చిట్టి న్యూస్

Lok Sabha: ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

పార్లమెంట్‌లో ఆదాయపు పన్ను కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్‌ ఓం బిర్లా వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. దశాబ్దాల కాలం నుంచి మనుగడలో ఉన్న ఆదాయపు పన్ను బిల్లు స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు కేంద్రం కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్యే నిర్మలా సీతారామన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేయగానే లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది.


ARREST: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. ఏపీలో గత ఎన్నికలకు ముందు జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో అరెస్ట్ చేశారా.? లేదా మరో కేసులో వంశీని అదుపులోకి తీసుకున్నారా.? అనే విషయాలపై మరికాసేపట్లో ఏపీ పోలీసులు క్లారిటీ ఇవ్వనున్నారు. ఒకవేళ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఇందులో వల్లభనేని వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. ఈలోపే వంశీ అరెస్టు అవడం ఇప్పుడు కీలకంగా మారింది. 2023 ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది.


Beer Prices Hike : పెరిగిన బీర్ల ధరలు.. అమలులో ఉన్న రేట్లు ఇవే

రాష్ట్రంలో బీర్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెంచిన బీర్ల ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం ప్రస్తుతం బీర్ల ఎమ్మార్పీ ధరలపై 15 శాంతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే బీర్లతో పాటు ఇతర మద్యం ధరలపై పలు రాష్ట్రాల్లో త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసింది.

రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచేందుకు తిసభ్య కమిటీ సిఫార్సును అబ్కారీ శాఖ నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసింది. ముఖ్యంగా బ్రాండెడ్ బీర్లు, బ్రాండెడ్ మద్యం, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. త్రిసభ్య కమిటీ కూడా 15 నుంచి 19 శాతం పెంచేందుకు నివేదిక ఇవ్వగా 15 శాతం బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒక్క బీర్ల పెట్టె మీద 15 శాతం బేసిక్ ధర పెంచితే, దానికి కనీసం రూ.250 నుంచి రూ. 280 వరకు వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో రూ.150 ఉన్న లైట్ బీర్ రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరిగాయి. కొత్త రేట్లతో ప్రభుత్వానికి నెలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 700 మేరకు అదనపు ఆదాయం కూరే అవకాశం ఉందని అబ్కారి శాఖ అధికారులు చెబుతున్నారు. 

Saudi  : సౌదీ మల్టిపుల్‌ ఎంట్రీ వీసాల నిలిపివేత

పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం సింగిల్‌ ఎంట్రీ వీసాలను మాత్రమే జారీ చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఒక సంవత్సరంపాటు చెల్లుబాటయ్యే మల్టిపుల్‌ ఎంట్రీ వీసాలను నిరవధికంగా నిలిపేసింది. ఈ నిర్ణయం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీర్ఘకాలిక వీసాలపై వచ్చేవారు చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయడం కోసం, అనుమతులు లేకుండా హజ్‌ యాత్ర చేయడం వంటివాటికి పాల్పడుతున్నారని అధికారులు చెప్పారు. మల్టిపుల్‌ ఎంట్రీ వీసాల నిలిపివేత నిర్ణయం తాత్కాలికమేనని తెలిపారు. సింగిల్‌ ఎంట్రీ వీసాలు 30 రోజులపాటు మాత్రమే చెల్లుతాయి. హజ్‌, ఉమ్రా, రెసిడెన్సీ వీసాల్లో మార్పులు ఉండవు.

USA: అమెరికాను వణికిస్తున్న ఫ్లూ

అమెరికాలో ప్రస్తుత ‘ఫ్లూ సీజన్‌’  నడుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ, నైరుతి, దక్షిణ రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో(వింటర్‌ వైరస్‌ సీజన్, ఫ్లూ సీజన్‌) రికార్డు స్థాయిలో ఫ్లూ రుగ్మతలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు శుక్రవారం ఇక్కడి ఆసుపత్రి సమాచార వర్గాలతో పాటు సీడీసీ(సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) అంచనాలు వెల్లడించాయి.

మొత్తం 43 రాష్ట్రాల్లో గరిష్ఠ సంఖ్యలో బాధితులు ఉన్నారని, ఎక్కువమంది శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర ఫ్లూ రుగ్మతల బారిన పడుతున్నారని, సాధారణంగా శీతాకాలంలో నమోదయ్యే గరిష్ఠ స్థాయిని మించి ప్రస్తుతం కేసుల సంఖ్య ఉన్నట్లు పేర్కొన్నాయి. సీడీసీ గణాంకాల ప్రకారం ఈ సీజన్‌లో సుమారు 2.4 కోట్లమంది ఫ్లూ వైరస్‌ల బారిన పడగా, 3.1 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. 13 వేల మరణాలు సంభవించాయి. మృతుల్లో 57 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో కోవిడ్‌-19 ఉన్న చిన్నారులు సైతం అధిక సంఖ్యలో ఉన్నట్లు ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆరు నెలలు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి ఒక్కరూ వార్షిక ఫ్లూ టీకాను పొందాలని, సీజనల్‌ వైరస్‌లను నివారించడానికి సంబంధిత నిబంధనలను తప్పక పాటించాలని అమెరికా ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.  

