చిట్టి న్యూస్

Mumbai: ముంబైకి బాంబు బెదిరింపులు..

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రానికి మ‌రోసారి బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ముంబై న‌గ‌రంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామ‌ని ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. శుక్రవారం బెదిరింపులు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్‌ ప్రకటించిన పోలీసులు బెదిరింపుల వెనకున్నది ఎవరో తేల్చేందుకు రంగంలోకి దిగారు. నగరంలో ఆరు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు పోలీసులకు సందేశాలు అందాయి.

గత నెల 6న కూడా నిందితులు బెదిరింపు ఈ-మెయిళ్లు పంపించారు. కొలాబా ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ వాస్తు సంగ్రయాల, వర్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్‌లో బాంబులు అమర్చినట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన ముంబై పోలీసులు.. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను ఆయా ప్రాంతాలకు పంపించారు. అయితే, అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ-మెయిల్స్ పంపించిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Kenya:  గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో పేలుడు,  ఇద్ద‌రు స‌జీవ‌ద‌హ‌నం

కెన్యా రాజ‌ధాని నైరోబీలో గురువారం భారీ పేలుడు సంభ‌వించింది. స్థానికంగా ఉన్న గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఇద్ద‌రు మృతి చెందారు. మ‌రో 165 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపు చేశారు. కంపెనీలో ఉన్న భ‌వ‌నాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు పేర్కొన్నారు.

Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్

పంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతి పెంపునకు విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే బహుమతి నోబెల్.  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. రిపబ్లిక్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీ ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ కావడం ఇది నాలుగోసారి.

మధ్య ప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారిగా శాంతి ఒప్పందాలు కుదరడంలో డొనాల్డ్ ట్రంప్ కీలకపాత్ర పోషించారని టెన్నీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపకుండా, మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం అసాధ్యమని ప్రభుత్వ యంత్రాంగాలు, విదేశాంగ విధాన నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు దశాబ్దాలుగా భావిస్తూ వచ్చినా, ఆ వాదన తప్పు అని ట్రంప్ నిరూపించారని టెన్నీ వివరించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అబ్రహం అకార్డ్స్‌ ఒప్పందంతో పాటు ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌, యూఏఈ మధ్య సంబంధాలను మెరుగుపరిచినందుకు ఆయనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ కోరారు. మధ్య ప్రాచ్యంలో శాంతి ఒప్పందాల రూపకల్పనకు ట్రంప్ సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారని, అయితే ఆయన కృషి నోబెల్ శాంతి బహుమతి కమిటీ గుర్తింపునకు నోచుకోవడంలేదని ఆమె వివరించారు. అందుకే ఇవాళ ట్రంప్ పేరును నామినేట్ చేసినట్టు తెలిపారు.

AP: డీఎస్సీ పేరిట వైసీపీ డ్రామాలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ నిర్ణయాలపై తెలుగుదేశం విమర్శలు గుప్పించింది. 60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60రోజుల్లో 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అని హడావుడి చేస్తే జనం నమ్మరని తెలుగుదేశం నేత నారా లోకేశ్ విమర్శించారు. త్వరలో డ్రామాల వైసీపీ ప్రభుత్వం పోతుందన్న ఆయన యువతకు ఉద్యోగాలు ఇచ్చే దమ్మున్న తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వస్తుందన్నారు. సౌర విద్యుత్ పేరిట జగన్ రెడ్డి 2వేల 350 కోట్లు దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. గత ప్రభుత్వాలు మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి మూడెకరాల కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం 6 ఎకరాలకు పెంచిందని దుయ్యబట్టారు. అడ్డగోలుగా నిబంధనలు మార్చి అదనంగా జరిపిన భూ కేటాయింపులపై మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

HYD: సీఐడీ అధికారులమని  చెప్పి కిడ్నాప్‌

 సీఐడీ అధికారులమంటూ హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో సోదాలు చేసి ఆ సంస్థ డైరెక్టర్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నాడు. గచ్చీబౌలిలోని అజయాడ్ ఐటీ కంపెనీలో ఈనెల 27న తొమ్మిది మంది ఏపీ సీఐడీ అధికారులమని తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో కంపెనీపై కేసు నమోదైందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తనిఖీలు చేపడుతున్నామని కార్యాలయంలోని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత సంస్థ డైరెక్టర్ , మరో ఉద్యోగిని.. ఓ హోటల్ కు తీసుకుని వెళ్లారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే 10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి 2.3కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. 10లక్షలు రూపాయలు తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో కర్నూలుకు చెందిన ఎస్ ఐ సుజన్ ..... కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలిపారు.

HC: కోదండరాం ప్రమాణ స్వీకారానికి బ్రేక్‌

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపివేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నామినేట్ చేయడంపై ఫిబ్రవరి 8 వరకు స్టేటస్ కో విధించింది. కొత్త MLCలతో..ప్రమాణ స్వీకారం చేయించవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.... జారీచేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తమను గవర్నర్ ఆమోదించకపోవడంపై..... గతంలోనే దాసోజు శ్రావణ్, సత్యనారాయణ వేసిన పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రేపు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఉందని... కేసు తేలేవరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం..కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. 

YCP: ఈ.. నా కొడుకును కొట్టండి.. వైసీపీ నేత దౌర్జన్యం

కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప్పాడ-3 సచివాలయం పరిధిలో పనిచేస్తున్న మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురామ్‌పై వాకతిప్ప గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపల్లి మండల జడ్పీటీసీ మాజీ సభ్యుడు రావు చిన్నారావు తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట పైపులైన్ల వ్యవహారంపై కలెక్టర్‌ నియమించిన విచారణ కమిటీ సభ్యులు తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు.


సమీక్ష అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో మత్స్యశాఖ, కర్మాగారాలశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖల జిల్లా అధికారుల సమక్షంలోనే వైసీపీ నాయకుడు, ఆయన అనుచరులు మత్స్యశాఖ సహాయకుడిపై దాడికి పాల్పడ్డారు. అతని చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆయనను కొట్టవద్దని, వదిలేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.వి.సత్యనారాయణ వారిస్తూ.. ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నా చిన్నారావు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా దాడి చేయాలని అనుచరులను ఉసిగొల్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళుతుంటే.. అనుచరులు పిడిగుద్దులు కురిపించారు.

AP: జగన్‌పైకి దూసుకొస్తున్న మరో బాణం!

వైఎస్‌ కుటుంబం నుంచి సీఎం జగన్‌కి వ్యతిరేకంగా మరో గళం వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్‌ చెల్లెలు, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల... జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత సోమవారం ఇడుపులపాయలో భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను తొలిసారి కలవనున్నారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం.. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే.


ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు ఇతరులు చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉండగా.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ తెచ్చుకున్నారు. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణను కోరడంతోనే సీఎం జగన్‌, సునీత మధ్య కుటుంబపరంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై సునీత షర్మిలతో చర్చించనున్నారు. తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు ఆమె అండగా నిలిచారు. సీబీఐకి తన వాంగ్మూలాన్ని సైతం ఇచ్చారు. ఇప్పుడు జరగనున్న భేటీలో సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

SAD: భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

ఒడిశాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ భర్త.. తన భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లడం సభ్య సమాజాన్ని ఆవేదనకు గురిచేసింది. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యుల సహాయంతో ఆమె భర్త 20 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. మూడు నెలల క్రితం తన భార్య కరుణ ఆడపిల్లకు జన్మనిచ్చిందని.. అప్పటినుంచి కొరాపుట్‌ జిల్లా బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీ పురుణగూడలోని తన పుట్టింట్లో ఉంటోందని మృతురాలి భర్త అమానత్య తెలిపాడు. కరుణ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతిచెందిందని.. అంత్యక్రియలు తన ఇంటివద్ద నిర్వహించేందుకు మృతదేహాన్ని నవరంగపూర్‌ జిల్లా నందహండి సమితి జగన్నాథ్‌పూర్‌ పంచాయతీ ఫుపుగావ్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌, మహాప్రాణ వాహనాలకు పలుమార్లు ఫోన్‌ చేసినా వారు స్పందించలేదని అందుకే తన భార్య మృతదేహాన్ని మోసుకెళ్లినట్లు తెలిపాడు. వేరే వాహనంలో తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో శనివారం ఉదయం కరుణ మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లానని ఆవేదన వ్యక్తం చేశాడు.

AP: మహిళపై వైసీపీ నేత దాష్టీకం

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామంలో మహిళపై స్థానిక వైసీపీ నేత అత్యాచారయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై ఆమె గట్టిగా నిలదీయడంతో మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పాల వెంకటాపురం గ్రామానికి చెందిన నటరాజు అనే వ్యక్తి మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో నిలదీయడంతో లక్ష్మీపై అతను దాడి చేశాడు. బ్రహ్మసముద్రం మండలం గొల్లదొడ్డికి చెందిన వివాహిత పాలవెంకటాపురంలో దుస్తుల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం దుకాణం మూసేసి చెరువు కట్ట మీదుగా గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా స్థానిక వైసీపీ నాయకుడు, గ్రామ సచివాలయం కన్వీనర్‌ నటరాజ్‌ ఆమెను అడ్డుకుని అత్యాచారం చేయబోయాడు. తీవ్రంగా ప్రతిఘటించడంతో విచక్షణరహితంగా దాడి చేశాడు. జుట్టు పట్టుకుని ఈడ్చి.. కాలితో తన్ని క్రూరంగా ప్రవర్తించాడు. పక్కనే పొలంలో పనిచేసుకుంటున్న ఓ రైతు అక్కడికి చేరుకుని ఆమెను విడిపించడానికి ప్రయత్నించాడు. అతనిపైనా నటరాజ్‌ దాడి చేశాడు. కొద్దిసేపటికి మరి కొంతమంది అక్కడికి చేరుకోవడంతో పరారయ్యాడు.


ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వ్యక్తి చిత్రీకరించాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన జరిగినట్లు పోలీసుల దృష్టికి రావడంతో బ్రహ్మసముద్రం ఎస్సై పరశురాముడు ఆధ్వర్యంలో పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దాడి జరిగిందని నిర్దారించకున్నారు. లక్ష్మీపై దాడి చేసిన నటరాజుపై బ్రహ్మసముద్రం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పరశురాముడు తెలిపారు. గాయపడిన మహిళను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఎస్సై పేర్కొన్నారు. నిందితుడు నటరాజ్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

REPUBLIC DAY: ప్రజలకు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా.... దేశ ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు... తెలిపారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ ... బలమైన.... మరింత సంపన్నమైన భారత్ ను నిర్మించేందుకు కలిసి పని చేద్దామని..... పిలుపునిచ్చారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో విరాజిల్లే దేశం భారత్ అని ఉపరాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగ సూత్రాలను మరోసారి మననం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..... జాతీయ నాయకుల స్ఫూర్తితో ముందుకుసాగాలని.... సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు, వీర సైనికులందరినీ........... కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మరించుకున్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామంటూ అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ..ఈ చారిత్రాత్మక రోజు సందర్భంగా భారత్ ను మరింత బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Kadapa:కడపలో కదం తొక్కిన ఉపాధ్యాయులు

కడపలో సమస్యలు పరిష్కరించలేదని ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు విజయవాడలో ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమయ్యారు.దీంతో పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు.. గృహ నిర్బంధం, 41 నోటీసులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ U.T.F. ఆధ్వర్యంలో.. మహావీర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.గత ఎన్నికల్లో C.P.S. రద్దు చేస్తానన్న హామీ.. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు గడుస్తున్న ఆ ఊసే ఎత్తకపోవడం దారణమన్నారు. గత రెండేళ్ల నుంచి పెండింగ్ లో ఉంచిన 18 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సీఎం జగన్ స్పందించకపోతే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

SHARMILA: జగన్‌పై మరోసారి షర్మిల తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె మరోసారి జగన్ పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా హోదాపై పోరాటాలు చేసిన జగన్ ... అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రయోజనాలను బీజేపీ వద్ద తాకట్టపెట్టారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్‌వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు. హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ గట్టిగా మాట్లాడారన్న షర్మిల... అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై పోరాడలేదన్నారు. విశాఖకు ఏంచేశారు... రైల్వే జోన్ కూడా ఇవ్వలేదని షర్మిల మండిపడ్డారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి.. కాంగ్రెస్ రావాలని నినదించారు. 

AP: అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి గళం

నిధులు రాక అభివృద్ధి విషయంలో ఏమీ చేయలేకపోతున్నామని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. బతిమలాడి పనులు చేయించినా బిల్లులు రాక తిప్పలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జి.కొండూరు మండలం వెలగలేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న వసంత కృష్ణ ప్రసాదర్‌... గుత్తేదారులు బిల్లులు రాక తన కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. మైలవరంలో ఒక నాయకుడు రూ.కోట్ల విలువైన పనులు చేసి బిల్లులు రాకపోవడంతో మామిడితోటను కూడా అమ్మేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కళ్లుగా ఉండాల్సిన అభివృద్ధి, సంక్షేమంలో ఒంటి కంటి చూపు ఇబ్బందికరమని ఆయనమ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సంక్షేమానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇవ్వడంతో, అభివృద్ధికి నిధులు తేవడానికి నానా తిప్పలూ పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు.

AP: క్షీణించిన కోడికత్తి శ్రీను ఆరోగ్యం

ముఖ్యమంత్రి జగన్‌ న్యాయం చేయాలంటూ జైల్లో నిరాహార దీక్ష చేపట్టిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించింది. జైల్లో దళిత సంఘ నేతలు శ్రీనును కలిశారు. ఆ సమయంలో ఒక జైలు అధికారి, మరో ఖైదీ శ్రీనును చేతులతో మోసుకొచ్చినట్లు దళిత సంఘ నేతలు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి జైల్లో శ్రీను దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ, జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయకపోవడంపై విశాఖ దళిత సంఘాల కన్వీనర్‌ బూసి వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. దీక్ష విరమింపజేయడానికి జైల్లో తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, విశాఖ జైల్లో ఏదైనా ప్రాణహాని జరగొచ్చని, వెంటనే శ్రీనును తరలించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శ్రీను హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్‌ అథారిటీలో న్యాయవాది సలీం పిటిషన్‌ వేశారు.

SURAT: సూరత్‌లో రాముడి అతిపెద్ద ముగ్గు

గుజరాత్‌లో 11 వేల 111 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వానరసేనను రంగవల్లుల రూపంలో చిత్రించి సూరత్‌ మహిళలు రామునిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక కతర్గాం కమ్యునిటీ హాల్‌లో కనులవిందు చేసే ఈ ముగ్గును వేశారు. ఈ కార్యక్రమంలో కలర్పన్‌ ఆర్ట్‌ సమూహానికి చెందిన సుమారు 40 మంది మహిళలు పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ముగ్గు వేయడానికి 14 వందల కిలోల రంగులను వినియోగించినట్లు చెప్పారు. 40 మంది మహిళల 15 గంటల నిరంతర శ్రమ ఫలితమే ఈ అద్భుతమైన ముగ్గని వారు తెలిపారు.


చూపరులను మంత్రముగ్ధుల్ని చేసే ఈ రంగవల్లిని రూపొందించడంలో ఎటువంటి పరికరాలను ఉపయోగించలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే, జౌళిశాఖ సహాయక మంత్రి దర్శన జర్దోష్‌ పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆమె కూడా రంగులను అద్దారు. ప్రస్తుతం సూరత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. కళారంగంలో సైతం సూరత్‌ అగ్రగామిగా నిలిచినట్లు సందేశం పంపినట్లైందని వెల్లడించారు.


AYODHYA: ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న రామ నామం

అయోధ్య రామ మందిరం ప్రారంభంకానున్న వేళ ప్రపంచవ్యాప్తంగాను సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలో భారతీయులు ఇప్పటికే భారీ కార్ల ర్యాలీ నిర్వహించగా, యూకే, ఆస్ట్రేలియాల్లోనూ జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. యూకేలో భక్తులకు పంచేందుకు పెద్ద ఎత్తున లడ్డూలు తయారు చేశారు. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని భారతీయులు సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని మేరీల్యాండ్‌లో 150 కార్లతో రామ భక్తులు ర్యాలీ నిర్వహించగా తాజాగా యూకే, ఆస్ట్రేలియాల్లోనూ వైభవంగా వేడకులు జరుపుకున్నారు. లండన్‌లో 300లకుపైగా కార్లతో చేపట్టిన ర్యాలీ ఆకట్టుకుంది. పలువురు యువతీ, యువకులు డోలు వాయిస్తూ..రామనామం జపించారు. తొలుత గణపతి పూజ చేసిన నిర్వాహకులు అనంతరం రాముడి జెండాలను చేతపట్టి దేవుడి చిత్రపటాలతో కార్ల ప్రదర్శన చేశారు.


అయోధ్య నుంచి యూకేలోని ప్రవాస భారతీయుల కోసం అక్షింతలు, కలశాలు వచ్చాయని ఓ పూజారి తెలిపారు.ఆ అక్షింతలను భక్తులను పంచిపెడుతున్నట్టు చెప్పారు. ప్రాణప్రతిష్ఠ వేళ యూకేలో ప్రత్యేకంగా లడ్డూలు తయారు చేయించారు. వాటిని భక్తులకు ప్రసాదంగా ఇవ్వనున్నారు. రాముడిపై భక్తిని చాటి చెప్పుతూ ఓ మహిళ పాడిన పాట ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోనూ రామ భక్తులు 100 కార్లతో ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

CBN: చంద్రబాబు హెలికాఫ్టర్‌లో సమస్య.. కాసేపు టెన్షన్‌ టెన్షన్‌

చంద్రబాబు "రా...కదలిరా" సభ కోసం అరకు వెళ్లాల్సిన హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్య, రూట్ సమస్య ఏర్పడడం కొంతసేపు కలవరం కలిగించింది. 12 గంటల సమయంలో విశాఖ విమానాశ్రయంలో దిగిన చంద్రబాబు హెలీకాప్టర్‌లో సాంకేతిక సమస్యతో అరగంట సేపు రన్ వే పైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ATC నుంచి అందుకున్న సిగ్నల్‌ను పైలెట్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల గాల్లోకి వెళ్లిన తర్వాత అరకు రూట్ కాకుండా వేరే రూట్లో పయనం సాగించింది. దీనిని గుర్తించిన ATC సిబ్బంది తిరిగి విమానాశ్రయానికి రావాల్సిందిగా సిగ్నల్స్ ఇచ్చారు. పదిహేను నిమిషాల పాటు గాల్లోనే హెలీకాప్టర్ ఉండిపోవాల్సి వచ్చింది.


తర్వాత విశాఖ విమానాశ్రయంలో ఇంధనాన్ని నింపుకుని ఒంటి గంట 20నిమిషాలకు తిరిగి అరకు బయలు దేరింది. వాస్తవంగా 12గంటల 5 నిమిషాలకు బయలుదేరాల్సిన హెలీకాప్టర్..... దాదాపు గంటా 15 నిమిషాలకు పైగా అలస్యంగా బయలుదేరింది. వీఐపీ హెలీకాప్టర్ ఈ రకంగా సమస్య ఎదురుకావడంతో D.G.C.A. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. విశాఖ నుంచి అరకు ఆ తర్వాత మండపేట వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ఈ హెలీకాప్టర్‌లో తొలుత సాంకేతిక సమస్య, తర్వాత రాంగ్ రూట్ పట్టడం, అపై ఇంధన సమస్య ఎదురు కావడంతో అధికార్లు, పార్టీ శ్రేణులు కలవరపాటునకు గురయ్యాయి.

AP: కోడికత్తి నిందితుడి కుటుంబ సభ్యుల దీక్ష భగ్నం

సీఎం జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీను తల్లి సావిత్రమ్మ మూడు రోజులుగా విజయవాడ గాంధీనగర్‌లోని రామా ఫంక్షన్‌హాలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శనివారం రాత్రి బలవంతంగా భగ్నం చేశారు. శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజుతో పాటు కుటుంబసభ్యులను తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు నివేదిక ఇవ్వడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పెద్దసంఖ్యలో శిబిరం దగ్గరకు వచ్చారు. దీక్ష విరమించాలని ఆమెను కోరారు.


జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితేనే తాను దీక్ష విరమిస్తానని సావిత్రమ్మ తేల్చిచెప్పారు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు భారీగా శిబిరం వద్ద మోహరించారు. దీక్ష చేస్తున్నవారిని తరలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా సమతా సైనిక్‌దళ్‌ సభ్యులు, ఇతర మద్దతుదారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. అనంతరం తీవ్ర ఉద్రిక్తతల నడుమ వారిని అత్యవసర వాహనంలో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సమతా సైనిక్‌దళ్‌ నాయకులు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక కార్యకర్త పెట్రోల్‌ సీసా తీసుకుని, ఆత్మాహుతికి యత్నించగా.. పోలీసులు అడ్డుకుని, స్టేషన్‌కు తరలించారు.

SAD: ఆవేదనతో అంగన్‌వాడీ టీచర్‌ మృతి

కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని చిన్న పేటకు చెందిన అంగన్వాడీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. అంగన్వాడి కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం 39 రోజులుగా నిరసన చేస్తున్నారు. చిన్న పేటకు చెందిన పి.శాంతికుమారి అంగన్వాడీ టీచర్..... కొత్తపేట నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే శాంతికుమారి ఛాతినొప్పితో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ప్రభుత్వం ఉద్యోగాలు తీసివేస్తామని చెప్పటంతో... టెన్షన్ పట్టుకుని శాంతి కుమారి గుండెపోటుతో మృతి చెందిందని తోటి అంగన్వాడి కార్యకర్తలు వాపోయారు.

AP: జగన్ ఎడ మొహం... షర్మిల పెడ మొహం

 ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం కార్యక్రమం వేదికగా వైఎస్ఆర్ కుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల తన అన్న వైఎస్ జగన్, వదిన భారతీలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల.. తన అన్న వైఎస్ జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. షర్మిల ఆమె భర్త అనిల్ ఇద్దరూ జగన్‌ను పట్టించుకోలేదు. ఫోటో దిగేందుకు రావాలని జగన్ పిలిచినా షర్మిల, అనిల్ రాలేదుదాంతో బొకే ఇచ్చి నిమిషంలోనే ముఖ్యమంత్రి దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్‌ హాజరయ్యారు. వరుడు వైఎస్‌ రాజారెడ్డి, వధువు అట్లూరి ప్రియలకు సీఎం జగన్‌ దంపతులు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. హైదరాబాద్‌ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. సీఎం జగన్‌ దంపతుల వెంట వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. 

AP: కోడికత్తి కేసు నిందితుడి ఆమరణ దీక్ష

కోడికత్తి కేసులో సీఎం జగన్‌ కోర్టుకు రావాలంటూ నిందితుడు శ్రీనివాస్‌ ఆమరణ దీక్షకు దిగారు. విశాఖ జైల్లోనే నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీనుకు మద్దతుగా అతని తల్లి, సోదరుడు కూడా వాళ్ల ఇంట్లో నిరశనకు దిగారు. దళిత సంఘాల నేతలు, మాజీ ఎంపీ హర్షకుమార్‌ సైతం శ్రీనుకు సంఘీభావం తెలిపారు. కోడికత్తి కేసులో సీఎం జగన్‌ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ‍‌కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌ ఈ కేసులో సీఎం జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీనుకు మద్దతుగా అతని తల్లి సావిత్రి, సోదరడు సుబ్బరాజు విజయవాడలోని వారి నివాసంలో దీక్షకు పూనుకున్నారు. విజయవాడలో దీక్షకు పోలీసులను అనుమతి కోరగా... ఇవ్వలేదని …. అందుకే ఇంట్లోనే దీక్ష చేపట్టామన్నారు. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ... తన కొడుకుకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని శ్రీను తల్లి సావిత్రి స్పష్టం చేశారు.


శ్రీను దీక్షకు విశాఖ దళిత సంఘం నేతలు ప్రకటించారు. శ్రీనుతో దళిత సంఘాల ఐక్య వేదిక ఉపాధ్యక్షుడు వెంకట్రావు జైల్లో ములాఖత్‌ అయ్యారు. అనంతరం దళిత సంఘం నేతలు జైలు బయట ఆందోళన నిర్వహించారు. మరోవైపు మాజీ ఎంపీ హర్షకుమార్‌ శ్రీనుకు సంఘీభావం తెలుపుతూ రాజమహేంద్రవరంలోని తన ఇంట్లో దీక్ష చేపట్టారు. శ్రీనుని ఐదేళ్ల పాటు జైల్లో పెట్టడం దుర్మర్గమని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

SC: ఫైబర్‌ నెట్‌ కేసు.. విచారణ మళ్లీ వాయిదా

ఫైబర్‌ నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం వద్ద కేసు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌.. ఈరోజు బెంచ్‌ కూర్చోవడం లేదని తెలిపారు. విచారణకు మరో తేదీ ఇస్తామని వెల్లడించారు. ఫైబర్‌ నెట్‌ కేసులోని అంశాలు 17-ఏ సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం సెక్షన్‌ 17-ఏపై ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.




విమాన టాయిలెట్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు.. దాదాపు 100 నిమిషాలు

టాయిలెట్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు షాక్‌కు గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు విమానం దిగింది. ఇంజనీర్లు విమానం ఎక్కి, తలుపులు పగలగొట్టి, రెండు గంటలపాటు శ్రమించి వ్యక్తిని రక్షించారు.

విమానంలో టాయిలెట్‌లో డోర్ లాక్ చెడిపోవడంతో ఓ మగ ప్రయాణికుడు దాదాపు 100 నిమిషాల పాటు ఇరుక్కుపోయాడు. ఇక్కడి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంజనీర్లు లూ డోర్‌ను పగులగొట్టి ఆయనను రక్షించారు. ముఖ్యంగా ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికుడు షాక్‌కు గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరిన SG-268 ఫ్లైట్‌లో ఈ సంఘటన జరిగిందని KIA వర్గాలు తెలిపాయి.

ఈ విమానం సోమవారం రాత్రి 10.55 గంటలకు బయలుదేరాల్సి ఉంది. "14D సీటులో ఉన్న ప్రయాణికుడు టేకాఫ్ అయిన వెంటనే టాయిలెట్‌కు వెళ్లాడని తెలిసింది. టాయిలెట్ తలుపు సరిగా పనిచేయకపోవడంతో అతను లోపల చిక్కుకున్నాడు " అని KIA గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడు చెప్పారు.

ప్రయాణీకుల కాల్స్ సిబ్బందిని అప్రమత్తం చేశాయి, వారు కూడా బయటి నుండి తలుపు తెరవడానికి ప్రయత్నించారు. "ఒక ప్రయాణీకుడు ముంబై నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్నాడు. ల్యాండ్ అయ్యే సమయానికి టాయిలెట్ కు వెళ్లాడు. ఆశ్చర్యకరంగా, చిన్న లావేటరీలో చిక్కుకున్నాడు" అని బెంగళూరు విమానాశ్రయ అధికారి తెలిపారు.

టాయిలెట్ తలుపు తెరవడానికి అవకాశం లేదని సిబ్బంది గ్రహించడంతో, ఎయిర్ హోస్టెస్‌లలో ఒకరు బ్రౌన్ పేపర్‌పై పెద్ద అక్షరాలతో ఒక గమనికను రాశారు: "సార్ మేము తలుపు తెరవడానికి మా శాయశక్తులా ప్రయత్నించాము, కానీ డోర్ తెరుచుకోవడం లేదు. భయపడకండి.. మనం కొద్ది నిమిషాల్లో దిగుతున్నాము, కాబట్టి దయచేసి కమోడ్ మూత మూసివేసి దానిపై కూర్చుని మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. మెయిన్ డోర్ తెరవగానే ఇంజనీర్ వస్తాడు." చిక్కుకుపోయిన ఫ్లైయర్‌ని ఓదార్చడానికి ఆమె నోట్‌ను లావెటరీ డోర్ కింద నుంచి పంపించింది.

మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు విమానం ల్యాండ్ అయ్యింది. ఇంజనీర్లు విమానం ఎక్కి, తలుపులు పగలగొట్టి, రెండు గంటలపాటు శ్రమించి లోపల ఉన్న ప్రయాణీకుడిని రక్షించారు. వెంటనే ప్రయాణికుడిని ప్రథమ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. "క్లాస్ట్రోఫోబియా కారణంగా ప్రయాణీకుడు పూర్తిగా గాయపడ్డాడు" అని అధికారి చెప్పారు.

TS: ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్ , బల్మూరి వెంకట్‌ ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరికి పోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు అభ్యర్ధులు నిర్దారించారు. అయితే... అధికారికంగా అభ్యర్ధుల ఎంపికపై ప్రకటన ఏఐసీసీ ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద..... ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరిగినా... చివరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ , NSUI తెలంగాణ అధ్యక్షుడు బలమూరి వెంకట్ లకు.... పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఈనెల 18వరకు నామనేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉండగా ఆలోపు ఇద్దరూ పత్రాలు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా ఉన్నందున శాసనసభలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్ కే రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి.

AP: కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థాలు

కోనసీమలో ప్రభల తీర్థాలు వైభవంగా జరిగాయి. అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, మామిడికుదురు, రాజోలుల్లో ప్రభల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబాజీపంట మండలంలో ప్రసిద్ధి గాంచిన జగ్గన్న తోట ప్రభల తీర్థానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పురాణ ప్రాశస్తం ప్రకారం... ఏకాదశ రుద్రులు కనుమ పండగ రోజు దేశం మొత్తం మీద కొలువు తీరేది జగ్గన్న తోటలోనే కొలువుతీరతారు. ఏకాదశ రుద్రుల్ని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యంలో భక్తులు తరలివచ్చారు.


గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామాలకు చెందిన సర్వమంగళ పార్వతి సమేత చెన్నమల్లేశ్వరస్వామి, పార్వతీవీరేశ్వరస్వామి ప్రభల్ని పంట కాల్వలు, వరిచేల మధ్య నుంచి ఎగువ కౌశిక నదిని దాటించి యువకులు భుజాలపై మోసుకొచ్చారు. ఈ దృశ్యాలను భక్తజనం తిలకించి అమితానందం పొందారు. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల ప్రభలు, రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలను అందంగా అలంకరించి భక్తులు భజాలపై మోసుకొచ్చారు. వాకలగరువులోని ఉమాపార్వతీ సోమేశ్వరస్వామి, తొండవరంలోని ఉమాతొండేశ్వరస్వామి, గున్నేపల్లి అగ్రహారంలోని పార్వతీరామేశ్వరస్వామి వార్ల ప్రభలకు తీర్థం నిర్వహించారు. పి.గన్నవరం మండలంలో వివిధ చోట్ల 80 ప్రభలను తీర్ధానికి తీసుకువచ్చారు. కోనసీమ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రభల తీర్థాలకు జనం తరలివచ్చారు.

AP: ఆకట్టుకుంటున్న ఎడ్ల పందేలు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఎడ్ల పందాలు ఆకట్టుకున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లంవారిపాలెంలో జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన ఉత్సాహంగా సాగాయి. యువకులు, పెద్దల కేరింతలు మధ్య పోటీలు హోరాహోరీగా సాగాయి. ఒంగోలు జాతి ఎడ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడెకల్ లో అంతర్ రాష్ట్ర ఎద్దుల గిరక పోటీలు కోలాహలంగా జరిగాయి. పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో పొట్టేల పందేలు జరిగాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేలా నిర్వాహకులు ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. 

AP: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్ స్టిట్యూట్ ను.. ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నాం పాలసముద్రానికి చేరుకొనున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం... అకాడమీలోని కేంద్రాలను సందర్శించనున్నారు. తర్వాత ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు. అనంతరం..ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్నిమోడీ విడుదల చేయనున్నారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసగించనున్న మోడీ N.A.C.I.Nకు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

SAD: మటన్ ముక్క కోసం గొడవ.. వ్యక్తి హత్య

మటన్ తినే విషయంలో గొడవ కారణంగా...... ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ ఠాణా పరిధిలో.... జరిగింది. గోల్ బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ స్నేహితులు. ఇద్దరు మద్యం తాగి వచ్చి.. భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో మటన్ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెరిగి....చారి కోపంలో కత్తితో అజయ్ పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అజయ్..అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న తుకారాం గేట్ పోలీసులు... చారిని అదుపులోకి తీసుకున్నారు.

MEDAARAM: భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. అసలు జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి బారులు తీరారు. సంక్రాంతి పండుగకి వరస సెలవులు రావటంతో.. పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోగాయి. మహాజాతర దగ్గరపడుతున్న కొద్దీ మేడారం భక్తులతో రద్దీగా మారుతోంది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తజనంతో.. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు కావటంతో... ముందుస్తుగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే యాభైవేలకుపైగా భక్తులు..తల్లులను దర్శించుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి.. కోరిన కోర్కెలు తీర్చే ఇష్టదైవాలను స్మరించుకున్నారు. బంగారాన్ని మొక్కులుగా సమర్పించుకుంటున్నారు. గద్దెల వద్ద రద్దీ నెలకొనడంతో...దర్శనం కాస్త ఆలస్యమైంది. మహా జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ముందస్తుగా వచ్చిన భక్తులు ఇక్కట్లకు లోనవుతున్నారు. ప్రధానంగా జంపన్నవాగు వద్ద స్నానాలకోసం.. ఏర్పాట్లు త్వరగా చేయాలని భక్తులు కోరుతున్నారు.

SAD: చైనా మాంజా మెడకు చుట్టుకుని సైనికుడి మృతి

హైదరాబాద్‌ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.కోటేశ్వర్‌ రెడ్డి అనే ఓ ఆర్మీ జవాను శనివారం రాత్రి విధులకు వెళ్లే సమయంలో లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై చైనీస్ మాంజా మెడకు చుట్టుకుని కింద పడిపోయాడు. పక్కనే ఉన్న ఆర్మీ ఆస్పత్రి సిబ్బంది గమనించి హుటాహుటీన హాస్పటల్‌కు తరలించి చికిత్స ఇస్తున్న సమయంలోనే తుది శ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు.


