చిట్టి న్యూస్

KTR: కేసీఆర్‌కు ఛాతిలో ఇన్‌ఫెక్షన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఛాతిలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని ఆయన కుమారుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే వైరల్‌ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్‌కు ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని వివరించారు. సీఎం కేసీఆర్‌కు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ తరువాత ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ మొదలైందన్న ఆయన. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌ వేగంగా కోలుకుంటున్నారని. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్‌లో చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్‌లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ 26న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా జ్వరం, దగ్గు సమస్యలతో కేసీఆర్ బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వీరాభిమానులు, కార్యకర్తలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Bengaluru Bus Stop : ఒక్క రాత్రిలోనే మాయమైన రూ.10లక్షల విలువైన బస్టాప్

వివిధ విచిత్రమైన విషయాలతో బెంగుళూరు నగరం ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లోనే ఉంటుంది. ఇప్పుడు, మరో విచిత్రమైన సంఘటనలో, బెంగళూరులో రద్దీగా ఉండే రహదారి నుండి పాక్షికంగా నిర్మించిన బస్ షెల్టర్ అదృశ్యమైంది. పలు నివేదికల ప్రకారం, అందులో కుర్చీలు, పైకప్పులు, స్తంభాలు ఉన్నాయి. అయినప్పటికీ, దొంగలు ఏమీ వదిలిపెట్టకుండా మొత్తం వస్తువులను తమతో తీసుకెళ్లారు. కన్నింగ్‌హామ్ రోడ్డులో 10 లక్షల రూపాయలతో స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం జరుగుతోంది. దీన్ని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) నిర్వహించింది.

ఈమేరకు రవాణాశాఖ ఉపాధ్యక్షుడు ఎన్ రవిరెడ్డి చోరీపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భవనాల నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే, అంతకుముందు, బెంగళూరు మహిళకు పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇస్తామని నకిలీ మోసగాళ్లు రూ.60 లక్షలు మోసం చేశారు. నివేదికల ప్రకారం, మహిళ నగరంలోని సర్జాపూర్ ప్రాంతంలో నివసిస్తున్న 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సెప్టెంబర్ 11-19 వారంలో ఆమె డబ్బు పోగొట్టుకుంది. పార్ట్ టైమ్ జాబ్ గురించి ఆమెకు తెలియజేసే లింక్‌తో కూడిన ఓ టెక్ట్స్ మెసేజ్ ఆమెకు రావడంతో ఇదంతా ప్రారంభమైంది.

ఆమె దాన్ని క్లిక్ చేయడంతో అది టెలిగ్రామ్ గ్రూప్‌కి తీసుకెళ్లింది. అక్కడ, ఆమె హోటల్‌లను సమీక్షించమని, దాని కోసం రూ. 100 సంపాదించమని అడిగారు. ప్రారంభంలో, హోటల్‌లను సమీక్షించినందుకు మహిళకు తక్కువ మొత్తం వచ్చింది. అయితే, తర్వాత, స్కామర్‌లు ఆమెకు మంచి బక్స్ సంపాదించడంలో సహాయపడే పెట్టుబడి అవకాశం గురించి తెలియజేశారు. దాంతో ఆ మహిళ పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. అలా ఆమె రూ.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. అయితే, తనకు ఇచ్చిన ఉద్యోగం రాకపోవడంతో.. తాను మోసపోయానని అర్థమైంది.


YCP ATTACK: వృద్ధుడని చూడకుండా టీడీపీ అభిమానిపై దాడి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ నంద్యాల జిల్లా చినదేవళా పురం నుంచి రాజమండ్రి వరకు పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం అభిమానిపై పల్నాడు జిల్లాలో కొందరు దుండగులు దాడి చేశారు. వినుకొండ దాటిన తర్వాత బైకులపై వచ్చిన దుండగులు..తెలుగుదేశం అభిమాని నారాయణను దూషించి దాడికి పాల్పడ్డారు. నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు తన స్వగ్రామం నుంచి నారాయణ అనే అభిమాని కాలినడకన రాజమండ్రికి బయలుదేరారు. వినుకొండ దాటి 4 కిలోమీటర్లు వెళ్లాక... విఠంరాజుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన వ్యక్తులు నారాయణపై దాడి చేశారు.


విషయం తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఆయనను వినుకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. నలుగురు వ్యక్తులు అసభ్యపదజాలంతో దూషించి దాడిచేశారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణను వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు పరామర్శించి నధైర్యం చెప్పారు. వినుకొండ MLA బొల్లా బ్రహ్మనాయుడే వైసీపీ కార్యకర్తలతో దాడి చేయించారని ఆంజనేయులు ఆరోపించారు.

Japan: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఫసిఫిక్‌ మహాసముద్రం వెలుపలి దీవుల సమీపంలో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈస్ట్‌ కోస్ట్‌ ఏరియాలోని ఇజూ ఐస్‌ల్యాండ్స్‌లో సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదైనట్లు తెలిపారు. మరోవైపు సముద్రంలో భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ  హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రం వద్దకు వెళ్లొద్దని సూచించారు.

తోరిషిమా సమీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత జపాన్ ఇజు దీవులకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఒక మీటరు ఎత్తుకు సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇజు దీవుల్లోని ప్రజల తీరప్రాంతాలు మరియు నదీ ముఖద్వారాలకు దూరంగా ఉండాలని సలహా కోరింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, తోరిషిమా ద్వీపానికి సమీపంలో ఉదయం 11 గంటలకు 6. 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో .. రెండు గంటల అనంతరం ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.