AP: జగన్ ఇంటిముందు మహిళ హల్‌చల్‌

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఎదుట ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. తాడేపల్లిలోని వైసీపీ జగన్ ఇంటి ఎదుట అద్దంకికి చెందిన సిద్ధారపు అంజమరెడ్డి ఈ నెల 6న తాడేపల్లిలోని జగన్‌ నివాసం వద్దకు చేరుకుంది. జగన్‌తో కలిసి ఫొటో దిగే వరకు వెళ్లేదే లేదని అక్కడ ఉన్న సిబ్బందికి తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ గ్రీవెన్‌ సెల్‌ అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి ఆమెను లోపలికి అనుమతించి జగన్‌తో ఫొటో తీయించారు. తర్వాత తనకు అప్పులు ఉన్నాయని ఇందుకు ఆర్థిక సాయం చేయాలని అంజమరెడ్డి కోరినట్లు తెలిసింది. వారు నిరాకరించడంతో బయటకు వచ్చి గేటు వద్ద అడ్డుగా కూర్చొంది. అక్కడ ఉన్న రక్షణ సిబ్బంది తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కల్యాణ్‌రాజు ఆ ప్రాంతానికి చేరుకుని మహిళా పోలీసులతో ఆమెను వాహనంలో స్టేషన్‌కు తరలించారు. వివరాలు సేకరించిన తర్వాత ఆమెను విడుదల చేశారు.

Plane Missing : అమెరికాలో విమానం మిస్సింగ్‌..

అమెరికాలోని అలస్కా మీదుగా 10 మందితో వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైంది. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ దీనిపై మాట్లాడుతూ.. ఉనాలాక్లీట్ నుంచి బయలుదేరి నోమ్ వెళ్తున్న సమయంలో సెస్నా 208బీ గ్రాండ్ కారవాన్ విమానం అదృశ్యమైనట్లు వివరించారు.

ఆ విమానం అమెరికాకు చెందిన బెరింగ్ ఎయిర్ ఎయిర్‌లైన్‌ సంస్థదని చెప్పారు. విమానంలో మొత్తం పది మంది ఉండగా, వారిలో తొమ్మిది మంది ప్రయాణికులు, ఒకరు పైలట్. అదృశ్యమైన విమానాన్ని గుర్తించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, వారం రోజుల క్రితమే అమెరికాలోని జరిగిన విమాన ప్రమాదంలో 60 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ డీసీలోని ఓ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అవుతుండగా ఆ ప్రమాదం సంభవించింది. ఇటీవల మరో ప్రమాదంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్‌ వద్ద ఓ విమానం కూలింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. అంతేగాక, అక్కడి ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధం కావడం గమనార్హం. ఆ విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కుప్పకూలింది. అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Chandrayaan 4: 2027లో చంద్రయాన్‌-4

చంద్రయాన్‌-4 మిషన్‌ ప్రయోగం 2027లో జరుగుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. పీటీఐ వీడియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రుని ఉపరితలంలోని శిలలను భూమికి తేవడమే ఈ ప్రయోగం లక్ష్యమని తెలిపారు. గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగం వచ్చే ఏడాది జరుగుతుందన్నారు. భారతీయ వ్యోమగాములను ప్రత్యేకంగా రూపొందించిన రోదసినౌకలో దిగువ భూ కక్ష్యలోకి తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం లక్ష్యమని తెలిపారు.

అదేవిధంగా సముద్రయాన్‌ను కూడా వచ్చే సంవత్సరమే నిర్వహిస్తామన్నారు. దీనిలో ముగ్గురు శాస్త్రవేత్తలు సముద్రం అడుగున 6,000 మీటర్ల లోతుకు వెళ్లి, పరిశోధనలు జరుపుతారని చెప్పారు. సముద్రయాన్‌ వల్ల ముఖ్యమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, సముద్ర సంబంధిత జీవ వైవిధ్యం వంటివాటి గురించి తెలుసుకోవచ్చునని తెలిపారు.

Health Safety Tips : మండే ఎండల్లో ఇలా చేయండి

వచ్చే వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్ర ఉపరితలం వేడిగా ఉండటం, వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడి గాలులే దీనికి కారణమని తెలుస్తోంది. దీని వల్ల భూమిపై అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు నీరు ఎక్కువగా తాగడం, పొడిదుస్తులు ధరించడం, ఎండ వేళ బయటికి వెళ్తే జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Weather Updates : మధ్యాహ్నం జాగ్రత్త.. దంచుతున్న ఎండలు..

ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. చలి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం, రాత్రి మినహాయిస్తే పగటి పుట ఉష్ణోగ్రతలు మాడు పగలకొడుతున్నాయి. గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్‌ అవుతున్నాయి. ఏపీలో ఒకపక్క ఎండలు మరోపక్క ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. నందిగామలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యింది. విశాఖపట్నం, కళింగపట్నం, శ్రీకాకుళం వంటి చోట్ల సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్‌ అయ్యింది. తెలంగాణలో కూడా గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో అప్పుడే 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలో నెలలో వడగాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Dokka seethamma : లోకేష్ చొరవతో డొక్కా సీతమ్మ భోజనంలో సన్న బియ్యం

పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు సన్న బియ్యం (ఫైన్ రైస్) అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది.

పోషక విలువలు అధికంగా ఉండే సన్న బియ్యం పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మద్దతు తెలిపారు. కావలసిన పోషక విలువలతో కూడిన సన్న బియ్యం తమ శాఖ వద్ద అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు.

Spiritual Leader Aga Khan : ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ కన్నుమూత

బిలియనీర్, పద్మవిభూషణ్ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్(88) కన్నుమూశారు. పోర్చుగల్ లోని లిస్బన్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్ వర్క్ ట్విట్టర్వేదికగా వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. 1936లో స్విట్జర్లాండ్లో జన్మించిన ఆగాఖాన్.. 1957లోనే ఇమామ్ గా బాధ్యతలు స్వీకరించారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతో పాటు ఆయన అనేక ఇతర వ్యాపారాల్లోనూ రాణించారు. యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ప్రముఖంగా నిర్వహించే రేసు గుర్రాల్లో నూ పాల్గొనేవారు.ఆగా ఖాన్కు హైదరాబాద్లో చారిత్రక సంబంధం కూడా ఉంది. అతని పూ ర్వీకులు ఈ ప్రాంతంలో వాణిజ్యం, దాతృత్వం సేవలను అందించారు. 1967లో ఆగాఖాన్ డె వలప్మెంట్ నెట్వర్క్ను స్థాపించి.. ప్రపంచం లో వందలాది ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేశారు. ఆయన సేవలకు గాను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూష ణ్ తో సత్కరించింది. ఆగా ఖాన్ కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

ChatGPT : చాట్ జీపీటీ వాట్సప్ లో మరో కొత్త ఫీచర్

ఓపెన్ ఏఐకి చెందిన చాట్ బాట్ 'చాట్ జీపీటీ'లో మరో కొత్త సదుపాయం తీసుకు వచ్చింది. వాట్సప్ ద్వారా చాటి జీపీటీ సేవలను అందించేందుకు ఇంతకు ముందే ప్రత్యేకంగా ఓ నంబర్ ను సంస్థ తీసుకు వచ్చింది. తాజా తన సేవలను మరింత విస్తృతం చేసింది. ఇప్పటి వరకు కేవలం టెక్స్ట్ మెసేజ్ లకు మాత్రమే సమాధానాలు ఇస్తూ వస్తున్న చాట్ జీపీటీ ఇక నుంచి ఆడియో, ఫోటో ఇన్ పుట్ కు కూడా స్పందించనుంది. కొత్త సదుపాయం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఏదైనా ఇమేజ్ ను వాట్సప్ ద్వారా అప్లోడ్ చేసి దానికి సంబంధించిన ప్రశ్న అడిగితే చాటిజీపీటీ సమాధానం ఇస్తుంది. ఇమేజ్ అప్లోడ్ చేస్తే దాన్ని ఓపెన్ ఏఐ సర్వర్లకు పంపించి ప్రాసెసింగ్ చేసి దానిపై సమాధానం ఇస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేయకుండా ఉండడమే మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇదే తరహాలో వాయిస్ ఇన్ పుట్ ను కూడా విశ్లేషించి ప్రశ్నలకు చాటిజీపీటీ సమాధానాలు ఇస్తుంది. చాటీపీటీ సేవలను పొందడానికి +1800 2428 478 నంబర్ ను 'పోపెన్ ఏఐ' గత సంవత్సరం డిసెంబర్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ నంబర్ కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకుంటే మీరు అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ బదులిస్తుంది. చాటీపీటీ వెబ్సైట్, యాప్ డౌన్లోడ్ చేసుకోకుండానే ఇక వాట్సప్ లో దీన్ని వాడే ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఐతే.. రోజువారీ వాడకంపై మాత్రం లిమిట్ పెట్టారు.

TG: ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే

తెలంగాణలో ఇక నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక కులగణన సర్వేకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడం.. చరిత్రలోనూ కీలక ఘట్టమని సీఎం అన్నారు. ఫిబ్రవరి నాలుగో తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కులగణనపై తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ధీటుగా కౌంటర్ ఇచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కులగణన లెక్కలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కులగణన సర్వేలో పాల్గొనలేని కేటీఆర్‌కు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. 

