చిట్టి న్యూస్

Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

డిజిటల్ క్రియేటర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో మెసేజ్ రిక్వెస్ట్‌లను ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. ప్రతీ మెసేజ్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వెరిఫైడ్, బిజినెస్, సబ్‌స్క్రైబర్స్/ఇతర కేటగిరీల్లో అవసరమైన దానిని సెలక్ట్ చేసుకుంటే ఆయా ప్రొఫైల్స్‌కు సంబంధించిన మెసేజ్‌లను సెపరేట్‌గా చూపిస్తుంది. అలాగే స్టోరీ రిప్లైస్‌కూ సెపరేట్ ఫోల్డర్‌ను ఇన్‌స్టా యాడ్ చేసింది.

Wedding Season : ఈ రెండు నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే

కార్తీక, మార్గశిర మాసాల కారణంగా ఈ రెండు నెలలు భారీగా వివాహాలు జరగనున్నాయి. నవంబర్ 7, 8, 9, 10, 13, 14, 17, 18, 20, 21, 23, 25, 27, డిసెంబర్ 4, 5, 6, 7, 8, 9, 11, 20, 23, 25, 26 తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.మొత్తం రెండు నెలల్లో కలిపి 24 మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే నవంబర్ నెలలో అన్ని డేట్లలో ఫంక్షన్ హాల్స్ పూర్తి బుక్ అయ్యయని.. ఈ రెండు నెలల్లో దాదాపు దేశ వ్యాప్తంగా అరకోటి జంటల పెళ్లిళ్లు అవుతాయని.. దీని కారణంగా.. రూ. 6 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Director Krish : డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను ఆయన వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్నారని, 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే క్రిష్ రెండో వివాహానికి సంబంధించి అధికారికంగా సమాచారం లేదు. కాగా క్రిష్ గతంలో రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అనుష్క శెట్టితో ‘ఘాటీ’ మూవీ తెరకెక్కిస్తున్నారు. 

Kerala : మత ప్రాతిపదికన కేరళ ఐఏఎస్‌ అధికారుల వాట్సాప్‌ గ్రూపులు

కేరళలోని ఐఏఎస్‌ అధికారులను మతపరంగా విభజించి, ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే, రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కే గోపాలకృష్ణన్‌ (ఐఏఎస్‌) ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ను హ్యాక్‌ చేసి, తనను కొత్త వాట్సాప్‌ గ్రూపులకు అడ్మిన్‌గా చేర్చారని ఆరోపించారు. ‘మల్లు హిందూ అధికారులు’, ‘మల్లు ముస్లిం అధికారులు’, మరికొన్ని గ్రూపులను క్రియేట్‌ చేశారని చెప్పారు. అక్టోబరు 30న మల్లు హిందూ అధికారుల గ్రూపును క్రియేట్‌ చేసి, దానిలో హిందూ ఐఏఎస్‌ అధికారులను చేర్చారని, దీని ఔచిత్యంపై చాలా మంది అధికారులు ప్రశ్నించడంతో దీనిని కొద్ది గంటల్లోనే డిలీట్‌ చేశారని తెలుస్తున్నది.


MiG 29 fighter jet: ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్‌-29 విమానం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్‌- 29 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అప్రమత్తమైన పైలట్‌ కిందకు సురక్షితంగా బయటపడ్డారు. విన్యాసాల కోసం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయల్దేరిన ఈ ఫైటర్‌ జెట్‌ ఆగ్రా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుప్పకూలిన చోట విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మిగ్‌-29 విమానం ఇలా కుప్పకూలిన ఘటనలు గతంలోనూ జరిగాయి. సెప్టెంబర్‌ 2న రాజస్థాన్‌లోని బార్మేర్‌లో శిక్షణ నేపథ్యంలో మిగ్‌- 29 ఫైటర్‌ జెట్‌ కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్‌ ఆ విమానం కూలడానికి ముందే సురక్షితంగా బయటపడ్డారు.