West Bengal: బెంగాల్ ఆహార మంత్రి ఇంట్లో ఈడీ దాడులు

 పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మరో మంత్రి ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  గురువారం దాడులు చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  సోదాలు చేసింది. మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్‌కతాలోని మంత్రి ఇంటితోపాటు 13 ప్రాంతాల్లో ఈడీతనిఖీలు నిర్వహిస్తోంది. గతంలో రతిన్‌ ఘోష్‌.. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో పురపాలికలో పెద్దసంఖ్యలో అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం ఘోష్‌తోపాటు అతని సహచరులు అభ్యర్థుల నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఘోష్‌ నివాసంతోపాటు 13ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాల కేసులో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 9న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో ఆయన భార్య రుజిరాకు కూడా నోటీసులు పంపింది. ఆమెను ఈ నెల 11న విచారణకు రావాలని కోరింది. ఎంపీ అభిషేక్‌కు ఈ నెల 3నే ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన హాజరుకాని విషయం తెలిసిందే. 

BHUVANESHWARI: భువనమ్మ మేలుకో తెలుగోడా యాత్రకు ఏర్పాట్లు!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం భువనమ్మ యాత్ర రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. పర్యటనకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించి, అధిష్ఠానానికి పంపారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగసభ నిర్వహిస్తారని తెలుస్తోంది. బస్సు యాత్ర ఏ తేదీ నుంచి ప్రారంభమవుతుందో స్పష్టత లేకపోయినా కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేలుకో తెలుగోడా పేరుతో భువనమ్మ యాత్ర చేపడతారని తెలుస్తోంది.


TALASANI: చంద్రబాబు అరెస్ట్‌ రాజకీయ కక్షే

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టు అన్యాయమని, అది తనకు ఎంతో బాధ కలిగించిందని తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తిని అవినీతి జరగని కేసులో అక్రమంగా అరెస్టుచేయడం రాజకీయ కక్షే అని తలసాని అన్నారు. ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయని తలసాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్ర హస్తం ఉందని, వారికి నచ్చని వారిని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టులు చేయించి తమాషా చేస్తున్నారని మండిపడ్డారు సనత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. విచారణ చేసే పద్ధతి ఇది కాదన్న తలసాని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.


Khalistan: ధర్మశాలలో ఖలిస్తాన్ జెండాలు క‌ల‌క‌లం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధర్మశాలలో ప్రభుత్వ భవనంపై 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు,  క‌ల‌క‌లం రేపుతున్నాయి. ధర్మశాలలో జలశక్తి డిపార్ట్‌మెంట్ భవనం గోడపై 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్, షాలిని అగ్నిహోత్రి మాట్లాడుతూ.. భ‌వ‌నం గోడ‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను క‌ల‌ర్ పెయింట్ చేయ‌డం, ఖ‌లిస్తాన్ జెండాలు స్థానికంగా క‌ల‌క‌లం రేపాయ‌న్నారు. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి అధికారులకు సమాచారం అందిందని,  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం గోడకు రంగులు వేయించినట్లు తెలిపారు.  ఈ ఘ‌ట‌న క్ర‌మంలో అక్క‌డి సీసీటీవీ కెమెరా దృశ్యాల‌ను చెక్ చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. వ‌న్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఐదు మ్యాచ్‌లు అక్టోబర్‌లో ధర్మశాలలో జరగనున్నాయి. ఇప్ప‌టికే ప‌లు జట్లు నగరానికి చేరుకోవడం ప్రారంభించినందున ఈ సంఘటన ఆందోళన కలిగించిందని అధికారులు తెలిపారు.  

Revanth reddy : బీఆర్‌ఎస్‌-బీజేపీది ఫెవికాల్‌ బంధం

బీఆర్‌ఎస్‌, బీజేపీ రహస్య స్నేహాన్ని మోదీ నిజామాబాద్‌లో బయటపెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అవినీతిలో బీజేపీని కూడా కేసీఆర్ భాగస్వామిని చేశారని ఆరోపించారు. కేసీఆర్ అక్రమ సంపాదనలో కొంత మోదీకి చెల్లిస్తున్నారని విమర్శించారు. మోదీ మాటల తర్వాత ఎంఐఎం, బీఆర్‌ఎస్‌తో దోస్తీ చేస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌తో దోస్తీపై ఎంఐఎం ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్‌రెడ్డి.. ఇన్నాళ్లు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారని.. రేవంత్‌ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు కేసీఆర్‌కు డబ్బు పంపారని మోదీ అంటున్నారని ఆ సమాచారం ఉంటే కేసీఆర్‌పై ఎందుకు చర్య తీసుకోలేదు? ఈడీ, ఐటీ కేసులు ఎందుకు నమోదు కాలేదని రేవంత్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ అవిభక్త కవలలని, వారిది ఫెవికాల్‌ బంధమని అన్నారు. సెక్యులర్‌ వాదులమని చెప్పే అసదుద్దీన్‌ ఇప్పుడేం చెబుతారని నిలదీశారు.

PROTEST: అమెరికాలో ఆగని ఆందోళనలు

చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ విదేశాల్లో ప్రవాసాంధ్రులు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అట్లాంటాలో తెలుగు వారునిరసన తెలిపారు. చంద్రబాబుతోనే మేము అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టునూ నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడలో TNSF విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు.


ఈ నిరాహార దీక్షకు రాజధాని రైతులు సంఘీభావం తెలిపారు. YSR జిల్లాలో మైదుకూరు, దువ్వూరు, కాజీపేట బ్రహ్మంగారిమఠం, చాపాడు మండలాలకు చెందిన టీడీపీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నల్ల కండువాలతో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.  