Consumer commission: కస్టమర్ల ఫోన్‌ నంబర్లను దుకాణదారులు తీసుకోరాదు

రిటైల్‌ దుకాణదారులు వినియోగదారుల ఫోన్‌ నంబర్లను తీసుకోరాదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌, చండీగఢ్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. అడ్వకేట్‌ పంకజ్‌ చంద్‌గోథియా ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఈ తీర్పునిచ్చింది. తాను 2024 ఏప్రిల్‌లో చెప్పులు కొన్నానని, దుకాణదారు బిల్లు ఇస్తాననే నెపంతో తన ఫోన్‌ నంబరును తీసుకున్నారని చెప్పారు. ఇది సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘన అని వాదించారు. విలువలు పాటించనివారికి తన సమాచారం అందుబాటులో ఉందన్నారు.

వినియోగదారుల శాఖ 2023 మే 26న జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఓ ఉత్పత్తిని అమ్మేటపుడు, ఫోన్‌ నంబర్లను చెప్పాలని కస్టమర్లను అడగటం, దానిని తప్పనిసరి అవసరంగా చెప్పటం, కస్టమర్ల హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పినట్లు తెలిపారు. దీనిపై బెంచ్‌ తీర్పు చెప్తూ, తక్షణమే పంకజ్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలని ఆదేశించింది. నష్టపరిహారంగా రూ.2,500 చెల్లించాలని తెలిపింది.

Odisha: రైతు వేషంలో  కలెక్టర్‌, ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాల గుట్టురట్టు

కలెక్టర్‌ మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్‌లు సినిమాల్లో చూస్తుంటాం. ఒడిశాలోని భద్రక్‌ జిల్లా కలెక్టర్‌ దిలీప్‌ రౌత్రాయ్‌ నిజజీవితంలో ఈ పని చేసి, అక్రమార్కులకు వణుకు పుట్టించారు. ఓ ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాలను గుర్తించి, చర్యలు చేపట్టారు. వరి సేకరణ కేంద్రాల్లో పంట దిగుబడిలో నాణ్యత లేదని పేర్కొంటూ తమకు తక్కువ ధర ఇస్తున్నారని రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో తానే స్వయంగా వెళ్లాలని కలెక్టర్‌ నిర్ణయించారు. ధామ్‌నగర్‌ బ్లాక్‌లోని కాటాసాహి మండీలోని ధాన్యం సేకరణ కేంద్రానికి రైతు వేషధారణలో వెళ్లారు. కొంత ధాన్యాన్ని విక్రయించేందుకు కాంటాకు వెశారు. అయితే, వృధా సాకుతో 8 కిలోలకు డబ్బులు తక్కువ ఇస్తానని అధికారి చెప్పాడు. సదరు అధికారికి షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్టు కలెక్టర్‌ తెలిపారు.

Vasant Panchami Day : వసంత పంచమి రోజున ఏం చేయాలి?

వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అక్షరాభ్యాస పూజలకు 2 గంటలు, అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వసతులు సరిగా లేవని పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఓ పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు వేయాలి.

సరస్వతీ దేవి ఫొటోను ఉంచి అలంకరించాలి. పుస్తకాలు, పూలను ముందు పెట్టుకోవాలి.

ఆవు నెయ్యితో 9వత్తులతో దీపాలు వెలిగించాలి.

ఓ గ్లాసు నీటిని ఎడమ చేతిలో పట్టుకుని దానిమీద కుడిచేతిని ఉంచాలి. ఆ తర్వాత ‘ఓం ఐం వాన్యై స్వాహా’ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.

ఆ నీటిని పిల్లల చేత తాగిస్తే దేవి అనుగ్రహం ఉంటుంది.

వసంత పంచమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీంతో హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు ఈరోజు సెలవు ఉండనుంది. మిగిలిన విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలా లేదా అనేది యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు.

Naga Chaitanya : శోభిత అభిప్రాయాలంటే నాకు చాలా గౌరవం: నాగచైతన్య

భార్య శోభిత సలహాల్ని తాను అనుసరిస్తుంటానని నటుడు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడైనా గందరగోళంగా ఉన్నప్పుడు నా ఆలోచనను శోభితతో పంచుకుంటుంటాను. ఒత్తిడిలో ఉన్నానంటే ఇట్టే గుర్తుపట్టేసి ఏమైందని అడుగుతుంది. తను ఎప్పుడూ ప్రశాంతంగా, చక్కగా ఆలోచిస్తుంది. మంచి సలహాలిస్తుంది. అందుకే తన అభిప్రాయాల్ని నేను చాలా గౌరవిస్తాను’ అని కొనియాడారు.

సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో వీళ్లిద్దరి పెళ్లి అయ్యింది. అప్పుడే వీళ్ళ పెళ్లి జరిగి రెండు నెలలు పూర్తి అయ్యిందా అని అనిపిస్తుంది కదూ..ఇద్దరు కొత్త ఇంట్లోకి కూడా ప్రవేశించారు. వీళ్లిద్దరి పెళ్లి తర్వాత విడుదల అవుతున్న సినిమా ‘తండేల్’.

