- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. తాను ఉన్నా లేకున్నా దర్గా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. గణేష్ ఘాట్ నిర్మా ణం కోసం 16 కోట్ల కేంద్ర నిధులు వెనక్కివెళ్లకుండా చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ పొట్టేపా లెంకలుజుపై కూడా స్పందించాలన్నారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.

నల్లపాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.హెల్తీ నరసరావు పేట పేరుతో కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారుటీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము.ఈ హెల్త్ క్యాంప్కు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు ప్రజలు.పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు నల్లపాటి రాము. అలాగే గోగులపాడులో ఐదువందల కుటుంబాలకు..ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు ఎన్.వారియర్, మేయర్ నీరజ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక పరివర్తన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఆధునిక భారతదేశం కోసం అంబేడ్కర్ నిరంతరం పోరాటం చేశారన్నారు.

హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపడానికి పూలమాల వేసిన డీజీపీ అంజనీ కుమార్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీలు, సీపీలు, ఐజీలు పాల్గొన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ వచ్చింది.

వైసీపీలో తనకు సభ్యత్వం లేదన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన రావు. ఎలక్షన్ తర్వాత వైసీపీ తరపున ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో తమకు అనుబంధం ఉందని.. తారక రామ మందిరం ఉంగుటూరులో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

వైసీపీ సర్కార్పై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ నిప్పులు చెరిగారు. దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్రావణ్ కుమార్.. మహానీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గడప గడపకి దగా ప్రభుత్వం పుస్తకం ఆవిష్కరించిన శ్రావణ్ కుమార్... వైసీపీ ప్రభుత్వం దళితులకు, అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

వైసీపీ సర్కార్పై ఎంపీ సీఎం రమేష్ ఫైరయ్యారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపులో భాగంగానే గీతం యూనిర్సిటీపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఐడీ జగన్ జేబు సంస్థలా పని చేస్తోందని.. అన్ని విషయాలను కేంద్ర హోంశాఖ గమనిస్తోందన్నారు. ప్రజలకు, రైతులకు మంచి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. జగన్ పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు.

అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే ఈరోజు ఏపీలో క్షేమంగా తిరుగుతున్నామని అన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. అమరావతిలో అంబేడ్కర్ భారీ విగ్రహ ఏర్పాటుకు సంకల్పిస్తే.. దానిని పూర్తి చేయడంలో జగన్ విఫలమయ్యారన్నారు.

నిజామాబాద్ జిల్లాలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ హనుమంతు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదానం చేపట్టారు.

గీతం యూనివర్సిటీపై ప్రభుత్వం కక్ష సాధించడం దారుణమన్నారు టీడీపీ నేత గండి బాబ్జి. కోడి కత్తి కేసు డ్రామాలు బయటపడటంతో.. ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మార్గదర్శిని టార్గెట్ చేశారని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్దిచెప్పాలని కోరారు.

విశాఖ ఎండాడలో ప్రభుత్వ స్థలాలు సర్వే చేసి.. హద్దులు ఆధారంగానే ఫెన్సింగ్ వేశామన్నారు భీమిలి ఆర్డీవో భాస్కర్రెడ్డి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇంకా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలో ఉన్నాయని చెప్పారు. 14 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్లు గుర్తించామని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సేవా భావంతో క్రైస్తవ సంఘాలు పనిచేస్తుంటే.. బాధ్యత విస్మరించిన సీఎం దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్ల ఎంతగా రాష్ట్రం దెబ్బతిందో క్రైస్తవ సంఘాలు ఆలోచన చేయాలన్నారు. సేవా భావంతో విశాఖలో గీతం యూనివర్సిటీ నెలకొల్పితే దానిపైనా విధ్వంసానికి దిగారని మండిపడ్డారు. చేయూతనివ్వాల్సిన సేవా సంస్థల పట్ల ఈ సీఎం సాయం చేయకపోగా.. దాడులు చేస్తున్న వ్యవహారంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. పాస్టర్లకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

విశాఖ కేంద్రంగా టీడీపీ నేతలపై అధికార పార్టీ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ స్థలం ఉందనే పేరుతో పోలీసులు, రెవెన్యూ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గీతం యూనివర్సిటీకి వెళ్లనీయకుడా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. ఇక మీడియాపై సైతం ఆంక్షలు విధిస్తున్నారు. ఇక పోలీసుల తీరుకు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

ప్రముఖ నటి సంయుక్త తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంయుక్తకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నటికి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని తొలిసారి దర్శించుకోవడం సంతోషంగా ఉందని సంయుక్త తెలిపారు. ఈ నెల 21న విరూపాక్ష చిత్రం విడుదల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు వెల్లడించారు. చిత్రం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.

హుస్సేన్ సాగర్ తీరంలో కోలాహాలం నెలకొంది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవం నేపథ్యంలో భారీగా ప్రజలు తరలివస్తున్నారు. మహారాష్ట్రలోని అకోలా పట్టణం నుంచి 60మంది అంబేడ్కర్ వాదులు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ సర్కార్పై అంబేడ్కర్ వాదుల ప్రశంసలు కురిపించారు. మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు సోమాజిగూడ జయ గార్డెన్స్లో బస ఏర్పాట్లు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్పై చూపుతున్న గౌరవంపై వెలకట్టలేనిదని కొనియాడారు.

రంపచోడవరం ఎమ్మెల్యేకు నాగులపల్లి ధనలక్ష్మికి ఆదివాసీల నుంచి నిరసన సెగ తగిలింది.అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు ఆదివాసీలు.బోయ వాల్మీకి,బొంతు ఒరియా కులాలను ఎస్టీల్లో కలపడాన్ని ఆపాలంటూ నిరసనకు దిగారు. దీనికి సంబందించిన జీవో నెంబర్ 52 రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీను కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.గత ఐదేళ్లుగా జైలులోనే మగ్గిపోతున్న శ్రీనును ఇప్పటికైనా విడుదల చేయాలని కోరుతున్నారు.ఘటన అనుకోకుండా జరిగిందని అప్పుడే చెప్పామని ఇప్పుడు NIA విచారణలో కూడా ఇదే తేలిందని అంటున్నారు. శ్రీను సీఎం జగన్ అభిమాని అని బెయిల్ కు కూడా నోచుకోకుండా ఐదేళ్లుగా జైల్లో ఉన్న శ్రీను విడుదలకు సీఎం సహకరించాలని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ లో పాదాచారుల వంతెన కూలింది. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో ఫుట్బాల్ వంతెన కూలి 20 మందికి పైగా గాయపడ్డారు. బైశాఖీ జాతర సందర్భంగా జనాలు గుమిగూడడంతో వంతెన కూలినట్లుగా సమాచారం. క్షతగాత్రులను చెనానిలోని హాస్పిల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సిద్దిపేటలో అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. అంబేద్కర్ ముందుచూపుతోనే దేశ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు.ఆయన స్పూర్తితోనే దళితుల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు తెచ్చారని తెలిపారు. దళితబంధు దేశంలోనే అద్భుతమైన పథకమన్న హరీష్ దళిత గిరిజన జాతుల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.
https://www.youtube.com/watch?v=wVnMuJbemOA
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