Annapurna Studio : అన్నపూర్ణ స్టూడియోలోనే చైతూ-శోభిత పెళ్లి

అక్కినేని నాగ చైతన్య-శోభితల పెళ్లి పనులు మొదలవడంతో వెడ్డింగ్ వేదిక ఎక్కడనే చర్చ మొదలైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని వార్తలు రాగా అందుకు భిన్నంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఇరు ఫ్యామిలీలు పెళ్లి పిలుపులను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా డిసెంబర్ 4న వీరి వివాహం జరుగుతుందని టాక్.

ఇక సమంతో నాగ చైతన్య విడిపోయిన తరువాత శోభిత మ్యాటర్ ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరూ కలిసి లండన్ వీధుల్లో తిరుగుతున్నారని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వదిలారు. అయితే వీరిద్దరి మీద వచ్చిన వార్తలను, డేటింగ్ టాక్‌ను అంతా నమ్మారు. కానీ చైతూ మాత్రం ఇదంతా రూమర్ అన్నట్టుగా కొట్టి పారేశాడు. వేరే అమ్మాయిని ఎందుకు మధ్యలోకి లాగి ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ ఆ మధ్య మాట్లాడాడు.

Kedarnath Temple : కేదారినాథ్ ఆలయం మళ్లీ తెరుచుకునేది ఎప్పుడో తెలుసా?

ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్ నాథ్ ఆలయం తలుపులు మూతపడ్డాయి. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయ తలుపులను మూసివేశారు. మళ్లీ ఆర్నెలల తర్వాతే ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. ఈ ఆర్నెలలు ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. అప్పటి వరకూ ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబాకి ఆరాధన, దర్శనం నిర్వహిస్తారు.

శీతాకాలం ప్రారంభం కావడంతో చార్ ధామ్ ఆలయాలు మూతపడుతున్నాయి. శనివారం గంగోత్రి ధామ్ తలుపులను మూసివేయగా.. ఆదివారం కేదార్ నాథ్ ఆలయం మూతపడింది. అలాగే యమునోత్రి ఆలయ తలుపులను మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేశారు. శ్రీ మహావిష్ణువు కొలువైన బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూసివేస్తారు. ఈ ఏడాది మే 10న ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర తుదిదశకు చేరుకుంది. నవంబర్ 1 వరకూ 15 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. భక్తులు జ్యోతిర్లింగాలను సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ వేసవికాలంలోనే ఆలయాల తలుపులు తెరచుకోనున్నాయి.  

Crime News: ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్‌ షాక్‌..

 ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడిపర్రులో విద్యుదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపర్రులో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని సినీ నటుడు సుమన్‌ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం గ్రామానికి చెందిన బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణ ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్‌ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు కోమటి అనంరావు తీవ్రంగా పడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం తణుకు ఏరియా దవాఖానకు తరలించారు.మృతుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సానుభూతి ప్రకటించారు. వారిని అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Guinness World Record:   గుమ్మడికాయ పడవతో.. గిన్నిస్‌ రికార్డు

కడవంత గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్‌ ప్రపంచ రికార్డును సాధించాడు అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్‌. ఒరెగ్యాన్‌ హ్యాపీవాయలీకి చెందిన గ్యారీ 555.2 కేజీల గుమ్మడికాయలోని గుజ్జును తీసి పడవగా మార్చాడు. దీంతో కొలంబియా నదిలో వాషింగ్టన్‌లోని నార్త్‌ బొన్నెవిల్లి నుంచి వాంకోవర్‌ వరకు ప్రయాణించాడు. గుమ్మడికాయ పడవపై అంతకు ముందెవ్వరూ ఇంత దూరం ప్రయాణం చేయకపోవడంతో దానిని గిన్నిస్‌ రికార్డుగా నమోదు చేశారు. స్వతాహాగా భారీ సైజులో గుమ్మడికాయలు పెంచడం గ్యారీకి అలవాటు. 2013లో అలా తయారు చేసిన గుమ్మడికాయ పడవపై ప్రయాణం చేసి స్థానిక పోటీలో బహుమతి గెల్చుకున్నాడు.


