- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

హైదరాబాద్ కు చెందిన శ్వేత అనే మహిళ తన భర్త చేతిలో హత్యకు గురైన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ AS రావ్ నగర్ కు చెందిన శ్వేతకు అశోక్ రాజ్ అనే వ్యక్తితో.. కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు.ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉండే అశోక్ రాజ్ తన భార్యను చంపి మృత దేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలో పడేసినట్టు అక్కడి పోలీసులు గుర్తించారు.

అనంతరం భారత్ కు వచ్చిన అశోక్ రాజ్ తన కుమారుడిని హైదరాబాద్ లోని శ్వేత పుట్టింట్లో వదిలేసి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. శ్వేత మృతిపై దర్యాప్తు చేపట్టిన విక్టోరియా పోలీసులు ఆమెను అశోక్ రాజ్ చంపినట్టు గుర్తించిఅతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు విక్టోరియా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్ లక్ష్యంగా క్షిపణి దాడి యత్నం జరిగినట్లు సమాచారం. అయితే వారు ఈ ప్రాణాంతక దాడి నుంచి తప్పించుకొన్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి వారి కాన్వాయ్కు కేవలం 500 మీటర్ల దూరంలో పడినట్లు సమాచారం. ఈ ఘటన నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో జరిగింది. ఉక్రెయిన్ పర్యటనకు వచ్చిన కిరియాకోస్తో కలిసి జెలెన్స్కీ నగర సందర్శనకు బయల్దేరారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి పుట్టగొడుగు ఆకారంలో భారీగా పొగ పైకి ఎగసిపడటాన్ని ప్రత్యక్ష సాక్షులు వీక్షించారు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు. గత రెండేళ్లుగా జెలెన్స్కీ యుద్ధ క్షేత్రాల్లోని సైనికులను ఉత్సాహపర్చేందుకు పలువురు ప్రపంచ నాయకులతో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కానీ బుధవారం నాటో సభ్యదేశమైన గ్రీక్ ప్రధాని ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం.

కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సమావేశంలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి కలవబోతున్నారు. మరోపక్క బుధవారం ఉదయం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో పవన్కల్యాణ్ కలిశారు. ఇరుపార్టీల అభ్యర్థుల రెండో జాబితాతో పాటు, బీజేపీతో పొత్తు అంశంపై గంటన్నరపాటు ఇద్దరూ చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని ఆయన స్పష్టంచేశారు. ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. తాజాగా హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ.... ప్రజలను సంరక్షిస్తున్నామని అనుకోవడం సరికాదన్నారు. అలా అనుకున్నందుకు తెలంగాణలో కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకున్నారని.... ఇప్పుడు జగన్ వంతని చెప్పారు. ప్రజలు వనరుల నిర్వహణనే కాకుండా నాయకుడి శక్తి సామర్థ్యాలను కూడా చూస్తారని వివరించారు. ప్రజలు ఓటు వేసే ముందు తప్పకుండా అభివృద్ధిని చూస్తారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఉదారంగా ఉచితాలు ఇస్తేనే ఓట్లు వస్తాయని అనుకోవడం సరికాదన్నారు. జగన్ ను ఓడించడం కష్టమనికొందరు భావిస్తారని... కానీ జగన్ పనైపోయిందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రాజకీయ నేతలతో పనిచేసినందుకు మీరు బాధపడుతున్నారా అన్న ప్రశ్నకు... తాను బాధపడనని,వారి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటానని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన..అన్ని అంశాలు పరిశీలించి, అధ్యయనం చేయడం సహా పగుళ్లకు కారణాలు విశ్లేషించి... తగిన సిఫారసులు చేసేందుకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ..కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ NDSA ఆదేశాలు జారీచేసింది. మరో ఐదుగురిని సభ్యులుగా నియమించింది. సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్. పాటిల్, కేంద్ర జలసంఘం డైరెక్టర్లు శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ కమిటీలోసభ్యులుగా ఉన్నారు. NDSA టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.

