చిట్టి న్యూస్

Johnny Master : జాలి గుండె చాటుకున్న జానీ మాస్టర్

పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలైన సినిమా డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ తన పెద్దమనసు చాటుకున్నారు. యాక్సిడెంట్‌ అయిన వ్యక్తిని దగ్గరుండి 108లో ఆస్పత్రికి తరలించారు. జానీ మాస్టర్‌ హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా.. ఒక వ్యక్తి యాక్సిడెంట్‌ అయి తీవ్ర గాయాలతో పడిఉండటాన్ని గమనించారు. దాంతో జానీ మాస్టర్‌ తన కారు ఆపి..108కి ఫోన్‌ చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. జానీ చేసిన సాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసుల ఒత్తిడిలో ఉండి కూడా ఇలా సాయం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు.

ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ మహేశ్వరరావు కుంచం, జస్టిస్‌ తూట చంద్ర ధనశేఖర్‌ ప్రమాణం చేశారు.


FIRE ACCIDENT: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ అబిడ్స్‌ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్‌ టేక్డీలోని ఓ టపాసుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీపావళి పర్వదినానికి ముందు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారాస్ బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు.

జనగామలోనూ..

జనగామ జిల్లా కేంద్రంలోని షాపింగ్‌ మాల్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. విజయ షాపింగ్‌ మాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి కాంప్లెక్స్‌ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విలువైన వస్ర్తాలు కాలి బూడిదయ్యాయి. రూ.15 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 12 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. అగ్నిమాపకశాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,746 కోట్లు

ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో బ్యాంక్‌ లాభం రూ.11,746 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి రూ.47,714 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ ఆదాయం (NII) 9.5శాతం పెరిగి రూ.18,308 కోట్ల నుంచి రూ.20,048 కోట్లకు చేరినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.97శాతానికి తగ్గాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆస్తులు 2.48శాతంగా ఉండేవి. నికర నిరర్థక ఆస్తులు 0.43శాతం నుంచి 0.42శాతానికి చేరాయని వెల్లడించింది.

Tamil Nadu : వర్షాలు, వరదలతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరి

భారీ వర్షాలతో తమిళనాడులోని ప్రధాన నగరాలు అతలాకుతలమయ్యాయి. ఏడు జిల్లాలకు వాతావరణ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. కొద్ది రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు నమోదవుతుండగా తాజాగా దానా తుపాను ప్రభావం కూడా కనిపిస్తోంది. రెండ్రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధురైలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మదురైలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల వారిని తరలించింది. సహాయక చర్యలను చేపట్టింది. మదురై కలెక్టర్‌తో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

New Semi High-Speed Rail : శంషాబాద్ టు వైజాగ్.. 4 గంటలే ప్రయాణం

శంషాబాద్ నుంచి వైజాగ్‌కు కేవలం 4 గంటల్లోనే చేరుకునే సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌ ఎలైన్‌మెంట్ ఖరారైంది. గంటకు 220KM వేగంతో దూసుకెళ్లే ఈ రైలు విజయవాడ మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. ఈ రూట్‌లో మొత్తం 12 స్టేషన్లుంటాయి. సర్వే తుది దశకు చేరగా నవంబర్‌లో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ను నిర్మించనున్నారు.

ఏపీ, తెలంగాణలో మొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ఇదే కావడం విశేషం. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించనున్నారు. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా డిజైన్‌ చేస్తున్నారు.

ఈ సెమీ హైస్పీడ్ కారిడార్ పూర్తయితే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్- విశాఖ మధ్య రైలు ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ మాత్రం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటోంది. సికింద్రాబాద్‌ -విశాఖ మధ్య ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంలో ఒకటి.. నల్గొండ, గుంటూరు, విజయవాడ ఈ మార్గం రెండోది.

Tirupati: తిరుపతిలో మరో‌సారి బాంబు బెదిరింపుల కలకలం

తిరుపతిలోని రాజ్‌ పార్క్‌ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రాజ్ పార్క్ హోటల్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు

Nara Lokesh: శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేశ్‌కు అపూర్వ స్వాగతం

ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేశ్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేశ్ అగ్ర‌రాజ్యంలో పర్యటిస్తారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 

పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అక్కడి తెలుగు ప్రముఖులు, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేశ్‌కి స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారిలో  ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇంచార్జి రవి మందలపు, ఐటీ సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీశ్‌ మండవ, సురేశ్‌ మానుకొండ ఎయిర్ పోర్టులో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం పలికిన ఉన్నారు.

