చిట్టి న్యూస్

IMD: ఈసారీ మండిపోనున్న ఎండలు!

1901 తర్వాత భారతదేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శుక్రవారం వెల్లడించింది. మొదటిసారిగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత అత్యంత వెచ్చని ఫిబ్రవరి నమోదైంది.

ఇది గోధుమ, శనిగ వంటి పంటలకు ముప్పు కలిగించవచ్చని హెచ్చరించింది. మార్చి నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ వెల్లడించారు. 2023 తర్వాత గరిష్ట ఉష్ణోగ్రత పరంగా ఫిబ్రవరి 2025 రెండో అత్యంత వెచ్చనిది. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టవచ్చని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.

AP: పోసాని కేసులో కోర్టు కీలక తీర్పు

అనుచిత వ్యాఖ్యల కేసులో నటుడు పోసాని కృష్ణ మురళికి.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ముందు పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం... పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోసానిని కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసులో రైల్వే కోడూరు కోర్టులో రాత్రంతా వాదనలు కొనసాగాయి. రాత్రి 9.30కు పోసానిని కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు 10 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5.30 వరకు సుమారు 7 గంటలపాటు వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం... పోసానికి మార్చి 13 వరకు రిమాండ్ విధిస్తూ రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.

IMD Warning: ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు

ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలతో సహా ఇతర రాష్ట్రాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఇక గురువారం ఉదయం నుంచి ఢిల్లీలో మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం చిరు జల్లులు పడుతున్నాయి. బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఇక జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.

ఉత్తర పాకిస్తాన్, దాని పరిసర ప్రాంతాల్లో పశ్చిమ దిశలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీని ఫలితంగా పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Edible Cementఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్‌

ఆహార వ్యర్థాలు వృథా కాకుండా వినియోగించుకునేందుకు ఇండోర్‌ ఐఐటీ పరిశోధకులు ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఆ వ్యర్థాలను ‘ఈ-కొలి’ లాంటి నాన్‌-పాథోజెనిక్‌ (వ్యాధులను సంక్రమింపజేయని) బ్యాక్టీరియాతో కలిపి కాంక్రీట్‌లో మిళితం చేయడం ద్వారా దృఢమైన నిర్మాణ పదార్థాన్ని తయారు చేశారు. నిర్మాణ బలాన్ని రెట్టింపు చేయడంతోపాటు కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేయడం ఈ కాంక్రీట్‌ ప్రత్యేకత. ఆహార వ్యర్థాలు కుళ్లిపోతే కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలవుతుంది.

ఆ వ్యర్థాలతోపాటు బ్యాక్టీరియాను కాంక్రీట్‌లో కలిపితే అందులో ఉండే కాల్షియం అయాన్లతో కార్బన్‌ డయాక్సైడ్‌ చర్య జరిపి కాల్షియం కార్బొనేట్‌ స్ఫటికాలను ఏర్పరుస్తుందని ఇండోర్‌ ఐఐటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ సందీప్‌ చౌదరి వెల్లడించారు. ఈ స్ఫటికాలు కాంక్రీట్‌లోని రంధ్రాలు, పగుళ్లను పూడ్చేస్తాయని, తద్వారా ఆ కాంక్రీట్‌ బరువుపై పెద్దగా ప్రభావమేమీ చూపదని, పైగా దాని దృఢత్వాన్ని బాగా పెంచుతాయని ఆయన వివరించారు.

Jamili Elections: జమిలి ఎన్నికలు అప్రజాస్వామికం కాదు

లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం అప్రజాస్వామికం కాదని, దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు ఎటువంటి హాని జరగదని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘం సభ్యుల ప్రశ్నలకు ఈ మంత్రిత్వ శాఖలోని లెజిస్లేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ స్పందించింది.

 మన దేశంలో గతంలో 1951 నుంచి 1967 వరకూ జమిలి ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుచేసింది. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధింపు సహా పలు ఇతర కారణాల వల్ల జమిలి ప్రక్రియ ఆగిపోయిందని పేర్కొంది. కమిటీ వేసిన మరికొన్ని ప్రశ్నలకు పూర్తి వివరాలతో బదులిచ్చేందుకుగాను.. ఆ ప్రశ్నలను ఎన్నికల సంఘానికి న్యాయ శాఖ పంపినట్లు సమాచారం. ఈ అంశంపై తదుపరి సమావేశాన్ని కమిటీ మంగళవారం నిర్వహించనుంది.