BANDAR: రోజాపై వ్యాఖ్యల కేసులో బండారుకు బెయిల్‌

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి బెయిల్‌పై విడుదలయ్యారు. రూ.25 వేల పూచీకత్తుతో బండారుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండారుపై నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నెల 2న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బండారును మొబైల్‌ కోర్టులో హాజరుపర్చగా పూచీకత్తుతో మొబైల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

బెయిల్‌పై విడుదలైన అనంతరం బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. ధర్మం గెలుస్తుంది. న్యాయం గెలుస్తుంది. చంద్రబాబు కూడా త్వరగా బెయిల్‌ రావాలని కోరుకుంటున్నా అని అన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం పట్ల తనకు గౌరవం ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానంలో న్యాయం జరిగిందని.. అరెస్టు చేసే సమయం నుంచి లోకేశ్‌ అండగా నిలిచారని తెలిపారు.

Earthquake | ఉత్తరాదిని వణికించిన భారీ భూకంపం..

ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. భూ ప్రకంపనలు భారీగా రావడంతో  ప్రజలంతా హడలిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని  భూకంపం సంభవించింది. . దాదాపు ఒక నిమిషం పాటు భూమి కంపించింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆఫీసుల్లో ఉన్న వారు అంతా కూడా భయంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఢిల్లీతో పాటు..ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సుమారు 10 సెకన్ల పైగా ప్రకంపనలు వచ్చాయని అధికారులు నిర్థారించారు. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు నిరంతరంగా భూకంపం సంభవించింది.  నేపాల్లో ఇవాళ భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి నేపాల్ వణికింది. దీని ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీపైనా పడింది. దీంతో ఢిల్లీలోనూ భారీ ప్రకంపనలు వచ్చాయి. కాసేపు ఢిల్లీ వాసులు కంగారు పడ్డారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. నేపాల్లో వచ్చిన భూకంపం కారణంగా ఈ ప్రకంపనలు వచ్చినట్లు తెలుసుకుని ఆ తర్వాత ఊపిరిపీల్చుకున్నారు.


Blue Whale:  కేరళ తీరానికి భారీ తిమింగలం

కేరళలోని కోజికోడ్ బీచ్‌కు కొట్టుకొచ్చిన ఓ బ్లూ వేల్ (నీలి తిమింగలం) కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాని పొడవు 15 మీటర్లు అంటే దాదాపు 50 అడుగులు. స్థానిక జాలర్ల ద్వారా సమాచారం అందుకున్న ఆరోగ్యాధికారి ప్రమోద్ వెంటనే బీచ్‌కు చేరుకుని తిమింగలం కళేబరాన్ని పరిశీలించారు. అది చనిపోయి రెండు రోజులు అవుతోందని గుర్తించారు. దాని మరణానికి కారణం తెలుసుకునేందుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తామని..ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పెద్దగొయ్యి పాతిపెడతామని చెప్పారు.

తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్ కళేబరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దానిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అయితే ఓ  యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..తిమింగలం కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. సాధారణంగా పెద్ద తిమింగలాల కళేబరాల్లో వాయువులు ఏర్పడి ఒక్కోసారి పేలిపోతుంటాయి. అవి కొన్నిసార్లు నెమ్మదిగా విడుదలవుతాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం భారీ పేలుడుతో బయటకు వచ్చేస్తాయి. గతంలో ఇలాంటి ఘటలు చాలానే జరిగాయి. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.


Delhi Police: మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అరెస్ట్‌

దేశ రాజధాని దిల్లీ జాతీయ దర్యాప్తు సంస్థ ని ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో కీలక విజయం సాధించింది. ఐసిస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మహమ్మద్‌ షానవాజ్‌ అలియాస్‌ షఫీ ఉజామాను అరెస్టు చేసింది. అతడ్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే  ప్రకటించింది. అతడి పై రూ.3 లక్షల రివార్డు కూడా ఉంది. పూణే ఐసిస్ మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడి కోసం ఎప్పటి నుంచో వేట కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 కొన్నాళ్ల క్రితం దిల్లీ మాడ్యుల్‌ ఐసిస్‌ ఉగ్రవాదిని అరెస్టు చేసి రాబట్టిన సమాచారం ఆధారంగా షానవాజ్‌ను బంధించారు. దిల్లీలో ఇతడు ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్లు ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. వృత్తిరీత్యా ఇంజినీర్‌ అయిన షానవాజ్‌ పుణే ఐసిస్‌ మాడ్యుల్‌ కేసులో కీలక నిందితుడని పోలీసులు తెలిపారు. ఇతడి వద్ద నుంచి ఐఈడీలను తయారు చేయడానికి ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకొన్నారు. విదేశాల్లోని వారి ఆదేశాలకు అనుగుణంగా ఉత్తరాదిన ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్టు పోలీసులు తెలుసుకున్నారు. షఫీ ఉజామా, మరో ఇద్దరిని పుణె మాడ్యూల్ కేసులో కొత్రూడ్ పోలీసులు జూలై 18న అరెస్ట్ చేశారు. పోలీసు వాహనం నుంచి షఫీ కిందకు దూకేసి తప్పించుకోగా, ఇన్నాళ్లకు మళ్లీ చిక్కాడు.

TDP DEEKSHA: నారా భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్ష

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. రాజమండ్రి క్వారీ సెంటర్‌ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరశన దీక్షలో కూర్చొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి భువనేశ్వరి అంజలి ఘటించిన అనంతరం దీక్ష చేపట్టారు.


మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు దీక్షలో కూర్చొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు టీడీపీ నేతల దీక్ష కొనసాగనుంది. 

LOKESH DEEKSHA: ఢిల్లీలో లోకేశ్‌ నిరాహార దీక్ష

రాజమండ్రి జైల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఢిల్లీలో నారా లోకేష్‌ ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌‌కు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు, భువనేశ్వరీల దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో యువనేత నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.


తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న లోకేశ్‌... అరాచకాలను నిరసిస్తూ దీక్ష చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నానని తెలిపారు. సైకో జగన్‌ ఫ్యాక్షన్‌ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాలరాశారని, సత్యాన్ని వధించారని మండిపడ్డారు. 

