చిట్టి న్యూస్

ఈడీ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు

ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు, వెబ్‌సైట్లపై దాడులు చేపట్టింది. ఈ సోదాల్లో రూ. 4వేల కోట్లు విదేశాలకు తరలించినట్లు ఈడీ తేల్చింది.

భట్టి పాదయాత్రకు ప్రజలు జేజేలు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ప్రస్తుతం పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న భట్టికి.. అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. కాంగ్రెస్‌ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ భట్టి పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గడప గడపకు కార్యక్రమంలో చుక్కెదురైంది. పేట అగ్రహారంలో కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. గ్రామంలోని ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. నాలుగేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే తమ గ్రామానికి ఏంచేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జై చంద్రబాబు నినాదాలతో పేట అగ్రహారం హోరెత్తింది.

సీరియల్ నటుడి అకాల మృతి

ప్రముఖ హిందీ సీరియల్ నటుడు నితీశ్ పాండే (51) కన్నుమూశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో నిన్న రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిద్రలోనే గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుపమ, కుచ్ తో లోగ్ కహెంగే, ప్యార్ కా దర్ద్ మీఠా మీఠా ప్యారా ప్యారా, ఏక్ రిష్తా సజేదారి కా వంటి అనేక సీరియళ్లలో నితీశ్ నటించారు. 

వైద్యం వికటించి నాలుగేళ్ల చిన్నారి మృతి

వైద్యం వికటించి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని సన్ షైన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వాంతులతో బాధపడుతోన్న చిన్నారిని ఆసుపత్రిలో చేర్చగా, వైద్యుడు ఆమె అధిక డోస్ ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను సదరు వైద్యుడే తన కారులో పెద్దాసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఉపక్రమించాడు. అయితే మార్గం మధ్యలోనే చిన్నారి ప్రాణాలు విడవడంతో అక్కడ నుంచి పరారయ్యాడని తెలుస్తోంది.

ఔరంగబాద్ లో రోడ్డు ప్రమాదం, తెలంగాణా వాసుల మృతి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ సిద్ధిపేట జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కాగా, వారిని ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఫేక్ కరెన్సీ కలకలం

అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో మరోసారి ఫేక్ కరెన్సీ కలకలం రేపింది. రెండు బ్యాగుల్లో నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠాను ముదిగుబ్బలో పోలీసులు పట్టుకున్నారు. నిందితులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.  

ఏపీ సర్కార్‌కు జేఏసీ సమ్మె నోటీసులు

ఏపీ సర్కార్‌కు విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది. ఉద్యోగుల పీఆర్సీపై వారంలోగా తేల్చాలన్న విద్యుత్‌ జేఏసీ.. ఈనెల 31 నుంచి ఆందోళన చేస్తామని హెచ్చరించింది.

వారి పాలనలో ఏపీ సంక్షోభంలోకి వెళ్లిపోయింది

వైసీపీ పాలనలో ఏపీ సంక్షోభంలోకి వెళ్లిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ మహానాడు ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం వైపు అడుగులు వేసేలా చేస్తామన్నారు.

రాజమండ్రిలో మహానాడు

రాజమండ్రిలో ఈనెల 27, 28వ తేదీల్లో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మహానాడును చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

విజయవంతంగా కొనసాగుతోన్న యువగళం

లోకేష్‌ యువగళం పాదయాత్ర 109వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 13వందల 93 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.

కొనసాగుతోన్న ఉత్కంఠ

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై అదే ఉత్కంఠ కొనసాగుతుంది. కర్నూలులో హైడ్రామా కొనసాగుతోంది. మూడు రోజులుగా కర్నూలులోనే సీబీఐ బృందం మకాం వేసింది. అటు.. విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్‌ రెడ్డి ఉన్నారు. ఆస్పత్రి చుట్టూ పోలీసు వాహనాలను నిలిపారు.

పెట్టుబడుల పంట

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. అమెరికాకు చెందిన క్లోవర్టెక్స్‌ సంస్థ 100 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో క్లోవర్టెక్స్ వ్యవస్థాపకులు ఒప్పందం చేసుకున్నారు. 

దశాబ్ది వేడుకలకు భారీ ఏర్పాట్లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించారు..ఇషితా కిషోర్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించగా.. గరిమ లోహియా సెకండ్‌ ర్యాంక్‌, ఉమా హారతి మూడో ర్యాంక్‌, స్మృతి మిశ్రా నాలుగో ర్యాంక్‌ సాధించారు.

తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకు సాధించారు.. శాఖమూరి శ్రీసాయి అశ్రిత్‌ 40వ ర్యాంకు, సాయి ప్రణవ్‌ 60వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన నిధి పాయ్‌ 110వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157వ ర్యాంకు సాధించగా.. కమతం మహేశ్‌కుమార్‌ 200వ ర్యాంకు గెలుచుకున్నారు. రావుల జయసింహారెడ్డి 217, విశాఖకు చెందిన సాహిత్య 243కు ర్యాంకు వచ్చింది. అంకుర్‌ కుమార్‌కు 257వ ర్యాంకు, బొల్లం ఉమామహేశ్వర రెడ్డికి 270వ ర్యాంకు, చల్లా కళ్యాణికి 285వ ర్యాంకు, పాలువాయి విష్ణువర్ధన్‌ రెడ్డికి 292వ ర్యాంకు, గ్రంధె సాయికృష్ణకు 293వ ర్యాంకు వచ్చింది.

అవినాష్‌రెడ్డి వర్గీయుల హంగామా

కర్నూలులో అవినాష్‌రెడ్డి వర్గీయులు హంగామా సృష్టిస్తున్నారు. విశ్వభారతి ఆస్పత్రి దగ్గర రోప్‌ పార్టీ పోలీసుల్ని అడ్డుకుంటున్నారు. అంతేకాదు.. అక్కడున్న ఫొటోగ్రాఫర్‌ కెమెరాలో తీసిన ఫొటోల్ని డిలీట్‌ చేయాలంటూ అతడ్ని వెంటాడుతున్నారు. అవినాష్‌ వర్గీయుల హంగామాతో విశ్వభారతి ఆస్పత్రి దగ్గర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

మెదక్‌ జిల్లాలో గాలివాన బీభత్సం

మెదక్‌ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. తూప్రాన్‌లో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురుగాలులతో టార్పాలిన్లు ఎగిరిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి దుమారంతో శివాజీ విగ్రహం విరిగిపడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్రక్కులో రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ట్రక్కులో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు ట్రక్కులోనే ప్రయాణించిన ఆయన.. ట్రక్కు డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గామారింది. 

మోదీకి ఘన స్వాగతం

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఇవాళ సిడ్నీలో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో, ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆకాశంలో ఎయిర్ క్రాఫ్ట్‌లతో వెల్ కమ్ మోదీ అంటూ స్వాగతం చెప్పారు. 

కోదాడలో విషాదం

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు డోర్‌ గ్లాస్‌లో మెడ ఇరుక్కుని తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. అనంతగిరి మండలం బొజ్జగూడెంతండలో ఈఘటన చోటుచేసుకుంది.

జూన్‌ 11న ఆప్ మహా ర్యాలీ

ఢిల్లీ పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా.. జూన్‌ 11న మహా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్‌ ప్రకటించింది. ఈ ర్యాలీలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని సీఎం కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. 

అనకాపల్లి భూకుంభకోణంలో మంత్రి పాత్ర

అనకాపల్లి జిల్లా విస్సన్నపేట భూకుంభకోణం వెనుక మంత్రి గుడివాడ అమర్నాథ్‌, అతని బినామీలు ఉన్నారని జనసేన నేతలు ఆరోపించారు. ఈ భూదందాపై సీబీఐ లేదా న్యాయ నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

జగన్ సర్కారును ఆదుకున్న కేంద్రం

అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సర్కారుపై మరోసారి కరుణ చూపించింది మోదీ సర్కారు. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్‌ ప్రభుత్వానికి.. ఏకంగా పదిన్నర వేల కోట్లు ఇచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు కింద ఈ ఆర్ధిక సాయం చేసింది.

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని పోలీసుల హౌస్‌ అరెస్ట్‌

నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని పోలీసుల హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గాంధీనగర్‌లోని క్రిస్టియన్‌ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆయన నిరసనకు పిలుపునివ్వడంతో పోలీసులు అడ్డుకున్నారు. 

Yuvagalam: కడప జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం

నేడు కడప జిల్లాలోకి ప్రవేశించనున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర. జమ్మలమడుగు నియోజకవర్గం, పెద్దముడియం మండలం లోని సుద్ధపల్లికి ఈ సాయంత్రం చేరుకోనున్న నారా లోకేష్. నారా లోకేష్ కి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్న కడప జిల్లా టిడిపి శ్రేణులు.

అమెరికా పర్యటనలో కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వ విజయాలపై అమెరికా వేదికగా కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్‌ జరుగుతున్న అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్ వరల్డ్‌ ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ కాంగ్రెస్‌ సదస్సులో మాట్లాడారు. 

బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ

వైఎస్‌ వివేక హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారించనుంది.

వివాదంలో చిక్కుకున్న కిలాడీ చిన్నది

పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ DCP రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంలో నటి డింపుల్ హయతిపై పోలీస్ కేసు నమోదు అయింది. డీసీపీ డ్రైవర్ చేతన్ ఇచ్చిన ఫిర్యాదుతో డింపుల్‌తో పాటు ఆమెకు కాబోయే భర్త డేవిడ్‌పై కూడా పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డింపుల్ తరుచుగా అతిగా ప్రవర్తిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఎన్నిసార్లు సర్ది చెప్పినా ఆమె వినలేదని రాహుల్ హెగ్డే ఆరోపించారు.

RRR విలన్ కన్నుమూత

RRR విలన్‌, హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్‌ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల దర్శకుడు రాజమౌళి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ ఆత్మకు శాంతి కలగాలి.. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారని అన్నారు. హాలీవుడ్ నటుడైన రే 1990లలో టీవీ షోలలో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత అడ్వెంచర్ మూవీ కింగ్ ఆర్థర్ సహా పలు యాక్షన్ వార్‌ సినిమాల్లో నటించారు.

శ్రీవారిని దర్శించుకున్న 78,349 మంది భక్తులు

తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

టోకెన్ లేని శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,349 మంది భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.56 కోట్లు

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే

కొలువులు కావాలంటే తెలంగాణలో కమలం రావాల్సిందేనన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణలో డబుల్‌ అభివృద్ధి సాధ్యమన్నారు. ఏం సాధించారని కేసీఆర్ దశాబ్ధి ఉత్సవాలు జరుపుతారని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్ మెయిల్ విలన్ .... కాంగ్రెస్, ఎంఐఎం సహ విలన్లంటూ ఆరోపించారు. బీజేపీ గ్రాఫ్‌ దెబ్బ తీసేందుకు ఈ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయంటూ మండిపడ్డారు. గెలవలేని చోట్ల కాంగ్రెస్ అభ్యర్దులకు కేసీఆర్‌ ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నారంటూ విమర్శించారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు

కొత్తగా ఎంపికైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకపత్రాలు అందజేశారు మంత్రి హరీష్. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. అందుకే అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసి.. పారామెడికల్‌ సిబ్బందిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాకపోతే, సీఎంగా కేసీఆర్ ఉండకపోతే ఇవన్నీ సాధ్యం అయ్యేవి కాదన్నారు. గతంలో వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గిందన్నారు.

పొంగులేటిపై పువ్వాడ ఫైర్

మాజీ ఎంపీ పొంగులేటిపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్య్యారు. తన హయంలో అభివృద్ధి జరుగుతుంటే చూసి తట్టుకోలేక మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి వేల కోట్లు సంపాదించారంటూ పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బావురుమంటోన్న రైతన్న

ఆరుగాలం పండించిన పంటను కోయడం ఒక టాస్క్‌ అయితే.. వాటిని అమ్ముకోవడం మరో టాస్క్‌గా మారిందని రైతులు వాపోతున్నారు. లోడింగ్‌ చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లుల వద్దకు తీసుకువస్తే.. తాము చెప్పేంత వరకు లోపలకు రావొద్దని మిల్లర్లు రోడ్డుపైనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు ఏ-గ్రేడ్‌ ఉంటే.. మిల్లులకు వచ్చాక బి-గ్రేడ్‌ అంటూ తరుగు తీయడం దారుణమంటున్నారు.

బీఆర్ఎస్ విజయం తథ్యం

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌. కర్నాటకలోని రాయచూర్‌ ఎమ్మెల్యే.. తమను తెలంగాణలో కలపమని అడగటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కర్నాటకలో బీజేపీ పాలనపై ప్రజలు విసిగి వేసారడంతో.. ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌ గెలుపునకు దోహదపడిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలవడమే కాకుండా.. మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమంటున్న గాదరి కిశోర్‌. 

ఉరకలేస్తోన్న యువగళం

జగన్‌ అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రానికి కొత్త కంపెనీలు రావని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో.. కాపు, బలిజ సామాజిక వర్గీయులతో లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ధరలన్నీ పెంచేశారని మండిపడ్డారు.