్తు సరఫరా కాకుండా అడ్డు పడతాయి. కావున అక్కడ ఏమైనా దుమ్ము, ధూళి ఉంటే పొడిబట్టతో తుడువాలి. ఫోన్ లో నీరు చేరితే వెంటనే ఛార్జ్ చేయకూడదు. ముందు ఫోన్ లోపలి భాగాలు డ్రై అయ్యేలా చూసుకోవాలి. తడిసిపోయిన భాగాలను హెయిర్ డ్రయర్తో వేడి గాలిని పంపిస్తూ ఆరబెట్టాలి అలా చేసిన తర్వాత కనీసం ఒకరోజైనా ఛార్జ్ చేయకుండా ఉండాలి. ఇలా పోన్ ఛార్జ్ అవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కావున పై పరిష్కారాల ద్వారా ఛార్జీంగ్ సమస్యను అధిగమించవచ్చు.

స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణం కోసం బెర్త్ రిజర్వు కానటువంటి, వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులు జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాలి. వీరు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించడానికి ఈ టికెట్లు చెల్లవు. ఒకవేళ వెయిటింగ్ లిస్టెడ్ టికెట్లతో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా చెల్లించక తప్పదు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్లతో ఏసీ బోగీలో ప్రయాణిస్తే, ఆ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని, రూ.440 ఫైన్ను చెల్లించాలి. స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే, రూ.250 జరిమానాతోపాటు, తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని చెల్లించాలి.
రూల్ ఏంటి? ఫైన్ ఎంత?
వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లపై రిజర్వేషన్ కోచ్లలో ప్రయాణించడాన్ని ఇప్పుడు పూర్తిగా నిషేధించింది. అంటే మీ టికెట్ వేచి ఉండి ఉంటే, మీరు AC లేదా స్లీపర్ కోచ్లో ప్రయాణించలేరు. మీరు స్టేషన్ విండో నుండి టిక్కెట్ను ఆఫ్లైన్లో కొనుగోలు చేసినప్పటికీ. ఈ తరహా టిక్కెట్పై రిజర్వ్ చేసిన కోచ్లలో ప్రయాణించడాన్ని రైల్వే ఇప్పుడు నిషేధించింది. రిజర్వ్ చేసిన కోచ్లలో కన్ఫర్మ్ చేసిన టిక్కెట్లతో ప్రయాణించే వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం అమలులోకి వచ్చినప్పటికీ, వెయిటింగ్ టిక్కెట్పై ప్రయాణించే లక్షల మంది ప్రయాణికులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులు రిజర్వ్డ్ కోచ్లలో జర్నీ చేస్తే టీటీ అతడిపై రూ.440 ఫైన్ వేసి, దారిలో రైలు నుంచి దిగేలా చేయవచ్చని రైల్వే తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతంలో ఇలా..
జులై వరకు ఇండియన్ రైల్వేస్ లో స్టేషన్ విండో నుండి వెయిటింగ్ టిక్కెట్ను కొనుగోలు చేసినట్లయితే, అతను రిజర్వ్ చేయబడిన కోచ్లలో కూడా ప్రయాణించవచ్చు. అతనికి ఏసీ కోసం వెయిటింగ్ టికెట్ ఉంటే.. ఏసీలో వెయిటింగ్ టికెట్ ఉంటే ఏసీలో, స్లీపర్ వెయిటింగ్ టికెట్ ఉంటేస్లీపర్ కోచ్లో ప్రయాణించవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన టిక్కెట్లపై ఇలా ప్రయాణించడంపై ఇప్పటికే నిషేధం ఉంది. ఎందుకంటే ఆన్లైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే దానంతట అదే క్యాన్సల్ అవుతుంది.

వైసీపీ నేత, జగన్ సన్నిహితుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ భార్గవరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అత్యవసరంగా పిటిషన్ వేశారు. సజ్జల, అతని కుమారుడు ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే చంద్రబాబు, పవన్కల్యాణ్, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశానని పోసాని వాంగ్మూలం ఇచ్చారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నమోదుచేసిన కేసులో తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, ముందస్తు బెయిల్ మంజూరుచేయాలని కోరారు. తమను అమాయకులమని... తమను అనవసరంగా ఈ కేసులోకి లాగుతున్నారని వీరు కోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా, తమకు ఈ నేరంలో పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని కూడా పేర్కొన్నారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామని... ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆశా వర్కర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వనుంది. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. వర్కర్లందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. వీరిలో గ్రామాల్లో 37,017 మంది ఉంటే... పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి నెల జీతం కింద రూ. 10 వేలు అందుతోంది. ఇక సర్వీసు ముగింపులో గ్రాట్యుటీ కింద రూ. 1.5 లక్షలు అందే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com