Karnataka : చిక్ మగళూరులో తొక్కిసలాట.. పెద్దసంఖ్యలో భక్తులకు గాయాలు

కర్ణాటకలోని చిక్కమగళూరులో విషాదం చోటు చేసుకుంది. దేవీరమ్మ కొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాట పలువురు గాయపడ్డారు. కొంతమంది కొండపై నుంచి కిందపడ్డారు. నరక చతుర్దశి సందర్భంగా ఇక్కడ జరిగే వార్షిక క్రతువులో అమ్మవారి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. కొండపైకి వచ్చే భక్తుల భద్రత కోసం చిక్కమగళూరు పోలీసులు ఏర్పాట్లు చేసినప్పటికీ భారీగా తరలిరావడంతో ఇబ్బందులుపడ్డారు.

Ukraine-Russia:  రష్యాకు సైన్యాలు పంపిన ఉత్తర కొరియా

ఉక్రెయిన్‌పై యుద్ధం సాగించడానికి సహాయంగా రష్యాకు ఉత్తర కొరియా సైన్యాలను పంపించిందని నాటో సోమవారం నిర్ధారించింది. కొన్ని సైన్యాలు రష్యా కుర్స్ రీజియన్‌లో దిగాయని, అక్కడ నుంచి ఉక్రెయిన్‌లో చొరబాటుకు రష్యా యుద్ధం సాగిస్తోందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రటిల్ పాత్రికేయులకు వివరించారు. దీనివల్ల రష్యా యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. బ్రసెల్స్‌లో నాటో ప్రధాన కార్యాలయంలో 32 మిత్ర దేశాల రాయబారుల సమావేశంలో దక్షిణ కొరియా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమీక్ష నిర్వహించిన సందర్భంగా నాటో ఈమేరకు ప్రకటించింది.

రష్యాలోకి కిమ్‌ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. అసలు కిమ్‌ సైన్యం మద్దతు తీసుకోవడం రష్యా బలహీనతను తెలియజేస్తోందని ఎద్దేవా చేసింది.



Philippines : ఫిలిప్పీన్స్ ను ముంచిన ట్రామీ తుపాను.. 150 మంది మృతి

ఫిలిప్పీన్స్​ లో ట్రామీ తుఫాన్​ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. సోమవారం నాటికి మృతి చెందిన వారి సంఖ్య దాదాపుగా 150కి చేరుకుంది. మరో 70 మంది గల్లంతయ్యారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. తుఫానుతో బికోల్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ 38 మంది చనిపోయారని పోలీసులు పేర్కొన్నారు. తుపాన్ ట్రామీ ధాటికి ఆ దేశంలో భారీ వినాశనం జరిగింది. అక్టోబర్ 24 నుంచి మొదలైన తుపాను ధాటికి ఇప్పటి వరకు 150 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 5 లక్షల మందికి పైగా తమ ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

Johnny Master : జాలి గుండె చాటుకున్న జానీ మాస్టర్

పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలైన సినిమా డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ తన పెద్దమనసు చాటుకున్నారు. యాక్సిడెంట్‌ అయిన వ్యక్తిని దగ్గరుండి 108లో ఆస్పత్రికి తరలించారు. జానీ మాస్టర్‌ హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా.. ఒక వ్యక్తి యాక్సిడెంట్‌ అయి తీవ్ర గాయాలతో పడిఉండటాన్ని గమనించారు. దాంతో జానీ మాస్టర్‌ తన కారు ఆపి..108కి ఫోన్‌ చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. జానీ చేసిన సాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసుల ఒత్తిడిలో ఉండి కూడా ఇలా సాయం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు.

ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ మహేశ్వరరావు కుంచం, జస్టిస్‌ తూట చంద్ర ధనశేఖర్‌ ప్రమాణం చేశారు.


FIRE ACCIDENT: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ అబిడ్స్‌ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్‌ టేక్డీలోని ఓ టపాసుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీపావళి పర్వదినానికి ముందు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారాస్ బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు.

జనగామలోనూ..

