చిట్టి న్యూస్

Tiger at Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం

శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కొత్తూరు మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గురువారం వరకు పార్వతీపురం మన్యం జిల్లా కాట్రగడ్డ పరిసర ప్రాంతాల్లో తిరిగిన పులి.. శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. కొత్తూరు మండలంలోని ఈతమనుగూడ, కారిగూడ, దొండమామిడి గూడ, బాండ్రుగూడ ప్రాంతాల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. 

డ్రైవింగ్‌ లైసెన్సులు,ఆర్‌సీలు ఇక ఉండవు

రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు,ఆర్‌సీలు ఇక కార్డు ఉండవు. వాహన్‌ పరివార్‌తో సేవలన్నీ ఆన్‌లైన్‌ చేయడంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి,డిజిటల్‌ రూపంలోనే పత్రాలు తీసుకొచ్చారు. ఏపీఆర్‌టీఏసిటిజన్‌ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ద్వారా యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.వాహనాల్ని తనిఖీలు చేసే పోలీసు, రవాణాశాఖ అధికారులకు డౌన్‌లోడ్‌ చేసిన పత్రాలను చూపిస్తే సరిపోతుంది. వీటిని అనుమతించాలని తనిఖీలు చేసే పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

ఉదయగిరి వైసీపీలో తారాస్థాయికి చేరిన  వర్గ విభేదాలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గడపగడపకు కార్యక్రమంలో.. వైసీపీ నేతలు బహాబాహీకి దిగారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. కారు దిగిన మేకపాటి రెండు వర్గాల నాయకులను తీవ్రస్థాయిలో మందలించారు. ఇలా కొనసాగితే మీ మండలానికో దండం.. ఇక మీ మండల కార్యక్రమాలకు రానంటూ రాజగోపాల్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.   

రెండో రోజు కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన

డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్, పారిశుధ్య, ఎంటమాలజీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. నేటి నుంచి జీహెచ్ఎంసీకి చెందిన అన్ని కార్యాలయాల్లోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికులు విధులకు రాకుండా పనులు స్తంభింపచేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, రెగ్యూలర్ ఉద్యోగులకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి.స్టేషన్‌ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పుతున్నారు.కేఎస్సార్‌ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.ఇటీవలే ఫలకనుమా ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు చెలరేగి రైలు భోగీలు మొత్తం తగలబడిన ఘటన మరదక ముందే మళ్లీ ఉద్యాన్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులుభయాందోళనకు గురవుతున్నారు.ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పరిస్థితి సమీక్షీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. 

వైసీపీకి అనుకూలంగా ఓటర్‌ స్లిప్‌లు రాస్తున్న వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలు భయపడినట్లే జరుగుతోంది. కర్నూలు జిల్లాలో ఇవాళ జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలోని కోట కందుకూరు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు స్లిప్‌లు రాస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద స్లిప్‌లు రాస్తున్నవారి వీడియోలను విడుదల చేశారు. ఇదే వీడియోను అధికారులకు పంపినట్లు ఆమె తెలిపారు.

పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులు

ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మ గుంట పంచాయతీ ఉప ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్ర వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులపై డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్ లాఠీ చార్జ్ చేశారు. అధికారం ఉందని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల్లోకి దర్జాగా వెళ్ళి వస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sathya Sai District: వైసీపీ నేతలకు, గ్రామస్తులకు వాగ్వాదం

ఏపీలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో వాలంటీర్ల అత్యుత్సాహం చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వాలంటీర్లు వైసీపీకి అనుకకూలంగా వ్యవహరిస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వాలంటీర్లు వైసీపీ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని చలివెందుల గ్రామంలో సర్పంచ్‌ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న వాలంటీర్‌ను అడ్డుకున్నారు గ్రామస్తులు. దీంతో అధికార పార్టీ నేతలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.

వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి- మంత్రి తలసాని

 హైదరాబాద్‌లోని స్టీల్ బ్రిడ్జి ని రేపు ప్రారంభవించనున్నారు మంత్రి కేటీఆర్.ఈ నేపధ్యంలోఎమ్మెల్యే ముఠా గోపాల్‌,జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తో కలసి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ స్టీల్ బ్రిడ్జితో ఇందిరా పార్క్,ఆర్టీసీ క్రాస్ రోడ్డు,వీఎస్టీ జంక్షన్ లలో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర నున్నాయని తెలిపారు.ఈ బ్రిడ్జికి మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టామన్న తలసాని సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో విశ్వనగరంగా హైదరాబాద్‌ రూపుదిద్దుకుంటుందని అన్నారు. 

ఏపీలో భూముల ధరలు తగ్గడానికి జగన్‌ అసమర్థ పాలనే కారణం

ఏపీలో భూముల ధరలు తగ్గడానికి జగన్‌ అసమర్థ పాలనే కారణమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. అమలాపురంలో ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు . ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందన్న ఆయన మేధావులు కూడా మాట్లాడేందుకు భయ పడుతున్నారని అన్నారు., తెలంగాణలో భూములు ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.హైదరాబాద్‌ శివార్లలోని కోకాపేటలో ఎకరం భూమి వంద కోట్లు పలుకుతోందని,అప్పట్లో కోకాపేటకు ఫార్ములా వన్ రేసింగ్ తీసుకురావాలనుకున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌కు బ్రాండింగ్ తేవాలను కునుకుంటే..ఫార్ములా వన్ రేసింగ్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడ్డుపడ్డాడని అన్నారు.

గ్రేటర్‌లో బస్సు యాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం

పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్‌ఛార్జులతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ భేటీ అయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభంకానున్న బస్సుయాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. బస్సు యాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పాల్గొంటారని, గ్రేటర్‌లో బస్సు యాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధమైందని తెలిపారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడిని బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, యాత్ర తేదీని రేపు చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. గ్రేటర్‌లో టీటీడీపీ బస్సు యాత్ర సక్సెస్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు కాసాని జ్ఞానేశ్వర్‌.

బొత్స కుటుంబానికి కారు చౌకగా భూముల కేటాయింపు

మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి కారు చౌకగా భూముల కేటాయింపుపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.బొబ్బిలిలో డిస్టలరీ కోసం 30 ఎకరాలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున.ఎకరానికి 80 లక్షలు పలికే భూమిని..10 లక్షలకే ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోవాలని..లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

BRS: బీఆర్ఎస్ అభ్యర్ధుల మొదటి జాబితా సిద్ధం

బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటనకు సిద్ధం కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్‌ ఈ నెల 21వ తేదీన మొదటి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్‌లో అసమ్మతి, ఆశావాహుల పోరు ఎక్కువైంది. కొందరు హైదరాబాద్‌ బాట పడుతుంటే.. మరికొందరు ఆందోళనలు చేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏకంగా రాజశ్యామల యాగం చేస్తున్నారు. టికెట్ల వ్యవహారంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.  

గెలుపు ప్రాతిపదికన అభ్యర్ధుల జాబితా  - రేవంత్‌

గాంధీభవన్‌లో అభ్యర్థుల దరఖాస్తు ప్రతులను పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈనెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 25వేలు.. సాధారణ అభ్యర్ధులకు 50వేలుగా దరఖాస్తు రుసుము ఉంది. ఇవాళ్టి నుంచే దరఖాస్తుల కార్యక్రమం మొదలు పెట్టామన్న రేవంత్‌రెడ్డి. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ధారించాకే అభ్యర్థుల ఖరారు ఉంటుందన్నారు. అప్పటి వరకు తామే అభ్యర్ధులమంటూ ఎవరైనా చర్చించుకున్నా.. అవి ఊహాగానాలే అవుతాయన్నారు. 