Patna: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం

 ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు కూలీలతో వెళ్తున్న ఆటో ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఆరుగురు కూలీలతోపాటు డ్రైవర్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బీహార రాష్ట్రం పట్నాజిల్లాలోని మాసౌర్హి- నౌబత్‌పూర్‌ రహదారిపై ధనిచక్‌మోర్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతిచెందిన కూలీలు అంతా పట్నా జిల్లాలోని డోరిపూర్‌ గ్రామానికి చెందినవారు కాగా.. డ్రైవర్‌ సుశీల్‌కుమార్‌ హన్సదిహ్‌ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆరుగురు కూలీలు పనికి వెళ్లి సాయంత్రం ఆటోలో ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టగానే రెండు వాహనాలు రోడ్డు పక్కనున్న లోతైన నీటి గుంతలో పడిపోయాయి. దాంతో జేసీబీల ద్వారా మృతదేహాలను బయటికి తీశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. జేసీబీని రప్పించి నీటి గుంతలో నుంచి మృతదేహాలను బయటికి తీయించారు. అనంతరం పోస్టుమార్టానికి పంపించారు. లారీ డ్రైవర్‌ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Trump:   2 వేల యూఎస్‌ ఎయిడ్ ఉద్యోగులపై వేటు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు. రెండో విడత పాలనలో ట్రంప్ చర్యలు మరింత స్పీడ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ముందుగా చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే పనిని మొదలుపెట్టారు. తాజాగా రెండు వేల మంది ‘యూఎస్‌ ఎయిడ్’ ఉద్యోగులపై వేటు వేశారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్ది మందిని మినహాయించి మిగిలిన వారికి బలవంతపు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్‌ జడ్జి అనుమతించిన తర్వాతే ఉద్యోగులపై వేటు పడింది. తొలగింపు నిలిపివేయాలంటూ ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించింది. యూఎస్‌ ఎయిడ్‌ ద్వారానే ప్రపంచంలోని పలు దేశాలకు సాయం అందుతుంది.

 ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ ద్వారా ప్రపంచ దేశాలకు అందుతున్న సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  ఇటీవలే నిలిపివేసిన విషయం తెలిసిందే. మన దేశంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఈ సంస్థ ద్వారా భారత్‌కు అందుతున్న రూ.182 కోట్ల (21 మిలియన్‌ డాలర్లు) సాయాన్ని కూడా నిలిపివేశారు. ఈ క్రమంలో ట్రంప్‌ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2 వేల మంది యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై  వేటు వేశారు.

ప్రపంచవ్యాప్తంగా కేవలం కొంతమందిని మినహాయించి మిగిలినవారికి బలవంతపు సెలవులు ప్రకటించారు. ఈ విషయం యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ వెబ్‌సైట్‌లోని నోటీసు ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్‌ జడ్జి అనుమతించిన తర్వాత యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై వేటు విషయంలో ట్రంప్‌ యంత్రాంగం ముందుకెళ్లినట్లు తెలిసింది. తమ తొలగింపు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి కార్ల్‌ నికోలస్‌ తిరస్కరించారు.

కాగా, రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప.. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌కు అప్పగించారు. డోజ్‌ బాధ్యతలు చేపట్టిన మస్క్‌.. ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అనేకమంది యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే.

కాగా, USAIDలో ప్రస్తుతం 10వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు యూఎస్‌ మీడియా తెలిపింది. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలో 9,700 మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్‌ యంత్రాంగం ప్లాన్‌ చేస్తోంది. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్‌ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండేలా సవరణలు కూడా చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Maha Kumbh Mela: కుంభమేళాపై తప్పుడు కథనాలు..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలతో ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పటి దాకా 42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. మరికొద్దిరోజుల్లో మహా కుంభమేళా ముగియనుంది. ఇక ఈనెల 26న మహా శివరాత్రి కారణంగా అత్యధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఇందుకు తగినట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తోంది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఆయా సంస్థలు లేనిపోని తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. అలాంటి సోషల్ మీడియా సంస్థలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. తప్పుదారి పట్టించే కంటెంట్‌ను పోస్టు చేసిన 140 సోషల్ మీడియా సంస్థలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు మహా కుంభమేళా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) వైభవ్ కృష్ణ తెలిపారు. ఇక ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పండుగకు అవసరమైన ఏర్పాట్లను పోలీసులు చేశారని తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని ప్రగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Kash Patel : భగవద్గీత సాక్షిగా కాష్‌ పటేల్‌ప్రమాణం

 భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌ భగవద్గీతపై ప్రమాణం చేసి నూతన ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవీ బాధ్యతల్ని చేపట్టారు. అమెరికాలో అత్యంత కీలకమైన దర్యాప్తు సంస్థకు ఓ భారతీయ అమెరికన్‌ డైరెక్టర్‌ కావటం ఇదే మొదటిసారి. దేశ అత్యున్నత సంస్థకు నేతృత్వం వహించటం జీవితంలో తనకు లభించిన ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటూ కాష్‌ పటేల్‌ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ, ‘ఎఫ్‌బీఐకి ఉత్తమ డైరెక్టర్‌ అవుతారు. ఏజెంట్స్‌ ఇష్టపడే వ్యక్తి అవుతాడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. వాషింగ్టన్‌లోని 1000 మంది ఎఫ్‌బీఐ ఏజెంట్లను బదిలీ చేయాలని కాష్‌ పటేల్‌ ఆదేశించినట్టు సమాచారం.

AP: మహిళల రక్షణ కోసం సురక్ష యాప్

మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని పోలీసులను హోంమంత్రి అనిత ఆదేశించారు. అలాగే సురక్ష పేరుతో రూపొందిస్తున్న ప్రత్యేక యాప్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. మార్చి 8 కల్లా యాప్ రూపకల్పన పూర్తి కావాలన్నారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని పేర్కొన్నారు. విద్య, సాధికారిత, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందన్న వంగలపూడి అనిత.. విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్కుల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై హోం మంత్రి చర్చించారు. మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Sonia Gandhi : వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ..

రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షణలో సోనియా గాంధీ ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆసుపత్రి బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ తెలిపారు. గతేడాది డిసెంబరు నెలలో సోనియా 78వ పడిలో ప్రవేశించారు.

Earthquake :  మేఘాలయను వణికించిన భూకంపం

ఈశాన్య రాష్ట్రం మేఘాలయ ను భూకంపం వణికించింది. గారో హిల్స్‌ లో గురువారం ఉదయం 11:32 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, బుధవారం రాత్రి కూడా మేఘాలయలో భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలోనే మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Kerala Twins: కవల సోదరుల్ని పెళ్లి చేసుకున్న కవల సోదరీమణులు

కొందరు కవలల్లో అస్సలు తేడా గుర్తించలేం. అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు. కేరళకు చెందిన ఈ కవల సోదరీమణులు కూడా అలాంటివాళ్లే.. ఈ కవలలు పెళ్లి చేసుకున్నారు. తమలాగే అచ్చం ఒకేలా ఉండే కవల సోదరులనే ఈ ఐడెంటికల్ ట్విన్స్ పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు కవల అబ్బాయిలు కూడా ముమ్మూర్తులా ఒకేలా ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లిలో ఈ కవల జంటలు ధరించిన దుస్తులు కూడా ఒకేలాగా ఉన్నాయి. వేద మంత్రాల సాక్షిగా ఈ  జంటలు ఒక్కటయ్యారు. ఈ నూతన కవల జంటలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Union Cabinet: నేడు  కేంద్ర మంత్రి మండలి సమావేశం.. కీలక నిర్ణయాలు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 19) కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టాక్. ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. ఆ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్య యుద్ధం ప్రకటించారు. దీనిపై ప్రధాని మోడీ చర్చించినా ప్రయోజనం లేకుండా పోవడంతో.. ట్రంప్ నిర్ణయాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, కేబినెట్ మీటింగ్ లో అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ప్రధాన విధాన, పాలన సంబంధిత అంశాలపై చర్చించడానికి ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు మంత్రి మండలి సమావేశాలను నిర్వహిస్తున్నారు.

Upasana Interesting Post : ప్రేమికుల రోజు..ఉపాస‌న ఇంట్రెస్టింగ్ పోస్టు

మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్ వైస్ చైర్ పర్సన్ గా ఉంటూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాంచరణ్ తేజ్ ను ఉపాసన ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబీకుల మధ్య గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. దాదాపు వీరికి పదకొండేళ్ల తర్వాత క్లీంకార జన్మించింది. తరచూ ఉపాసన ఫ్యామిలీకి సంబంధించినవి, వెకేషన్స్ పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికంగా అభిమానులతో పంచుకుంటుంది. అందులో క్లింకార కూడా ఉన్నప్పటికీ.. ఫేస్ ను మాత్రం ఎమోజీలతో కవర్ చేస్తూ క్లీంకారపై క్యూరియాసిటీని పెంచుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదిక అయిన ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ రాసుకొచ్చింది. వాలెంటైన్స్ డే 22 ఏండ్లు అంతకన్నా చిన్న వయస్సున్న బాలికల కోసం.. మీ వయస్సు 22 దాటిందా..! ఆంటీ దయచేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం వేచి ఉండండి' అని రాసుకొచ్చింది. కింద రెండు నవ్వే ఎమోజీలను జోడించింది.

Ram Charan Parrot : తిరిగొచ్చిన రామ్ చరణ్ చిలుక

సినీ నటుడు రామ్ చరణ్ నివాసంలో పెంపుడు చిలుక ఈ మధ్య కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ఉపాసన ట్వీట్ చేయగా.. యానిమల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెతికి పట్టుకొని అప్పగించారు. రామ్ చరణ్ కుటుంబం కుట్టి అనే ఆఫ్రికన్ గ్రేచిలకను పెంచుకుంటోంది. రెండు రోజుల క్రితం చిలుక తప్పిపోయిందని, కనిపిస్తే చెప్పండి అంటూ ఉపాసన సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ చేశారు. పోస్ట్ను చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు చిలుకను వెతికి పట్టుకుని రామ్ చరణ్ దంపతులకు అప్పగించారు. చిలుకను ఇంటికి తీసుకురాగానే అది చరణ్ భుజంపై కూర్చుంది. తన పెట్ ను తిరిగి అప్పగించిన యానిమల్ వారియర్స్ టీమ్ కు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. చిలుకను ఎలా కనిపెట్టామనేది యానిమల్ వారియర్ టీమ్ వివరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Lok Sabha: ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

పార్లమెంట్‌లో ఆదాయపు పన్ను కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్‌ ఓం బిర్లా వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. దశాబ్దాల కాలం నుంచి మనుగడలో ఉన్న ఆదాయపు పన్ను బిల్లు స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు కేంద్రం కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్యే నిర్మలా సీతారామన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేయగానే లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది.


ARREST: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. ఏపీలో గత ఎన్నికలకు ముందు జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో అరెస్ట్ చేశారా.? లేదా మరో కేసులో వంశీని అదుపులోకి తీసుకున్నారా.? అనే విషయాలపై మరికాసేపట్లో ఏపీ పోలీసులు క్లారిటీ ఇవ్వనున్నారు. ఒకవేళ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఇందులో వల్లభనేని వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. ఈలోపే వంశీ అరెస్టు అవడం ఇప్పుడు కీలకంగా మారింది. 2023 ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది.


Beer Prices Hike : పెరిగిన బీర్ల ధరలు.. అమలులో ఉన్న రేట్లు ఇవే

రాష్ట్రంలో బీర్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెంచిన బీర్ల ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం ప్రస్తుతం బీర్ల ఎమ్మార్పీ ధరలపై 15 శాంతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే బీర్లతో పాటు ఇతర మద్యం ధరలపై పలు రాష్ట్రాల్లో త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసింది.

రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచేందుకు తిసభ్య కమిటీ సిఫార్సును అబ్కారీ శాఖ నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసింది. ముఖ్యంగా బ్రాండెడ్ బీర్లు, బ్రాండెడ్ మద్యం, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. త్రిసభ్య కమిటీ కూడా 15 నుంచి 19 శాతం పెంచేందుకు నివేదిక ఇవ్వగా 15 శాతం బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒక్క బీర్ల పెట్టె మీద 15 శాతం బేసిక్ ధర పెంచితే, దానికి కనీసం రూ.250 నుంచి రూ. 280 వరకు వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో రూ.150 ఉన్న లైట్ బీర్ రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరిగాయి. కొత్త రేట్లతో ప్రభుత్వానికి నెలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 700 మేరకు అదనపు ఆదాయం కూరే అవకాశం ఉందని అబ్కారి శాఖ అధికారులు చెబుతున్నారు. 

Saudi  : సౌదీ మల్టిపుల్‌ ఎంట్రీ వీసాల నిలిపివేత

పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం సింగిల్‌ ఎంట్రీ వీసాలను మాత్రమే జారీ చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఒక సంవత్సరంపాటు చెల్లుబాటయ్యే మల్టిపుల్‌ ఎంట్రీ వీసాలను నిరవధికంగా నిలిపేసింది. ఈ నిర్ణయం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీర్ఘకాలిక వీసాలపై వచ్చేవారు చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయడం కోసం, అనుమతులు లేకుండా హజ్‌ యాత్ర చేయడం వంటివాటికి పాల్పడుతున్నారని అధికారులు చెప్పారు. మల్టిపుల్‌ ఎంట్రీ వీసాల నిలిపివేత నిర్ణయం తాత్కాలికమేనని తెలిపారు. సింగిల్‌ ఎంట్రీ వీసాలు 30 రోజులపాటు మాత్రమే చెల్లుతాయి. హజ్‌, ఉమ్రా, రెసిడెన్సీ వీసాల్లో మార్పులు ఉండవు.