జనగామ జిల్లా కేంద్రంలోని షాపింగ్‌ మాల్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. విజయ షాపింగ్‌ మాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి కాంప్లెక్స్‌ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విలువైన వస్ర్తాలు కాలి బూడిదయ్యాయి. రూ.15 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 12 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. అగ్నిమాపకశాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,746 కోట్లు

ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో బ్యాంక్‌ లాభం రూ.11,746 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి రూ.47,714 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ ఆదాయం (NII) 9.5శాతం పెరిగి రూ.18,308 కోట్ల నుంచి రూ.20,048 కోట్లకు చేరినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.97శాతానికి తగ్గాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆస్తులు 2.48శాతంగా ఉండేవి. నికర నిరర్థక ఆస్తులు 0.43శాతం నుంచి 0.42శాతానికి చేరాయని వెల్లడించింది.

Tamil Nadu : వర్షాలు, వరదలతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరి

భారీ వర్షాలతో తమిళనాడులోని ప్రధాన నగరాలు అతలాకుతలమయ్యాయి. ఏడు జిల్లాలకు వాతావరణ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. కొద్ది రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు నమోదవుతుండగా తాజాగా దానా తుపాను ప్రభావం కూడా కనిపిస్తోంది. రెండ్రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధురైలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మదురైలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల వారిని తరలించింది. సహాయక చర్యలను చేపట్టింది. మదురై కలెక్టర్‌తో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

New Semi High-Speed Rail : శంషాబాద్ టు వైజాగ్.. 4 గంటలే ప్రయాణం

శంషాబాద్ నుంచి వైజాగ్‌కు కేవలం 4 గంటల్లోనే చేరుకునే సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌ ఎలైన్‌మెంట్ ఖరారైంది. గంటకు 220KM వేగంతో దూసుకెళ్లే ఈ రైలు విజయవాడ మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. ఈ రూట్‌లో మొత్తం 12 స్టేషన్లుంటాయి. సర్వే తుది దశకు చేరగా నవంబర్‌లో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ను నిర్మించనున్నారు.

ఏపీ, తెలంగాణలో మొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ఇదే కావడం విశేషం. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించనున్నారు. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా డిజైన్‌ చేస్తున్నారు.

ఈ సెమీ హైస్పీడ్ కారిడార్ పూర్తయితే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్- విశాఖ మధ్య రైలు ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ మాత్రం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటోంది. సికింద్రాబాద్‌ -విశాఖ మధ్య ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంలో ఒకటి.. నల్గొండ, గుంటూరు, విజయవాడ ఈ మార్గం రెండోది.

Tirupati: తిరుపతిలో మరో‌సారి బాంబు బెదిరింపుల కలకలం

తిరుపతిలోని రాజ్‌ పార్క్‌ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రాజ్ పార్క్ హోటల్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు

Nara Lokesh: శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేశ్‌కు అపూర్వ స్వాగతం

ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేశ్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేశ్ అగ్ర‌రాజ్యంలో పర్యటిస్తారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 

పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అక్కడి తెలుగు ప్రముఖులు, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేశ్‌కి స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారిలో  ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇంచార్జి రవి మందలపు, ఐటీ సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీశ్‌ మండవ, సురేశ్‌ మానుకొండ ఎయిర్ పోర్టులో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం పలికిన ఉన్నారు.

ఇక 2000 సంవత్సరంలోనే విజన్ 2020 పేరుతో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.


TTD Instructions: శ్రీవారి కాలిబాట భక్తులు.. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి -టీటీడీ

శ్రీవారి దర్శనార్థం కాలినడక మార్గంలో తిరుమల వచ్చే భక్తుల్లో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో భక్తులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తితిదే శుక్రవారం ఓ ప్రకటనలో సూచించింది. ‘60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల, గుండె సంబంధిత వ్యాధులున్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదు. తిరుమల సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న కారణంగా ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవాలి. కాలినడకన వచ్చే భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1,500 మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్యసహాయం పొందవచ్చు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24 గంటలూ వైద్యసాయం అందిస్తారు. కిడ్నీల సమస్య బాధితులు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌ సౌకర్యం పొందవచ్చు’ అని తితిదే పేర్కొంది.