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం: చంద్రబాబు

అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన మహిళా ప్రగతి-ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో మహిళే ఆర్థికమంత్రిగా వ్యవహరించి....ఇల్లును చక్కదిద్దుతుందన్నారు. టీడీపీకి సంపద సృష్టించడం తెలుసన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా తమ హయాంలో మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశామన్నారు. ఆక్వా రంగాన్ని వైసీపీ నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఆరు నెలలు ఓపిక పడితే అధికారంలోకి వచ్చి ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. 

తిరుమలకు చేరుకున్న కొత్త బోనులు

తిరుమలలో చిరుతలను బంధించేందుకు తయారు చేయించిన కొత్త బోనులు తిరుమల చేరుకున్నాయి. సరికొత్త టెక్నాలజీ తో తయారు చేసిన ఈ బోనులను మహారాష్ట్ర నుంచి తెప్పించింది అటవీశాఖ. చిరుత కదలికలను బట్టి ఈ బోన్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి కెమెరా ట్రాప్స్‌తో నిరంతరం మానిటరింగ్‌ చేస్తున్నారు. 

మార్గదర్శిపై సీఐడి దాడులను ఖండించిన సీపీఐ

అనంతపురంలో మార్గదర్శిపై సీఐడీ దాడులకు వ్యతిరేకంగా...సీపీఐ వినూత్నంగా నిరసన తెలిపింది. గాంధీ విగ్రహం దగ్గర మోకాళ్లపై కూర్చొని సీపీఐ కార్యకర్తలు...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజావ్యతిరేకత చూసి ఓర్వలేకపోతున్న జగన్‌....మార్గదర్శిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మార్గదర్శిపై హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా....సోదాలు నిర్వహించడం ఏంటని సీపీఐ నేతలు ప్రశ్నించారు. కక్షపూరిత చర్యలను సీఎం జగన్‌ మానుకోవాలన్నారు. 

Yuvagalam: విధి పగబడితే లోకేష్‌ అన్న దారిచూపాడు

తాడేపల్లిలో నివాసముండే షేక్ రెహానా ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. చంటిబిడ్డతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయింది. స్థానిక టీడీపీ నాయకుల ద్వారా తమ కష్టాలను యువనేత లోకేష్‌కు విన్నవించుకుంది. పాదయాత్రకు బయలుదేరే నెలముందు ఆమెకు టిఫిన్ బండి సమకూర్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ ఆకస్మికంగా రెహానా టిఫిన్ బండి వద్దకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మీ దయతో ప్రస్తుతం నెలకు 30వేలు సంపాదిస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆనందంగా చెబుతూ యువనేతకు అల్పాహారాన్ని అందజేసింది.  

Andhra Pradesh: క్రీడా రంగానికి జగన్‌ సర్కార్‌ అన్యాయం

ఉత్తరాంధ్ర పై వైసీపీ సర్కార్‌ నిర్లక్ష్యం వహిస్తోంది. క్రీడా రంగానికి జగన్‌ సర్కార్‌ అన్యాయం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విజయనగరం స్పోర్ట్స్ స్కూల్‌ని కడపకు తరలించిన సర్కార్‌. ఉత్తరాంధ్రలోని క్రీడా మైదానాల్లో కాసుల వేట ప్రారంభించింది జీవీఎంసీ.ఇప్పటికే MVP స్పోర్ట్స్ ఏరినా ప్రైవేట్‌కు ధారాదత్తం చేసిన జగన్‌ ప్రభుత్వం ఇతర గ్రౌండ్లు,ఇండోర్ స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు.. కట్టపెట్టేందుకు సిద్ధమైంది.స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం,బీచ్ రోడ్ లోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రైవేట్ పరం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. 

గుజరాత్.. శ్రీకాకుళం మత్స్యకారులకు తప్పిన ప్రాణాపాయం

గుజరాత్ తీరంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు ప్రాణాపాయం తప్పింది. విరావల్ సముద్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటలో ఉండగా.. బోటు అకస్మాత్తుగా మునిగిపోయింది. దీంతో.. మత్స్యకారులు ఈదుకుంటూ పక్కనున్న బోట్లలోకి చేరుకున్నారు. రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్.. మత్స్యకారులను రక్షించింది. మునిగిపోయిన బోటులో రణస్థలం మండలానికి చెందిన 8 మంది మత్స్యకారులు ఉన్నారు. అందరూ సేఫ్‌గా బయటపడడంతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. 

హైదరాబాద్‌ మార్కెట్‌లో  మెర్సిడెస్‌ బెంజ్‌  హవా

మెర్సిడెస్‌ బెంజ్‌ పై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ మార్కెట్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ హవా కొనసాగుతుండగా అందులో 30 శాతం మహిళా కొనుగోలుదారులే ఉన్నారు. ఎలక్ట్రానిక్‌ మోడళ్ల అమ్మకాలపై లగ్జరీ కార్ల ఉత్పత్తిదారులు మెర్సిడెస్‌ బెంజ్‌ ఆసక్తిగా ఉందని, వచ్చే ఏడాదిలో 3,4 ఈవీ కార్లను తీసుకు వస్తామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సీఈఓ తెలిపారు. మూడేళ్లలో తాము విక్రయించే కార్లలో నాలుగో వంతు ఎలక్ట్రానిక్‌ కార్లే ఉంటాయని అన్నారు.  

Begging Mafia: హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ మాఫియా

హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ మాఫియా బరితెగించింది. సిటీలో చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో భిక్షాటన చేయిస్తున్నారు. ఇలా బెగ్గింగ్‌ చేస్తున్న కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన అనిల్‌ పవార్‌.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనిల్‌ పవార్‌ను అరెస్ట్‌ చేశారు.  ప్రతి రోజూ ఒక్కొక్కరి నుంచి.. 5 వేల నుంచి 6 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. భిక్షాటన చేస్తున్న 23మందిని అదుపులోకి తీసుకొని విచారించి ఎన్జీవో హోమ్‌కు తరలించారు.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. భవిష్యత్‌కు గ్యారెంటీ చైతన్య యాత్రలో భాగంగా ఈ పర్యటన చేస్తున్నారు. ఈ చైతన్య యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.ఇవాళ అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో వైద్యులు, న్యాయవాదులు, రైతులు, బ్రాహ్మణ సమైక్య, పాస్టర్‌లతో పాటు ఆయా వర్గాల నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యేకు నిరసన సెగ

ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను నిలదీశారు మహిళలు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని కొత్త రెడ్డి పాలెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను నాలుగేళ్లలో ఏంచేశారని నిలదీశారు స్థానికులు.రోడ్లు, డ్రైనేజ్‌ సమస్యలను పరిష్కరించకుండా..తమ ఊరికి ఎందుకొచ్చారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఊదరగొట్టిన ఇంటింటికి రేషన్‌ బియ్యం కూడా తమకు అందడం లేదంటూ కొత్తరెడ్డి పాలెం గ్రామస్తులు నిరసన తెలిపారు. 

చిత్తూరు జిల్లా పుంగనూరులో రోడ్డెక్కిన మహిళలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో మహిళలు రోడ్డెక్కారు. 13వ వార్డులో రెండు నెలల నుంచి రేషన్ అందడం లేదని తోపుమఠం మహిళలు ముంబై హైవే పై ధర్నా నిర్వహించారు. రేషన్ సరఫరా ఎందుకు చేయడం లేదని నిలదీస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నాడని మహిళలు ఆరోపిస్తున్నారు.

Yadadri: చౌటుప్పల్‌లో పాపన్న గౌడ్ 373 జయంతి వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలు, సాహసాలు చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాపన్న గౌడ్ 373 వ జయంతి సందర్భంగా యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని కిషన్ రెడ్డి కొనియాడారు. అనంతరం ఖమ్మం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

మార్గదర్శి కార్యాలయాల్లో కొనసాగుతోన్న సోదాలు

కర్నూలు మార్గదర్శి లో రెండో రోజు దాడులు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాలు ధిక్కరించి నిన్న ఆర్ధరాత్రి ఒంటి గంట వరకు సోదాలు చేశారు. ఇవాళ ఉదయం మూకుమ్మడిగా సోదాలు ప్రారంభించారు. నిన్న అర్ధరాత్రి మార్గదర్శి కార్యాలయం బయట నోటీసులు అంటించి ఫోటోలు తీసుకుని వెంటనే చించేశారు. ఇదే విషయాన్ని అధికారుల దగ్గర మార్గదర్శి మేనేజర్ ప్రస్తావించగా చిట్స్ రిజిస్ట్రార్ మల్లికార్జున దాటవేశారు. ఈ సోదాల్లో సీఐడీ సీఐ డేగల ప్రభాకర్, చిట్స్ రిజిస్ట్రార్ మల్లికార్జున, డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజాధనాన్ని కొల్లగొట్టింది - కిషన్‌రెడ్డి

తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజాధనాన్ని కొల్లగొట్టిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. రైతుల్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిందంటూ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్‌లో కేంద్రమంత్రి కిషన్‌కు రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు. దళితుల భూముల్ని కూడా బీఆర్‌ఎస్‌ నేతలు ఆక్రమించారంటూ ఫైర్‌ అయ్యారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు కిషన్‌ రెడ్డి. అంతకు ముందు చౌటుప్పలో సర్దార్‌ సర్వాయి పాపన్న 373 జయంతి వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు.

వైసీపీ సర్కారుపై సోమిరెడ్డి ఆగ్రహం

సోమశిల జలాశయంలో 20 టీఎంసీల నీటిని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. చెరువుల్లో మట్టి తవ్వేసి కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రైతులను నష్టపరిచి వైసీపీ నేతలు మట్టి అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. సిలికాలో భారీ భూకుంభకోణం జరిగిందని ఆ డబ్బంతా లోటస్‌పాండ్‌కు వెళుతుందని ఆరోపించారు. అసైన్డ్‌ భూముల్ని కాజేసే కుట్ర జరుగుతోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన మంత్రి అక్రమ సంపాదనతో విదేశాల నుంచి తెచ్చిన సామాగ్రితో ఇల్లు నిర్మించుకున్నారని అన్నారు.

సింహాద్రి రమేష్‌పై మండలి బుద్ధప్రసాద్ ఫైర్‌

సింహాద్రి రమేష్ అనవసర ప్రేలాపనలు, గోబెల్స్ ప్రచారాలు మానుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సూచించారు. సముద్రపు కరకట్ట అభివృద్ధిని డిమాండ్ చేస్తూ.. అవనిగడ్డ నియోజకవర్గంలోని సొర్లగొంది నుంచి గుల్లలమోద వరకు ఆయన పాదయాత్ర చేశారు. దమ్ము ధైర్యం ఉంటే కృష్ణా డెల్టా వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా చేయించుకోవాలని సవాల్‌ విసిరారు. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని బుద్ధప్రసాద్‌ నిలదీశారు. మత్స్యకారులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు

రణరంగంగా మారిన గంగవరం పోర్టు

గంగవరం పోర్టు రణరంగాన్ని తలపించింది. సమస్యల పరిష్కారంపై కార్మికులు పోర్టును ముట్టడించడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా నిర్వాసితులు, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు చేస్తున్నా.. పోర్టు యాజమాన్యం స్పందించకపోవడంతో పోరుబాట పట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను చేధించుకుని కార్మికులు.. ఒక్కసారిగా ముందుకు రావడంతో ఆ ప్రాంతం ఆందోళనలతో హోరెత్తింది. ఇనుప కంచెలను దాటి పోర్ట్ గేట్‌ను ముట్టడించారు. తోపులాట చోటుచేసుకోవడంతో పలువురు పోలీసులకు, కార్మికులకు గాయాలయ్యాయి.  