BUS YATRA: ఈనెల 5 నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర!

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి బస్సుయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈనెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టుల్లో వెలువడే ఉత్తర్వుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ యాత్రను రాయలసీమ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టైన నాటి నుంచి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో వివిద రూపాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలుగుదేశం కార్యకర్తలకు నైతిక స్థైర్యం అందిస్తున్నారు.

HARISH: చంద్రబాబు అరెస్ట్‌ దురదృష్టకరం: హరీశ్‌రావు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని అన్నారు. సిద్ధిపేటలోని నంగునూరు మండలం నర్మెట్టలో పర్యటించిన హరీశ్ రావు.పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తర్వాత.. ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మంత్రి ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని అన్నారు. కేసీఆర్ పాలన మంచిగుంది కాబట్టే చంద్రబాబు అలా మెచ్చుకున్నారన్నారు. కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం లేదన్నారు. కేసీఆర్ తెలంగాణలో రైతుల ఆదాయాన్ని పెంచారని తెలిపారు. మరోవైపు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Harishrao, ts minister, Chandrababu Arrest, CID serves, TDP 'noisy protest,' evokes, no sound, IT Employees Protest, in Bengaluru, Against Chandrababu's Arrest, second day., Chandrababu Naidu Arrest, Chandrababu, supporters, protest in america, usa, Andhra, Protests continue, arrest of TDP Chief Chandrababu Naidu, Chandrababu. family members, Pawan kalyan, clarity, 2024 elections, Balayya, meet, bhuvaneshwari, brahmani, Protest, Hyderabad, IT Employees, Protests, Support Of Chandrababu, AP HIGH COURT, HEARING, CHANDRABABU, cid CASE, nara lokesh, comments, chandrababu arrest, cbn, tdp, chandrababu naidu, tdp, jremand, tv5, tv5news

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. వారికి మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూా మద్దతు తెలిపారు.మంత్రి మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే షకీల్ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు.

Balakrishna: వారాహి యాత్రకు పూర్తి మద్దతు: బాలకృష్ణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. దెబ్బకు దెబ్బ, కోతకు కోత ఉంటుందని హెచ్చరించారు. కేసులకు, కోర్టులు, జైలు శిక్షకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అవినీతి చేయని వాడు దేవుడికి కూడా భయపడడని... సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నాన్న నందమూరి తారక రామారావు చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసిస్తామని బాలకృష్ణ అన్నారు.


తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో బాలకృష్ణ పాల్గొన్నారు. వైకాపా అక్రమ కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా.... చంద్రబాబును అరెస్టు చేశారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని బాలకృష్ణ మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో స్పందన చూసి ఓర్వలేకపోయారని, అందుకోసమే చంద్రబాబుపై స్కిల్‌ కేసులో.. రాజకీయ కక్షతోనే పెట్టారని బాలకృష్ణ వెల్లడించారు. 

PAWAN: మహిళా కమిషన్‌ ఎక్కడ?


ముఖ్యమంత్రి, హోం మంత్రి, మహిళా కమిషన్‌కు ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత లేదా అని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లాలోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా... కలచి వేసిందన్నారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే ఏపీలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

AP: ఏపీలో కక్ష సాధింపులు లేవని చెప్పలేం: కేంద్రమంత్రి

ఎలక్షన్స్‌ దగ్గర పడుతుండటంతో రెండేళ్ల క్రితమే నమోదైన స్కిల్‌ కేసును మళ్లీ ఓపెన్ చేశారని... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ.నారాయణ స్వామి అన్నారు. గతంలో చంద్రబాబు పేరు F.I.Rలో లేకపోయినా.. కొత్తగా చేర్చినట్లు విన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష సాధింపు చర్యలు లేవని తాను చెప్పలేనని... అయితే వివాదం కోర్టులో ఉన్న కారణంగా రాజకీయంగా మాట్లాడలేని నారాయణ స్వామి బదులిచ్చారు. చార్జ్ షీట్ ఎలా వేశారో... ఎందుకు అరెస్ట్ చేశారో.. ఆయన పేరు ఎలా వచ్చిందో తనకు తెలీదన్నారు. ఏపీలో కక్ష సాధింపు లేదని తాను చెప్పలేను అంటూ పరోక్షంగా జగన్‌కు చురకలంటించారు. వివాదం కోర్టులో ఉన్న కారణంగా తాను రాజకీయంగా మాట్లాడలేనని నారాయణ స్వామి పేర్కొన్నారు.

YSRTP: ఈనెల 30లోపు పార్టీ విలీనంపై నిర్ణయం: షర్మిల

కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై ఈనెల 30లోపు నిర్ణయం తీసుకుంటామని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YSషర్మిల వెల్లడించారు. ఒకవేళ విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గం సమావేశం నిర్వహించిన షర్మిళ పార్టీ విలీనం, ఎన్నికల వ్యుహంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో 119నియోజకవర్గాల్లో తమ పార్టీ..పోటీ చేసేందుకు సిద్దంగా ఉందని షర్మిల స్పష్టం చేశారు. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Udhayanidhi Stalin : ఒకరు దొంగ, మరొకరు దోపిడీదారు

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నాడీఎంకే, బీజేపీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీలపై విరుచుకుపడ్డారు. ‘ఒకరు దొంగ, మరొకరు దోపిడీదారు’ అన్నట్లుగా రెండు పార్టీలు కలిసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. బీజేపీతో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకున్నప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

“ఏఐఎడీఎంకే-బిజెపి పొత్తు ముగిసిందని కేపీ మునుసామి ప్రకటించారు. మీరు (ఎఐఎడిఎంకె) బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, లేకున్నా, డీఎంకే గెలవబోతోంది. మీరు ప్రజలను మోసం చేయలేరు. మీ స్వంత అన్నాడీఎంకే కార్యకర్తలు మీ మాజీ ముఖ్యమంత్రి, మంత్రులపై ఈడీ కేసులు పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణం’’ అని కృష్ణగిరి జిల్లాలో జరిగిన డీఎంకే యువజన విభాగం బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ అన్నారు. "ఇది మొదటిసారి జరగడం లేదు, వారు (AIADMK, BJP) పోరాడినట్లు నటిస్తారు, కానీ ఎన్నికల సమయంలో, వారు మళ్లీ కలిసి ఉంటారు ఎందుకంటే ఒకరు దోపిడీదారుడు, మరొకరు దొంగ" అని ఆయన అన్నారు.