Aghori : పేలిన అఘోరీ కారు టైర్.. కేదార్‌నాథ్‌లో ఏం జరిగిందంటే?

టీవీ, డిజిటల్ మీడియాకు ఇంటర్వ్యూలతో పాపులరైన అఘోరీకి కేదార్ నాథ్ లో తృటిలో ప్రమాదం తప్పింది. కేదార్‌నాథ్ వెళుతుండగా అఘోరీ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయినట్టు పలు చానెళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. టైర్ పేలిందని కూడా చూసుకోకుండా 10 కిలోమీటర్లు అఘోరీ అలాగే వెళ్లిందని తెలిసింది. తర్వాత కారు ముందుకు వెళ్లకపోవడంతో వాహనాన్ని నిలిపివేసిందనీ.. డెహ్రాడూన్ నుండి ఓ భక్తులు కొత్త టైర్ తీసుకొచ్చి అఘోరీ వాహనానికి అమర్చాడని సమాచారం. ఈ విషయాన్ని అఘోరీ తనకు ఫోన్ చేసిన మీడియా సిబ్బందికి తెలియజేసింది.

Philippines : ఫిలిప్పీన్స్‌లో ట్రామి తుఫాన్‌ బీభత్సం..

ఫిలిప్పీన్స్‌ లో తీవ్ర తుఫాన్‌ ‘ట్రామి’ బీభత్సం  సృష్టించింది. ఈ తుఫాన్‌ కారణంగా ఉత్తర ఫిలిప్పీన్స్‌లో వరదలు సంభవించాయి. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి . ఈ ఘటనల్లో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. ఈ తుఫాన్‌ అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర ప్రావిన్స్‌లోని ఇసాబెలాలోకి ప్రవేశించినట్లు స్థానిక అధికారులను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తుఫాన్‌ ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసర సేవలు మినహా పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు. తుఫాను ధాటికి గంటలకు 95 – 100 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తున్నాయి.

దాదాపు 1,500 మంది పోలీసు అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తుఫాను ధాటికి సంభవించిన ప్రమాదాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మనీలాకు ఆగ్నేయంగా ఉన్న ఆరుప్రావిన్స్‌ బికోల్‌ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదైనట్లు పేర్కొన్నారు.

JK: జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ వాహనం టార్గెట్​గా   దాడి..

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లతో పాటు మరో ఇద్దరు సామాన్య పౌరులు మృతి చెందారు. 18 రాష్ట్రీయ రైఫిల్స్‌కి చెందిన వాహనమే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపారు.

బారాముల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు సైనికులు మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో ఇద్దరు పౌరులు కూడా మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు వర్గాలు తెలిపాయి. బారాముల్లాలోని బుటాపత్రి సాధారణ ప్రాంతంలో సైనికులు మరియు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు ఎక్స్‌లోని ఒక పోస్ట్‌లో భారత సైన్యం ధృవీకరించింది. బుటాపత్రిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు తొలుత దాడి చేశారు. ఒక కార్మికుడు గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీతమ్ సింగ్‌గా గుర్తించారు.

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు.. ఇన్నోవా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలుకు చెందిన పలువురు ఇన్నోవా కారులో తిరుపతికి వెళుతుండగా.. రైల్వే కోడూరు మండలం రాజానగర్ సమీపంలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సును ఢీకొట్టడం జరిగింది.