మూడు ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై.. సమగ్ర అధ్యయనం, తనిఖీల కోసం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు.. NDSA కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించి....... ప్రాజెక్ట్ డేటా, డ్రాయింగ్స్, డిజైన్ మెమోరండా, సైట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, బ్యారేజ్ ఇన్ స్పెక్షన్ రిపోర్ట్స్, మెటీరియల్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్ తదితర అంశాలను... పూర్తిగా పరిశీలించాలని సూచించింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు సహా ఇతర అంశాలకు.... కారణాలను కమిటీ పరిశీలించాలని ఆదేశించింది. 3 ఆనకట్టల విషయంలోతదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను కమిటీ.. సిఫార్సు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ... 4 నెలలలోపు నివేదిక ఇవ్వాలని NDSA గడువు నిర్దేశించింది.

కాళేశ్వరం పరిశీలనకు ఈనెల 6న నిపుణుల కమిటీ రానుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నామని, ఇందుకు అన్నిరకాలుగా సహకరిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు తమ ప్రభుత్వం.......... ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గతంలో కుంగిపోయిన మేడిగడ్డ ఆనకట్టను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించి.... నీటిని ఖాళీ చేయాలని చెప్పిందని గుర్తుచేశారు. తర్వాత సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లను పరిశీలించిన కమిటీ.. మేడిగడ్డలో ఉన్న సమస్యలే వాటిల్లోనూ ఉన్నాయని..... నీటిని ఖాళీ చేయాలని సూచించిందని చెప్పారు. అథారిటీ సూచన మేరకే ప్రభుత్వం నీటిని ఖాళీ చేస్తోందన్నారు. కానీ... భారాస రాజకీయాలు చేస్తూ నీటిని నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యత రాహిత్యమని ఉత్తమ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో..... గుండెకాయ లాంటి మేడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సిన భారాస నేతలు..... ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం... రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు..

పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే కనీసం రాజధాని కూడా లేని దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షనేతగా కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే సాగిల పడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీని మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తుందని తిరుపతిలో నిర్వహించిన న్యాయ సాధన సభలో..... షర్మిల హామీ ఇచ్చారు. ఇది ప్రత్యేక హోదా కోసం ఆరాటపడే వారికి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య పోరాటమని అన్నారు.

మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన శంథన్ కన్నుమూశాడు. చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శంథన్ అలియాస్ సుతేంద్రరాజా ఆరోగ్యం విషమించడంతో.. తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. 55 సంవత్సరాల సంథాన్ 1991లో రాజీవ్గాంధీ హత్య కేసులో దోషీగా తేలి 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022లో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి కాలేయ వైఫల్యానికి చికిత్స తీసుకుంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున శంథన్కు గుండెపోటు వచ్చిందని సీపీఆర్ చేసి అతడిని బతికించామని రాజీవ్గాంధీ ఆస్పత్రి డీన్ తెరనిరాజన్ తెలిపారు. తర్వాత అతడిని వెంటిలేటర్పై ఉంచామని.... చికిత్సకు అతడి శరీరం స్పందించలేదని వివరించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో శంథన్ తుది శ్వాస విడిచినట్లు తెరనిరాజన్ వివరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీలంకకు పంపించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో తొలుత సంథాన్కు మరణశిక్ష పడింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్పు చేశారు. 32 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదల అయ్యాడు.

గుజరాత్లో వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోర్బందర్లో భారత నౌకా దళంయాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATSనార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి 3 వేల 300 కిలోల డ్రగ్స్ను సీజ్ చేశాయి. ఈ డ్రగ్స్ను ఇరాన్, పాకిస్థాన్ల నుంచి భారత్కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నౌకలో 3 వేల 300 కిలోల డ్రగ్స్ను తరలిస్తుండగా పట్టుకున్నామని వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో వేల కోట్లు ఉంటుందని.. అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో అయిదుగురిని అరెస్ట్ చేశామని అందులో నలుగురు ఇరానీయులు ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు.

మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దీంతో ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహరించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే పోలీసు, సెక్యూర్టీ బలగాలు తక్షణమే స్పందించిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అదనపు ఎస్పీ అమిత్ కుమార్ను ఆ దళాలు కాపాడాయి. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం క్షేమంగా ఉంది. మంగళవారం రాత్రి ఏడు గంటలకు కిడ్నాప్ ఘటన చోటుచేసుకున్నది. ఇంపాల్ ఈస్ట్లో ఉన్న కుమార్ ఇంటిపై మైతీ తెగ అటాక్ చేసినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నాలుగు రోజుల క్రితం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్యాంపస్లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ కార్యాలయం వద్ద పేలుడు ఘటన చోటు చేసుకుంది. .

విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం ప్రారంభించిన నీటిపై తేలే వంతెన తెగిపోయింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్... రెండో రోజే తెగిపోయింది. సుమారు 100 మంది సందర్శకులు నిలబడేలా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరిభాగంవిడిపోయి...సముద్రంలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఆ సమయంలో సందర్శకులు వంతెనపై లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైపు ప్రజలు వెళ్లకుండా...... భద్రతా ఏర్పాట్లు చేశారు. నిర్వహణలో భాగంగానే వంతెన తెగిందన్న బ్రిడ్జ్ నిర్వహణ సంస్థ... తెగిన భాగాన్ని తీసుకొచ్చి మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపింది. ప్రారంభించిన ఒక్క రోజులోనే విశాఖలో నీటిపై తేలే వంతెన తెగిపోయింది. చివరి భాగం విడిపోయి కొద్దిదూరం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిను ఆదివారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఫ్లోటింగ్ బ్రిడ్జి వైపు ప్రజలు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారు. అయితే, నిర్వహణలో భాగంగా వంతెనను విడదీసినట్లు నిర్మాణ సంస్థ చెబుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని సందర్శనకు అనుమతిస్తామని తెలిపింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు స్వల్ప ఊరటను కల్పించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల వ్యవహారాల్లో ఫుల్ బిజీగా ఉన్న చంద్రబాబుకు... విచారణ వాయిదా పడటం బిగ్ రిలీఫ్ గానే చెప్పుకోవచ్చు.
స్కిల్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు... చంద్రబాబుకు తొలుత తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ గా మార్చింది. దీంతో, చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

బీహార్లోని కైమూర్ జిల్లా మొహానియా పరిధిలోగల దేవ్కలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లాయి. అయితే ఎదురుగా వస్తున్న ట్రక్కు వాటిని గుద్దింది. జీపులో ఉన్న ఎనిమిది మందితోపాటు బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందారు. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి కారులో వస్తున్న ఆరుగురు యువకులు మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అతివేగంగా ముందుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు భారీగా పట్టుబడ్డాయి. అనంత కుమార్ బారిక్ అనే ఒడిశాకు చెందిన బాలానగర్ ప్రాంతంలోని ఘరక్ కంటా ప్రాంతంలో తన చిన్న కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్ లు అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో బాలానగర్ SOT పోలీసులు రంగంలోకి దిగారు. కిరాణా షాపును తనఖీ చేయగా కొన్ని గంజాయి చాక్లెట్ లు పట్టుబడ్డాయి. తదుపరి విచారణలో తన స్కూటీ సీట్ కింద డిక్కీ లో దాచి ఉంచిన 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లను పోలీసులు గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి తీసుకుని వచ్చి బాలానగర్ ప్రాంతంలోని కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు పోలీసులు గుర్తించారు. నిందితుణ్ని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలన్నారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో రఘురామ పేర్కొన్నారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హుడిగా చేయడానికి వైకాపా నేతలు ప్రయత్నించిన వారు ఆశించిన ఫలితం రాలేదన్నారు. నరసాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషిచేస్తానన్నారు.