సెప్టెంబర్ 25న తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తో అన్నాడీఎంకే బంధాన్ని తెంచుకుంది, “ఏఐఏడీఎంకే మాజీ నేతలపై బీజేపీ అనవసర వ్యాఖ్యలు చేస్తోందని” పేర్కొంది. బీజేపీకి చెందిన తమిళనాడు చీఫ్ కె అన్నామలై దూకుడు రాజకీయాల కారణంగా తలెత్తిన రాష్ట్రంలోని పరిస్థితి గురించి సీనియర్ ఎఐఎడిఎంకె నాయకులు డిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను పిలిచి, ఆయనకు తెలియజేసిన కొద్ది రోజుల తర్వాత పార్టీతో తెగదెంపులు చేసుకోవాలనే నిర్ణయం వచ్చింది.

ద్రావిడ ఐకాన్ సీఎన్ అన్నాదురైపై వ్యాఖ్యలు చేసినందుకు వారు అన్నామలై నుండి క్షమాపణలు చెప్పాలని కోరారు. అతను క్షమాపణ చెప్పకపోతే అతనిని తీసివేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తుందని తెలిపింది. అన్నామలై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. తన పార్టీకి, అన్నాడీఎంకేకు మధ్య ఎటువంటి సమస్య లేదని సమర్థించారు. తాను అన్నాదురై గురించి చెడుగా మాట్లాడలేదని, 1956 నాటి సంఘటనను మాత్రమే చెప్పానని ఆయన పేర్కొన్నారు.

ఎన్డీయే నుంచి వైదొలగే నిర్ణయాన్ని పునరాలోచించుకోమని అన్నామలై అన్నామలైకి గట్టి మద్దతు ఇస్తున్నట్లు అన్నాడీఎంకేను పార్టీ కోరబోదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐఎడిఎంకె 2019 లోక్‌సభ ఎన్నికలు - 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో మిత్రపక్షంగా భాగస్వామిగా ఉంది.


VARAHI YATRA: మలి విడత యాత్రకు జనసేనాని సిద్ధం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మలివిడత వారాహి యాత్ర ఖరారైంది. అక్టోబర్ 1 నుంచి పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర చేపడతారని ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ విడత.. వారాహి యాత్ర సాగనుండటంతో స్థానిక నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డలో వారాహి యాత్ర సభ జరుగుతుందని..మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజక వర్గాల మీదుగా యాత్ర సాగుతుందని నాదెండ్ల తెలిపారు.

PROTEST: ఎక్కడికక్కడ అంగన్‌వాడీల అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో వేతనాల పెంపు, మినీ అంగన్‌వాడీ వ్యవస్థ రద్దు సహా పలు డిమాండ్లతో ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఛలో విజయవాడకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మారు వేషాల్లో విజయవాడకు చేరుకున్న అంగన్వాడీలను విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద అరెస్టు చేసి ప్రైవేట్ కల్యాణ మండపాలకు పోలీసులు తరలిస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని స్పష్టం చేస్తున్న అంగన్వాడి కార్మికులు.. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చేపట్టిన ఛలో విజయవాడను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని విమమర్శించారు. అంగన్వాడీల అరెస్టును వామపక్షాలు ఖండించాయి. అంగన్వాడీ మహిళల పట్ల జగన్ ప్రభుత్వ నిర్బంధ విధానానికి ఇదో నిదర్శనమని వామపక్ష నేతలు మండిపడ్డారు.


PERNI NANI:  పేర్ని నాని వింత ప్రవర్తన

వైసీపీ ఎమ్మెల్యే వింత ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకే నాని ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన వేంకన్నను నాని సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి, శేష వస్త్రం కప్పుతుండగా నాని అభ్యంతరం తెలిపారు. ఆలయ సంప్రదాయాన్ని కాదని తానే స్వయంగా శేష వస్త్రాన్ని భుజంపై వేసుకున్నారు. దీంతో ఆలయ అధికారులు, అర్చకులు అవాక్కయారు. అభిమానంతో ఆయన్ని కలవడానికి ఆలయం వద్దకు వచ్చిన వైసీపీ నేతలతో కూడా పేర్ని నాని వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రశాంతంగా స్వామి వారి దర్శనానికి వస్తే.. విహారయాత్ర, వివాహానికి వచ్చినట్లు ఇంత మంది ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే పుట్టిన రోజుకి మాజీ ఎమ్మెల్యే హోదాలో తన ఆశీర్వాదం పంపుతానని నాని చెప్పడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

LOKESH: మళ్లీ జనంలోకి యువగళం

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా నిలిపివేసిన యువగళం పాదయాత్రను వచ్చే వారం నుంచి ప్రారంభించే యోచనలో నారా లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే లోకేశ్ యువగళాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేశ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు ఆయన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. న్యాయపోరాటం కొనసాగిస్తూనే యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని నిర్ణియించారు.

MEET: నారా బ్రాహ్మణిని కలిసిన జనసేన నేతలు

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు తెలుగుదేశం, జనసేన కలిసి పని చేస్తాయని జనసేన నేత కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణిని జనసేన నేతలు కలిశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఆమెతో సమావేశమై సంఘీభావం తెలిపారు.


అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జనసేన నేత కందుల దుర్గేష్‌, మాజీ మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రెండు పక్షాలు ఉమ్మడిగా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. భవిష్యత్తులోనూ ఐక్యంగా పనిచేస్తామని నేతలు వెల్లడించారు.

Pakistan Drone: హెరాయిన్ మోసుకెళ్తున్న డ్రోన్‌

పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో హెరాయిన్ మోసుకొని వెళుతున్న ఓ  డ్రోన్ వెలుగుచూసింది. పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలోని మహావా గ్రామ శివార్లలోని వరి పొలంలో డ్రోన్, హెరాయిన్ బార్డర్ సెక్యూరిటీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హెరాయిన్ డ్రోన్ దొరికింది. స్వాధీనం చేసుకున్న డ్రోన్ చైనా తయారీదని, అది క్వాడ్‌కాప్టర్ (డీజేఐ మావిక్ 3 క్లాసిక్ మోడల్) అని పోలీసు అధికారులు తెలిపారు.

వరి పొలంలో 500 గ్రాముల హెరాయిన్, డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం మహావా సమీపంలో డ్రోన్ కదలికలను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. మరోవైపు గుజరాత్‌లోని భుజ్‌ సరిహద్దులోకి చొరబడిన పాకిస్థానీ జాతీయుడిని అరెస్టు చేశారు.  పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని బాడిన్ జిల్లాకు చెందిన మెహబూబ్ అలీ (30)ని అరెస్టు చేశారు. బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ బృందం భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికను గమనించింది. ఒక బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పాకిస్థాన్ జాతీయుడైన మెహబూబ్ అలీని అరెస్టు చేసిందని బీఎస్ఎఫ్ పేర్కొంది. 

Chandrababu : రెండో రోజు కొనసాగుతున్న సీఐడీ విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడును క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) సెప్టెంబర్ 24 ఆదివారం వరుసగా రెండో రోజూ ప్రశ్నించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. 12 మంది సీఐడీ అధికారుల బృందం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తోంది.

రెండో రోజు విచారణ ప్రారంభానికి ముందు చంద్రబాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన తరపు న్యాయవాది డి. శ్రీనివాస్‌ సమక్షంలో సమావేశ మందిరంలో ఈ విచారణ కొనసాగుతోంది. విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 22న సీఐడీకి రెండు రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఆయన తరపు న్యాయవాది సమక్షంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భోజన విరామంతో గంటపాటు చంద్రబాబును ప్రశ్నించేందుకు సీఐడీకి అనుమతి లభించింది. ఈ క్రమంలో ప్రశ్నించిన ఫొటోలు, వీడియోలను బయటపెట్టరాదని కోర్టు ఆదేశించింది.

తొలిరోజు దాదాపు ఆరు గంటల పాటు చంద్రబాబును ప్రశ్నించారు. విచారణకు ముందు, తర్వాత అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చీఫ్‌ను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా, కోర్టు రెండు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతించింది. రెండు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఆ తర్వాత తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, జ్యుడీషియల్ రిమాండ్‌ను రద్దు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది. ఏసీబీ కోర్టు శుక్రవారం ఆయన జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 24 వరకు పొడిగించింది. ఈ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అరెస్ట్ చేయగా.. మరుసటి రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం అంచనా ప్రాజెక్ట్ విలువ రూ.3,300 కోట్లతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ల క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన కేసులో అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ మోసం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.371 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని సీఐడీ పేర్కొంది. ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం చేసిన మొత్తం 10 శాతం నిబద్ధతకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూ. 371 కోట్ల అడ్వాన్స్‌ను ప్రైవేట్ సంస్థల ద్వారా ఏదైనా ఖర్చు చేయకముందే విడుదల చేసినట్లు ఏజెన్సీ తెలిపింది.

సీఐడీ ప్రకారం, ప్రభుత్వం అడ్వాన్స్‌గా విడుదల చేసిన డబ్బులో ఎక్కువ భాగం నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్ కంపెనీలకు మళ్లించబడిందని, ఇన్‌వాయిస్‌లలో పేర్కొన్న వస్తువుల అసలు డెలివరీ లేదా అమ్మకం జరగలేదని అధికారులు తెలిపారు. ఆరు స్కిల్ డెవలప్‌మెంట్ క్లస్టర్‌ల కోసం ప్రైవేట్ సంస్థలు ఖర్చు చేసిన మొత్తం మొత్తం రూ. 371 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అడ్వాన్స్‌డ్ చేసిన నిధుల నుండి సేకరించినట్లు సీఐడీ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది.

Lulu Mall : హైదరాబాద్ లో మరో భారీ షాపింగ్ మాల్

సెప్టెంబర్ 27న నగరంలో లులూ గ్రూప్ తన మాల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హైదరాబాద్ మరో షాపింగ్ డెస్టినేషన్‌కు స్వాగతం పలుకనుంది. కూకట్‌పల్లిలో లులు గ్రూప్ లాంఛ్ చేయబోయే ఈ మాల్ భారతదేశంలో తొలి వెంచరేం కాదు. లులు మాల్స్ ఇప్పటికే వివిధ భారతీయ నగరాల్లో స్థాపించింది.

హైదరాబాద్‌లోని లులు మాల్‌లో సౌకర్యాలు

నగరంలోని లులు మాల్ విస్తృతమైన సౌకర్యాలు అందించడానికి సిద్ధంగా ఉంది. దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లను కలిగి ఉన్న స్టోర్‌లతో పాటు, మాల్‌లో సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ మరెన్నో సౌకర్యాలను కల్పించనుంది. ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్ గమ్యస్థానాలలో ఇది ఒకటి. ఈ మాల్ కోసం రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అంతకుముందు ఓ ప్రకటనలో పేర్కొంది.