ఈ ఘటనలో కర్నూలు జిల్లా ఎల్లురు నగర్‌కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్ (51), రావూరి వాసవి (47), నరసింహారెడ్డి నగర్‌కు చెందిన కామిశెట్టి సుజాత (40) మృతి చెందారు. వీరంతా తిరుపతిలో రిసెప్షన్ వేడుకకు వెళుతుండగా, ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని 108 అంబులెన్స్‌లో రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


MEDICAL COLLAGE: వైఎస్‌ పేరు తొలగించి పింగళి వెంకయ్య పేరు

మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, 'పింగళి వెంకయ్య మెడికల్ కాలేజీ'గా ఏపీ ప్రభుత్వం పేరు మార్చింది. బీజేపీ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పలు విద్యాసంస్థలకు తమ ఇంట్లో వారి పేరు పెట్టుకుంటే.. తాము మాత్రం దేశ నాయకుల పేర్లు పెడుతున్నామని పేర్కొన్నారు. మచిలీపట్నం మెడికల్‌ కాలేజీకి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టాలని వైసీపీ ప్రభుత్వ హయంలోనే విజ్ఞప్తులు వచ్చాయి. కానీ జగన్‌ సర్కార్‌ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్య పేరును నిర్ణయించిన సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Fire In Metro Station: మెట్రో స్టేషన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

పూణెలోని మండై మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు రాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దాంతో అక్కడి ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన మెట్రో అధికారులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దాంతో ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని ఐదు నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో నీటిని చల్లి మంటలను ఆర్పారు . ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్‌లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయని చెప్పారు. కాగా, మెట్రో స్టేషన్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ట్వీట్‌ చేశారు.

ACCIDENT: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ప్రమాదం తప్పింది. దత్తాత్రేయ ఢిల్లీ వెళ్లేందుకు తన కాన్వాయ్ లో శంషాబాద్ వెళుతుండగా… ఫ్లైఓవర్ దాటి ఎయిర్‌ పోర్ట్‌కు ప్రవేశించే సమయంలో తన కాన్వాయ్ వెనుక వస్తున్న మరో వ్యక్తి కారు కాన్వాయ్ ని ఓవర్టేక్ చేయబోయి సడన్ బ్రేక్ వేశాడు. దీంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ కారు ముందుకు వెళ్ళిపోయింది. కాన్వాయ్ లోని మిగిలిన రెండు కార్లు, ఒక అంబులెన్స్ ఒకదానినొకటి ఢీకొనడంతో కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Blast In Delhi: ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వ‌ద్ద పేలుడు..

ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ బౌండరీ వాల్ దగ్గర భారీ పేలుడు శబ్దం వినిపించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని కూడా సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదు.ఈ సంద‌ర్భంగా ప్ర‌త్య‌క్ష సాక్షి మాట్లాడుతూ.. నేను ఇంట్లో ఉండ‌గా, భారీ శ‌బ్దం వినిపించింది. బ‌య‌ట‌కు వ‌చ్చి చూడగా స్కూల్ స‌మీపంలో పొగ‌లు ద‌ట్టంగా క‌మ్ముకున్నాయి. ఆ దృశ్యాల‌ను త‌న ఫోన్‌లో రికార్డు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఇంత‌కు మించి త‌న‌కు ఏమి తెలియ‌ద‌న్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

CRIME: ఇంటర్‌ విద్యార్థినిని హత్య చేసిన ఉన్మాది..!

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో దారుణం జరిగింది. ఇంటర్‌ విద్యార్థిని ఓ ఉన్మాది హత్య చేశాడు. సన్నీ అనే యువకుడు కొంతకాలంగా అశ్విని అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతి తరచూ నిరాకరిస్తుండటంతో కోపంతో ఊగిపోయిన సన్నీ.... ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విద్యార్థిని అశ్విని నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. అశ్విని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

SUCIDE: ప్రేమ జంట బలవన్మరణం

గుంటూరు జిల్లాలో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెదకాకాని వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్‌(22), శైలజ(21)గా గుర్తించారు. పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్‌, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా చదివిన మహేశ్‌.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌లో పని చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. 10 రోజుల క్రితం యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దసరా సమయంలో శైలు, మహేశ్‌ ఇంట్లో చెప్పకుండా బయటకెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై విగత జీవులుగా కనిపించారు.