ఈ నెల 7వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. సుమారుగా 80 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఖర్చు చేసారు. ప్రొమోషన్స్ కూడా దుమ్ము లేపేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తమిళం, హిందీ భాషల్లో కూడా నాన్ స్టాప్ ప్రొమోషన్స్ చేస్తున్నారు.

TTD : తిరుమల రథసప్తమి దర్శనాలపై కీలక ప్రకటన

ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు పై టీటీడీ సమీక్ష నిర్వహించింది. టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఈ సమావేశం జరిగింది. రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇస్తారు. ఈ వేడుకలను చూసేందుకు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో ఆరోజు సిఫారసు లేఖల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సర్వదర్శనం టోకెన్ల రద్దు చేయనున్నారు. భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ల ద్వారా అనుమతి ఇవ్వనున్నారు. మాడవీధుల్లో భక్తుల రక్షణకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రథసప్తమి రోజు భక్తుల కొరకు 8 లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. 

TTD: కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం

మహా కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించేందుకు దీపాలి సుబ్రమణ్యం... ప్రయాగ్‌రాజ్‌కు అక్కడి వెళ్లారు. దీపాలి సుబ్రమణ్యం ఉన్నట్టుండి అదృశ్యమైనట్లుగా తోటి ఉద్యోగులు గుర్తించారు. దాదాపు టీటీడీ నుంచి సుమారు 250 మంది సిబ్బంది ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు డిప్యుటేషన్‌పై వెళ్ళినట్లుగా సమాచారం. ఎంతకీ సుబ్రమణ్యం ఆచూకీ లభించకపోవడంతో తోటి ఉద్యోగులు దారాగంజ్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సుబ్రమణ్యం ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు.

TIRUMALA: తిరుమలలో మళ్లీ చిరుత సంచారం

తిరుమలలో మళ్లీ చిరుత సంచరించడం కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేసింది. చిరుత.. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ల సమీపంలోనే సంచరిస్తున్నట్లు టీటీడీ, అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేశారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దర్శనాల కోసం వచ్చే భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు హితవు పలికారు. తిరుమలలో మరోసారి చిరుత సంచరిస్తుండటంతో.. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Employees Prioritize Family : కుటుంబమే ముఖ్యమన్న ఉద్యోగులు.. సర్వేలో వెల్లడి

వారంలో ఎక్కువ గంటలు పని చేయాలన్న దానిపై ఇటీవల కాలంలో చాలా చర్చ జరుగుతోంది. వారానికి 72 గంటల పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి సూచించారు. ఎల్ అండ్ టీ చైర్మన్ మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటల పని గురించి మాట్లాడారు. వీరి అభిప్రాయాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇలాంటి పని గంటలపై ఉద్యోగులు అభిప్రాయాలను సేకరించింది ఓ సంస్థ. సర్వేలో 78 శాతం మంది ఉద్యోగులు తమకు కుటుంబమే ముఖ్యమని తేల్చి చెప్పారు. దీని తరువాతే ఏదైనా అని నిక్కచ్చిగా చెప్పేశారు. ప్యూచర్ కెరీర్ రిజల్యూషన్ రిపోర్ట్ పేరుతో ఈ సర్వే నివేదికను జాబ్ సైట్ ఇండీడ్ విడుదల చేసింది. 

Adulterated Jaggery : కల్తీ బెల్లాన్ని గుర్తించేందుకు ఈజీ టిప్స్.

మీరు ఏ డెజర్ట్ చేసినా, చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల అది రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. బెల్లాన్ని భారతీయ వంటలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్లు, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల క్రమం తప్పకుండా బెల్లం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మార్కెట్లో కల్తీ బెల్లం ఎక్కువైంది. కల్తీ బెల్లం తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం, కాబట్టి బెల్లం నిజమైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

బెల్లం అంచు డిజైన్‌ను బట్టి అది అసలైనదా లేదా నకిలీదా అని చెప్పవచ్చు. స్వచ్ఛమైన బెల్లం తేలికగా, మృదువుగా, కొద్దిగా జిగటగా ఉంటుంది. ఈ బెల్లం సులభంగా విరిగిపోతుంది. కానీ కల్తీ బెల్లం గట్టిగా ఉండి రుబ్బుకోవడం కష్టంగా మారుతుంది.