USA: అమెరికాను వణికిస్తున్న ఫ్లూ

అమెరికాలో ప్రస్తుత ‘ఫ్లూ సీజన్‌’  నడుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ, నైరుతి, దక్షిణ రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో(వింటర్‌ వైరస్‌ సీజన్, ఫ్లూ సీజన్‌) రికార్డు స్థాయిలో ఫ్లూ రుగ్మతలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు శుక్రవారం ఇక్కడి ఆసుపత్రి సమాచార వర్గాలతో పాటు సీడీసీ(సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) అంచనాలు వెల్లడించాయి.

మొత్తం 43 రాష్ట్రాల్లో గరిష్ఠ సంఖ్యలో బాధితులు ఉన్నారని, ఎక్కువమంది శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర ఫ్లూ రుగ్మతల బారిన పడుతున్నారని, సాధారణంగా శీతాకాలంలో నమోదయ్యే గరిష్ఠ స్థాయిని మించి ప్రస్తుతం కేసుల సంఖ్య ఉన్నట్లు పేర్కొన్నాయి. సీడీసీ గణాంకాల ప్రకారం ఈ సీజన్‌లో సుమారు 2.4 కోట్లమంది ఫ్లూ వైరస్‌ల బారిన పడగా, 3.1 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. 13 వేల మరణాలు సంభవించాయి. మృతుల్లో 57 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో కోవిడ్‌-19 ఉన్న చిన్నారులు సైతం అధిక సంఖ్యలో ఉన్నట్లు ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆరు నెలలు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి ఒక్కరూ వార్షిక ఫ్లూ టీకాను పొందాలని, సీజనల్‌ వైరస్‌లను నివారించడానికి సంబంధిత నిబంధనలను తప్పక పాటించాలని అమెరికా ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.  

AP: జగన్ ఇంటిముందు మహిళ హల్‌చల్‌

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఎదుట ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. తాడేపల్లిలోని వైసీపీ జగన్ ఇంటి ఎదుట అద్దంకికి చెందిన సిద్ధారపు అంజమరెడ్డి ఈ నెల 6న తాడేపల్లిలోని జగన్‌ నివాసం వద్దకు చేరుకుంది. జగన్‌తో కలిసి ఫొటో దిగే వరకు వెళ్లేదే లేదని అక్కడ ఉన్న సిబ్బందికి తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ గ్రీవెన్‌ సెల్‌ అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి ఆమెను లోపలికి అనుమతించి జగన్‌తో ఫొటో తీయించారు. తర్వాత తనకు అప్పులు ఉన్నాయని ఇందుకు ఆర్థిక సాయం చేయాలని అంజమరెడ్డి కోరినట్లు తెలిసింది. వారు నిరాకరించడంతో బయటకు వచ్చి గేటు వద్ద అడ్డుగా కూర్చొంది. అక్కడ ఉన్న రక్షణ సిబ్బంది తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కల్యాణ్‌రాజు ఆ ప్రాంతానికి చేరుకుని మహిళా పోలీసులతో ఆమెను వాహనంలో స్టేషన్‌కు తరలించారు. వివరాలు సేకరించిన తర్వాత ఆమెను విడుదల చేశారు.

Plane Missing : అమెరికాలో విమానం మిస్సింగ్‌..

అమెరికాలోని అలస్కా మీదుగా 10 మందితో వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైంది. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ దీనిపై మాట్లాడుతూ.. ఉనాలాక్లీట్ నుంచి బయలుదేరి నోమ్ వెళ్తున్న సమయంలో సెస్నా 208బీ గ్రాండ్ కారవాన్ విమానం అదృశ్యమైనట్లు వివరించారు.

ఆ విమానం అమెరికాకు చెందిన బెరింగ్ ఎయిర్ ఎయిర్‌లైన్‌ సంస్థదని చెప్పారు. విమానంలో మొత్తం పది మంది ఉండగా, వారిలో తొమ్మిది మంది ప్రయాణికులు, ఒకరు పైలట్. అదృశ్యమైన విమానాన్ని గుర్తించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, వారం రోజుల క్రితమే అమెరికాలోని జరిగిన విమాన ప్రమాదంలో 60 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ డీసీలోని ఓ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అవుతుండగా ఆ ప్రమాదం సంభవించింది. ఇటీవల మరో ప్రమాదంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్‌ వద్ద ఓ విమానం కూలింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. అంతేగాక, అక్కడి ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధం కావడం గమనార్హం. ఆ విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కుప్పకూలింది. అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Chandrayaan 4: 2027లో చంద్రయాన్‌-4

