- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

రాష్ట్రంలో 23వేల కోట్లతో భూములు కొని ఇళ్ల ప్లాట్లు పేదలకు ఇచ్చామని ఘనంగా చెప్పుకుంటున్న సీఎం జగన్ చిరువోలు గ్రామ లబ్దిదారుల సమస్య పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు. పూర్తిగా స్మశానం పక్కన ఆర్ సి కరకట్ట స్థలంలో లే ఔట్ వేయటంతో నెలకొన్న సమస్య పరిశీలించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిర్లక్ష్యం కారణంగానే ఈ గ్రామంలో ఎస్సీ బీసీలకు అన్యాయం జరిగిందని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అల్లూరి జిల్లా చింతపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్ధునులు అదృశ్యమయ్యారు. పోలీసులకు ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పాంగి గాయత్రి, గెమ్మిల నీరజ, 5వ తరగతి చదువుతున్న పాంగి గీత అనే ముగ్గురు విద్యార్ధునులు మంగళవారం సాయంత్రం ఉపాధ్యాయుల అనుమతి లేకుండా పాఠశాల నుంచి బయటికి వెళ్లిపోయారు. తోటి విద్యార్ధులు ఆరా తీయగా బంధువుల ఇంటికి వెళుతున్ననట్లు చెప్పినట్లు తెలిపారు. బంధువుల ఇళ్లకు వెళ్లి వాకబు చేయగా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది.2 రోజుల పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు హైదరాబాద్లోనే ఉండనున్నారు. సోనియా, రాహుల్, ఖర్గేతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. మరోవైపు ఈనెల 17న కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్ఎస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్గాంధీ హాజరు కానున్నారు.తెలంగాణ కోసం కాంగ్రెస్ త్యాగాలను వివరించడంతో పాటు, కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

తెలంగాణ పోలీస్ అకాడమీలో ఫ్యూచర్ ఉమెన్ లీడర్ పోగ్రామ్ 2023 పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టీఎస్పీఏలో గ్లోబెల్ ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. మూడ్రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్పీఏ డైరెక్టర్ సందీప్ శాండిల్య హాజరయ్యారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీచెంగాలమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్యా ఎల్-1 ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. రేపు ఉదయం 11.50 గంటలకు పీఎస్పీ సి-57 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. అక్టోబర్ లో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్ - 2 ద్వారా ఇన్శాట్ 3 డీఎస్ శాటిలైట్ను నింగిలోకి పంపుతామన్నారు. నవంబరులో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం చేపడుతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

ఒకే దేశం, ఒకే ఎన్నికలు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 15 నుండి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చీఫ్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉండనున్నారు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఒక దేశం ఒక ఎన్నిక, యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉంది.

అమరావతిలోని ఆర్5 జోన్ కేసు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. అమరావతి రాజధాని కేసును విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనమే.. ఆర్5 జోన్ కేసును విచారించనుంది. పిటిషన్పై విచారణ మధ్నాహ్నం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఆర్5జోన్పై హైకోర్టు తీర్పును సవాల్ చేసింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వస్తుందంటే ఆయన అభిమానులకు పెద్ద పండగే. నెల్లూరుకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు తమ నాయకుడికి పుట్టినరోజు కానుకగా అపూరపమైన బహుమతి ఒకటి ఇచ్చారు. 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని తీర్చిదిద్దారు. నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఈ కళాకృతిని తయారు చేయించారు. 470 కేజీల వెండి పట్టీలు, మువ్వలతో చిరునవ్వులు చిందిస్తోన్న పవన్ కల్యాణ్ ముఖచిత్రాన్ని రూపొందించారు.

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇవాళ 201వ రోజు పాదయాత్ర ఉదయం 8గంటలకు పొంగుటూరు క్యాంపు నుంచి ప్రారంభంకానుంది. పోతవరంలో స్ధానికులు, రైతులతో సమావేశం కానున్నారు. ఉదయం 11గం. 30ని.లకు కవులూరులో స్దానికులు, మధ్యాహ్నం 12గం. 30ని.లకు చీపురుగూడెంలో గీతకార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం నల్లజర్ల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆటో యూనియన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6గం. 30ని.లకు ప్రకాశరావుపాలెంలో స్దానికులు, దళిత మహిళలతో సమావేశం కానున్నారు.

అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన బాలిక గర్భం దాల్చిన కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ రాజశేఖర్ బాలికను గర్భవతిని చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో ఉంచిన కానిస్టేబుల్ రమేష్ను వెంటనే విడుదల చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. గ్రామ పెద్దలకు కానిస్టేబుల్ రమేష్ కు మధ్య మనస్పర్ధల కారణంగానే రమేష్ను ఇరికించినట్లు తెలుస్తోంది.

ఏపీలో పలుచోట్ల డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేస్తున్నారు. కార్డ్ 2.0ను అమలు చేయోద్దంటూ నిరసన చేశారు. విశాఖ, మధురవాడలో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనకు దిగారు. పాత పద్ధతి లోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకున్నామని,.. డాక్యుమెంట్ విధానాన్ని డిజిటలైజేషన్ ఎంతవరకు సరైందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తాము రోడ్డును పడతామంటున్నారు. ప్రైమ్ 2.0 అనే కొత్త విధానంతో డాక్యుమెంట్లలో అవకతవకలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెన్ డౌన్ చేస్తున్నారు డాక్యుమెంట్ రైటర్లు.

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంఖానాదం కార్యక్రమంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. మహిళల కోసం మోదీ ఒక అన్నగా ముందు నిలిచాడని తెలిపారు. మహిళల గౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారని అన్నారు. నాడు కొంత మంది అవహేళన చేశారని విమర్శించారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణుల కోసం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారని పురందేశ్వరి అన్నారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలనాలు బయటికి వస్తున్నాయి. సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీకి డ్రగ్ మాఫియాతో లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్లతో వెంకట్, బాలాజీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్ పార్టీ జరిగిన రూమ్లో 5 రకాల మత్తు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. LSD, ESTACY పిల్స్, MDMA , కొకైన్, గాంజా స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని రకలా డ్రగ్స్ ఉండటం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడు పొన్నై అటవీప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జనసంచారం ప్రాంతంలోకి వచ్చిన గజరాజు ఓ మహిళను చంపేసింది. ఏనుగు దాడిలో మహిళతో పాటు ఓ ఆవు ప్రాణాలు కోల్పోయింది. పార్క్ చేసి ఉన్న బైక్ను ఏనుగు ధ్వంసం చేసింది. కుంకి ఏనుగుల సాయంతో దాడికి పాల్పడిన ఏనుగును అటవీ ప్రాంతలోకి తరమడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం రామాపురం ప్రాంతంలో ఏనుగు సంచరిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఒంటరి ఏనుగును నియంత్రించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర కత్తులతో యువకుల వీరంగం కలకలం సృష్టించింది. రద్దీ ప్రాంతంలో సర్కిల్ పోలీస్స్టేషన్కు సమీపంలోనే మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. కత్తులు పట్టుకుని రోడ్డుపై తిరుగుతుంటే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొత్తచెరువు ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో యువకుడు హంగామా సృష్టించిన ఘటన జరిగి వారం గడవకముందే ప్రధాన సర్కిల్ కత్తులతో వీరంగం వేయడంపై స్థానికుల వణికిపోతున్నారు. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వచ్చే నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం కానుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు.. ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేక సమావేశాలపై ప్రకటన చేశారు. అకస్మాత్తుగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుందా? లేదంటే కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రతిపక్ష నేతల్లోనూ విభిన్నరకాల చర్చలు జరుగుతున్నాయి.

భార్యను వేట కొడవలితో నరికి చంపేందుకు ప్రయత్నించాడో కిరాతక భర్త. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటనలో లక్ష్మీ దేవి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాపూజీ పార్క్ వద్ద భార్యతో భర్త రఘు గొడవ పడ్డాడు. అనంతరం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె రోడ్డుపైకి రావడంతో కొడవలితో వెంటపడి నరికి చంపడానికి ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకున్నా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మీ కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నిమ్స్ ఆస్పత్రిలో ప్రకృతి వైద్య విభాగం అందుబాటులోకి వచ్చింది. యోగ, ప్రకృతి వైద్యం అందించాలనే ఉద్దేశంతో యోగాసనాలతో పాటు 159 రకాల థెరపిలను ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలో కొత్తగా మరో 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.

తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ వేదికగా నిలిచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలో ఆత్మీయుల మధ్య రాఖీపౌర్ణమి వేడుకలు జరిగాయి. రక్షాబంధన్ సందర్భంగా కేసీఆర్కు అక్కచెల్లెలు రాఖీ కట్టారు. ఆ తర్వాత సోదరీమణులకు కేసీఆర్ పాదాభివందనాలు చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ వేడుకలో కేసీఆర్ సతీమణి శోభతో పాటు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లాలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్ నేత, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు లేఖ పంపారు. కొండలరావు అరకు నియోజకవర్గం పరిశీలకునిగా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాసరావు.. గజపతినగరం టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిన్న తన తమ్ముడు కొండపల్లి అప్పలనాయుడు, తన కుమారుడుతో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

తెలంగాణలో 24 గంటల కరెంటు రావడం లేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా 12 గంటలకు మించి కరెంటు ఎక్కువ ఇవ్వడం లేదన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కరెంటు కోతలు తప్పవని ఇప్పటికే నీరందక పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం మాటలు నమ్మి నాట్లు వేసిన రైతులు నిండా మునిగే ప్రమాదం ఏర్పడిందన్నారు. రైతుబంధు డబ్బులు రైతు తెచ్చిన పెట్టుబడికి వడ్డీ కట్టేందుకు కూడా సరిపోవడం లేదన్నారు. మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. కిషన్రెడ్డి, ఈటల మధ్యలో గ్యాప్ రావడంతో మాజీ మంత్రి కృష్ణాయాదవ్ చేరిక ఆఖరి నిమిషంలో ఆగింది. ఈటల ద్వారా బీజేపీలో చేరేందుకు కృష్ణాయాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తనను సంప్రదించకపోవడంతో చేరికను వాయిదా వేశారు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మరోవైపు బీజేపీలో చేరక ముందే అంబర్ పేట్ నుంచి పోటీ చేస్తానన్న కృష్ణాయాదవ్ ప్రకటించేశారు. దీంతో కిషన్ రెడ్డి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.

రేపు సీపీఎస్ ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు... చలో విజయవాడను భగ్నం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. సీపీఎస్ ఉద్యోగ నేతల్ని పోలీస్ కమిషనరేట్ కు పిలిపించుకుని ప్రశ్నిస్తున్నారు. రేపటి నిరసనపై .. ఆరా తీస్తున్నారు. అయితే.. కోర్టు తీర్పుకు లోబడే తమ ఆందోళన ఉంటుందంటున్నారు సీపీఎస్ ఉద్యోగులు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్ ను ఒప్పుకునేది లేదంటున్నారు.

బీసీ మంత్రం జపిస్తుంది టీకాంగ్రెస్. పార్టీలో బీసీల ప్రాధాన్యతపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తుంది టీ కాంగ్రెస్. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. బీసీ డిక్లరేషన్లో చేర్చాల్సిన అంశాలపై సూచనలు,సలహాలు ఇవ్వనుంది పొన్నం కమిటీ. బీసీ సంక్షేమం, రాజకీయ ప్రధాన్యతపై సిఫార్సులు చేయనుంది. కమిటీలో పార్టీలోని బీసీ నేతలకు చోటు కల్పించారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి డిక్లరేషన్ ప్రకటించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.

ప్రవాహం నుంచి..సునామీగా మారిన లోకేష్ యువగళం పాదయాత్ర మరో కీలక మైలురాయిని చేరింది. పోలవరం నియోజకవర్గంలో 200వ రోజుకు చేరుకున్న పాదయాత్రలో పాల్గొన్నారు లోకేష్ తల్లి నారా భువనేశ్వరి. యువగళం పాదయాత్రకు సంఘీభావంగా నారా,నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 200రోజుల పాదయాత్రలో 77 నియోజకవర్గాలు,185 మండలాలు, 1675 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. 200 రోజుల పాటు కొనసాగిన పాద యాత్రలో 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8రచ్చబండ సభలు నిర్వహించారు.

వైసీపీ ప్రభుత్వంపై ఏకంగా ఆ పార్టీ కార్యకర్తే విసిగిపోయాడు. చిన్న పని కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పని మాత్రం కావడంలేదని తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. వైసీపీ కార్యకర్తను అయినందుకు తనకు ఇలా జరగాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండల సంగాల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేష్ పొలం పని నిమిత్తం తహసీల్దార్ కార్యాలయం చుట్టు రెండు నెలలుగా తిరుగుతున్నాడు. ఏ అధికారి తన గోడు వినిపించుకోవడంలేదని ఆవేదన చెందాడు.