బెల్లం సల్ఫర్ సమ్మేళనాలతో కల్తీ చేయబడిందో లేదో పరీక్షించడం సులభం. కాబట్టి,

ఒక బెల్లం ముక్కను నీటిలో కరిగించాలి. దానికి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి. ఈ సమయంలో బుడగలు కనిపిస్తే, బెల్లం కల్తీ అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

స్వచ్ఛమైన బెల్లం రంగు గోధుమ లేదా పసుపు. బెల్లం రంగు చాలా ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉంటే దానికి కృత్రిమ రంగులు కలిపినట్లు.. కాబట్టి ఒక చిన్న ముక్కను నీటిలో కరిగించాలి. నీటి రంగు మారితే, దానికి

రంగు వేసి కల్తీ చేశారని అర్థం చేసుకోండి.

స్వచ్ఛమైన బెల్లం రుచిలో తియ్యగా ఉండి మట్టి వాసనను కలిగివుంటుంది. కానీ బెల్లం అతి తీపిగా లేదా కారంగా ఉంటే అది కచ్చితంగా కల్తీ బెల్లం.

స్వచ్ఛమైన బెల్లం వేడి చేసినప్పుడు అది కరిగి చిక్కటి ద్రవంగా మారుతుంది. కానీ బెల్లం కల్తీ అయితే వేడి చేసినప్పుడు చక్కెర స్ఫటికాలు లేకుండా ఒక అవశేషాన్ని వదులుంది. అలా ఉంటే బెల్లంలో రసాయనాలు కలిపారని అర్థం. ఇలా రకరకాల పద్ధతుల్లో కల్తీ బెల్లాన్ని గుర్తుపట్టొచ్చు.

Building Collapses: ఢిల్లీలో కూలిన భవనం, ఎంతమందిని రక్షించారంటే?

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కూలింది. బురారీ ప్రాంతంలోని ఆస్కార్‌ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో కౌశీక్‌ ఎన్‌క్లేవ్‌ అనే భవనం సోమవారం రాత్రి 7 గంటలకు కుప్పకూలింది. పోలీసులు, అగ్నిమాపక, ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందా లు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.

శిథిలాల కింద చిక్కుకున్న 10 మందిని రక్షించి ఆసుపత్రికి  తరలించాయి. రక్షించిన వారిలో ఆరు, 14 ఏండ్ల అమ్మాయిలిద్దరు ఉన్నారని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ చీఫ్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. మరో 10 మంది వరకు శిథిలాల కింద ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని తమ ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా, పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్టు తెలిపారు.

Jacqueline Trendy Look : జాక్విలిన్ ట్రెండీ లుక్.. సోషల్ మీడియాలో వైరల్.

శ్రీలంకకు చెందిన బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్సు ప్రాక్టీస్ చేస్తోంది. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ కార్యక్రమానికి జాక్వెలిన్ హాజరైంది. తనదైన ప్రదర్శనతో అలరించింది. జాక్వెలిన్తో పాటు, సోను నిగమ్, బి ప్రాక్ వంటి ఇతర తారలు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు. జాక్విలిన్ ఈ ప్రత్యేక కార్యక్రమంలో అద్భుతమైన నృత్యంతో అలరించిన ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి. జాక్విలిన్ వేషధారణ, ట్రెడిషనల్ లుక్ అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. జాక్విలిన్ ధరించిన స్పెషల్ డ్రెస్ క్రిస్టల్స్ ఎంబ్రాయిడరీతో అత్యంత భారీతనంతో డిజైన్ చేయడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ లుక్ లో జాకీ అభినవ నాట్యమయూరన్ని తలపిస్తోందంటున్నారు అభిమానులు. తీహార్ జైలులో ఉన్న కాన్మేన్ సుకేష్ చంద్రశేఖర్ ప్రేమలేఖలు రాస్తూ జాక్విలిన్ పై ప్రేమను కురిపించడంతో అది మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రస్తుతం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిందీ భామ.

Divorce Impact : తల్లిదండ్రుల విడాకులు.. పిల్లల్లో స్ట్రోక్ వచ్చే ప్రమాదం డబుల్

తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే పిల్లల బాధ వర్ణనాతీతం. సరైన ప్రేమ దొరక్క ఎంతో సతమతమవుతారు. అయితే విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల 13,000 మందిని సర్వే చేశారు. శాశ్వత కుటుంబాల్లో పెరిగిన వారి కంటే విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు 60 శాతం ఎక్కువగా స్ట్రోక్‌కు గురవుతున్నారని సర్వేలో తేలింది. ఈ వ్యక్తులలో డిప్రెషన్, మధుమేహానికి సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని.. ఇవన్నీ స్ట్రోక్ అవకాశాన్ని పెంచుతాయని అధ్యయనం తెలిపింది.

మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు లేదా మెదడులోని రక్తనాళం పగిలిపోయినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. రెండు సందర్భాల్లోనూ, మెదడులోని భాగాలు దెబ్బతింటాయి. ఒక స్ట్రోక్ శాశ్వత మెదడు దెబ్బతినడం, దీర్ఘకాలిక వైకల్యం లేదా మరణానికి కారణమవుతుంది. చిన్నతనంలో శారీరకంగా లేదా మానసికంగా వేధింపులకు గురైన వారికి, విడాకులు తీసుకున్న కుటుంబాలలో మద్దతు లేకుండా పెరిగిన వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు ఎస్మే ఫుల్లర్-థామ్సన్ అన్నారు.