చంద్రయాన్‌-4 మిషన్‌ ప్రయోగం 2027లో జరుగుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. పీటీఐ వీడియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రుని ఉపరితలంలోని శిలలను భూమికి తేవడమే ఈ ప్రయోగం లక్ష్యమని తెలిపారు. గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగం వచ్చే ఏడాది జరుగుతుందన్నారు. భారతీయ వ్యోమగాములను ప్రత్యేకంగా రూపొందించిన రోదసినౌకలో దిగువ భూ కక్ష్యలోకి తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం లక్ష్యమని తెలిపారు.

అదేవిధంగా సముద్రయాన్‌ను కూడా వచ్చే సంవత్సరమే నిర్వహిస్తామన్నారు. దీనిలో ముగ్గురు శాస్త్రవేత్తలు సముద్రం అడుగున 6,000 మీటర్ల లోతుకు వెళ్లి, పరిశోధనలు జరుపుతారని చెప్పారు. సముద్రయాన్‌ వల్ల ముఖ్యమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, సముద్ర సంబంధిత జీవ వైవిధ్యం వంటివాటి గురించి తెలుసుకోవచ్చునని తెలిపారు.

Health Safety Tips : మండే ఎండల్లో ఇలా చేయండి

వచ్చే వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్ర ఉపరితలం వేడిగా ఉండటం, వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడి గాలులే దీనికి కారణమని తెలుస్తోంది. దీని వల్ల భూమిపై అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు నీరు ఎక్కువగా తాగడం, పొడిదుస్తులు ధరించడం, ఎండ వేళ బయటికి వెళ్తే జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Weather Updates : మధ్యాహ్నం జాగ్రత్త.. దంచుతున్న ఎండలు..

ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. చలి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం, రాత్రి మినహాయిస్తే పగటి పుట ఉష్ణోగ్రతలు మాడు పగలకొడుతున్నాయి. గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్‌ అవుతున్నాయి. ఏపీలో ఒకపక్క ఎండలు మరోపక్క ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. నందిగామలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యింది. విశాఖపట్నం, కళింగపట్నం, శ్రీకాకుళం వంటి చోట్ల సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్‌ అయ్యింది. తెలంగాణలో కూడా గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో అప్పుడే 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలో నెలలో వడగాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Dokka seethamma : లోకేష్ చొరవతో డొక్కా సీతమ్మ భోజనంలో సన్న బియ్యం

పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు సన్న బియ్యం (ఫైన్ రైస్) అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది.

పోషక విలువలు అధికంగా ఉండే సన్న బియ్యం పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మద్దతు తెలిపారు. కావలసిన పోషక విలువలతో కూడిన సన్న బియ్యం తమ శాఖ వద్ద అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు.

Spiritual Leader Aga Khan : ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ కన్నుమూత

బిలియనీర్, పద్మవిభూషణ్ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్(88) కన్నుమూశారు. పోర్చుగల్ లోని లిస్బన్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్ వర్క్ ట్విట్టర్వేదికగా వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. 1936లో స్విట్జర్లాండ్లో జన్మించిన ఆగాఖాన్.. 1957లోనే ఇమామ్ గా బాధ్యతలు స్వీకరించారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతో పాటు ఆయన అనేక ఇతర వ్యాపారాల్లోనూ రాణించారు. యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ప్రముఖంగా నిర్వహించే రేసు గుర్రాల్లో నూ పాల్గొనేవారు.ఆగా ఖాన్కు హైదరాబాద్లో చారిత్రక సంబంధం కూడా ఉంది. అతని పూ ర్వీకులు ఈ ప్రాంతంలో వాణిజ్యం, దాతృత్వం సేవలను అందించారు. 1967లో ఆగాఖాన్ డె వలప్మెంట్ నెట్వర్క్ను స్థాపించి.. ప్రపంచం లో వందలాది ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేశారు. ఆయన సేవలకు గాను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూష ణ్ తో సత్కరించింది. ఆగా ఖాన్ కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