భారతదేశంలోని ఇతర లులు మాల్స్ కింది నగరాల్లో ఉన్నాయి:

  • కొచ్చి, కేరళ
  • తిరువనంతపురం, కేరళ
  • బెంగళూరు, కర్ణాటక
  • లక్నో, ఉత్తరప్రదేశ్
  • కోయంబత్తూరు, తమిళనాడు

భవిష్యత్తులో లులు గ్రూప్ అహ్మదాబాద్, చెన్నైలలో కొత్త షాపింగ్ మాల్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. తద్వారా స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.

హైదరాబాద్‌లోని ఇతర షాపింగ్ మాల్స్

లులు మాల్ హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటి అయినప్పటికీ, నగరం ఇప్పటికే అనేక ప్రసిద్ధి చెందిన మాల్స్ ను కలిగి ఉంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రసిద్ధ షాపింగ్ స్పాట్స్:

  • సిటీ సెంటర్ షాపింగ్ మాల్
  • ఇనార్బిట్ మాల్
  • సుజనా మాల్ ఫోరం
  • హైదరాబాద్ సెంట్రల్ మాల్
  • బాబుఖాన్ మాల్
  • FMG మాల్
  • మంజీరా ట్రినిటీ మాల్
  • గల్లెరియా మాల్
  • GVK వన్ మాల్
  • సనాలీ మాల్

హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక షాపింగ్ స్పాట్స్ ఏర్పాటు చేయడంతో, లులు గ్రూప్ ప్రవేశం నగరానికి అధిక పోటీని తెస్తుందని భావిస్తున్నారు.

Rahul Gandhi : విద్యార్థిని స్కూటర్‌పై రాహుల్ గాంధీ పిలియన్‌ రైడ్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెప్టెంబర్ 23న జైపూర్‌లో విద్యార్థి స్కూటర్‌పై పిలియన్ రైడర్‌గా ప్రయాణించారు. రాహుల్ జైపూర్‌లోని మహారాణి కాలేజీకి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు, బాలికలకు స్కూటర్లు పంపిణీ చేసి, వారితో కాసేపు సంభాషించారు. అనంతరం విద్యార్థినితో కలిసి స్కూటర్‌పై వెళ్లాడు. పిలియన్ రైడర్‌గా ఆయన చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రాజస్థాన్ మే జన్ నాయక్’ అంటూ కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది.

జైపూర్‌లో కొత్త కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ భవనానికి రాహుల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శంకుస్థాపన చేశారు. వేడుకల అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

DRUGS CASE: డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ విచారణ

హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌లో డ్రగ్స్‌ కేసులో తీగలాగుతుంటే డొంక కదలుతోంది. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్‌ను యాంటీ నారొటిక్స్‌ బ్యూరో విచారించిందివిచారణకు . శనివారం ఉదయం 11 గంటల నుంచి నవదీప్‌ను ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. ఈ కేసులో పట్టుబడిన వైజాగ్‌కు చెందిన రాంచంద్‌ ద్వారా మత్తుపదార్ధాలను నవదీప్ కోనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుల జాబితాలో చేర్చారు.


నవదీప్‌ తన సెల్‌ఫోన్‌ను తీసుకురాకపోవడంతో టీన్యాబ్‌ అధికారులు ఫోన్‌ను తెప్పించారు. మొబైల్‌ను ఫార్మాట్‌ చేసి సోషల్‌ మీడియా, గ్యాలరీసహా డాటా మొత్తం డిలీట్‌ చేసినట్టు గుర్తించారు. ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి, డాటా రిట్రీవ్‌ చేయించనున్నారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని నవదీప్‌ను ఆదేశించారు. ‘డ్రగ్‌ అఫెండర్స్‌ ప్రొఫైలింగ్‌ అనాలిసిస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌’లోని డ్రగ్స్‌ సప్లయర్లు, కస్టమర్లుగా ఉన్న 81 మందితో నవదీప్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈనెల14న మాదకద్రవ్యాల రవాణా కేసులో ముగ్గురు నైజీరియన్లతో సహా మరో 8 మందిని అరెస్ట్‌ చేశారు. నటుడు నవదీప్‌ వారి వద్ద డ్రగ్స్ కోనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పాన్‌ఇండియా తరహాలో TSన్యాబ్‌ డ్రగ్స్‌పై లోతుగా దర్యాప్తు చేస్తోందని నటుడు నవదీప్‌ అన్నారు. మత్తుపదార్ధాల కేసులో పారిపోయానంటూ మాధ్యమాల ద్వారా వచ్చినవి పుకార్లు మాత్రమేనని సృష్టం చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చినట్లు తెలిపారు. కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, నోటీసులిస్తే వచ్చానని వివరించారు. గతంలో పబ్‌ నిర్వహించినపుడు సిట్, ED దర్యాప్తునకు హాజరయ్యానని, అప్పుడు ఇచ్చిన జవాబులే ఇప్పుడు నార్కొటిక్‌ పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.


మాదాపూర్‌ డ్రగ్స్‌కేసులో నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించినట్లు టీఎస్‌న్యాబ్‌ SPసునీతారెడ్డి తెలిపారు. కేసులో 81 లింకులను గుర్తించామని, వాటిలో నవదీప్‌ 41 లింకుల వివరాలు అందించినట్లు వెల్లడించారు. సిట్, ఈడీ విచారణ ఎదుట డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఫోన్లలోని డేటాను నవదీప్‌ పూర్తిగా తొలగించాడని ఆ సమాచారం తిరిగి సేకరించాక మరోసారి విచారిస్తామని సునీతారెడ్డి వివరించారు. ఈ కేసులో పట్టుబడ్డ డ్రగ్‌ వినియోగదారుడు కొల్లి రామ్‌చంద్‌తో 15 ఏళ్లుగా పరిచయం ఉన్నట్టు నవదీప్‌ అంగీకరించినట్టు చెప్పారు. అమెరికాకు వెళ్లిన సమయంలో అక్కడ లభించే గమ్మీస్‌ తీసుకునేవాడినని నవదీప్‌ తెలిపాడని, ఇందులో స్థానిక చట్టాలకు అనుగుణంగా డ్రగ్స్‌ మోతాదు ఉంటుందని తెలిపారు.