ఇక 2000 సంవత్సరంలోనే విజన్ 2020 పేరుతో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.


TTD Instructions: శ్రీవారి కాలిబాట భక్తులు.. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి -టీటీడీ

శ్రీవారి దర్శనార్థం కాలినడక మార్గంలో తిరుమల వచ్చే భక్తుల్లో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో భక్తులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తితిదే శుక్రవారం ఓ ప్రకటనలో సూచించింది. ‘60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల, గుండె సంబంధిత వ్యాధులున్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదు. తిరుమల సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న కారణంగా ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవాలి. కాలినడకన వచ్చే భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1,500 మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్యసహాయం పొందవచ్చు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24 గంటలూ వైద్యసాయం అందిస్తారు. కిడ్నీల సమస్య బాధితులు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌ సౌకర్యం పొందవచ్చు’ అని తితిదే పేర్కొంది.

Aghori : పేలిన అఘోరీ కారు టైర్.. కేదార్‌నాథ్‌లో ఏం జరిగిందంటే?

టీవీ, డిజిటల్ మీడియాకు ఇంటర్వ్యూలతో పాపులరైన అఘోరీకి కేదార్ నాథ్ లో తృటిలో ప్రమాదం తప్పింది. కేదార్‌నాథ్ వెళుతుండగా అఘోరీ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయినట్టు పలు చానెళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. టైర్ పేలిందని కూడా చూసుకోకుండా 10 కిలోమీటర్లు అఘోరీ అలాగే వెళ్లిందని తెలిసింది. తర్వాత కారు ముందుకు వెళ్లకపోవడంతో వాహనాన్ని నిలిపివేసిందనీ.. డెహ్రాడూన్ నుండి ఓ భక్తులు కొత్త టైర్ తీసుకొచ్చి అఘోరీ వాహనానికి అమర్చాడని సమాచారం. ఈ విషయాన్ని అఘోరీ తనకు ఫోన్ చేసిన మీడియా సిబ్బందికి తెలియజేసింది.

Philippines : ఫిలిప్పీన్స్‌లో ట్రామి తుఫాన్‌ బీభత్సం..

ఫిలిప్పీన్స్‌ లో తీవ్ర తుఫాన్‌ ‘ట్రామి’ బీభత్సం  సృష్టించింది. ఈ తుఫాన్‌ కారణంగా ఉత్తర ఫిలిప్పీన్స్‌లో వరదలు సంభవించాయి. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి . ఈ ఘటనల్లో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. ఈ తుఫాన్‌ అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర ప్రావిన్స్‌లోని ఇసాబెలాలోకి ప్రవేశించినట్లు స్థానిక అధికారులను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తుఫాన్‌ ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసర సేవలు మినహా పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు. తుఫాను ధాటికి గంటలకు 95 – 100 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తున్నాయి.

దాదాపు 1,500 మంది పోలీసు అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తుఫాను ధాటికి సంభవించిన ప్రమాదాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మనీలాకు ఆగ్నేయంగా ఉన్న ఆరుప్రావిన్స్‌ బికోల్‌ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదైనట్లు పేర్కొన్నారు.

JK: జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ వాహనం టార్గెట్​గా   దాడి..

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లతో పాటు మరో ఇద్దరు సామాన్య పౌరులు మృతి చెందారు. 18 రాష్ట్రీయ రైఫిల్స్‌కి చెందిన వాహనమే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపారు.

బారాముల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు సైనికులు మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో ఇద్దరు పౌరులు కూడా మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు వర్గాలు తెలిపాయి. బారాముల్లాలోని బుటాపత్రి సాధారణ ప్రాంతంలో సైనికులు మరియు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు ఎక్స్‌లోని ఒక పోస్ట్‌లో భారత సైన్యం ధృవీకరించింది. బుటాపత్రిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు తొలుత దాడి చేశారు. ఒక కార్మికుడు గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీతమ్ సింగ్‌గా గుర్తించారు.

