- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్ శనివారం సమీక్షించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎ.బాబు, హరి జవహర్లాల్, కన్నబాబు, హరికిరణ్, వీరపాండ్యన్లకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) సురేష్కుమార్కు రిపోర్టు చేయాలని ఈ అధికారులను ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది.ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టి సంఖ్య 1034 ద్వారా శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.శుక్రవారం ఉదయం 11 గం.లకు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

జపాన్లోని ఇషికావా ప్రిఫెక్చర్లో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది . సోమవారం తెల్లవారుజామున 6.31 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నోటో పీఠభూమిలో భూకంప కేంద్రం ఉన్నదని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నోటో నగరంలో ఐదు కంటే తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో జనవరి 1న సంభవించిన భూకంపంలో 230 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిదే అధికారమని... ఇండియా టుడే- మై యాక్సిస్ కూడా తేల్చిచెప్పింది. దాదాపు అన్ని కీలక సర్వేలు కూటమికే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఇండియా టుడే- మై యాక్సిస్ కూడా చేరింది. తెలుగుదేశం సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని... మిత్రపక్షాలు జనసేన 16 నుంచి 18 స్థానాల్లో, భాజపా 4 నంచి 6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. మొత్తంగా NDAకు 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్పోల్స్ ప్రకటించింది. ఇక అధికార వైకాపాకు 55 నుంచి 77 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది. కాంగ్రెస్కు 0 నుంచి 2 సీట్లు వస్తాయని తెలిపింది.

ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం అబ్బాయితో హిందూ అమ్మాయి వివాహం చెల్లుబాటు కాదని మధ్య ప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహాన్ని రిజిస్ట్రార్ వద్ద నమోదు చేయించుకునేందుకు పోలీసు భద్రత కల్పించాలని ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి కోర్టును ఆశ్రయించారు. పెండ్లి తర్వాత దంపతులిద్దరూ మతం మారబోరని యువతీయువకుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముస్లిం పర్సనల్ లాలో మతాంతర వివాహం నిషేధమే అయినప్పటికీ, ప్రత్యేక వివాహ చట్టం కింద చెల్లుబాటు అవుతుందని కోర్టుకు తెలిపారు. వీరి వాదనలను విన్న జస్టిస్ గుర్పాల్ సింగ్ అహ్లువాలియా.. హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని ప్రత్యేక వివాహ చట్టం కింద పెండ్లి చేసుకున్నప్పటికీ పర్సనల్ లా ప్రకారం నిషేధమైన ఈ వివాహం చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని సెక్టార్ 100లోని లోటస్ బ్లూబర్డ్ సొసైటీ ఫ్లాట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏసీలో పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం తర్వాత సొసైటీలో గందరగోళ వాతావరణం నెలకొంది. మంటల నుండి తప్పించుకోవడానికి, ప్రజలు తమ ఫ్లాట్లను వదిలి బయటకు వచ్చేశారు. అగ్నిప్రమాదంపై సొసైటీ ప్రజలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎయిర్ కండీషనర్లో పేలుడు కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతంలో విపరీతమైన వేడి విధ్వంసం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజురోజుకు అగ్ని ప్రమాదాల వార్తలు వస్తున్నాయి. ఉక్కపోత కారణంగా ఏసీ, కూలర్, ఫ్రీజ్ వంటి కూలర్ల వాడకం బాగా పెరిగింది.

దక్షిణ కొరియా కార్యకర్తలు తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఉత్తర కొరియా మంగళవారం రాత్రి నుంచి బెలూన్ల ద్వారా దక్షిణ కొరియాలోకి చెత్త, మురికి మట్టిని పంపింది. బుధవారం మధ్యాహ్నానికి దాదాపు 260 ఉత్తర కొరియా బెలూన్లు తమ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో వ్యర్థాలను జారవిడిచాయని దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి. బెలూన్లను, అవి విడిచిన వస్తువులనూ, పదార్థాలనూ తాకవద్దనీ, వాటి గురించి పోలీసులకు కానీ, సైన్యానికి కానీ తెలపాలని తమ పౌరులను అధికార వర్గాలు కోరాయి. దేశమంతటా రోడ్ల వెంబడి బెలూన్లు జారవిడచిన చెత్త చెల్లాచెదురుగా పడి ఉంది. రాజధాని సియోల్లో పడిన బెలూన్లో ఒక టైమర్ కనిపించింది. అది బెలూన్ను పేల్చడానికి ఉపయోగించిన టైమర్ అని దక్షిణకొరియా అధికారులు తెలిపారు. ఈ చెత్తలో ప్రమాదకర పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయేమో ఆరా తీయడానికి నిపుణుల బృందాలను నియమించారు. 2016లో ఉత్తర కొరియా బెలూన్ల వల్ల దక్షిణ కొరియాలో కార్లు, ఇతర ఆస్తులు దెబ్బతిన్నాయి. ఈ సారి ఏమైనా నష్టం జరిగిందా అన్నది తెలియరాలేదు.

పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. బలూచిస్థాన్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్థాన్లోని టర్బాట్ నగరం నుంచి ఉత్తరాన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయల్దేరింది. ఈ క్రమంలో కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 మంది వరకు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ వారం సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, PVR మరియు INOX థియేటర్లు ఒక అద్భుతమైన ఆఫర్ను ప్రకటించాయి. వారు ఈ ఫ్రైడే మాత్రమే సినిమా టికెట్లను కేవలం రూ.99కే అందించబోతున్నారు. ఈ ఆఫర్ అన్ని సినిమాలకు మరియు అన్ని షో టైమ్లకు వర్తిస్తుంది.

మిజోరంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. నిరాటంకంగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు సెలవు ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేయాలని కోరిట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో పలు జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లను మూసివేసినట్లు తెలిపారు. ఇక, జాతీయ రహదారి 6పై కొండ చరియలు విరిగిపడటంతో.. ఐజ్వాల్కు ఇతర ప్రాంతాలతో ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మరో రెండ్రోజులు అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావారణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

అమెరికాను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఓక్లహోమా, ఆర్కాన్సాస్లలో పరిస్థితులు దారుణంగా మారాయి. టోర్నడోలు ధాటికి ఇప్పటివరకు 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్లో ఓక్లహామా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి.ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.భీకర గాలుల విధ్వంసానికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.పెద్దసంఖ్యలో చెట్లు నేలకూలాయి.వేలాది సముదాయాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.చెట్లు, విద్యుత్తు లైన్లు కూలిపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని. అధికారులు వెల్లడించారు. డల్లాస్, డెంటన్ తదితర చోట్ల ఏర్పడిన టోర్నడోల ధాటికి అనేక వాహనాలు తిరగబడ్డాయి. దీంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ టెక్సాస్, న్యూ మెక్సికో, అరిజోనా, కొలరాడో, ఓక్లహామాలోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదం ఉందనే.. హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చేది NDA సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. PTI వార్తాసంస్థతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడిన అమిత్ షా ఏపీలో తాము దాదాపు 17 లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా . 400కు పైగా సీట్లు సాధిస్తామన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా, విపక్ష పార్టీల పాలనలోని.... రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని షా ధీమాగా పేర్కొన్నారు. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందని జోస్యం చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి -UCC తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు.UCCని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల భుజస్కంధాలపై ఉంచారని.......... షా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ నిర్దేశించిన మూలసూత్రాల్లో యూసీసీ కూడా ఉందని చెప్పారు. తమ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి వచ్చే ఐదేళ్లలో UCCని అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో నియామకం కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటాన్ని షా తప్పుబట్టారు. అగ్నిపథ్ కంటే ఆకర్షణీయ పథకం యువతకు ఇంకొకటి ఉండదన్నారు.

ఉత్తరప్రదేశ్లోని షాజాహాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షాజాహాన్పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఓ లారీ ఆగిఉన్న బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు.
శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో భక్తులతో కూడిన బస్సు రాత్రి భోజనం కోసం ఓ దాబా వద్ద ఆగి ఉంది. బస్సులోని కొందరు భోజనం తింటుండగా, మరికొందరు బస్సులో ఉన్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అధి బస్సుపైకి దూసుకురావడంతో 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు. బస్సులో మొత్తం 70 మంది ఉన్నారని, వారంతా ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ నుంచి ఉత్తరాఖండ్లోని పూర్ణగిరికి తీర్థయాత్రకు వెళ్తున్నారని చెప్పారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న చాలా మంది సగం నిద్రలో ఉన్నారు. మహిళలు, పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది. వారంతా డంపర్ కింద సమాధి అయ్యారు.

కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసులకు ఓబీసీ కింద జారీ చేసిన సర్టిఫికెట్లన్నింటిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు... ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్నవారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది

బస్సు, రైల్లో రద్దీ ఎక్కువైతే ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంగా విమానంలో కూడా ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ఇండిగో ప్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు.
ముంబై విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకొన్నది. ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి. టేకాఫ్కు ఫ్లైట్ సిద్ధమైంది. ఇదే సమయంలో ఓవర్ బుక్ అయిన అఖిలేశ్ చౌబే అనే ప్రయాణికుడు విమానంలో నిలబడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది.. పైలట్ను అలర్ట్ చేశారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి వెనక్కు మళ్లించాడు. నిలబడ్డ ప్రయాణికుడిని దింపేసిన అనంతరం గంట ఆలస్యంతో విమానం బయలుదేరింది. బుకింగ్ విషయంలో చిన్న తప్పిదం జరిగిందని ఇండిగో సంస్థ తెలిపింది.

అదనపు కట్నం కోసమో, మద్యం మత్తులోనో భర్తలు వేధిస్తున్నారని భార్యలు ఫిర్యాదులు చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా భార్యనుంచి తనకు ప్రాణహాని ఉంది రక్షించండంటూ ఓ బాధితుడు పోలీసులు వేడుకుంటున్నాడు. APలోని అమలాపురానికి చెందిన టెమూజియన్ మల్లారెడ్డి కళాశాలలో ఇంగ్లీష్ ఆచార్యునిగా పనిచేస్తూ హైదరాబాద్లోని ఆల్వాల్ నివాసం ఉంటున్నాడు. ఏపీలోని రాజోలుకు చెందిన అమ్మాయితో ఏడేళ్ల క్రితం తనకు వివాహం కాగా ఐదేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపాడు. పెళ్లైనప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా హింసిస్తోందని ఆవేదన వెలిబుచ్చుతున్నాడు. గతంలో పలుమార్లు దాడి చేయగా పెద్దమనుషులు సర్ది చెప్పారని వివరించారు. అయినా తీరు మార్చుకోకుండా ఇటీవల మళ్లీ కత్తితో దాడి చేసిందంటూ గాయాలు చూపించాడు. స్థానిక ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవట్లేదంటూ గోడు వెలిబుచ్చాడు.

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. ఆయా రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో పరిస్థితి చూసుకోవాలని హితవు చెప్పారు. బీజేపీ నేతలను రాజకీయ పర్యాటకులు అని అభివర్ణించారు. ఒడిశాలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారం తెర పడింది. అధికార బీజేడీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పెరిగింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగుతున్నాయి. బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్ గఢ్, హర్యానా, అసోం రాష్ట్రాల సీఎంలు ఒడిశా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీకి అధికారం ఇస్తే ఒడిశాను నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని హామీలు గుప్పించారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ వీడియో సందేశం ద్వారా స్పందించారు. ఒడిశాలో కంటే అసోంలో తలసరి అప్పు రెట్టింపు అని, మీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండని సూచించారు. తమ పార్టీ నేతలను పొలిటికల్ టూరిస్టులు అని నవీన్ పట్నాయక్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయ టూరిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు.

పంజాబ్లోని అమృత్సర్లో శనివారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్జీత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో జరిగిన ఘటనలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలయ్యాయి. దీంతో అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అమృత్సర్ నుంచి గుర్జీత్ సింగ్ వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2017 ఉప ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అమృత్సర్ లోక్ సభ స్థానం నుంచి ఈసారి కాంగ్రెస్ తరఫున గుర్జీత్ సింగ్, బీజేపీ తరఫున తరణ్జిత్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కుల్దీప్ సింగ్ బరిలో నిలిచారు.

లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోట్లాది రూపాయల అక్రమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న ఆరోపణతో నాందేడ్లోని భండారి ఫైనాన్స్, అదినాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్లపై దాడులు జరిపి లెక్కల్లో చూపని రూ.170 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.140 కోట్ల నగదుతో పాటు 8 కేజీల బంగారం కూడా ఉన్నది. స్వాధీనం చేసుకున్న నగదును లెక్కపెట్టడానికి అధికారులకు 14 గంటల సమయం పట్టింది. మే 10న వందలాది మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు ప్రాంతాల్లోని ఈ సంస్థల కార్యాలయాలు, వాటి యజమానుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు.వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి.

బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా తల్లీకుమారుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ జూన్ 1న చివరిదశలో పోలింగ్ జరగనుండగా.. నామినేషన్లకు మంగళవారం తుది గడువు. తొలుత పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా పవన్సింగ్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే.. తన పాటలపై ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని చెప్పి, సొంత రాష్ట్రం బిహార్లోని కారాకట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో ఎన్డీయే అభ్యర్థిపై ఇండిపెండెంట్గా పోటీ చేయడాన్ని భాజపా తీవ్రంగా పరిగణించింది. పోటీ నుంచి వైదొలగాలనీ, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజాగా అదే నియోజకవర్గం నుంచి ఆయన తల్లి పోటీకి దిగడం విశేషం. కాగా, ఈ ఎన్నికల్లో బెంగాల్లోని అసన్సోల్ బీజేపీ టికెట్ను తిరస్కరించిన పవన్ సింగ్ తన సొంత రాష్ట్రమైన బీహార్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి నామినేషన్ వేశారు.

రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ ఈ టర్మ్లో తన తొలి విదేశీ పర్యటనలో చైనాలో చేయనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో పుతిన్ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నిక కాకముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు.
చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ జీ జిన్పింగ్తో పుతిన్ సమావేశం కానున్నారు. ఇరు దేశాల నడుమ దౌత్య సంబంధాలపై వారు చర్చించనున్నారు. రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్పింగ్ ఆహ్వానం మేరకు పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గతవారమే ఐరోపాలో అయిదు రోజుల పర్యటన ముగించుకొని వచ్చారు. ఐరోపాలో రష్యాకు సన్నిహితమైన సెర్బియా, హంగరీలనూ జిన్సింగ్ సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్తో జరిపిన చర్చల్లో రష్యాకు ఆయుధాలను కానీ, యుద్ధానికీ, పౌర ప్రయోజనాలకు రెండింటికీ ఉపకరించే సాధనాలను కానీ సరఫరా చేయబోమని జిన్పింగ్ హామీ ఇచ్చారు.

దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. వారణాసి బీజేపీ అభ్యర్థిగాప్రధా ని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచంలోనే భారతదేశం కీలకపాత్ర పోషించబోతుందని ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారతమే లక్ష్యంగా మోదీ కృషిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్డీయేదే విజయం అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. వైసీపీ నేతల దౌర్జన్యాలకు దిగుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా బలవంతంగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరపడి అరాచకాలకు ఒడిగడుతున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయిలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైసీపీ నేతలు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లిపోయారు. తమ ఏజెంట్ను కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీగా క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 96 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్లో ఉదయం నుంచే ఓటర్లు భారీగా బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భారీగా ఓటర్లు బారులు తీరడంతో ఈసారి జమ్ముకశ్మీర్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగో విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉజ్జయిన్ పోలింగ్ స్టేషన్లో మధ్యప్రదేశ్ CM మోహన్యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ఓటు వేసేందుకు తెల్లవారుజామునుంచే భారీ క్యూ ఉండడంతో అల్పహారం అందించారు. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం , ఐస్క్రీమ్లు అందించారు.
నాలుగో దశలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. బిహార్లోని బెగుసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ పోటీ చేస్తున్నారు. మరో కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఝార్ఖండ్లోని ఖూంటీ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్రంజన్ చౌధరీ బంగాల్లోని బహరంపుర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్య వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు శత్రుఘన్సిన్హా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం కన్నౌజ్ నుంచి బరిలో నిలిచారు.

ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారి పల్లె పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేతలు అరాచకానికి ఒడిగట్టారు. టీడీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. టీడీపీ ఏజెంట్పై దాడి చేసి పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు లాగేశారు. అనంతపురం జిల్లా చాపాడు మండలంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వైసీపీ నాయకులు గుంపులుగా వచ్చారు. వారిని కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కర్నూల్ జిల్లా హాలహర్వి 74, బాపురం 22 నెంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదు. మరోవైపు తెలంగాణలో మాత్రం లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.

అలాగే సీఎం జగన్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పులివెందులలోని భాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్-భారతి దంపతులు ఓటు వేశారు.

హైదరాబాద్ ఫిలింనగర్లో ఓటు వేసిన ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ వేశారు.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా శనివారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. దీంతో అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు భారీగా గుమికూడారు. సెక్షన్ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అల్లు అర్జున్ సహా ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీచేశారు. దీంతో ఓ లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు పట్టుబడ్డాయి. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు. అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.. హైవేలు, ఇతర రోడ్లు అనే తేడా లేకుండా చెక్పోస్టులు పెట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు.. ఇలా ఇప్పటికే కోట్లాది రూపాయలు పోలీసుల తనిఖీల్లో సీజ్ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు వద్ద.. తాజాగా భారీగా నగదు సీజ్ చేశారు. ఓ లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు..

లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా నిలిచే కోడె మొక్కులను ప్రధాని తీర్చుకున్నారు. అనంతరం ప్రధానికి వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆయనను ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక మెమొంటో, శాలువాతో సత్కరించడం జరిగింది. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి భాజపా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ వేములవాడ, వరంగల్లో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రసంగించనున్నారు. మొదట వేములవాడ సభలో పాల్గొని అక్కడి నుంచి వరంగల్ వెళ్లనున్నారు. అక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్కు మద్దతుగా బహిరంగ సభలో మోదీ మాట్లాడుతారు.

తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. అధ్యక్షుడు జెలెన్స్కీ సహా మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ కైరోలో బుడనోవ్, ఎస్బీయూ చీఫ్ వాసిల్ మాల్యుక్ తదితరులు ఈ హిట్ లిస్టులో ఉన్నారని తెలిపింది. ఈ కుట్రకు సంబంధించి దేశంలోని అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ పన్నిన హత్యా ప్రణాళిక అమలులో వారిది అనుమానాస్పద పాత్ర ఉన్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2022లో ఆ కర్నల్స్ను విధుల్లోకి తీసుకున్నట్లు ఓ ప్రకటన వివరించింది. గతంలో కూడా జెలెన్స్కీ అంతానికి రష్యా పలుమార్లు కుట్ర పన్నినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. దేశాధినేతను పట్టుకుని చంపించాలనుకుందని, దానిలో భాగంగా, జెలెన్స్కీ భద్రతకు దగ్గరగా ఉన్న మిలిటరీలోని బలమైన నేరస్థులను కనుగొనడం రష్యా గూఢచారి సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ లక్ష్యంగా పెట్టుకుందని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు చెప్పారు. యుద్ధం ప్రారంభయ్యాక తనపై కనీసం ఐదుసార్లు హత్యా యత్నాలు జరిగాయంటూ జెలెన్స్కీ గతంలో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లుతోందని ముఖ్యమంత్రి జగన్ నిర్వేదం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె, మచిలీపట్నంలో సిద్దం సభలో పాల్గొన్న జగన్ సాధ్యం కానీ హామీలతో తెలుగుదేశం మేనిఫెస్టో ఇచ్చిందన్నారు. తాము ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామన్నారు. రైతుభరోసా కేంద్రాలతో అన్నదాతకు అండగా నిలిచామని తెలిపారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఏనాడు పేదల సమస్యలు పట్టించుకోలేదంటూనే..ఈ ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.