Ganesh Chaturthi: లాల్‌బాగ్చా రాజా గణేష్ కు రూ.1కోటి విరాళం

ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బౌగ్చా రాజా గణేశోత్సవ పండుగ జరిగిన రెండు రోజుల్లోనే రూ. 1.02 కోట్ల (రూ. 1,02,62,00) మొత్తాన్ని విరాళంగా అందుకున్నారు. మండలంలో రెండోరోజు ఉత్సవాల సందర్భంగా రూ.60 లక్షలకు పైగా (రూ.60,62,000) విరాళాలు అందాయి. గణపతి విగ్రహానికి 183.480 గ్రాముల బంగారం, 622 గ్రాముల వెండి విరాళంగా లభించింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు నగదు రూపంలో ఎక్కువ విరాళాలు వచ్చాయి.

లాల్‌బాగ్చా రాజా

లాల్‌బాగ్చా రాజా ముంబైలోని పురాతన, అత్యంత ప్రసిద్ధ మండలాల్లో ఒకటి. ఇది ప్రముఖులు, రాజకీయ నాయకులతో సహా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. లాల్‌బాగ్చా రాజా చరిత్ర చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది లాల్‌బౌగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్‌లోని ప్రసిద్ధ గణేష్ విగ్రహం. ఇది పుత్‌లబాయి చాల్‌లో ఉంది. ఇది ఎనిమిది దశాబ్దాల క్రితం 1934లో స్థాపించబడింది. దివంగత ఆర్ట్ డైరెక్టర్ నితిన్ సి దేశాయ్ చివరి సృష్టి అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన 350వ వార్షికోత్సవానికి ప్రతీకగా సింహాసనంపై గంభీరంగా కూర్చున్న 'లాల్‌బాగ్చా రాజా' కనిపిస్తుంది.

గణేశోత్సవం మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధ పండుగ. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ముంబయితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వివిధ మండలాలు ఏర్పాటు చేసిన పండల్స్ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్నాయి. పండుగకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్సవాల కోసం, ప్రజలు తమ ఇళ్లకు గణేష్ విగ్రహాలను తీసుకువస్తారు, ఉపవాసాలు పాటిస్తారు, నోరూరించే రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా పండల్‌లను సందర్శిస్తారు. ఈ పవిత్రమైన పదిరోజుల పండుగ చతుర్థి తిథితో ప్రారంభమై అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది.

Emergency Alert : మీకూ ఈ మెసేజ్ వచ్చిందా.. దీని అర్థమేంటంటే..

చాలా మంది మొబైల్ వినియోగదారులు ఈరోజు బిగ్గరగా బీప్‌తో పాటు ‘Emergency alert: Severe’ అనే సందేశాన్ని అందుకున్నారు. కొద్దిసేపటికే, ప్రజలు తమ ఆశ్చర్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలా మంది మొబైల్ ఫోన్ యూజర్స్ కు ఇలాంటి సందేశాలు వచ్చాయి.

మొబైల్ ఫోన్‌లలో కనిపించిన 'అత్యవసర హెచ్చరిక' సందేశంలో.., 'ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి చర్య అవసరం లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అమలు చేస్తున్న పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించడానికి ఈ సందేశం పంపబడింది. ఇది ప్రజా భద్రతను మెరుగుపరచడం, అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది అని ఉంది. ఇది నిజానికి చాలా మంది మొబైల్ ఫోన్ వినియోగదారులను ఆందోళనకు గురి చేసింది. కొందరు తమ సెల్‌ఫోన్‌లు హ్యాక్‌కు గురైనట్లు భావించారు. ఈ ఫ్లాష్ హెచ్చరిక సందేశం గురించి పోస్ట్‌లు చేస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మొబైల్‌లో పంపిన 'అత్యవసర హెచ్చరిక' సందేశం ఏమిటి?

ఈ హెచ్చరిక బీప్ సౌండ్‌తో మెరుస్తుంది. అది యూజర్ ఓకే అని నొక్కినంత వరకు కొనసాగుతుంది, అయితే ఇది కేవలం ప్రభుత్వం నుండి వచ్చిన టెస్టింగ్ మెసేజ్ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర పోలీసులు దాని X హ్యాండిల్‌లో, 'భయపడాల్సిన అవసరం లేదు. దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే పంపాల్సిన నమూనా సందేశాన్ని సెంట్రల్ టెలికమ్యూనికేషన్ పంపింది' అని తెలిపారు.

మొబైల్ ఆపరేటర్లు, సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాలను పరీక్షించడానికి వివిధ ప్రాంతాలలో ఎప్పటికప్పుడు ఇటువంటి పరీక్షలు నిర్వహించబడతాయని టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ అంతకుముందు పేర్కొంది. భూకంపాలు, సునామీలు మొదలైన విపత్తులను ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.


LOKESH: చంద్రబాబును అంతం చేసే కుట్ర ?

తెలుగుదేశం అధినేత చంద్రబాబును అంతం చేసేందుకే అక్రమ అరెస్టు చేయించారని... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతని లోకేశ్‌ అన్నారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఆధారాల్లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకు జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదని విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడన్నారు. చంద్రబాబుకు ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారన్న లోకేశ్... చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యతన్నారు.