సరైన కారణంగా లేకుండా కరెంటు కట్ చేస్తే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం... కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ పై దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ త ప్రభుత్వ హ యాంలో నియ మితులైన కొంద రు క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కోత విధిస్తున్నారనే సమచారం.. ఉందని సీఎం తెలిపారు. గ తేడాదితో పోల్చితే గత రెండు నెల ల్లో విద్యుత్ స ర ఫ రా ఎక్కువ గా చేసినట్లు ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ వివరించారు. ఇటీవ ల మూడు సబ్ స్టేషన్ల ప రిధిలో లోడ్ హెచ్చుతగ్గులను గమనించనందున కొంతసేపు విద్యుత్ స ర ఫ రాకు అంత రాయం క లిగింద ని చెప్పారు. మరోవైపు తాగునీటి సరఫరాపై సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కోసం నాగార్జున సాగర్ నుంచి ఏపీ 9 టీఎంసీలు తీసుకుంటోందని, ఏపీలో ఎక్కడ వాడుతున్నారో లెక్కలు తీసుకోవాలన్నారు. తాగునీటి పేరిట ఇతర అవసరాలకు తీసుకెళ్లకుండా చూడాలన్నారు. సమగ్రంగా సమీక్షించి కేఆర్ఎంబీకి లేఖ రాయాలన్నారు. జీహెచ్ ఎంసీలో తాగునీటికి సమస్య రాకుండా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేడు ఛలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లోనే నిద్రించారు. ఇవాళ చలో సెక్రటేరియట్ ఉన్న నేపథ్యంలో షర్మిల ఉన్న భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలుచోట్ల కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారు. దీనిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?అని నిలదీశారు. వేలాదిగా వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఈ పరిస్థితి రావడం జగన్కు అవమానం కాదా అని నిలదీశారు. తామేం తీవ్రవాదులం కాదని... సంఘ విద్రోహ శక్తులె కూడా కాదన్నారు. మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే. మీ అసమర్థతను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదన్నారు.

ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది 95 సంవత్సరాల వయసున్న ఫాలీ నారీమన్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఢిల్లీలోని ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నారీమన్ 22 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులై ఢిల్లీ వెళ్లారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 1991 నుంచి 2010 వరకూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగానూ పని చేశారు. భారత న్యాయ వ్యవస్థకు నారీమన్ ను భీష్మ పితామహుడిగా పిలుస్తారు. ఆయన కుమారుల్లో ఒకరైన జస్టిస్ రొహింటన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2011 నుంచి 2013 వరకూ ఆయన కూడా సొలిసిటర్ జనరల్ గా విధులు నిర్వర్తించారు.
న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. నారీమన్ ఓ గొప్ప రచయితగానూ గుర్తంపు పొందారు. 'బిఫోర్ ది మెమొరీ ఫేడ్స్', 'ది స్టేట్ ఆఫ్ ది నేషన్', 'ఇండియాస్ లీగల్ సిస్టమ్: కెన్ ఇట్ బి సేవ్డ్?', 'గాడ్ సేవ్ ది సుప్రీంకోర్టు' వంటి పుస్తకాలు రాశారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనకు టిక్కెట్ ఇవ్వకున్నా తాను వ్యతిరేకించబోనని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఇన్నాళ్లు... తనను తప్పించేందుకు కేశినేని నాని తెగ ప్రయత్నించినట్టు చెప్పారు. మొదటి కేశినేని నాని తనను లక్ష్యం చేసుకుని పనిచేశారని ఆరోపించారు.

ఏపీలోని 175 స్థానాల్లో... విజయవాడ పశ్చిమ సీటు ఒక్కటే పక్కన పెట్టి.... 174 స్థానాల్లో IVRSసర్వే చేపడుతున్నారన్న బుద్దా వెంకన్న.. ఇది తనకు బాధ కలిగించిందని తెలిపారు. రక్తం తీసి చంద్రబాబు చిత్ర పటానికి బుద్దా వెంకన్న కాళ్లు కడిగారు. సీబీఎన్ జిందాబాద్ అంటూ.. రక్తంతో గోడపై రాశారు. తన అభిమానాన్ని చాటుకునేందుకే ఇదంతా చేస్తున్నట్టు బుద్దావెంకన్న తెలిపారు.


రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 14లోక్ సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే సీటు ఇచ్చేందుకు సునీల్ కనుగోలు బృందంతో పాటు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతల పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల తర్వాత లోక్ సభ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం... ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. 17 నియోజకవర్గాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా TPCC వడపోత పూర్తి చేసి.. స్క్రీనింగ్ కమిటీకి నివేదించింది. హరీష్ చౌదరి ఛైర్మన్ గా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితాను పరిశీలించి నియోజకవర్గానికి ముగ్గురు లెక్కన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్లతో కలిసి రెండు గంటలపాటు చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో అనుకూలతలపై సునీల్ కనుగోలు బృందం ఆరా తీస్తోంది. టికెట్ల కోసం దరఖాస్తు చేసిన ముఖ్య నేతలతో పాటు పార్టీలో చేరిన, చేరనున్ననాయకుల బలాబలాలపైనా సునీల్ కనుగోలు బృందం సర్వేలు చేపడుతోంది

నల్గొండలో 3 లక్షలు లంచంతీసుకుంటూ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చునాయక్... ఏసీబీకి చిక్కారు. ఆస్పత్రిలో 'బై హ్యాండ్' ఔషధాల టెండర్ కి అనుమతిచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్టు.... గుత్తేదారు తెలిపారు. టెండర్ కావాలంటే ప్రతిదానిలో 10 శాతం కమిషన్ కావాలని సూపరింటెండెంట్ డిమాండ్ చేయగా ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. గత నవంబర్ నుంచి కమిషన్ మరింత కావాలని డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించినట్లు వివరించారు. సూపరింటెండెంట్ అడిగిన మొత్తాన్ని బాధితుడు అందిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

తిరుపతి ఎస్వీ జంతుప్రదర్శనశాలలో విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ కు చెందిన సందర్శకుడు సింహం బారిన పడి ప్రాణాలు కొల్పోయాడు. మధ్యాహ్నం రెండున్నర సమయంలో రాజస్ధాన్ కు చెందిన ప్రహ్లద్ గుర్జర్ అనే వ్యక్తి.. అక్కడి సిబ్బంది వారిస్తున్నా లయన్ ఎన్ క్లోజర్ లోకి దూకాడు. సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈలోపే ఎన్ క్లోజర్ లో ఉన్న మగ సింహం దాడి చేయడంతో..సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల మేరకు అతని కుటుంబసభ్యులకు...... సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు.

సొంత సైన్యమైన వాలంటీర్ల వల్లే 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఘన విజయం సాధించామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఏపీలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న జగన్ అవి వాలంటీర్ల వల్లే అందరికీ చేరువ అవుతున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా ఫిరంపురంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫిరంగిపురం ఊరిబయటే బారికేడ్లు పెట్టి ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఫలితంగా ప్రైవేటు వాహనదారులతో పాటు, బస్సులు, లారీలు నిలిచిపోయాయి. గ్రామానికి బయటి నుంచి వచ్చే స్థానికులనూ అనుమతించకపోవడంతో మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ వాలంటీర్ల సేవలను కొనియాడారు. ప్రభుత్వ పథకాలకు వాలంటీర్లే అంబాసిడర్లనీ లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనని వాలంటీర్లు నిరూపించారని ప్రశంసించారు.

పాతబస్తీలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా షా నవాజ్ నివాసంలో సోదాలు జరిగాయి. ఆ సమయంలో షా నవాజ్ దుబాయ్కి వెళ్లిపోయారు. గతంలోనూ ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుతున్నారన్న సమాచారం అందడంతో ఫలక్నామలోనీ కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. షా నవాజ్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన ఫంక్షన్ హాల్, ఆఫీస్,హోటల్స్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో రెండు సార్లు షానవాజ్పై ఐటీ దాడులు జరిగాయి.