తెలంగాణలో వైన్‌ షాపులకు పోటెత్తుతున్న టెండర్లు

తెలంగాణలో వైన్‌ షాపులకు టెండర్లు పోటెత్తుతున్నాయి.. నిజామాబాద్‌ జిల్లాలోనూ వ్యాపారులు పోటీ పడుతున్నారు. శ్రావణమాసం సెంటిమెంట్‌తో టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు లేకపోయినా.. కలిసొస్తుందన్న ఆశతో వారిపై టెండర్లు వేస్తున్నారు. ప్రస్తుతం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం అంతంతమాత్రంగానే ఉండటంతో వైన్‌ షాప్‌ల టెండర్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గత ఏడాది నిజమాబాద్‌ జిల్లాలో 102మద్యం దుకాణాలకు 17 వందల దరఖాస్తులు వచ్చాయి. ఈఏడాది ఈ సంఖ్య 2వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జనగామ బీఆర్‌ఎస్‌లో వేడెక్కుతున్న టికెట్‌ రాజకీయం

జనగామ బీఆర్‌ఎస్‌లో టికెట్‌ రాజకీయం వేడుక్కుతోంది. బుధవారం ప్రగతిభవన్‌కు కూతవేటు దూరంలో ఉన్న హరిత టూరిజం ప్లాజాలో జరిగిన హైడ్రామా దృష్ట్యా....ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గీయులు పల్లా తీరుపై సీరియస్ అయ్యారు. పల్లా వద్దు ముత్తిరెడ్డి ముద్దు అంటూ.... ఎమ్మెల్యే వర్గీయులు జనగామ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనగామలో గ్రూపు రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

మూడు జిల్లాల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ కార్యకర్తలను పిలవాల్సిన అవసరమేంటని ముత్తిరెడ్డి వర్గీయులు ప్రశ్నించారు. జీడిమెట్ల దగ్గర పేదలకు సంబంధించిన మూడు ఎకరాల స్థలాన్ని పల్లా ఆక్రమించారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా ఉండి జనగామకు ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉందని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మూడోసారి టికెట్ వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ నేత భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పారు. ముత్తిరెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని అన్న మండలాల కార్యకర్తలు హైదరాబాద్ మల్లాపూర్‌లోని నోమ ఫంక్షన్‌హాల్‌కు తరలివచ్చారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వారితో సమావేశం అయ్యారు. కార్యకర్తలకు స్వయంగా భోజనం వడ్డించారు. పల్లా వద్దు..ముత్తిరెడ్డి ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Kakinada: ప్రత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉపాధి హామీ పథకం సోషల్‌ ఆడిట్‌ కోసం అధికారులు వచ్చారు. అయితే.. ఉపాధి అవకతవకలు జరిగినట్లు ప్రజలు గళమెత్తారు. కొత్తపేటలో వేయని గ్రావెల్‌ రోడ్‌ వ్యవహారంలో.. 7 లక్షలు వైసీపీ నేతలు దోచేశారని ఆరోపించారు. అధికారులకూ ప్రమేయం ఉందని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చేయని పనులకు, పనికి హాజరుకాని వారి పేర్లు నమోదు చేసి.. ఉపాధి సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా రేపు అమలాపురంలో చంద్రబాబు పర్యటిస్తారు. అధినేత పర్యటన కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ అమలాపురంలో టీడీపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో గడియారం స్తంభం సెంటర్‌ మొత్తం పసుపు మయంగా మారింది. చంద్రబాబు రాక కోసం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు..

సత్యసాయి జిల్లాలో వాలంటీర్ల ఓవరాక్షన్‌

సత్యసాయి జిల్లాలో పలువురు వాలంటీర్ల తీరు వివాదాస్పదం అవుతుంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పంచాయతీ సర్పంచ్‌.. వార్డ్‌ మెంబర్‌ స్థానాల భర్తీకి ఈనెల 19న పోలింగ్‌ జరగనుంది. మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మండలంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో ఐదుగురు వాలంటీర్లు పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రలోభాలకు చేశారు. అధికారులు ఏం చేస్తున్నారని విపక్షాలు నిలదీస్తున్నాయి.