- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

షాంగై సూపర్మార్కెట్లో కత్తితో దాడి జరిగిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. అనుమానితుడిని లిన్ మౌమౌగా గుర్తించారు. 37 ఏళ్ల ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మందిని ఆస్పత్రికి తరలించారు. దాంట్లో ముగ్గురు మృతిచెందినట్లు తేలింది. 15 మంది ప్రాణాలు మాత్రం ప్రమాదంలో లేవన్నారు. వ్యక్తిగత ఆర్థిక సమస్యల వల్ల లిన్ .. సూపర్మార్కెట్లో కత్తితో దాడికి పాల్పడినట్లు తేలింది. సూపర్మార్కెట్లో ఓ వ్యక్తి తన చేతుల్లో కత్తితో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో అక్కడున్న వారు భయంతో అరుస్తూ పరుగులు తీశారు.

కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ పక్కగా కర్ర చేత పట్టుకున్న ఒక వ్యక్తి బైక్పై వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో ఈ సంఘటన జరిగింది. రాహుల్ గాంధీ సోమవారం హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఒక వ్యక్తి కలకలం సృష్టించాడు. రాహుల్ గాంధీ వాహనం పక్కగా బైక్పై వెళ్లాడు. వృద్ధుడైన ఆ వ్యక్తి చేతిలో పొడవైన కర్ర కూడా ఉన్నది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ కీలక నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పక్కగా బైక్ వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించడంపై విమర్శలు వచ్చాయి. మరోవైపు 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరుగనున్నది. అక్టోబర్ 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో జరగుతోన్న వ్యవహారంపై అంతా నోరువిప్పాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికత.. హిందుత్వంపై సోషల మీడియా వేదికగా ఎక్స్ లో పవన్ కల్యాణ్ ఓ పోస్ట్ పెట్టారు. దేవాలయాలు, సైన్స్ మధ్య ఉన్న బంధాన్ని భారత చరిత్ర, దేశ సంస్కృతుల్లో కనపడుతూనే ఉంటాయన్నారు. ఆలయాలకు.. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధం స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు. వివిధ ప్రదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనల్ని అనుసంధానం చేస్తుందన్నారు. ఆలయాలు వాటి గోడలలో కూడా తరతరాలుగా జ్ఞానం నిక్షిప్తమై ఉందని పవన్ అన్నారు. సంస్కృతి, విజ్ఞానానికి కేంద్రాలుగా దేవాలయాలు భాసిల్లేవనే గుర్తుచేశారు. ఆలయాలు సైన్స్, ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేసేవి.. అంతరాలను తగ్గించేవి అంటూ తన ట్విట్టర్ హ్యాడిల్లో ఓ వీడియోను జనసేన అధినేత షేర్ చేశారు .
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్లు.. ఎట్టకేలకు తిరిగి రాబోతున్నారు. వారిని తీసుకొచ్చేందుకు స్పేస్-ఎక్స్ ప్రత్యేక మిషన్ చేపట్టింది. శనివారం ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి క్రూ-9 స్పేస్క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపింది.
ఈ లాంచ్ప్యాడ్ నుంచి చేపట్టిన తొలి మానవ సహిత స్పేస్ఫ్లైట్ ఇదే. బోయింగ్ స్టార్లైనర్ ద్వారా సునీతా విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్కి చేరుకోగా, తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇద్దరు వ్యోమగాములు గత 100 రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా స్పేస్-ఎక్స్ క్రూ-9 స్పేస్క్రాఫ్ట్ను పంపుతున్నది. ఫిబ్రవరి 2025లో స్పేస్క్రాఫ్ట్ తిరుగు ప్రయాణంతో ఇద్దరు వ్యోమగాముల్ని భూమి మీదకు తీసుకొస్తారు.

ప్రాణాంతక వైరస్గా డబ్ల్యూహెచ్వో ఇటీవల ప్రకటించిన మంకీపాక్స్ క్లేడ్-1బీ రకం వైరస్ భారత్లో ప్రవేశించింది. కేరళలో మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏండ్ల వ్యక్తికి గతవారం ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి మ నీశ్ వర్మ సోమవారం మీడియాకు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని గతవారం కేరళ ప్రభుత్వం మంకీపాక్స్ అనుమానిత కేసుగా గుర్తించి, ఐసోలేషలో ఉంచింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భారత్లో ఇప్పటివరకు 30 ఎంపాక్స్ కేసులు వెలుగులోకి రాగా, అవన్నీ క్లేడ్-2 రకానికి చెందినవిగా వైద్య పరీక్షలో తేలింది. డబ్ల్యూహెచ్వో 2022 నుండి మంకీపాక్స్ను ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’గా ప్రకటించినప్పటి నుండి భారతదేశంలో 30 కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేరిన మంకీపాక్స్ రోగి డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు.

ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చే అవకాశాలున్నాయి. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు దారుణమైనదని సుప్రీంకోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 ఏళ్ల యువకుడు వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకూ పంపలేదని కోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది.

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు ఘటనాస్థలంలోనే మరణించారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంట గ్రామ సమీపంలో అర్థరాత్రి ఒక లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నార్పల నుంచి అనంతపురం కి పప్పుల లోడుతో వస్తున్న లారి.. కారును ఢీ కొట్టింది. ప్రమాదం లో మృతి చెందిన నలుగురు యువకులు కూడా అనంతపురం పట్టణానికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మృతులతా 24 ఏళ్ల లోపు ఉన్నవారే. మృతులను బలిజ పవన్, చాకలి పవన్, దాసరి శ్రీనివాసులు, ముస్తఫాగా గుర్తించారు. మృతులంతా కూడా స్నేహితులు కావడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

వాయుసేనలో అపార అనుభవం, వ్యూహకర్తగా గుర్తింపు అందుకున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్సింగ్ భారత్ వాయుసేన తదుపరి చీఫ్గా నియమితులయ్యారు. వాయుసేన ప్రస్తుత అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ నెల 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ మేరకు శనివారం రక్షణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అమర్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ‘ఇండియన్ ఎయిర్ఫోర్స్’ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఉన్నారు. 1964 అక్టోబర్ 27న జన్మించిన ఆయన భారత వాయుసేనలో యుద్ధ విమానాల పైలట్గా 1984లో కెరీర్ ఆరంభించారు. గత 40ఏండ్లుగా వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కు చెందిన అధికారిక యూట్యూబ్ ఛానల్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అందులో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ యూట్యూబ్ ఛానల్లో అమెరికాలోని రిపిల్ ల్యాబ్స్కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఆర్పీని ప్రచారం చేస్తూ వీడియోలు కన్పించాయి. శుక్రవారం ఉదయం నుంచి ఈ సమస్య తలెత్తింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఐటీ విభాగం చర్యలు చేపట్టింది. జాతీయ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ను సంప్రదించడంతో ప్రస్తుతానికి ఈ ఛానల్ లింక్ను తొలగించారు. ఈ యూట్యూబ్ ఛానల్ లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసులతో పాటు కొన్ని కీలక కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 విక్రయాలు నేటినుంచి ప్రారంభమయ్యాయి. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు యాపిల్ స్టోర్ల ముందు భారీగా క్యూ కట్టారు. ముంబై, ఢిల్లీతో సహా పలు యాపిల్ స్టోర్ల బయట కొనుగోలుదారులు పెద్దఎత్తున బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ ప్రొ మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను యాపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో వచ్చింది. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది.

పశ్చిమబెంగాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. ఈ వరదల వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్యామ్ల వద్ద డ్రెడ్జింగ్ చేయడంలో విఫలమైందని.. అందువల్లే బెంగాల్లోని పలు జిల్లాల్లో వరదలు సంభవించాయని ఆరోపించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఝార్ఖండ్ -బెంగాల్ సరిహద్దులో మైథాన్, పంచేత్ల వద్ద డీవీసీ డ్యామ్లు ఉండగా.. డీవీసీ ఈ ఏడాది 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడమే తాజా పరిస్థితికి కారణమని ఆమె ఆరోపించారు. గురువారం పశ్చిమ మేదినీపుర్ జిల్లాలోని పష్కురా వద్ద వరద పరిస్థితులను పరిశీలించిన దీదీ.. డీవీసీతో అన్ని సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించారు. వరదలతో నష్టపోయిన వారందరికీ తగిన సహాయ సామగ్రి అందించేలా అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్జడ్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నేహారెడ్డి అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. నిర్మాణాల కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు లేవని గుర్తు చేస్తూ రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యలు ఆపవద్దని జీవీఎంసీకి సూచించింది. అక్రమ నిర్మాణం విషయంలో ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలతో స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నేహారెడ్డి తరపున న్యాయవాది చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
విశాఖలో అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనంలో బుధవారం మరోసారి విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, జీవీఎంసీ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డిఏ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు ఎన్డిఏ శాసనసభా పక్ష నేతలు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేయనున్నారు. రేపు CK కన్వెన్షన్ మంగళగిరిలో నిర్వహిస్తున్న ఎన్డిఏ శాసనసభాపక్ష సమావేశo జరగనుంది. ఈ సమావేశానికి 164మంది ఎన్డిఏ మిత్ర పక్ష శాసన సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్.. పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కిలో మీటర్ల దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మొదటి వంద కిలోమీటర్లు మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీలో తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో గ్రామంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని లోకేష్ శిలాఫలకంలో పొందుపరిచి ఆవిష్కరించారు. మంత్రి హోదాలో ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ప్రభుత్వ ఆస్పపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కావాల్సిన యంత్రాలు, పడకలు, ప్రత్యేకమైన నీటి శుద్ధి పరికరాలను కేంద్రంలో ఏర్పాటు చేశారు. గతంలో బంగారుపాళ్యంతో పాటు అరగొండ, ఐరాల తదితర ప్రాంతాలకు చెందిన 72 మంది డయాలసిస్ రోగులు ప్రస్తుతం చిత్తూరుకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ బాధలు తొలగిపోనున్నాయి.

పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ PHC డాక్టర్లు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా PHC వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. దీంతో విజయవాడలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు శనివారం అత్యవసర సేవలు మినహా ఇతర సేవలకు డాక్టర్లు హాజరుకాలేదు. పీహెచ్సీ వైద్యులు చేపట్టిన సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ తెలిపారు. ఏపీ ఎన్జీవో, స్టాఫ్ నర్స్, సీహెచ్వో, ఎంఎల్హెచ్పీ సంఘాలు కూడా ఈ నిరసనకు సపోర్ట్ ఇచ్చాయి. నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొంటామని పీహెచ్సీ వైద్యులు స్పష్టం చేశారు. పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటా కుదింపు నిర్ణయం దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు. గ్రామీణ, గిరిజన ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో ఇన్సర్వీస్ కోటాను తెచ్చినట్టు వారు గుర్తు చేశారు.

శనివారం హైతీలో గ్యాసోలిన్తో వెళ్తున్న ట్యాంకర్ ట్రక్కు బోల్తాపడి పేలి 15 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి వ్యాఖ్యానించడానికి హైతీ అధికారులు సుముఖత చూపించలేదు. హైతీలోని ఆసుపత్రుల్లో తీవ్రంగా కాలిన రోగులకు చికిత్స చేయడానికి తగిన సౌకర్యాలు లేవు. ఈ ఘటన బలూచిస్థాన్ లోని జోబ్ జిల్లాలోని ధన సార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కోట్ల జనాభా ఉన్న ఈ దేశం కూడా ఇంధన కొరతతో సతమతమవుతోంది. ముఠాల మధ్య తగాదాల కారణంగా దేశంలోకి వస్తువులను దిగుమతి చేసుకోవడం కష్టతరంగా మారింది. 60,000 మంది జనాభా ఉన్న మిరాగోనేలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతం మూడేళ్ల క్రితం శక్తివంతమైన భూకంపం బారిన పడింది.
శనివారం హైతీలో గ్యాసోలిన్తో వెళ్తున్న ట్యాంకర్ ట్రక్కు బోల్తాపడి పేలి 15 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి వ్యాఖ్యానించడానికి హైతీ అధికారులు సుముఖత చూపించలేదు. హైతీలోని ఆసుపత్రుల్లో తీవ్రంగా కాలిన రోగులకు చికిత్స చేయడానికి తగిన సౌకర్యాలు లేవు. ఈ ఘటన బలూచిస్థాన్ లోని జోబ్ జిల్లాలోని ధన సార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కోట్ల జనాభా ఉన్న ఈ దేశం కూడా ఇంధన కొరతతో సతమతమవుతోంది. ముఠాల మధ్య తగాదాల కారణంగా దేశంలోకి వస్తువులను దిగుమతి చేసుకోవడం కష్టతరంగా మారింది. 60,000 మంది జనాభా ఉన్న మిరాగోనేలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతం మూడేళ్ల క్రితం శక్తివంతమైన భూకంపం బారిన పడింది.

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో 9 మంది సజీవ సమాధి అయ్యారు. మీరట్లోని జాకీర్ కాలనీలో భవనం కూలిపోయింది. ఇప్పటివరకు 9 మంది చనిపోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షం కురుస్తున్నప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యాయి.
శిథిలాల కింద 14 మంది చిక్కుకుపోయారని జిల్లా కలెక్టర్ దీపక్ మీనా వెల్లడించారు. వారిలో ఎనిమిది మందిని రక్షించామన్నారు. మిగిలిగినవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగిందని తెలిపారు. కాగా, ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

వైసీపీ చీఫ్ జగన్తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్ అయేషా బానుకు ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉండి జగన్తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్కు ఛార్జిమెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్ జగన్తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్కు ఛార్జిమెమో ఇవ్వడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని ఆరోపించింది.

దేశ వ్యాప్తంగా గణేశ్ ( నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ ఇళ్లలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలోనూ గణపతి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇక ఈ పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
తమ నివాసానికి వచ్చిన ప్రధానికి సీజేఐ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ సంప్రదాయాన్ని అనుసరించారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ, కుర్తాపైజామా ధరించి పూజలో పాల్గొన్నారు. ఈ పూజకు సంబంధించిన ఫొటోను మోదీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. విఘ్నేశ్వరుడు మనందరికీ ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లో ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్ప పీడనం ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు.. తీవ్ర వాయుగుండం ప్రభావానికి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరంలో అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లిలో 13.4, ముంచింగిపుట్టులో 13.3, గంగవరంలో 12.4, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షం పడింది.

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టీడీపీ తెలంగాణ అధ్యక్షురాలి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెను రాజ్యసభకు పంపిస్తారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టేందుకే సుహాసినికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. నందమూరి సుహాసిని ఏపీ రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా గతంలో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట లేదంటే మరో నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు. అయితే తాజాగా సుహాసినికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది .

మధ్యప్రదేశ్లోన్ జబల్పూర్లో పెను ప్రమాదం తప్పింది. ఇండోర్-జబల్పూర్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి.ఇండోర్ - జబల్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రెండు కోచ్లు పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇండోర్ - జబల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు జబల్పూర్ రైల్వే స్టేషన్లోని ఆరో నెంబర్ ప్లాట్ ఫామ్కు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్లాట్ ఫామ్పై ఆగుతున్న సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో ఆ లైన్లో వెళ్లాల్సిన ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రైలు దిగడానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకు రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను మళ్లీ ట్రాక్పైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రైలు జబల్పూర్ స్టేషన్కు చేరుకోబోతుండగా దాని రెండు కోచ్లు పట్టాలు తప్పాయని రైల్వే పీఆర్వో హర్షిత్ శ్రీవాత్సవ చెప్పారు. ఆ సమయంలో రైలు వేగం గంటకు 5 కిలోమీటర్లుగా ఉందన్నారు. అందువల్ల పెద్ద ప్రమాదం జరుగలేదని తెలిపారు. అయితే ప్రమాదం జరుగడానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. కాగా, రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన ఇతర రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ముంపు బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ. 6 కోట్ల సాయం ప్రకటించారు. ఇందులో రూ. కోటి చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంద జేశారు. విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబును కలిసిన పవన్... పలు అంశాలపై చర్చలు జరిపారు. సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈక్రమంలో పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పవన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వరద బాధితుల సహాయార్థం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇటీవల భారీ విరాళం ప్రకటించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానన్నారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.కోటి ఇస్తానని వెల్లడించారు.

రష్యా నిఘా తిమింగలంగా వార్తల్లోకెక్కిన ‘హ్వాల్దిమిర్’ అనే బెలుగా తిమింగలం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 14 అడుగుల పొడవు, 2,700 పౌండ్ల బరువు కలిగిన ఇది ఆగస్టు 31న స్టావంజర్ దగ్గరలోని బే ఆఫ్ రిసవికాలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. 2019లో ఉత్తర నార్వేలోని హామర్ఫెస్ట్ సమీపంలో మొదటిసారిగా ఈ తిమింగలం కనిపించింది. దానికి నార్వే నుంచి ‘హ్వాల్’, రష్యా నుంచి ‘వాల్దిమిర్’ పేర్లు కలిపి ‘హ్వాల్దిమిర్’ అని పెట్టారు. దీని మెడకు సెయింట్ పీటర్స్ బర్గ్ అనే లేబుల్ ఉండడంతో ఇది రష్యా నిఘా వర్గంలో భాగమనే ఊహాగానాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి రష్యా స్పైగా వార్తల్లోకెక్కింది. అయితే.. వీటిపై స్పందించిన రష్యా అది తమ వేల్ కాదని స్పష్టం చేసింది.
మెరైన్ మైండ్ వ్యవస్థాపకుడు, హ్వాల్దిమిర్ సంరక్షణ బాధ్యతలు చూసుకునే సెబాస్టియన్ స్ట్రాండ్ దీని మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. దీని మరణం నార్వేలోని వేలాది మంది ప్రజల హృదయాలను తాకిందన్నారు. మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హ్వాల్దిమిర్ మృతికి ముందు ఎంతో ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు.

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంది ప్రవహిస్తున్నాయి. పీలేరు వాగుకు వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని నాగులేరు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

విత్తనాలు కొని డబ్బులు చెల్లించడం మరిచిపోయిన వ్యక్తి పట్ల దుకాణ యాజమాని అమానవీయంగా ప్రవర్తించాడు. శుక్రవారం గుజరాత్లోని గోద్రాలో జరిగిన ఈ ఘటనలో దుకాణం యజమాని, మరో ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు, బాధితుడిపైనా కేసు నమోదు చేయటం గమనార్హం. కిశోర్ బావ్రీ అనే వ్యక్తి కాకర విత్తనాలు కొని డబ్బులు చెల్లించటం మర్చిపోయాడు. దుకాణ యజమాని పార్మర్ అడిగిన వెంటనే రూ.500 చెల్లించాడు. అయినా, కోపంతో ఊగిపోయిన పార్మర్ మరో ఇద్దరిని పోగేసి కిశోర్ని తాళ్లతో కారు బ్యానెట్పై కట్టేసి, రోడ్లపై తిప్పాడు.

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ శుక్రవారం భాజపాలో చేరారు. రెండు రోజుల క్రితమే జేఎంఎం పార్టీకి రాజీనామా చేసిన ఆయన కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, ఝార్ఖండ్ భాజపా అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో చంపయీ సోరెన్ తన మద్దతుదారులతో కలిసి పార్టీలో చేరారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చంపయీ.. కొంతకాలంగా ఆ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి చంపయీ వైదొలగారు. సీఎం పగ్గాలు మళ్లీ హేమంత్ సోరెన్ చేతికి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో సొంత పార్టీ అధినాయకత్వంపై చంపయీ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

అమెరికా పర్యటనలో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పటికే స్టాలిన్ ప్రయాణిస్తున్న విమానం చాలా దూరం వెళ్లింది. దీంతో ఆ విమానం దుబాయ్ చేరుకునేంత వరకు ఎయిర్పోర్టు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందారు. దుబాయ్లో ఆ విమానం ల్యాండ్ అయ్యాక బాంబ్స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబులు లేవని నిర్ధరించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన BRS MLC కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈరోజు(మంగళవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈ కేసులో మార్చి 15న అరెస్టైన కవిత 153 రోజులు తిహార్ జైలులో ఉన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. ఇంట్లో సోదాలు నిర్వహించి, మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిదంటే..?
ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు దిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరఫున రూ.కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా రూ.100కోట్ల ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్టు చేసింది.

తెలంగాణలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ( Teenmaar Mallanna ) అన్నారు. రిజర్వేషన్ను అమలుచేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ సర్కారు రాబోతుందని, బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్కు వినతిపత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని, మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని చెప్పారు. బీసీల సహకారంతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని ఎద్దేవా చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వనని అన్నారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందన్నారు. బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించారు. బడ్జెట్లో బీసీలకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తే తాను నిర్భయంగా ప్రశ్నించానన్నారు. వరంగల్లో వార్ రూం ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్కు వినతిపత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని, మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్-5 సీఎంల జాబితాలో నిలిచారు. ‘ఇండియా టుడే- సీ ఓటర్’ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో అనేక అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం ‘ఇండియా టుడే’ వెల్లడించింది. ఇందులో... అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో... స్టాలిన్, చంద్రబాబు నిలిచారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రెండు నెలల్లోనే చంద్రబాబు టాప్-5 ముఖ్యమంత్రుల జాబితాలోకి రావడం విశేషం. ‘‘అభివృద్ధి రాజకీయాలకు దేశంలో చంద్రబాబు చిరునామాగా ఉన్నారు. గతంలో హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిన రికార్డు ఆయన సొంతం’’ అని దీనిపై జరిగిన చర్చలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు.. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని ఈ ముఠా సభ్యులు డబ్బులు దండుకున్నారు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మోసాలకు వీళ్లు పాల్పడుతున్నారు అని తెలిపారు పోలీసులు.. ఈలాంటి వారిని నమ్మొద్దని రాచకొండ పోలీసులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఈ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను రాచకొండ మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నిందితుల్ని మీడియా ముందు రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు ప్రవేశ పెట్టినున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతైన విచారణ చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తుపై సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. బెయిల్ దరఖాస్తులో ఇచ్చిన వాదనలను దర్యాప్తు సంస్థ వ్యతిరేకించింది. నేడు ఈ అంశంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ కింగ్పిన్ అని సీబీఐ పేర్కొంది. నిర్ణయాలన్నీ అతని సమ్మతి, దిశానిర్దేశంతో తీసుకున్నందున ఈ స్కామ్ గురించి అతనికి ప్రతిదీ తెలుసని సీబీఐ పేర్కొంది. కానీ దర్యాప్తు సంస్థ ప్రశ్నలకు వారు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడం లేదని తెలిపింది. దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని సీబీఐ ఆరోపించింది. అందువల్ల దర్యాప్తు కీలకమైన ఈ తరుణంలో కేజ్రీవాల్ను బెయిల్పై విడుదల చేయడం ఏ కోణంలో చూసినా సమర్థనీయం కాదని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ చేపట్టనుంది. ఆగస్టు 14న జరిగిన చివరి విచారణలో, బెంచ్ సీబీఐకి నోటీసు జారీ చేసింది. కేజ్రీవాల్ దరఖాస్తుపై సమాధానం కోరింది. ఐదు నెలల క్రితం మార్చి 21న కేజ్రీవాల్ను ఇడి అరెస్టు చేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా మే 20 నుంచి జూన్ 1 వరకు ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్ 2న అతను తీహార్ తిరిగి రావాల్సి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు వాయిదా చేసినట్టు తెలిపింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో మొత్తం 1,48, 881 మంది ఈ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 4,496 మంది మాత్రమే మెయిన్స్కు అర్హత సాధించారు.

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. దాడి రోజు వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే ఇదే కేసులో వైసీపీ నేత దేవినేని అవినాశ్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న మరియా బ్రన్యాస్ 117 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అమెరికాలో జన్మించిన స్పెయిన్ దేశస్థురాలైన బ్రన్యాస్ తాను కోరుకున్నట్లే మంగళవారం నిద్రలో ఎలాంటి బాధ లేకుండా మరణించారు. ఆమె కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది ఫ్రాన్స్కు చెందిన లూసిల్ రాండన్మరణించిన అనంతరం వయోవృద్ధుల అధ్యయన బృందం బ్రన్యాస్ను ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ప్రకటించింది.బ్రన్యాస్ తరువాతి స్థానంలో జపాన్కు చెందిన టోమికో ఇతోకా ఉన్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో 1907 మార్చి 4న బ్రన్యాస్ మరియా జన్మించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె కుటుంబం స్పెయిన్లో స్థిరపడింది. ఆ సమయంలో అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటిన అనుభవాలను బ్రన్యాస్ పంచుకునేవారు. 113 ఏళ్ల వయసులో ఆమె కరోనా నుంచి కోలుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com