తల్లిదండ్రుల విడాకులు, స్ట్రోక్ మధ్య సంబంధం యొక్క పరిమాణం పురుషులు - స్త్రీలలో ఒకేలా ఉండదు. వీటన్నింటికీ విడాకులే కారణమని చెప్పలేము. తల్లిదండ్రుల విడాకులు నిరాశ, మధుమేహం, మాదకద్రవ్య వ్యసనం, ధూమపాన వ్యసనానికి దారితీస్తాయి.

స్ట్రోక్ లక్షణాలు

ముఖం, చేయి లేదా ఒక కాలు అకస్మాత్తుగా తిమ్మిరి లేదా బలహీనత, ఆకస్మిక గందరగోళం, మాట్లాడటంలో ఇబ్బంది, ఒకటి లేదా రెండు కళ్ళలో ఆకస్మికంగా దృష్టి లోపం, నడవలేకపోవడం, తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి, ఒక చేతిలో బలహీనత లేదా తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్​ని సంప్రదించాలి.

Republic Day:  భారత ప్రజలకు అమెరికా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రజలకు అమెరికా (America) శుభాకాంక్షలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందిస్తామని వెల్లడించింది. భారత్‌, అమెరికా మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు. భారత రాజ్యంగం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పునదిగా గుర్తింపు పొందాడాన్ని నమ్ముతామని పేర్కొన్నారు. భారత్‌-అమెరికా ప్రజల మధ్య శాశ్వతమైన స్నేహం, సహకారం మన ఆర్థిక సంబంధాలను ముందుకు నడుపుతుందుని విశ్వసిస్తున్నామని చెప్పారు. అంతరిక్ష పరిశోధనలతో సహా రానున్న సంవత్సరాల్లో మన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

YCP: రాజ్యసభకు మరో వైసీపీ ఎంపీ గుడ్ బై..?

విజయసాయిరెడ్డితో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా ఉండే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం రాజ్యసభ చైర్మన్ కు అయోధ్య రామిరెడ్డి రాజీనామా లేఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాంకీ గ్రూపునకు యజమాని అయిన అయోధ్య రామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కొన్ని కీలక జిల్లాల వైసీపీ బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. ఆయన కూడా రాజీనామా చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతారా లేకపోతే పదవికి మాత్రమే రాజీనామా చేసి వైసీపీలోనే ఉంటారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్న సమయంలో వీరు ఇలా రాజీనామాల నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. పదవి కాలం ఇంకా ఐదేళ్ల వరకూ ఉన్నా వీరు హఠాత్తుగా ఎందుకు పదవులు వదులుకుంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామిరెడ్డి మాత్రం బీజేపీలో చేరుతారని అంటున్నారు. ఆయన మళ్లీ ఆ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికవుతారన్న ప్రచారం జరుగుతోంది. 

Cricketer Virender Sehwag : విడాకులు తీసుకోనున్న మాజీ క్రికెటర్ సెహ్వాగ్?

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు తెలిపింది. రెండు వారాల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ పాలక్కాడ్‌లోని విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే వారిలో ఆర్తి ఎక్కడా కనిపించలేదు. 2004లో వీరికి పెళ్లి కాగా, ఇద్దరు కుమారులున్నారు. గత దీపావళి రోజు సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫొటోలు షేర్ చేయడం విడాకుల వార్తకు బలం చేకూరుస్తోంది.

1980 డిసెంబరు 16న జన్మించిన ఆర్తి, లేడీ ఇర్విన్ సెకండరీ స్కూల్ మరియు భారతీయ విద్యాభవన్ నుండి తన విద్యను అభ్యసించింది. ఢిల్లీ యూనివర్సిటీలోని మైత్రేయి కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది. సెహ్వాగ్ , ఆమె ప్రేమకథ 2000 సంవత్సరంలో కొనసాగింది. 2004లో, వారిద్దరూ మాజీ ఆర్థిక మంత్రి మరియు ఢిల్లీ మరియు జిల్లా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అంటే DDCA, అరుణ్ జైట్లీ నివాసంలో వివాహం చేసుకున్నారు.

Heroine Colors Swathi : హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకులు?

సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు హింట్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ప్రమోషన్స్ సమయంలోనూ ఇలాంటి రూమర్సే రాగా స్పందించేందుకు స్వాతి నిరాకరించారు.

తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా తమిళ్‌, మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మద్యలో గ్యాప్ తీసుకున్నా రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటున్నారు. 2018లో వికాస్‌ను వివాహం చేసుకున్న స్వాతి కొన్నాళ్లకే ఆయన నుంచి విడి పోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో స్వాతి ఆ వార్తలను కొట్టి పారేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ నుంచి పెళ్లి ఫోటోలతో పాటు, వికాస్‌తో ఉన్న ఫోటోలు అన్నింటిని డిలీట్ చేసింది. ఆ సమయంలోనే ఇద్దరూ విడి పోయారు అంటూ బలంగా ప్రచారం జరిగింది.

Indore: బిచ్చమేశాడని కేసు బుక్ చేసిన పోలీసులు

దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్‌లో అరుదైన కేసు నమోదైంది. ఖండ్వా రోడ్‌లోని ఓ దేవాలయం వద్ద బిచ్చగత్తెకు బిచ్చం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కింద నమోదైన మొదటి కేసు ఇదే కావడం విశేషం. నేరస్థునికి ఒక ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేలు వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. దేశంలోనే మొదటి బిచ్చగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దాలని ఇండోర్‌ అధికారులు నిర్ణయించారు. కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 10 నగరాలను భిక్షాటన రహిత నగరాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా పైలట్‌ ప్రాజెక్టును ఇండోర్‌లో అమలు చేస్తున్నారు. బిచ్చగాళ్ల సమాచారం చెప్పినవారికి రూ.1,000 బహుమతి ఇస్తున్నారు.

AP: రాజమండ్రిలో బోల్తా పడ్డ బస్సు

ఏపీలోని రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు 50 మందితో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే బస్సు దివాన్‌ చెరువు (Diwan Cheruvu) హైవేపై అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కోమలి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.

కాకినాడ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

కాకినాడ జిల్లా తాళ్లరేవు పటవల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, బైకు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో కాకినాడ GGHకి తరలించారు. బైక్ ని ఢీ కొట్టిన బొలెరో వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Encounter: జమ్మూ కాశ్మీర్‌ బారాముల్లాలో ఎన్‌కౌంటర్..

 జమ్మూ కాశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. బారాముల్లా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. బారాముల్లాలోని సోపోర్ సెక్టార్‌లో భద్రతా దళాలు కార్డర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కాల్పుల్లో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) యొక్క 179వ బెటాలియన్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 

upreme Court: ఇద్ద‌రు సుప్రీంకోర్టు జ‌డ్జీల కాల్చివేత‌

ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో సాయుధ దాడి జ‌రిగింది. సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లో ఇద్ద‌రు జ‌డ్జీల‌ను కాల్చిచంపారు. మొహ‌మ్మ‌ద్ మొగిషు, హోజ‌తొలెస్లామ్ అలీ రైజిని అనే జ‌డ్జీలు మృతిచెందారు. దాడిలో గాయ‌ప‌డ్డ మ‌రో జ‌డ్జికి ప్ర‌స్తుతం చికిత్స అందిస్తున్నారు. షూటింగ్‌కు పాల్ప‌డిన త‌ర్వాత దుండ‌గుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి చెందిన మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉన్న‌ది.

రోడ్డు ప్రమాద బాధితులను రక్షిస్తే 25 వేలు

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను దవాఖానలకు తరలించి, ప్రాణాలను కాపాడేవారిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మానవత్వం చాటుకుంటున్న వారికి ఇప్పటివరకు ప్రభుత్వం రూ.5,000 ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది.

దీనిని ఐదింతలు పెంచి రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. నాగ్‌పూర్‌లో రోడ్డు భద్రతకు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు అనుపమ్‌ ఖేర్‌తో కలిసి గడ్కరీ పాల్గొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి ఏడు రోజులు చికిత్స అందించేందుకు అయ్యే ఖర్చును రూ.1.5 లక్షల వరకు ప్రభుత్వం భరించనున్నట్టు గడ్కరీ చెప్పారు.

Nara Lokesh: నామినేటెడ్ పోస్టులపై లోకేశ్ కీలక వ్యాఖ్యలు

నామినేటెడ్ పదవులపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పర్యాయాలు ఒక పదవిలో కొనసాగిన తర్వాత ఉన్నత పదవికైనా వెళ్లాలి.. లేదా ఓ విడత ఖాళీగా అయినా ఉండాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, తాను కూడా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలుగా పనిచేయాలని అన్నారు. అందరి ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకుంటామని నారా లోకేశ్ వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసేవారు పొలిట్‌బ్యూరో వరకు వచ్చే అవకాశం ఉంటుందని అప్పుడే పార్టీ బలపడుతుందని లోకేశ్ అన్నారు. నెల రోజుల్లో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామన్న నారా లోకేశ్... ఎలాంటి షరతులూ లేకుండా ఎన్డీయేలో టీడీపీ కొనసాగుతోందని స్పష్టం చేశారు. మూడు పార్టీల కలయికతో రాష్ట్ర ప్రయోజనాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను లోకేశ్ ప్రారంభించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు నివాసంలో టీడీపీ నేతలు.. కార్యకర్తలతో లోకేశ్ సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరిపారు.