చిట్టి న్యూస్

రాజ్‌భవన్‌లో రాఖి ఫర్ సోల్జర్స్ కార్యక్రమం

భారత దేశం ఎన్నో సంస్కృతుల సమ్మేళనం అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. రాఖి పండుగ అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అన్నారు. రాజ్‌భవన్‌లో ఘనంగా రాఖి ఫర్ సోల్జర్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మీ ఫోర్స్ సోల్జర్స్‌తో పాటు, విద్యార్ధులు పాల్గొన్నారు. వారికి గవర్నర్ తమిళిసై రక్షా బంధన్ కట్టారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడం భారత దేశానికి గర్వకారణం అన్న ఆమె.. త్వరలోనే మనం స్యూరుడిపై అడుగుపెట్టబోతున్నామన్నారు.

general elections 2023: నిన్న అసంతృప్తిగా ముగిసిన పీఈసీ సమావేశం


కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత కత్తిమీద సాములా మారింది. 119 నియోజకవర్గాలకు గాను వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేయడంతో.. పీఈసీ పని కష్టతరంగా మారింది. దీంతో నిన్న పీఈసీ సమావేశం అసంతృప్తిగా ముగిసింది. అభ్యర్థుల వడపోతకు మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 2న మరోసారి ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఆ రోజే దరఖాస్తుల జాబితాను షార్ట్‌ లిస్ట్‌ చేయనున్నారు. సెప్టెంబర్‌ 2 లేదా 3వ వారంలో తుది జాబితా విడుదలకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. 

షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్‌సభ పోల్స్ జరగవచ్చు: సీఎం  నితీష్

ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్‌సభ పోల్స్ జరగవచ్చన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎన్నికలు ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఒరిజినల్ షెడ్యూల్‌కే ఎన్నికలు జరుగుతాయనే గ్యారెంటీ లేదన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం డిసెంబర్ లేదా జనవరిలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికలకు ముందస్తుగానే అన్ని హెలికాప్టర్లను ముందుగానే బీజేపీ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మమతా వ్యాఖ్యలపై స్పందించిన నితీష్. ఎన్డీయే ముందస్తుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చాలాకాలంగా తాను చెబుతునే ఉన్నానన్నారు.  

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కొద్దినెలల్లో ఉండగా.. ఒడిశా సైతం ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్‌ వరకు అసెంబ్లీ గడువున్నప్పటికి... ఒడిశాలో ఈ ఏడాదే ఎన్నికలుంటాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్లే వచ్చే నెల 13న కేంద్ర ఎన్నికల బృందం ఒడిశాలో పర్యటించనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. అక్టోబరు నాటికి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల పరిశీలనను పూర్తి చేసి నవంబరు 15కు ఎన్నికలకు అన్నీ సిద్ధంగా ఉంచుతామన్నారు ఒడిశా ముఖ్య ఎన్నికల అధికారి నికుంజ బిహారీ. 

శ్రీకాకుళం పాతపట్నంలో అగ్నిప్రమాదం

శ్రీకాకుళం పాతపట్నం ప్రధాన రహదారిపై ఉన్న స్నేహ షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మాల్‌ మొత్తం మంటలు వ్యాపించాయి. స్ధానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఉత్సాహంగా సాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. లోకేష్ పాదయాత్రకు మాజీ జడ్పీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు ముళ్ళపూడి బాపిరాజు సంఘీభావం తెలిపారు. యువగళం పాదయాత్ర మధ్యలోనే నిలిపివేస్తారంటూ వైసీపీ నేతలు కారుకూతలు కూశారు.. ఇప్పుడు వస్తున్న ప్రజాదరణ చూసి నోరెళ్ల పెడుతున్నారని మండిపడ్డారు. కారు కూతలు కూసే ప్రతి ఒక్కరికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామన్నారు టీడీపీ మాజీ జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు.

ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలన్న దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు

టీడీపీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావుకి భారతరత్న ఇవ్వాలన డిమాండ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలని దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు. ఇటీవలే జరిగిన ఎన్టీఆర్‌ శత శయంతి నేపధ్యంలో డిమాండ్‌ మరింత పెరిగింది. ఎన్టీఆర్‌ శతజయంతి స్మారక వంద రూపాయిల నాణెం విడుదల చేశారు.ఎన్టీఆర్‌ తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనమని,రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయనో ప్రభంజనమని ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవమని దర్శకేంద్రుడు ప్రసంశించారు. 

NTR 100 Rupees Coin: ఎన్టీఆర్‌ స్మారక  రూ.వంద నాణెం అమ్మకం ప్రారంభం

హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ స్మారక వంద రూపాయిల నాణెల అమ్మకం ప్రారంభమైంది. ఈ నాణెనికి మూడు ధరలునిర్ణయించారు. అధికారులు.4 వేల850,4వేల380,4 వేల50 రూపాయిలుగా ధరలు నిర్ఱయించారు అధికారులు. మింట్ కాంపౌండ్‌లోనాణెం కోసం బారులు తీరారుఅభిమానులు. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉన్న నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, శతజయంతి అని హిందీలో ముద్రించారు. ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల సేల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ వద్ద మత్స్యకారుల ఆందోళన

విశాఖలో ఫిషింగ్‌ హార్బర్‌ కంటైనర్‌ టెర్మినల్ సమీపంలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. టెర్మినల్‌కు భూములు అప్పగించిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ టెర్మినల్‌ వద్ద ధర్నాకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. 2002లో విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ఏర్పాటు సమయంలో ఒక్కో కుటుంబానికి 60 గజాల ఇంటి స్థలం, రూ.లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని.. వాటిని అధికారులు నెరవేర్చాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. ఆందోళనకారుల ధర్నా దృష్ట్యా కంటైనర్‌ టెర్మినల్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు.   

Crime: రేప్‌ చేసి బండరాయితో హత్య

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. నానక్‌రామ్‌గూడలోని ఓ నిర్మాణ సంస్థలో మహిళను రేప్‌ అండ్‌ మర్డర్‌ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. మృతురాలు గౌలిదొడ్డి కేశవనగర్‌కు చెందిన కాశమ్మగా పోలీసులు గుర్తించారు. వేస్ట్ మెటీరియల్‌ తీసుకునేందుకు వచ్చిన మహిళను రేప్‌ చేసిన అనంతరం నిందితులు బండరాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే శుక్రవారం మిస్సింగ్‌ కేసు కూడా నమోదైనట్లు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

BJP: ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వెళ్లనని స్పష్టం చేశారు. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలన్నదే తన లక్ష్యమన్న రాజాసింగ్… బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయలను పక్కనపెట్టి.. హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటానని తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ.. వేరే పార్టీల నుంచి కానీ పోటీ చేయనని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని ఆశాభావం వ్కక్తం చేశారు.

కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి

ఎన్టీఆర్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ కుప్పంలో పర్యటిస్తున్నారు. పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఎన్టీఆర్‌ సంజీవని ఉచిత వైద్యశాల, ఎన్టీఆర్‌ ట్రస్టు ఉచిత వైద్య మొబైల్‌ వ్యాన్‌ను ప్రారంభించారు. అంతకుముందు ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతిపురం మండలం కడపల్లె సమీపంలోని శివపురం వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలిస్తారు. అక్కడ్నంచి బెంగళూరుకు చేరుకుని హైదరాబాదుకు తిరుగు ప్రయాణమవుతారు.

AP: టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహం ఉద్రిక్తతకు దారితీసింది. కొత్తూరు మండలం నివగాం ఇసుక ర్యాంపు పరిశీలనకు పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదేమీ రాజ్యం.. అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

టీడీపీ బోర్డులో అన్యమతస్థులు.. బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ


టీడీపీ బోర్డులో అన్యమతస్థులు, లిక్కర్‌ మాఫియాను పెట్టొదంటూ..ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టింది.కృష్ణా జిల్లా గుడివాడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరించారు. టీటీడీలో దొంగలు పడ్డారని.. హైందవ దేవాలయాల్లోఅన్యమతస్థులు ఉండటం సిగ్గుచేటంటూ నిరసన చేపట్టారు. టీటీడీని నిర్వీర్యం చేసేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలుస్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ మద్దతు తెలిపారు స్ధానికులు.

దళితుడిని పక్కా స్కెచ్‌ వేసి హత్య చేసిన వైసీపీ నేత

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. రాజకీయ కారణాలతో దళితులపై వైసీపీ నేత ప్రతాపం చూపిస్తున్నారు. ఏర్పేడు మండలం చెన్నంపల్లిలో స్థానిక టీడీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా హత్యచేశారు. కల్లూరుకు చెందిన టీడీపీ దళిత కార్యకర్త..మోహన్‌బాబును వైసీపీ నేత మునిరెడ్డి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మునిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ NIA కోర్టులో కోడి కత్తి కేసు విచారణ

కోడికత్తి కేసులో తమ బిడ్డకు బెయిల్ ఇవ్వాలంటూ శ్రీను కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఏడుసార్లు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయి కోర్టులు. ఇప్పటి వరకు విజయవాడలో జరిగిన కేసు విచారణ.. ఇక నుండి విశాఖలో జరగనుంది. మరోవైపు శ్రీనివాస్‌ని కావాలనే సర్కార్‌ వేధిస్తోందిని ఆరోపిస్తున్నారు. జగన్ చేతిలో శ్రీనివాస్ భవిష్యత్ ఉందని.. తమకు మద్దతిచ్చిన దళిత సంఘాల నేతలను అరెస్ట్ చెయ్యడం దారుణమని శ్రీనివాస్ తల్లి,సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Hyderabad: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. రెండు మసాజ్‌ సెంటర్లపై దాడులు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ 12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలో.. ది వెల్వెట్ స్పాలో మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న 9 మంది సెక్స్ వర్క ర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు నీలిమ, కార్తీక్, జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాపై కేసు నమోదు చేశారు. 

అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ పార్టీయే- పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించటం ఖాయమని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ పార్టీయేనని, రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఖమ్మం జిల్లా మధిర మండలంలో పొంగులేటి పర్యటించారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒకటేనని, కేంద్రంలోని బీజేపీ నేతల కనుసన్నల్లో బీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: రోజర్ బిన్ని

ఎకో వైజాగ్ క్యాంపెయిన్‌లో భాగంగా విశాఖలో జీవీఎంసీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధర్యంలో బీచ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని హాజరయ్యారు. ఎకో వైజాగ్ బీచ్ వాక్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. గతంలో కంటే వైజాగ్‌లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. తాను ఇప్పటి వరకు కుటుంబసభ్యులతో కలిసి ఐదు వేల మొక్కలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పర్యవరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రోజర్ బిన్ని అన్నారు.

Nandamuri Harikrishna: దివంగత టీడీపీ నేత హరికృష్ణ వర్ధంతి

ఇవాళ రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నందమూరి హరికృష్ణ వర్ధంతి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన్ను స్మరించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు.


బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి ఫైర్‌

ఖమ్మం కార్పొరేషన్‌లో అక్రమంగా దోచుకుని దాచుకున్న సొమ్మును, అక్రమంగా కబ్జా చేసిన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్కిస్తామని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంత్రి తన బినామీ కాంట్రాక్టర్‌లను పెంచి పోషిస్తు.. రానున్న ఎన్నికల్లో మూడోసారి గెలవాలనే తపనతో ఉన్నారని మండిపడ్డారు. త్వరలో ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చరమగీతం పాడతుందని పొంగులేటి అన్నారు.

Yuvagalam: 198వ రోజుకు చేరుకున్న యువనేత లోకేష్ యువగళం

యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర 198వ రోజుకు చేరుకుంది. ఉదయం చింతలపూడి నియోజకవర్గం తీగలవంచ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పోలవరం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. టీ. నరసాపురంలో రైతులతో, స్ధానికులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం శ్రీరామవరం భోజన విడిది కేంద్రం వద్ద పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్ పాల్గొననున్నారు.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వెయ్యి కోట్ల రూపాయల మేర పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ ముట్టడికి పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబాలతో సహా బల్దియా ముట్టడికి వచ్చారు కాంట్రాక్టర్లు. రంగంలోకి దిగిన పోలీసులు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకుంటున్నారు.

గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరింపజేస్తాం : ధూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో DVC హాస్పిటల్ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, మేనేజింగ్ డైరెక్టర్ ధూళిపాళ్ల జ్యోతిర్మయి, తిరుపతి బర్డ్స్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ జగదీష్‌కుమార్, గుంటూరు స్టార్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రవికుమార్, డాక్టర్ శైలజతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. DVC హాస్పిటల్ వైద్య సేవలను ముఖ్య అతిథులు కొనియాడారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరింపజేయనున్నట్లు ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. పల్లె ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ ధ్యేయమన్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్‌ కాల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్‌ కాల్ రావడంతో.. CISF భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు చేశారు. అలాగే ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు.. బెదిరింపు కాల్ చేసింది ఎవరో గుర్తించారు. అయితే తన పిల్లలు పొరపాటున ఫోన్ చేశారని, జరిగిన తప్పుకు క్షమించాలని భద్రతా సిబ్బందిని కోరాడు. మొత్తానికి బాంబ్ బెదింపు కాల్ ఫేక్ అని తేలండతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

Vishakapatnam: పట్టుబడిన అక్రమ మద్యం

విశాఖలో అక్రమ మద్యం పట్టుబడింది. పక్కా సమాచారంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీతమ్మదారలోని ఓ ఇంటిపై దాడి చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకుని 79 డిఫెన్స్ మద్యం సీసాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.

Anakapalli: విస్సన్నపేట లేఅవుట్‌లో బయటపడుతున్న పెద్దల పాత్ర

అనకాపల్లి జిల్లా విస్సన్నపేట లేఅవుట్‌లో వైసీపీ పెద్దల పాత్ర ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విస్సన్నపేట భూముల్లో 60 ఎకరాలను మంత్రి అమర్నాథ్‌, విజయసాయిరెడ్డికి గురుదక్షిణ కింద ఇచ్చినట్లు ఆరోపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి బినామి గోపీనాథ్‌రెడ్డి సంస్థ ఎశుర్ డెవలపర్స్ పేరుపై భూబదిలీ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి అమర్నాథ్‌ బినామి బొడ్డేటి ప్రసాద్, ఆయన తండ్రితో పాటు మరికొంతమంది బినామిల పేర్లపై విస్సన్నపేట భూములు మారిపోయాయి. మరోవైపు రైతులను వారి భూముల వద్దకు వెళ్లకుండా మంత్రి అనుచరులు అడ్డుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూదోపిడీ చేస్తున్నారని వామపక్షాలు, జనసైనికులు  ఆరోపిస్తున్నారు.  

Kakinada: జ్యోతుల నెహ్రూను పరామర్శించిన టీడీపీ నేతలు

కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూను పరామర్శించారు టీడీపీ సీనియర్‌ నేత యనమల. ఇటీవల జ్యోతుల నెహ్రూ సోదరి మృతిచెందారు. యనమలతో పాటు చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి జగ్గంపేట వెళ్లి జ్యోతుల నెహ్రూను కలిసి సానుభూతి తెలిపారు. ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ సోదరి తోట నాగలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

Kavitha:  కాంగ్రెస్‌ ప్రకటించింది దళిత డిక్లరేషన్‌ కాదు ఫాల్స్‌ డిక్లరేషన్‌: కవిత

దళితుల పేరుతో కాంగ్రెస్‌, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రకటించింది దళిత డిక్లరేషన్‌ కాదు పాల్స్‌ డిక్లరేషన్‌ అని విమర్శించారు. దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం బీఆర్‌ఎస్‌ కృషి చేస్తోందని ఆమె చెప్పారు. మొదట కర్నాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలన్నారు. అమిత్‌ షా ఖమ్మంలో రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని కవిత విమర్శించారు

Nagari: జగన్‌ను కలవడానికి ప్రయత్నించిన సర్పంచ్‌లు అడ్డుకున్న పోలీసులు

చిత్తూరు జిల్లా నగరిలో జగన్‌ను కలవడానికి ప్రయత్నించిన సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీకి చెందిన సర్పంచ్‌లను సైతం పక్కకు నెట్టివేశారు. కేంద్రం గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో తిరిగి నిధులను మంజూరు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

ఏపీలో భారీగా పన్నుల బాదేస్తున్న జగన్ సర్కారు

ఏపీలో జగన్ సర్కారు జనాన్ని పన్నులతో బాదేస్తోంది. ఇప్పటికే కరెంట్ ఛార్జీలతో షాకిస్తోన్న వైసీపీ సర్కారు.. ఇప్పుడు ఇంటి పన్నుతో కొరడా ఝుళిపిస్తోంది. ఇబ్రహీంపట్నంలోని ఓ రేకుల షెడ్డుకు ఏకంగా 3400 రూపాయలు ఇంటి పన్ను వేసింది. గతంలో కేవలం 200 రూపాయలు ఉన్న ఇంటి పన్ను ఏకంగా... 3వేల 400 రూపాయలు వేయడంతో.. లబోదిబో మంటున్నాడు బాధితుడు. రేకుల షెడ్డుకు.. ఇంత భారీగా ఇంటి పన్ను వేయడమేంటని ప్రశ్నిస్తున్నాడు. క్రాంతి, నీరజ దంపతులు.

ఇబ్రహీంపట్నంలో ఓ రేకుల షెడ్డులో ఉంటున్నారు క్రాంతి, నీరజ దంపతులు. ఎలాంటి సౌకర్యాలు లేని ఈ ఇంటికి 3400 రూపాయల ఇంటి పన్ను వేయడంతో.. షాక్ కు గురయ్యారు. దీనిపై కొండపల్లి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. వాస్తవానికి ఎస్సీలకు 200 యూనిట్లు లోపు కరెంట్ ఉచితంగా ఇస్తుంది. బాధితులు ఎస్సీ అయినా ప్రతినెలా కరెంట్ బిల్లు కట్టడం విశేషం. కనీసం ఈ రేకుల షెడ్డుకు మౌలిక సదుపాయాలు కూడా లేవు.

ఏ సదుపాయాలు లేని ఈ రేకుల షెడ్డుకు వేల రూపాయల ఇంటి పన్ను విధించడం, ఎస్సీలకు ఉచితంగా ఇచ్చే కరెంటే చార్జీలు కూడా వసూలు చేయడం పై మండిపడుతున్నాయి విపక్షాలు. రెక్క ఆడితే కానీ.. డొక్కాడని తాము...ఇంత ఇంటి పన్ను ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.  

Mint: హైదరాబాద్ మింట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారు

ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా స్మారక నాణెం విడుదల చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్‌ జరిగిన కార్యక్రమంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ స్మారక నాణెన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ మింట్‌లో తయారైన ఈ నాణెం మార్కెట్‌లో చలామణి కోసం కాదని. కేవలం స్మారక నాణెమని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు.ఈ నాణెం ధర 3 వేల 500 నుంచి 4వేల850 వరకు ధర ఉంటుందని..దీని తయారీకి కూడా అంతే ఖర్చు అవుతుందని అన్నారు. తొలి విడతలో 12వేల నాణేలు తయారు చేశామన్న ఆయన వీటి కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని అన్నారు.డిమాండ్ కి తగినంత సప్లై లేదని,అందరికీ అందేలా నాణేలు తయారు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ మింట్‌లో తొలిసారి ఓ వ్యక్తి పేరు మీద నాణెం ముద్రించామని,ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వంద రూపాయిల డినామినేషన్ తో కాయిన్ ముద్రించామని అన్నారు. ఈ కాయిన్‌ కొనుగోలు కోసం ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల సేల్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు నాయుడు తెలిపారు.  

Nagari YCP : సీఎం జగన్ పర్యటనలో బయటపడ్డ విభేదాలు

సీఎం జగన్ పర్యటనలో నగరి వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం జగన్ శిలాపలకం ప్రారంభించిన తర్వాత సభాస్థలి వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వేదిక వద్ద వైసీపీ నేత కేజే శాంతితో మంత్రి రోజాను కలిపే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ఇద్దరూ చేతులు కలపాలని సూచించారు. అయితే వీరిద్దరూ దీనికి అంగీకరించలేదు. వీరిద్దరిని కలిపేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తుండగా రోజా తన చేతిని వెనక్కు తీసుకున్నారు. సీఎం సమక్షంలో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడటం ఆసక్తిగా మారింది.

Prakasam: గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు అసమ్మతి సెగ

ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు అసమ్మతి సెగ తగులుతోంది. కొమరోలులో రాజన్న భోజనశాల ఏర్పాటు చేశారు వైసీపీ నేత రమణారెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరైయ్యారు. స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపలేదు. కోట్లు ఖర్చుతో భారీ స్థాయిలో జన సమీకరణతో పాటు హెలీకాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపిస్తూ హంగామా చేశాడు. ఐతే ఇటీవల అట్టహాసంగా పుట్టినరోజు జరుపుకున్న అన్నా రాంబాబుకు కౌంటర్‌గా ఈ కార్యక్రమాలు చేపట్టారని వైసీపీ నేతలు చర్చించుకుంటారు. 

తాడిపత్రి మున్సిపల్ సమావేశంలో ఉద్రిక్తత

తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పైకి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయుడు, 30 వార్డు కౌన్సిలర్ హర్ష వర్ధన్ రెడ్డి దూసుకువచ్చాడు. టీడీపీ కౌన్సిలర్ గా గెలిచి ఇటీవలే వైసీపీలోకి వెళ్ళిన 6వ వార్డు కౌన్సిలర్ రాబర్ట్ మునిసిపల్ స్థలంలో అక్రమంగా హోటల్ నిర్మాణానికి సంబంధించి గొడవ మొదలైంది. పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. 

Anantapuram: జడ్జిపై కేసు పెట్టిన భార్య

అనంతపురంలో జడ్జిపైన ఆయన భార్య కేసు నమోదు చేశారు. జిల్లా 8వ ఏడిజే ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న డి. శ్రీనివాసులుపై ఆయన భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ కంఫ్లైంట్‌ చేశారు. మ్యూచవల్ డైవర్స్ కి ఒప్పుకోవాలని వేధిస్తున్నారని ఆరోపించారు. జడ్జి సోదరుడు తనపై తీవ్ర ఒ‍త్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన కూతురి భవిష్యత్తు కోసమే కలిసి ఉండాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలతో కలసి ఎస్పీ ఆఫీస్‌కు వచ్చారు.