ChatGPT : చాట్ జీపీటీ వాట్సప్ లో మరో కొత్త ఫీచర్

ఓపెన్ ఏఐకి చెందిన చాట్ బాట్ 'చాట్ జీపీటీ'లో మరో కొత్త సదుపాయం తీసుకు వచ్చింది. వాట్సప్ ద్వారా చాటి జీపీటీ సేవలను అందించేందుకు ఇంతకు ముందే ప్రత్యేకంగా ఓ నంబర్ ను సంస్థ తీసుకు వచ్చింది. తాజా తన సేవలను మరింత విస్తృతం చేసింది. ఇప్పటి వరకు కేవలం టెక్స్ట్ మెసేజ్ లకు మాత్రమే సమాధానాలు ఇస్తూ వస్తున్న చాట్ జీపీటీ ఇక నుంచి ఆడియో, ఫోటో ఇన్ పుట్ కు కూడా స్పందించనుంది. కొత్త సదుపాయం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఏదైనా ఇమేజ్ ను వాట్సప్ ద్వారా అప్లోడ్ చేసి దానికి సంబంధించిన ప్రశ్న అడిగితే చాటిజీపీటీ సమాధానం ఇస్తుంది. ఇమేజ్ అప్లోడ్ చేస్తే దాన్ని ఓపెన్ ఏఐ సర్వర్లకు పంపించి ప్రాసెసింగ్ చేసి దానిపై సమాధానం ఇస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేయకుండా ఉండడమే మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇదే తరహాలో వాయిస్ ఇన్ పుట్ ను కూడా విశ్లేషించి ప్రశ్నలకు చాటిజీపీటీ సమాధానాలు ఇస్తుంది. చాటీపీటీ సేవలను పొందడానికి +1800 2428 478 నంబర్ ను 'పోపెన్ ఏఐ' గత సంవత్సరం డిసెంబర్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ నంబర్ కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకుంటే మీరు అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ బదులిస్తుంది. చాటీపీటీ వెబ్సైట్, యాప్ డౌన్లోడ్ చేసుకోకుండానే ఇక వాట్సప్ లో దీన్ని వాడే ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఐతే.. రోజువారీ వాడకంపై మాత్రం లిమిట్ పెట్టారు.

TG: ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే

తెలంగాణలో ఇక నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక కులగణన సర్వేకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడం.. చరిత్రలోనూ కీలక ఘట్టమని సీఎం అన్నారు. ఫిబ్రవరి నాలుగో తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కులగణనపై తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ధీటుగా కౌంటర్ ఇచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కులగణన లెక్కలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కులగణన సర్వేలో పాల్గొనలేని కేటీఆర్‌కు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. 

Consumer commission: కస్టమర్ల ఫోన్‌ నంబర్లను దుకాణదారులు తీసుకోరాదు

రిటైల్‌ దుకాణదారులు వినియోగదారుల ఫోన్‌ నంబర్లను తీసుకోరాదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌, చండీగఢ్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. అడ్వకేట్‌ పంకజ్‌ చంద్‌గోథియా ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఈ తీర్పునిచ్చింది. తాను 2024 ఏప్రిల్‌లో చెప్పులు కొన్నానని, దుకాణదారు బిల్లు ఇస్తాననే నెపంతో తన ఫోన్‌ నంబరును తీసుకున్నారని చెప్పారు. ఇది సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘన అని వాదించారు. విలువలు పాటించనివారికి తన సమాచారం అందుబాటులో ఉందన్నారు.

వినియోగదారుల శాఖ 2023 మే 26న జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఓ ఉత్పత్తిని అమ్మేటపుడు, ఫోన్‌ నంబర్లను చెప్పాలని కస్టమర్లను అడగటం, దానిని తప్పనిసరి అవసరంగా చెప్పటం, కస్టమర్ల హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పినట్లు తెలిపారు. దీనిపై బెంచ్‌ తీర్పు చెప్తూ, తక్షణమే పంకజ్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలని ఆదేశించింది. నష్టపరిహారంగా రూ.2,500 చెల్లించాలని తెలిపింది.

Odisha: రైతు వేషంలో  కలెక్టర్‌, ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాల గుట్టురట్టు

కలెక్టర్‌ మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్‌లు సినిమాల్లో చూస్తుంటాం. ఒడిశాలోని భద్రక్‌ జిల్లా కలెక్టర్‌ దిలీప్‌ రౌత్రాయ్‌ నిజజీవితంలో ఈ పని చేసి, అక్రమార్కులకు వణుకు పుట్టించారు. ఓ ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాలను గుర్తించి, చర్యలు చేపట్టారు. వరి సేకరణ కేంద్రాల్లో పంట దిగుబడిలో నాణ్యత లేదని పేర్కొంటూ తమకు తక్కువ ధర ఇస్తున్నారని రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో తానే స్వయంగా వెళ్లాలని కలెక్టర్‌ నిర్ణయించారు. ధామ్‌నగర్‌ బ్లాక్‌లోని కాటాసాహి మండీలోని ధాన్యం సేకరణ కేంద్రానికి రైతు వేషధారణలో వెళ్లారు. కొంత ధాన్యాన్ని విక్రయించేందుకు కాంటాకు వెశారు. అయితే, వృధా సాకుతో 8 కిలోలకు డబ్బులు తక్కువ ఇస్తానని అధికారి చెప్పాడు. సదరు అధికారికి షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్టు కలెక్టర్‌ తెలిపారు.

Vasant Panchami Day : వసంత పంచమి రోజున ఏం చేయాలి?

వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అక్షరాభ్యాస పూజలకు 2 గంటలు, అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వసతులు సరిగా లేవని పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఓ పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు వేయాలి.

సరస్వతీ దేవి ఫొటోను ఉంచి అలంకరించాలి. పుస్తకాలు, పూలను ముందు పెట్టుకోవాలి.

ఆవు నెయ్యితో 9వత్తులతో దీపాలు వెలిగించాలి.

ఓ గ్లాసు నీటిని ఎడమ చేతిలో పట్టుకుని దానిమీద కుడిచేతిని ఉంచాలి. ఆ తర్వాత ‘ఓం ఐం వాన్యై స్వాహా’ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.

ఆ నీటిని పిల్లల చేత తాగిస్తే దేవి అనుగ్రహం ఉంటుంది.

వసంత పంచమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీంతో హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు ఈరోజు సెలవు ఉండనుంది. మిగిలిన విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలా లేదా అనేది యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు.

Naga Chaitanya : శోభిత అభిప్రాయాలంటే నాకు చాలా గౌరవం: నాగచైతన్య

భార్య శోభిత సలహాల్ని తాను అనుసరిస్తుంటానని నటుడు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడైనా గందరగోళంగా ఉన్నప్పుడు నా ఆలోచనను శోభితతో పంచుకుంటుంటాను. ఒత్తిడిలో ఉన్నానంటే ఇట్టే గుర్తుపట్టేసి ఏమైందని అడుగుతుంది. తను ఎప్పుడూ ప్రశాంతంగా, చక్కగా ఆలోచిస్తుంది. మంచి సలహాలిస్తుంది. అందుకే తన అభిప్రాయాల్ని నేను చాలా గౌరవిస్తాను’ అని కొనియాడారు.

సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో వీళ్లిద్దరి పెళ్లి అయ్యింది. అప్పుడే వీళ్ళ పెళ్లి జరిగి రెండు నెలలు పూర్తి అయ్యిందా అని అనిపిస్తుంది కదూ..ఇద్దరు కొత్త ఇంట్లోకి కూడా ప్రవేశించారు. వీళ్లిద్దరి పెళ్లి తర్వాత విడుదల అవుతున్న సినిమా ‘తండేల్’.

ఈ నెల 7వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. సుమారుగా 80 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఖర్చు చేసారు. ప్రొమోషన్స్ కూడా దుమ్ము లేపేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తమిళం, హిందీ భాషల్లో కూడా నాన్ స్టాప్ ప్రొమోషన్స్ చేస్తున్నారు.

TTD : తిరుమల రథసప్తమి దర్శనాలపై కీలక ప్రకటన

ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు పై టీటీడీ సమీక్ష నిర్వహించింది. టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఈ సమావేశం జరిగింది. రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇస్తారు. ఈ వేడుకలను చూసేందుకు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో ఆరోజు సిఫారసు లేఖల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సర్వదర్శనం టోకెన్ల రద్దు చేయనున్నారు. భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ల ద్వారా అనుమతి ఇవ్వనున్నారు. మాడవీధుల్లో భక్తుల రక్షణకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రథసప్తమి రోజు భక్తుల కొరకు 8 లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. 

TTD: కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం

మహా కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించేందుకు దీపాలి సుబ్రమణ్యం... ప్రయాగ్‌రాజ్‌కు అక్కడి వెళ్లారు. దీపాలి సుబ్రమణ్యం ఉన్నట్టుండి అదృశ్యమైనట్లుగా తోటి ఉద్యోగులు గుర్తించారు. దాదాపు టీటీడీ నుంచి సుమారు 250 మంది సిబ్బంది ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు డిప్యుటేషన్‌పై వెళ్ళినట్లుగా సమాచారం. ఎంతకీ సుబ్రమణ్యం ఆచూకీ లభించకపోవడంతో తోటి ఉద్యోగులు దారాగంజ్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సుబ్రమణ్యం ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు.