- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

హైదరాబాద్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్పై ఓ ఆటో బోల్తా పడింది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వస్తున్న ఆటో అకస్మాత్తుగా పల్టీ కొట్టింది. డ్రైవర్ సెల్ఫోన్ చూస్తూ ఆటో నడుపుతూ.. ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని గమనించలేదు. దీంతో ద్విచక్ర వాహనానికి సమీపించగానే ఢీ కొడుతుందనే భయంతో ఆటోను కుడివైపుకు తిప్పాడు. దీంతో అదుపు తప్పిన ఆటో పల్టీ కొట్టింది. ఈ నెల 22న జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

భద్రాచలంలో బీసీల ఆర్థికసాయం కార్యక్రమంలో రభస చోటుచేసుకుంది. తనను సంప్రదించకుండా లబ్దిదారుల్ని ఎలా ఎంపిక చేశారంటూ బీసీ సంక్షేమ అధికారిని ప్రశించారు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య. అంతేకాదు.. వేదికపై రేగా కాంతారావుని మాట్లాడనీయకుండా అడ్డగించారు. కాంతారావు చేతిలోని మైక్ను లాక్కున్నారు. దీంతో అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఏపీలో ఓట్ల తొలగింపునకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బల్క్గా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు రావడంతో.. వెరిఫికేషన్, నిర్ధారణ వంటి అంశాల్లో నిబంధనలను సూచించింది. 2020వ సంవత్సరం.. ఒకటో నెల.. 6వ తేదీ నుంచి ఇప్పటివరకు జరిగిన ఓట్ల తొలగింపును చెక్ చేయాలంది. డెత్, షిఫ్టింగ్ సహా పలు కారణాలతో తొలగించిన ఓట్లపై పునపరిశీలన జరపాలంది. ఓట్ల తొలగింపుపై జిల్లా స్థాయ అధికారుల తోపాటు, కలెక్టర్ ద్వారా వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించింది. ఈనెల 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది.

బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో బీసీలకు స్ధానం ఎక్కడ ఉందని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. ఆ పార్టీలోని బీసీలు, ముదిరాజులు బయటికి రావాలని పిలుపు నిచ్చారు. టీడీపీ 60 సీట్ల వరకు బీసీలను ప్రకటించబోతుందని తెలిపారు. సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అభ్యర్ధుల ప్రకటన అనంతరం బస్సు యాత్ర నిర్వహిస్తామంటున్న కాసాని జ్ఞానేశ్వర్.

విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో మున్సిపల్ కార్మికులు భారీగా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యల సాధన కోసం చలో విజయవాడకు వెళ్లే కార్మికులను పోలీసులు అడ్డుకుని అక్రమ అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకు దిగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు సీఐటీయూ నాయకులు.

కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ బీజేపీ శ్రేణులు మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం నుంచి బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు. పోలీసుల కళ్లుగప్పి బయటకి వచ్చిన బీజేపీ నేతలు మంత్రి ఇంటి గేటు దూకి లోపలకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు గత ఏడు రోజులుగా కొనసాగుతున్నాయి. సర్కిల్స్,జోనల్ కార్యాలయాల గేట్లకు..తాళం వేయడంతో రోడ్డుపై బైటాయించి ఆందోళన చేస్తున్నారు. 2014లో తమను పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు.

విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు ప్రముఖ సినీనటుడు సుమన్. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది చంద్రబాబేనన్న ఆయన రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని అన్నారు. రజినీకాంత్ను టార్గెట్ చేసి మాట్లాడడం బాధ కలిగించిందన్నారు.రాజకీయాలతో సంబంధం లేని రజినీకాంత్ పై ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నించారు.సినీ పరిశ్రమలోని వారు పకోడి గాళ్ళు కాదని అలా విమర్శించిన వాళ్ళే బజ్జీగాళ్ళని విమర్శించారు.

హైదరాబాద్ మియాపూర్లో కాల్పులు సంచలనం రేపాయి. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న దేవేందర్ గాయన్ పై రాత్రి రిత్విక్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దేశవాళీ తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దేవేందర్కు గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. వివాహేతర సంబంధమే కాల్పులకు కారణమని అనుమానిస్తున్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్పై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పొద్దున ఒక పార్టీ.. మధ్యాహ్నం మరో పార్టీలో ఉండే నాయకుల గురించి మాట్లాడనని అన్నారు. ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలోకి వెళ్దామని చూసే వ్యక్తులు.. ఆ అన్నదమ్ములు అని ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి జగదీశ్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. తనను చంపేందుకు కుట్ర చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఎన్నో బాధలు భరించానన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై చేసిన వ్యాఖ్యలను తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. నకిరేకల్ అభివృద్ధిపై చిరుమర్తి బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసి రారు. తమ పార్టీల్లో చేరమని కాంగ్రెస్, బీజేపీ నుంచి పిలుపు వచ్చిన మాట వాస్తవమేనన్నారు వేముల వీరేశం. అనుచరులు, కార్యకర్తల ఇష్టం మేరకే పార్టీ మార్పు అని వెల్లడించారు.

మెదక్ జిల్లా బీఆర్ఎస్లో టికెట్ల పంచాయితీ ఆగడం లేదు. హైదరాబాద్లోని మంత్రి హరీష్ రావు ఇంటికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్యూ కట్టారు. నర్సాపూర్ స్థానాన్ని పెండింగ్లో పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్రెడ్డికే టికెట్ ఇవ్వాలని ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. హరీష్ రావు ఇంటి ఎదుట మదన్ రెడ్డి బలప్రదర్శనకు దిగారు. ప్లకార్డులతో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.

జగన్ సర్కార్ పబ్లిసిటీ గుడిని, బడిని కూడా వదటం లేదన్న విమర్శలు పెద్దెత్తున వస్తున్నాయి. చివరికి సర్కారీ స్కూళ్లలో జగన్ నామస్మరణ చేయిస్తున్నారు.స్వామి భక్తి చాటుకుంటున్నారు ఫుడ్ కమిషన్ సభ్యురాలు దేవి.గవర్నమెంట్ అంటే ఎవరు అంటే జగన్ మామ అంటూ గుంటూరు జిల్లా తెనాలి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్ధినిలతో వల్లె వేయించారు. పిల్లలు చిన్నగా అంటే తనకు వినిపించలేదని చెప్పి మరీ గట్టిగా చెప్పించారు. అయితే ఈ చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సర్కారీ స్కూళ్లలో డ్రామాలేంటని మండిపడుతున్నారు పేరంట్స్.

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాభిమానం తట్టుకోలేకే ప్రభుత్వం పాదయాత్రకు నోటీసులపేరుతో హడావిడి చేస్తుందని టీడీపీ నేతలు మండిపడ్డారు. బహిరంగ సభల్లో వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే పోలీసులు వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. నిన్న పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదనిఅన్నారు. రోజురోజుకీ పాదయాత్రకి ప్రజాభిమానం పెరుగుతుంటే తట్టుకోలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటున్నారు.

నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డిని కేబినెట్లోకి తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్ రాజీనామాతో కేబినెట్లో ఖాళీ అయిన స్థానాన్ని పట్నం మహేందర్ రెడ్డితో భర్తీ చేయనున్నారు. మహేందర్రెడ్డి పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి నష్టం కలగకుండా.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పట్నం ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణం చేయనున్నారు మహేందర్రెడ్డి.

కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ కకావికలం అయ్యాయని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు దిక్కుతోచడంలేదన్నారు. తమ అధినేత నిర్ణయంపై అందరికి పూర్తి విశ్వాసం ఉందన్న ఆయన.. బీఆర్ఎస్లో క్రమశిక్షణ గల నేతలు, కార్యకర్తలు ఉన్నారన్నారు. అందరూ పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తారని చెప్పారు. కేసీఆర్ను వదులుకుంటే మళ్లీ కష్టాలు తప్పవని తెలిపారు. 75 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. పోటీ పడి రాహుల్ గాంధీ, మోదీ అనుచరులు అసంతృప్తుల కోసం కాగడా పట్టి వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. 119 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతం అ్రమాబాద్కు చెందిన కపిలవాయి గోపికృష్ణచారి.. అతి సూక్ష్మంగా విక్రమ్ ల్యాండర్ కళాఖండాన్ని తయారు చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. 450 మిల్లీ గ్రాముల బంగారంతో బియ్యం గింజ సైజులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను తయారు చేశాడు.

సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి తలసాని. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడలో BC కులవృత్తిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఆర్ధిక సహాయ ప్రక్రియ చేపట్టారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కులవృత్తులను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. దీంతో మేయర్ తీరుపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు భగ్గుమన్నారు. మేయర్ ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. SRDP రెండో దశ, మున్సిపల్ కార్మికులను పర్మెంట్ చేయాలని.. జీహెచ్ఎంసీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

చలో హైదరాబాద్కు కాంట్రాక్ట్ ANMలు పిలుపునిచ్చారు. 9రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ ANMలు.. ప్రభుత్వం ఇచ్చిన పరీక్ష షెడ్యూల్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. VRA, ఆర్టీసీ కార్మికులను పర్మినెంట్ చేసినట్లుగానే తమను పర్మినెంట్ చేయాలంటుని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. పిట్టగోడను టాటా సుమో వాహనం ఢీకొట్టింది. 32వ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ బెంగుళూరుకు చెందిన నలుగురు భక్తులను తిరుపతి స్విమ్స్కు తరలించారు

సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన నేపథ్యంలో విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలతో మెదక్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించారు. అటు.. సీఎం పర్యటనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. బైక్ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదానికి దిగారు. తోపులాట కూడా చోటు చేసుకుంది. వీరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల తంటాలు పడుతున్నారు.

మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉండగా రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. శిథిలాల నుంచి 17 మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో 40 మంది కార్మికులు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిజోరంలో రైల్వే వంతెన దుర్ఘటనపై ఆరాష్ట్ర సీఎం దిగ్ర్భాంతి వ్యక్తి చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

140 కోట్ల భారతీయుల కల చంద్రయాన్ 3 ద్వారా నెరవేరబోతుందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అన్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని కోరుకుంటు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్లోని శ్రీ భద్రకాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖగోళంలోని చరిత్రను కనుక్కున్న గొప్పదేశం మన భారత దేశమన్నారు. ఆనాడు వాజ్పేయి ప్రభుత్వ హాయంలో చంద్రయాన్కు అంకురార్పణ జరిగిందని తెలిపారు. నేడు ప్రధాని మోదీ హాయంలో చంద్రయాన్ 3 విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్ధించామని రాకేష్ రెడ్డి తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు యార్లగడ్డ వెంకట్రావుని గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించారు నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో ఉన్న పిల్ల సైకోని గుడివాడలో ఉన్న సన్న బియ్యం సన్నాసిని ఓడిస్తామని శపథం చేశారు. ఇదే కోవలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో పెద్ద ఎత్తున కీలక వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఇందులో సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్ లు, సహకార బ్యాంకు సభ్యులు, ఇతర నియోజకవర్గ నేతలు ఉన్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంస్థకి తర్లువాడ భూ కేటాయింపులపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే తర్లువాడ కొండను జనసేన బృందం పరిశీలించింది. వైసీపీ ప్రభు త్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖలో కొండలన్నీ కబ్జాకు గురవుతున్నాయంటూ ఆందోళన చేపట్టారు. అక్రమార్కులు కొండల్ని బోడిగుండు చేస్తున్నారం టూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్లువాడ లక్ష్మీనరసింహస్వామి తిరగాడిన కొండని, అలాంటి ఆధ్యాత్మిక కొండను కొట్టేయాలని అనుకోవడం దారుణమన్నారు

దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని ఎమ్మెల్యీ కవిత అన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్సభలో 8 శాతం మహిళా ఎంపీలే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని అన్నారు. మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని తెలిపారు. మణిపూర్లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని తెలిపారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్లో ఉన్నారని తెలిపారు. టీడీపీ సిద్దాంతాల పట్ల ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, స్థానిక నాయకత్వం ఎవరిని అంగీకరిస్తుందో వాళ్ళనే చంద్రబాబు పార్టీలోకి చేర్చుకుంటారని తెలిపారు. జగన్ చర్యలతో వైసీపీ కార్యక్తలు సిగ్గుపడుతున్నారని, సర్పంచ్లు చెప్పుతో కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్కు చిప్పకూడు తప్పదని తప్పదని జోస్యం చెప్పారు.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ కీలక సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షత ఈ భేటీ కొనసాగుతోంది. బల్దియా కార్మికుల సమ్మెకు దిగిన నేపథ్యంలో.. కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా సాగే అవకాశం ఉంది. అటు ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అటు జీహెచ్ఎంసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్లను ఆమోదించాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

చేతిలోని గన్ మిస్ ఫైర్ కావడంతో గార్డ్ ఇంచార్జ్, హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. సూర్యాపేటకు చెందిన భూపతి శ్రీకాంత్ తెల్లవారుజామున విధులు ముగించుకొని నిద్రకు ఉపక్రమించే తరుణంలో చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో అతని తలలోకి బుల్లెట్ దూసుకు పోయింది. అలికిడికి లేచిన పోలీసులు తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కానీ, పరిస్థితి విషమించడంతో శ్రీకాంత్ మృతి చెందాడు.

చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాలని దేశమంతా సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో సాధువులు యాగం చేపట్టారు. చంద్రయాన్ మిషన్ విజయవంతం కావాలని హోమం నిర్వహించారు. అటు వారణాసిలోనూ చంద్రయాన్-3 సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒడిషా సముద్ర తీరంలో ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ విక్రం ల్యాండర్ చంద్రుడిపై సేఫ్గా ల్యాండ్ కావాలని ఇసుకతో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుందాం.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో సినీఫక్కీలో చోరీ జరిగింది. కారును వెంబడించి పోలీసుల పేరుతో రెండు కోట్ల నగదును తీసుకెళ్లారు దుండగులు. ఎస్ఆర్ఆర్ నిర్మాణ సంస్థకు చెందిన 2కోట్ల రూపాయల్ని సంస్థ మేనేజర్ శ్రీపతి అనుపకుమార్ హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కారును ఆపి లాఠీలను చూపించి నగదు తీసుకెళ్లినట్లు చెప్పారు. అసలు విషయం తెలియడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదును బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తెలంగాణ సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పుణ్యహవాచనం, యాగశాల శుద్ధి, గోపూజ, ఆవాహిత గణపతి హోమం చేయనున్నారు. 24న ఉదయం 9 గంటలకు స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం, వేద పారాయణం, మహాలక్ష్మీ యాగం, మహా మంగళహారతి కార్యక్రమాలను చేపడుతారు. 25న ఉదయం చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వివరాలు తెలపాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్కు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు చేశామని ప్రభుత్వం చెపుతున్న అంశాలను ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కాగ్కు తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన లావాదేవీలను ప్రశ్నించారు. కాగ్ 2022 ఆడిట్ నివేదికలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం చేసిన అప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లా పద్మనాభం మండలం రేవిడి సచివాలయం పరిధి రౌతులపాలెంలో వైసీపీ నాయకులు వీరంగం సృష్టించారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మోపాడ ఆదినారాయణపై సర్పంచ్ అనుచరులు కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. 'స్పందన'లో సర్పంచ్ కుమారుడి భూ అక్రమాలపై ఫిర్యాదు చేసినందుకు రెక్కీ నిర్వహించి దాడి చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములు సర్పంచ్ కుమారుడి పేరిట నమోదు చేసుకున్నారని ఆదినారాయణ ఫిర్యాదు చేశారు. దాడికి ప్రోత్సహించిన కోన రమణతో పాటు దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రత్యర్థులు ఎవరైనా బీఆర్ఎస్దే గెలుపన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీలు పోటీ చేయడానికి భయపడుతున్నాయని అన్నారు. జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించుకుంటామని చెప్పారు. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో పువ్వాడ సమావేశమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