ఘట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరికి ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆయనకు విముక్తి లభించింది. ఇందుకు సంబంధించి ఘట్కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం, ఘట్కేసర్లోని అంబేడ్కర్ నగర్కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ (50), భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భార్య పేరిట ఉన్న స్థలంలో నరసింహ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు నరసింహ తన పేరు మీద ఉన్న మరో స్థలం అమ్ముతానని భార్యకు చెప్పాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభించలేదు. గత నెల 30న నరసింహ యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారంలో ఉన్నట్లు భారతమ్మ తెలుసుకుంది. కుమారులతో కలిసి వెళ్లి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం నరసింహను గదిలో వేసి ఇనుప గొలుసులతో కట్టేసి తాళం వేసింది. ఇంటి స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని అతడిని చిత్రహింసలు పెడుతున్నది. అయితే ఈ తతంగాన్నంతా వీడియో తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికున్న పోలీసులు నరసింహను విడిపించి స్టేషన్కు తరలించారు. భార్య భారతమ్మ, కుమారుడు గణేశ్, రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. ఆ రెండు దేశాలకు ప్రయాణాలు చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, భారత ఎంబసీతో టచ్లో ఉండాలని పేర్కొన్నది. ఈ రెండు దేశాల గగనతలంలో వాణిజ్య విమానాలకు అనుమతించిన నేపథ్యంలో ఎంఈఏ ఈ సూచన చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. కాగా, కమర్షియల్ విమానాల రాకపోకల కోసం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఇటీవల తమ గగనతలాలను తిరిగి ప్రారంభించాయి. అయితే ఉద్రిక్తతలు కొనసాగితే, గగనతలం తెరిచే ఉంటుందని కచ్చితంగా చెప్పలేమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గత నెల ఇజ్రాయెల్పై వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు వాటన్నింటినీ నిరోధించిన ఇజ్రాయెల్.. ఎదురుదాడికి సిద్ధమైంది. దాంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ దళాలు, హెజ్బొల్లా మధ్య సరిహద్దులో రోజూ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆ రెండు దేశాల్లో ఉన్న/వెళ్లాలనుకునే వారి కోసం గతంలోనే ఎంఈఏ అడ్వైజరీ జారీ చేసింది. తాజాగా వాటికి సంబంధించి అప్డేట్ ఇచ్చింది.

తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పలుప్రాంతాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.7డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెం, మంచిర్యాల జిల్లా హాజిపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.5 డిగ్రీలు రికార్డైనట్టు..... హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబాబాద్, నారాయణపేట్, జయశంకర్, వరంగల్, ములుగు, జనగామ వనపర్తి, గద్వాల్, నాగర్కర్నూల్, హనుమకొండ, కొత్తగూడెం, నిర్మల్, మహబూబ్నగర్, మేడ్చల్-మల్కాజ్గిరి,నిజామాబాద్ జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. కుమరంభీం...., సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 45, హైదరాబాద్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.

అమెరికా హూస్టన్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో శాన్ జసింటో నది ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఉత్తర హారిస్ కౌంటీ నది పరిసరాల్లో ఉన్నవారిని అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయిస్తున్నారు. రహదారులు నీటితో నిండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని...పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయని స్థానికులు తెలిపారు. . అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా- అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచింది. మోకాలి లోతుకు పైగా వర్షపు నీరు నిలిచిపోయింది. సబ్బేలన్నీ వరద నీటితో నిండిపోయాయి. చెరువులను తలపించాయి.

జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం భారీగా కూరవడంతో రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది, రెడ్క్రాస్ రంగంలోకి దిగి సహాయ సహకారాలు అందిస్తున్నారు.బిసింగర్ మార్కెట్ చౌరస్తాలో మీటరు ఎత్తులో నీరు నిలిచిపోయింది. ఇక గుటెన్బర్గ్ కిండర్ గార్డెన్ ఎదుట ఉన్న నిర్మాణ స్థలం కొట్టుకుపోయింది. ఇక పలు ప్రాంతాల్లో అయితే రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. వాహనాలన్నీ ఒక దగ్గరు పోగుపడ్డాయి. వరదలు కారణంగా పలు రోడ్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే బాడెన్-వుర్టెంబర్గ్లో ప్రజలు కార్లలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎవరైనా చనిపోయారా? ఎంత నష్టం జరిగింది అన్న విషయం ఇంకా తెలియలేదు. నీళ్లు తగ్గితేనే గానీ.. అధికారులు అంచనా వేయలేరు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిత్యావసర వస్తువులు అందక.. చాలా చోట్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com