బీఆర్ఎస్ ఒత్తిడితోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించట్లేదని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసనగా రేపు నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ సభ వల్లే కాంగ్రెస్లో చలనం వచ్చిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్కు దక్కిన మొదటి విజయంగా భావిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు.కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం అయ్యింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పద్దుకు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రాధాన్యాలు, కేటాయింపుల గురించి సమావేశంలో చర్చించనున్నారు. దీంతోపాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. భారాసకు ధీటుగా సమాధానం చెప్పడం, నల్గొండలో ఆ పార్టీ సభ తలపెట్టిన నేపథ్యంలో అధికార పక్షంగా ఎదుర్కోవడం, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మేడిగడ్డ ఆనకట్టపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నివేదిక, సంబంధిత అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి పిల్లల విభాగంలో ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిల్లల విభాగంలో వైద్యం పొందుతున్న చిన్నారులకు...శుక్రవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర గంటకు చిన్నారులకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండటంతో వారిని ఇంటెన్సివ్ కేర్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల విభాగంలోని మొత్తం 15 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర గంట తర్వాత విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండడంతో వారిని ఇంటెన్సివ్ కేర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ జోసఫ్ రాజారావు సమష్టి దివ్య పూజాబలితో ప్రారంభించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేశామని బిషప్ రాజారావు తెలిపారు. ఈ వేడుకలలో వాటికన్ రాయబారి లియోపోల్డో జిరెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. 1924 ఏడాదిలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసఫ్స్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. అక్కడ గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ 17 లోక్సభ స్థానాలను గెలుచుకోబోతోందంటూ ఇండియా టుడే- సి ఓటర్ సర్వే వెల్లడించడంపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీకి అంతిమయాత్ర పక్కా... సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోందని ఇండియా టుడే- సి ఓటర్ సర్వే చెప్పిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్తో ఇండియా టుడే ఫొటోను ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 45 శాతం ఓటర్లు టీడీపీ-జనసేనతోనే ఉన్నారని... ఈ రెండు పార్టీలు 17 లోక్సభ సీట్లు గెలుచుకుంటాయి. 41 శాతం ఓట్లతో వైసీపీ 8 స్థానాలకు పరిమితం కానుందని ఆజ్తక్ ఛానల్ సర్వేలో పేర్కొన్న విషయాలను లోకేశ్ ప్రస్తావించారు.

జార్ఖండ్లో నక్సల్స్తో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది బుధవారం ఒక ఆపరేషన్లో పాల్గొని తిరిగి వస్తుండగా, చత్ర జిల్లాలోని బైరియో అడవుల్లో వారిపై తృత్య సమ్మేళన్ ప్రస్తుతి కమిటీ (టీపీఎస్సీ)కి చెందిన నక్సల్స్ ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో తేరుకున్న భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు ఐజీ అమోల్ వీ హొమాకర్ నిర్ధారించారు. గాయపడిన జవాన్ను వాయుమార్గంలో రాజధాని రాంచీకి తరలించినట్టు చెప్పారు. జార్ఖండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటన తర్వాత సమీపంలోని పోలీసు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్లో జార్ఖండ్లోని గర్వాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కొన్ని గంటలపాటు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ పోలీసు అధికారిని కూడా కాల్చిచంపారు.