నగరాభివృద్ధికి పాటుపడాల్సిన కర్నూలు మేయర్ వైసీపీ అనుచరుడిలా మారారు. తమ డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలని టీడీపీ కార్పొరేటర్లు విన్నవించగా జై జగన్ అంటేనే నిధులిస్తామన్నారు మేయర్ బి.వై.రామయ్య. కర్నూలులోని నూతన కౌన్సిల్ హాల్లో బుధవారం నగరపాలక పాలకవర్గ సమావేశం జరిగింది. టీడీపీ చెందిన పలువురు కార్పొరేటర్లు తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలంటూ సభ దృష్టికి తెచ్చారు. వీధి దీపాల పనులు చేయమంటే టీడీపీ గెలిచిన వార్డుల్లో చేయోద్దని అధికారులే చెబుతున్నారన్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ బాలుడు మురికి నీటి సంపులో పడి చనిపోయాడు. బాలుడు షాద్ నగర్ పరిధిలోని నందిగామకు చెందిన అభిజిత్ రెడ్డిగా గుర్తించారు. బాలుడి కోసం పరిసర ప్రాంతాల్లో వెతికిన కుటుంబ సభ్యులు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫంక్షన్ హాల్ ఆవరణలోని మురికి నీటి సంపులో బాలుడి మృతదేహం కనిపించింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లాలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ L బ్లాక్ లో 14 షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు కోటి రూపాయలకు పైగా నష్టం జరిగింది. సరుకు కళ్ళముందే కాలి దగ్ధం అవ్వుతున్న ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామంటూ షాపు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ప్రమాదానికి షాట్ సర్కిటే కారణమని తెలుస్తుంది. ప్రమాదాన్ని నివారించేందుకు దేవస్థానం అధికారులు ఫైర్ సేఫ్టీ నియమాలు పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖకు వచ్చారు బెంగాల్ పోలీసులు. విద్యార్థిని రీతిషాహా అనుమానాస్పద మృతి కేసులో విచారణ చేపట్టారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ మృతురాలి తండ్రి పేర్కొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ సీఎం ఆదేశాలతో కోల్కతాలోని నేతాజీ నగర్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విశాఖ వచ్చి విచారణ చేపట్టారు బెంగాల్ పోలీసులు. హత్య కోణంలో విచారణ మొదలుపెట్టారు. రీతిషాహాది ఆత్మహత్యగా భావిస్తున్నారు విశాఖ పోలీసులు. విచారణలో కళాశాల, హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు.

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒంటరి ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందారు. ఇద్దరూ పొలాల పక్కన ఉండగా ఒక్కసారిగా దాడిచేసినట్లుగా తెలుస్తోంది. మృతులు వెంకటేష్, సెల్విగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాల వద్దకు వెళ్లేందుకు కూడా జనం జంకుతు న్నారు. గ్రామ శివారులో కూడా ఏనుగు హల్చల్ చేస్తుండటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు.

రేపటితో పాదయాత్రకు 200 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో... భగవంతుడు లోకేష్ కు అన్ని శక్తులు ఇవ్వాలని కోరుకున్నారు నారా భువనేశ్వరి. లోకేష్ ప్రజల కోసం పోరాడుతున్నారన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్లలో నూతన హెరిటేజ్ పార్లర్ను భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రజల తరపున లోకేష్ పాదయాత్ర చేపట్టారన్నారు. రేపు తమ కుటుంబం సభ్యులు లోకేష్ పాదయాత్రలో పాల్గొంటారని.. అందరూ పాదయాత్రను దిగ్విజయం చేయాలన్నారు నారా భువనేశ్వరి.

నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయంలో మహిళా భక్తుల పట్ల ఓ వైసీపీ నేత అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలతో ....నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి అనే వైసీపీ నేత....వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆలయంలో... శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే.... మహిళల మధ్యలోకి ప్రవేశించిన మదన్ మోహన్ రెడ్డి....మహిళా భక్తులపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు. దీనిపై మండిపడ్డారు మహిళా భక్తులు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. బీరువా, హుండీని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం అంపురాం గ్రామంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతికి నిరసన సెగ తగిలింది. గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అంపురాం వెళ్లిన ఎమ్మెల్యేను స్ధానిక గిరిజనులు నిలదీశారు. గ్రామానికి సరైన రోడ్లు, మంచినీటి కులాయిలు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నాలుగేళ్లుగా గ్రామంలో ఉన్న సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే వచ్చారంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు చొరవదీసుకుని గిరిజనులను అడ్డుకున్నారు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