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు.. ఇన్నోవా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలుకు చెందిన పలువురు ఇన్నోవా కారులో తిరుపతికి వెళుతుండగా.. రైల్వే కోడూరు మండలం రాజానగర్ సమీపంలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సును ఢీకొట్టడం జరిగింది.

ఈ ఘటనలో కర్నూలు జిల్లా ఎల్లురు నగర్‌కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్ (51), రావూరి వాసవి (47), నరసింహారెడ్డి నగర్‌కు చెందిన కామిశెట్టి సుజాత (40) మృతి చెందారు. వీరంతా తిరుపతిలో రిసెప్షన్ వేడుకకు వెళుతుండగా, ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని 108 అంబులెన్స్‌లో రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


MEDICAL COLLAGE: వైఎస్‌ పేరు తొలగించి పింగళి వెంకయ్య పేరు

మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, 'పింగళి వెంకయ్య మెడికల్ కాలేజీ'గా ఏపీ ప్రభుత్వం పేరు మార్చింది. బీజేపీ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పలు విద్యాసంస్థలకు తమ ఇంట్లో వారి పేరు పెట్టుకుంటే.. తాము మాత్రం దేశ నాయకుల పేర్లు పెడుతున్నామని పేర్కొన్నారు. మచిలీపట్నం మెడికల్‌ కాలేజీకి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టాలని వైసీపీ ప్రభుత్వ హయంలోనే విజ్ఞప్తులు వచ్చాయి. కానీ జగన్‌ సర్కార్‌ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్య పేరును నిర్ణయించిన సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Fire In Metro Station: మెట్రో స్టేషన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

పూణెలోని మండై మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు రాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దాంతో అక్కడి ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన మెట్రో అధికారులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దాంతో ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని ఐదు నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో నీటిని చల్లి మంటలను ఆర్పారు . ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్‌లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయని చెప్పారు. కాగా, మెట్రో స్టేషన్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ట్వీట్‌ చేశారు.

ACCIDENT: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ప్రమాదం తప్పింది. దత్తాత్రేయ ఢిల్లీ వెళ్లేందుకు తన కాన్వాయ్ లో శంషాబాద్ వెళుతుండగా… ఫ్లైఓవర్ దాటి ఎయిర్‌ పోర్ట్‌కు ప్రవేశించే సమయంలో తన కాన్వాయ్ వెనుక వస్తున్న మరో వ్యక్తి కారు కాన్వాయ్ ని ఓవర్టేక్ చేయబోయి సడన్ బ్రేక్ వేశాడు. దీంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ కారు ముందుకు వెళ్ళిపోయింది. కాన్వాయ్ లోని మిగిలిన రెండు కార్లు, ఒక అంబులెన్స్ ఒకదానినొకటి ఢీకొనడంతో కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Blast In Delhi: ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వ‌ద్ద పేలుడు..

ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ బౌండరీ వాల్ దగ్గర భారీ పేలుడు శబ్దం వినిపించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని కూడా సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదు.ఈ సంద‌ర్భంగా ప్ర‌త్య‌క్ష సాక్షి మాట్లాడుతూ.. నేను ఇంట్లో ఉండ‌గా, భారీ శ‌బ్దం వినిపించింది. బ‌య‌ట‌కు వ‌చ్చి చూడగా స్కూల్ స‌మీపంలో పొగ‌లు ద‌ట్టంగా క‌మ్ముకున్నాయి. ఆ దృశ్యాల‌ను త‌న ఫోన్‌లో రికార్డు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఇంత‌కు మించి త‌న‌కు ఏమి తెలియ‌ద‌న్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

CRIME: ఇంటర్‌ విద్యార్థినిని హత్య చేసిన ఉన్మాది..!

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో దారుణం జరిగింది. ఇంటర్‌ విద్యార్థిని ఓ ఉన్మాది హత్య చేశాడు. సన్నీ అనే యువకుడు కొంతకాలంగా అశ్విని అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతి తరచూ నిరాకరిస్తుండటంతో కోపంతో ఊగిపోయిన సన్నీ.... ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విద్యార్థిని అశ్విని నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. అశ్విని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

SUCIDE: ప్రేమ జంట బలవన్మరణం

గుంటూరు జిల్లాలో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెదకాకాని వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్‌(22), శైలజ(21)గా గుర్తించారు. పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్‌, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా చదివిన మహేశ్‌.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌లో పని చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. 10 రోజుల క్రితం యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దసరా సమయంలో శైలు, మహేశ్‌ ఇంట్లో చెప్పకుండా బయటకెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై విగత జీవులుగా కనిపించారు.

High Court: భారత్‌ మాతా కీ జై అంటేనే బెయిల్‌.. నిందితుడికి తిక్క కుదిర్చిన హైకోర్టు

భారత వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసిన ఓ నిందితుడికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు తిక్క కుదిర్చింది. అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఊహించని షరతులు విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 17న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. భోపాల్‌ సమీపంలోని మిస్రోద్‌లో ఓ పంక్చర్‌ షాప్‌ నిర్వహించే ఫైసల్‌ఖాన్‌ ఆ వీడియోలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌”, ‘భారత్‌ ముర్దాబాద్‌’ అని నినాదాలు చేయడం కనిపించింది. దీంతో అతడిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫైసల్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.

ఈ కేసులో తాజాగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ పలివాల్‌ అతడికి బెయిలు మంజూరు చేస్తూ.. ఫైసల్‌ తన దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలని షరతు విధించారు. జాతీయ జెండాకు 21సార్లు వందనం చేయాలని, నెలకు రెండుసార్లు ‘భారత్‌ మాతా కీ జై’ అని నినదించాలని షరతులు పెట్టారు. కేసు ముగిసే వరకు ప్రతినెల మొదటి, నాలుగో మంగళవారం మిస్రోద్‌ పోలీస్‌ స్టేషన్‌లోని జెండా స్తంభం వద్ద ఇలా చేయాలని ఆదేశిస్తూ ఫైసల్‌కు బెయిలు మంజూరు చేశారు.

IND vs NZ:   భారత బ్యాటర్లు ఘోర  వైఫల్యం,  46 కి ఆలౌట్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్లుగా పెవిలియన్‌ బాట పట్టడంతో 46 పరుగులకే టీమ్‌ ఇండియా అలౌట్‌ అయింది. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ కాగా.. ఇద్దరు (జైస్వాల్‌ - 12, పంత్‌ - 20) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టిమ్‌ సౌథీ ఒక వికెట్‌ తీసుకున్నాడు.

Haryana : హర్యానా సీఎంగా నేడు సైనీ ప్రమాణం

 హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన హర్యానా సీఎంగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ విజయం సాధిస్తే సైనీయే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎన్నికల అనంతరం బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు సీఎంగా ఉన్న మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను తొలగించిన బీజేపీ మార్చిలో సైనీని ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన నాయకత్వంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, విపక్ష కాంగ్రెస్‌ 37 సీట్లకే పరిమితమైంది.

THEFT: శ్లోకం చదువుతండగా గొలుసు లాక్కెళ్లాడు

బెంగుళూరులో షాకింగ్ ఘటన జరిగింది. గుడిలో అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఆమె తేరుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యాడు. బెంగుళూరులోని శంకర్ నగర్‌లోని గణేష్ ఆలయంలో మహిళలంతా అమ్మవారి శ్లోకాలు చదువుతున్నారు. గుడిలో కిటికీ పక్కన కూర్చుని శ్లోకాలు చదువుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు. ఆమె తేరుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న మహిళలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Boeing :  సమ్మె ఎఫెక్ట్‌.. బోయింగ్‌ సంస్థలో 17వేల ఉద్యోగాల కోత

ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టం కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఏకంగా 17వేల మంది సిబ్బందిపై వేటు వేయనుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10శాతం మందిని తొలగించనుంది.