High Court: భారత్‌ మాతా కీ జై అంటేనే బెయిల్‌.. నిందితుడికి తిక్క కుదిర్చిన హైకోర్టు

భారత వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసిన ఓ నిందితుడికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు తిక్క కుదిర్చింది. అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఊహించని షరతులు విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 17న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. భోపాల్‌ సమీపంలోని మిస్రోద్‌లో ఓ పంక్చర్‌ షాప్‌ నిర్వహించే ఫైసల్‌ఖాన్‌ ఆ వీడియోలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌”, ‘భారత్‌ ముర్దాబాద్‌’ అని నినాదాలు చేయడం కనిపించింది. దీంతో అతడిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫైసల్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.

ఈ కేసులో తాజాగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ పలివాల్‌ అతడికి బెయిలు మంజూరు చేస్తూ.. ఫైసల్‌ తన దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలని షరతు విధించారు. జాతీయ జెండాకు 21సార్లు వందనం చేయాలని, నెలకు రెండుసార్లు ‘భారత్‌ మాతా కీ జై’ అని నినదించాలని షరతులు పెట్టారు. కేసు ముగిసే వరకు ప్రతినెల మొదటి, నాలుగో మంగళవారం మిస్రోద్‌ పోలీస్‌ స్టేషన్‌లోని జెండా స్తంభం వద్ద ఇలా చేయాలని ఆదేశిస్తూ ఫైసల్‌కు బెయిలు మంజూరు చేశారు.

IND vs NZ:   భారత బ్యాటర్లు ఘోర  వైఫల్యం,  46 కి ఆలౌట్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్లుగా పెవిలియన్‌ బాట పట్టడంతో 46 పరుగులకే టీమ్‌ ఇండియా అలౌట్‌ అయింది. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ కాగా.. ఇద్దరు (జైస్వాల్‌ - 12, పంత్‌ - 20) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టిమ్‌ సౌథీ ఒక వికెట్‌ తీసుకున్నాడు.

Haryana : హర్యానా సీఎంగా నేడు సైనీ ప్రమాణం

 హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన హర్యానా సీఎంగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ విజయం సాధిస్తే సైనీయే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎన్నికల అనంతరం బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు సీఎంగా ఉన్న మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను తొలగించిన బీజేపీ మార్చిలో సైనీని ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన నాయకత్వంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, విపక్ష కాంగ్రెస్‌ 37 సీట్లకే పరిమితమైంది.

THEFT: శ్లోకం చదువుతండగా గొలుసు లాక్కెళ్లాడు

బెంగుళూరులో షాకింగ్ ఘటన జరిగింది. గుడిలో అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఆమె తేరుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యాడు. బెంగుళూరులోని శంకర్ నగర్‌లోని గణేష్ ఆలయంలో మహిళలంతా అమ్మవారి శ్లోకాలు చదువుతున్నారు. గుడిలో కిటికీ పక్కన కూర్చుని శ్లోకాలు చదువుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు. ఆమె తేరుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న మహిళలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Boeing :  సమ్మె ఎఫెక్ట్‌.. బోయింగ్‌ సంస్థలో 17వేల ఉద్యోగాల కోత

ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టం కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఏకంగా 17వేల మంది సిబ్బందిపై వేటు వేయనుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10శాతం మందిని తొలగించనుంది.

సియాటెల్‌ ప్రాంతంలో 33,000మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకొనేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్‌ అన్నారు. ‘‘ రానున్న నెలల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10శాతం మందిని తగ్గించాలని చూస్తున్నాం. వీరిలో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు ఉండనున్నారు’’ అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం బోయింగ్‌ ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయాత్మక చర్యలు అవసరం అని బోయింగ్‌ తెలిపింది. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవడానికి ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరం అని పేర్కొంది. సమ్మె ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో 777X జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నట్లు బోయింగ్‌ తెలిపింది. 2026లో వీటి డెలివరీలు అందిస్తామని వెల్లడించింది. ప్రస్తుత ఆర్డర్లను పూర్తి చేసిన తర్వాత 2027లో 767 ఫ్రైటర్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని బోయింగ్‌ యోచిస్తోంది. ఈనేపథ్యంలో బోయింగ్‌ షేర్లు 1.1శాతం క్షీణించాయి. భారీ స్థాయిలో ఉద్యోగు