అన్నమయ్య జిల్లాలో (Annamayya District) ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి చంపారు. సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం రావటంతో.....సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద కాపు కాశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేష్ ఆపేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు అతడిని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఎర్రచందనం వాహనంతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో ముగ్గురు స్మగ్లర్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్ల దాడిలో పోలీసు గణేష్ చనిపోవడం తెలుగుదేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు (Chandra Babu) తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఘటన తీవ్ర బాధాకరమన్న చంద్రబాబు స్మగ్లర్లకు టిక్కెట్లిచ్చే జగన్ (Jagan) ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యమిస్తుంటే పోలీసులను లెక్కచేస్తారా అని ప్రశ్నించిన ఆయన...టాస్క్ ఫోర్స్ ను వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రాణాలు కోల్పోయిన గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎర్రచందనం స్మగ్లర్లపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి గుంటూరు, కృష్ణా, NTR జిల్లాల్లో నాలుగురోజుల పాటు పర్యటించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో... మనస్థాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించి... ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ నెల 6న మంగళగిరి, 7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, 8న తాడికొండ నియోజకవర్గాల్లో ఆమె పర్యటన సాగనుంది. 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భువనేశ్వరి పర్యటనలో పలువురు కార్యకర్తలతోపాటు నాయకులు కూడా పాల్గొంటారు.
పర్యటన వివరాలు...
6న మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన.
7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన.
8న తాడికొండ నియోజకవర్గంలో పర్యటన.
9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటన.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలోనే మొదటగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయింది. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లేదారిలో బైఠాయించే ప్రయత్నం చేసారూ టీడీపీ సభ్యులు. ఈ తరుణంలోనే టీడీపీ సభ్యులను మార్షల్స్..అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీఛార్జ్ చేస్తారా అంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
కాగా.. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు రేపటికి (మంగళవారం) వాయిదా పడనున్నాయి. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. బుధవారం (ఫిబ్రవరి 7) ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.సమావేశం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. అయితే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది.

విద్వేషతపూరిత ప్రసంగం కేసులో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని (Mufti Salman Azhari) గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 31న గుజరాత్లోని జునాగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అజారీ ప్రసంగించారు. రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ ప్రసంగాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్చేశారు. అదికాస్తా వైరల్గా మారడంతో జునాగఢ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేశారు.
అయితే ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్లాం బోధకుడు అజారీని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు.. ముంబై అర్బన్ జిల్లాలోని ఘట్కోపర్ పీఎస్లో ఉంచారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ముఫ్తీ మద్దతుదారులు గుమికూడారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.
విద్వేశపూరిత ప్రసంగం చేసినందుకుగాను ఐపీసీ 153B (మతాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), 505 (2) (ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం) సెక్షన్ల కింద అజారీతోపాటు కార్యక్రమాన్ని నిర్వహించిన మహ్మద్ యూసుఫ్ మాలెక్, అజీమ్ హబీబ్పై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.

మెగా డీఎస్సీ అంటూ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఉద్యోగార్థులు మండిపడ్డారు. వేల ఉపాధ్యాయ ఖాళీలుంటే తక్కువ పోస్టులు వేసి జగన్ ప్రభుత్వం నాటకాలాడుతోందని నిరుద్యోగులు అనంతపురం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లాలో నాలుగున్నరేళ్లుగా 4వేల మంది డీఎస్సీ కోసం ఎదురుచూస్తుంటే కేవలం 4 ఎస్జీటీ పోస్టులు వేశారన్నారు. తొలుత నగరంలో ర్యాలీ తీశారు. ప్రధాన రహదారిపై అరగంట బైఠాయించారు. ఆ తర్వాత కలెక్టరేట్ గేట్లను తోసుకొని, లోనికి చొచ్చుకెళ్లారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కలెక్టర్ ఛాంబర్ దాకా వెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్ధృతంగా మారడంతో పోలీసులు నిరుద్యోగులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్కు తరలించారు.

సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వు బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. వెయ్యి కోట్ల రూపాయల చొప్పున మూడు లాట్లు, 500 కోట్ల రూపాయల చొప్పున రెండు లాట్లలో సెక్యూరిటీల వేలం వేసి ఈ రుణాన్ని తీసుకున్నారు. 5 ఏళ్ల నుంచి 19 ఏళ్ల పాటు చెల్లింపు కాలవ్యవధిలో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర 5 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4 వేల కోట్ల రుణాన్నీ తీసుకున్నాయి. ప్రస్తుత నాలుగు వేల కోట్ల రుణంతో ఏపీ ఈ ఏడాదిలో తెచ్చిన అప్పు 1.02 వేల కోట్ల రూపాయలకు చేరింది. అనుమతించిన స్థాయి కంటే అప్పులు చేసి ఎఫ్ఆర్ బీఎం నిర్దేశించిన పరిధిని ఇప్పటికి 22 సార్లు ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