విశాఖపట్నంకు చెందిన ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి లంగర్ హౌస్ లో అద్దెకు ఉంటూ విధులకు వెళ్తూ వస్తున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయంసైనిక లాంఛనాల తర్వాత కోటీశ్వర్ రెడ్డి మృతిదేహాన్ని స్వస్థలమైన విశాఖపట్నం పంపారు.

YCP: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ రాజీనామా

 వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి..... ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అసంతృప్తిగా ఉన్న బాలశౌరి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా..... వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టుగా అధికారికంగా ట్విటర్ ఎక్స్ ఖాతాలో బాలశౌరి వెల్లడించారు. అలాగే పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కూడా ఎక్స్ వేదికగా తెలియచేశారు. మచిలీపట్నం MLA పేర్ని నానితో పాటు పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్‌తోనూ ఎంపీ బాలశౌరికి రాజకీయంగా విభేధాలున్నాయి. తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని పేర్ని నానిపై బాలశౌరి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం...... లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్పు చేస్తుండటంతో బాలశౌరి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

MEET: చంద్రబాబును కలిసిన షర్మిల

కాంగ్రెస్ నాయకురాలు Y.S.షర్మిల.... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టీడీపీ అధినేత నివాసానికి వెళ్లిన ఆమె తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. బాబుతో భేటీ అనంతరం మాట్లాడిన షర్మిల YSRతో ఆయనకున్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారని చెప్పారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని... తన కుమారుడి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించేందుకు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదన్న షర్మిల... తమ మధ్య రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు ఉండబోమని స్పష్టం చేశారు.

YCP: పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే క్షమాపణ

ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ MLA రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.... పోలీసులతో వ్యవహరించిన తీరు ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ... పోలీసులను పరుష పదజాలంతో దూషించడం... తీవ్ర విమర్శల పాలైంది. అధిష్ఠానం కలగజేసుకోవడంతో MLA రాచమల్లు...పోలీసులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మరోవైపు పోలీసులతో అనుచితంగా మాట్లాడిన MLAపై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు పోలీసులతో వ్యవహరించిన తీరు వైసీపీ అధిష్ఠానానికి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. పుల్లయ్య అనే వ్యక్తి పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకుని వెళ్తుండగా... ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేందుకు సంతకం పెట్టాలని కోరగా... పుల్లయ్య నిరాకరించారు. అక్కడికి వచ్చిన రాచమల్లు ఎస్ఐ బేగ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీకి కాదు, వాళ్ల బాబుకి చెప్పుకో అంటూ దూషించారు. కేసు పెడితే ఒప్పుకోనన్న ఆయన...చట్టాన్ని మార్చుకో, లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులతో వ్యవహరించిన తీరు అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో... అక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో రాచమల్లు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న తాను ఓ సామాన్యుడిలా మాట్లాడానని రాచమల్లు అన్నారు. తన మాటలు పోలీసు అధికారుల మనసు నొప్పించి ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు MLA రాచమల్లు తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. రాచమల్లుపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు.

AP: తిట్టకపోవడమే నా తప్పా..?

 ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్ధతగా వైకాపా అధిష్టానం భావించి ఉండొచ్చని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అర్హత లేదని తనకు మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదన్నారు. బీసీలకు వైకాపాలో అగ్ర తాంబూలం అనేది నేతి బీర కాయలో నెయ్యి తరహానేనని విమర్శించారు. బలహీన వర్గాలకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని గతంలో తానూ చెప్పిన వాడినేనన్న పార్థసారథి...అది తప్పని తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదన్నారు. గన్నవరంలో వైకాపా గెలిచే పరిస్థితి లేదన్న ఆయన...ఆ స్థానానికి తనను పంపాలని జగన్ చూశారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీలో పార్థసారథి చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఆయనతో చర్చించారు. వారు టీడీపీలోకి ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా.. కదలి రా’ బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీదే పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

YCP MLA: ఎస్పీకి కాదు వాళ్ల బాబుకి చెప్పుకో...

YSR జిల్లా ప్రొద్దుటూరు సెబ్ ఎస్సై అలీబేగ్ ని..... MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర పరుష పదజాలంతో దూషించారు. ప్రొద్దుటూరుకి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి.. పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకెళ్తుండగా.... ఎస్ ఈబీ పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని నిర్ణయించిన పోలీసులు.. సంతకం పెట్టాలని కోరగా పుల్లయ్య నిరాకరించారు. ఇదితెలిసి స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే రాచమల్లు..కుర్చీలో కూర్చుని ఎస్సై బేగ్ పై విరుచుకుపడ్డారు. తల్లి చనిపోయి... దినం కోసం మందు బాటిల్లు తీసుకెళ్తుంటే..కేసు పెడతావా అని ప్రశ్నించారు. కేసు నమోదుచేసి స్టేషన్ బెయిల్ ఇస్తామని బేగ్ చెబుతున్నా MLA పట్టించుకోలేదు. ఎస్పీకి కాదు వాళ్ల బాబుకి చెప్పుకో.... అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసు పెడితే ఒప్పుకోబోనన్న ఆయన...... చట్టాన్ని మార్చుకో లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.