సియాటెల్‌ ప్రాంతంలో 33,000మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకొనేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్‌ అన్నారు. ‘‘ రానున్న నెలల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10శాతం మందిని తగ్గించాలని చూస్తున్నాం. వీరిలో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు ఉండనున్నారు’’ అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం బోయింగ్‌ ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయాత్మక చర్యలు అవసరం అని బోయింగ్‌ తెలిపింది. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవడానికి ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరం అని పేర్కొంది. సమ్మె ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో 777X జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నట్లు బోయింగ్‌ తెలిపింది. 2026లో వీటి డెలివరీలు అందిస్తామని వెల్లడించింది. ప్రస్తుత ఆర్డర్లను పూర్తి చేసిన తర్వాత 2027లో 767 ఫ్రైటర్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని బోయింగ్‌ యోచిస్తోంది. ఈనేపథ్యంలో బోయింగ్‌ షేర్లు 1.1శాతం క్షీణించాయి. భారీ స్థాయిలో ఉద్యోగు

Team India Players:  జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న తిల‌క్ వ‌ర్మ‌, నితిశ్ కుమార్

బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్న విష‌యం తెలిసిందే. ఇవాళ‌ విజ‌య ద‌శ‌మి కావ‌డంతో తెలుగు ప్లేయ‌ర్లు తిల‌క్ వ‌ర్మ‌, నితిశ్ కుమార్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ‌త‌ల్లిని ద‌ర్శించుకున్నారు. శ‌నివారం అమ్మ‌వారి ఆల‌యంలో ఈ ఇద్ద‌రు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఇక ఈ రోజు రాత్రి 7 గంట‌ల‌కు ఉప్ప‌ల్ వేదిక‌గా బంగ్లా, భార‌త్ ఆఖ‌రిదైన మూడో టీ20లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవ‌సం చేసుకుంది. చివ‌రి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాల‌ని భార‌త జ‌ట్టు చూస్తోంది. మ‌రోవైపు బంగ్లా టైగ‌ర్స్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని భావిస్తోంది.

AP : అనంతలో మద్యం టెండర్ల వేళ కిడ్నాప్ కలకలం

అనంతపురం జిల్లా మద్యం టెండర్ల వేళ అధికార పార్టీ నేతల దౌర్జన్యకాండ వెలుగు చూసింది. యాడికి మండల కేంద్రంలో మద్యం టెండర్‌ దాఖలు చేసిన వ్యక్తిని అధికార పార్టీ నేతలు కిడ్నాప్ చేశారు. అతని ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఆ వ్యక్తిని వదిలిపెట్టారు. ఈ ఘటన జిల్లాలో పెను సంచలనంగా మారింది.

Tirumala:  గజవాహనంపై భక్తులకు అభయమిస్తున్న శ్రీనివాసుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన బుధవారం రాత్రి మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను అలరించాయి. పెద్ద సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు. వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా గజాలు ఆకర్షణగా నిలిచాయి. ఆలయ గజాలైన లక్ష్మి, మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి నేతృత్వంలో మలయప్ప వాహన సేవల వైభవాన్ని పెంచింది. రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ పాల్గొన్నారు.

ఏపీ బీజేపీ నేతల నగ్న వీడియోలు  హల్ చల్

 గుంటూరు జిల్లాకు చెందిన ఓ నేత నగ్న వీడియోకాల్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ పార్టీకే చెందిన ఓ మహిళతో ఆయన వీడియోకాల్‌లో మాట్లాడుతూ అందులో నగ్నంగా కనిపించారు. ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ చేసి.. పార్టీ పెద్దలకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా ముఖ్య నేత నగ్న వీడియో కూడా కలకలం రేపింది. దీని వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలకు చెందిన రెండు నగ్న వీడియోలు బయటకు రావడంతో కమలం పార్టీ ఉలిక్కిపడింది. రెండు వీడియోలు సోషల్ మీడియాలో రావడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. 2022వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అప్పట్లో అది ఫేక్ వీడియో అని పోలీసుల విచారణలో తేలింది.

TTD: కన్నులపండువగా శ్రీనివాసుని గరుడ సేవ

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎంతో విశిష్టమైన గరుడ సేవ కన్నుల పండువగా జరిగింది. తిరుమల వెంకన్న మలయప్పస్వామి రూపంలో గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా వీక్షించి, తరించేందుకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. దాంతో తిరుమాడ వీధులు ఇసుకేస్తే రాలనంతగా భక్త జనసంద్రాన్ని తలపించాయి. మాడవీధుల్లో ఏర్పాటు చేసిన 231 గ్యాలరీలు భక్తులతో కిక్కిరిసిపోయారు. గరుడ వాహన సేవను భక్తులందరూ వీక్షించేందుకు వీలుగా ,టీటీడీ తిరుమల అంతటా భారీ ఎలక్ట్రానిక్ తెరలను ఏర్పాటు చేసింది. గోవింద నామ స్మరణతో తిరుమల కొండ మార్మోగింది.


భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు పంపిణీ చేశారు. భక్తజనం గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. సుమారు 3.5 లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించారు. గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. గరుడ సేవకు 400లకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిన అధికారులు.. 3వేల ట్రిప్పులు నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

SC Classification: ఎస్సీ వర్గీకరణపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

మంగళవారం సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయ్యింది. కాగా ఈ సCabinet Sub Committee On Sc Classification Meet In Today సీతక్క, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, ఏజీ సుదర్శన్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ, కులగణన తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

CBI : హత్యాచారం చేసింది సంజయ్‌ రాయ్ ఒక్కడే

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో సీబీఐ సోమవారం సీల్డాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. 200మందికి పైగా వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సీబీఐ, ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌గా తేల్చింది. రాత్రి విరామ సమయంలో దవాఖాన సెమినార్‌ హాల్‌లోకి వెళ్లిన వైద్యురాలిపై సివిక్‌ వలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌ ఘాతుకానికి పాల్పడ్డాడని సీబీఐ తెలిపింది. గ్యాంగ్‌ రేప్‌ జరిగిందా? లేదా? మరికొంత మంది ప్రమేయం ఇందులో ఉందా? అన్నది తేల్చేందుకు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొన్నది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ, దవాఖానలో విధుల్లో ఉన్న వైద్యురాలిపై లైంగికదాడి, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌ను తీవ్రంగా కుదిపేసింది. ఆగస్టు 9న వెలుగుచూసిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో అమ్మాయిల ర్యాగింగ్‌

ఆంధ్రా యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఆర్కిటెక్చర్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులను సెకండియర్ విద్యార్థినులు.. హాస్టల్‌లో డ్యాన్సులు వేయాలంటూ ర్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఈ తతంగాన్నంతా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. తమకు డ్యాన్స్ రాదని చెప్తే అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టినట్లు బాధితులు వాపోయారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. ర్యాగింగ్ సమయంలో వీడియోలు తీసి వాట్సప్ గ్రూపులలో షేర్ చేసి కామెంట్స్ చేయడంతో క్లాస్ రూంలలో ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ప్రొఫెసర్లకు చెపితే ఎక్కడ సీనియర్లు తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తారో అని భయపడిపోయారు. చివరకు మీడియాను ఆశ్రయించారు. ర్యాగింగ్ అంశం బయటకి రావడంతో ఎంక్వయిరీ చేసిన యూనివర్సిటీ అధికారులు.. 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశామన్నారు.

Dussehra Navratri: శ్రీ మహాచండీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజున నేడు దుర్గమ్మ శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయని భక్తుల నమ్మకం. సింహం భుజ‌ముల‌పై భీష‌ణంగా కూర్చొని త‌న ఎనిమిది చేతుల యందు వివిధ ర‌కాల ఆయుధాల‌ను ద‌రించి, రాక్ష‌స సంహారం గావించి లోక క‌ళ్యాణం జ‌రిపించిన దివ్య‌మైన రూపంతో భ‌క్తుల‌ను బంగారు రంగు చీరలో సాక్షాత్క‌రిస్తుంది. ఈ రోజున చండీ పారాయ‌ణం, చండీ యాగం చేస్తారు. చండీ దేవిగా ద‌ర్శ‌న‌మిచ్చే జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఈ రోజున నైవేద్యంగా తెల్ల నువ్వులు కలిపిన బెల్లం పొంగలి, వడలు నివేదిస్తారు.

మహా చండీ దేవి అలంకార విశిష్టత

చండుడు, ముండుడు అనే రాక్షసులను సంహరించిన కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చింది. దేవీ భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటువంటి వారికి గ్రహ పీడలు తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది. చాముండేశ్వరి దేవి ఆరాధన వలన, మానసిక రోగాలు, పిశాచ భయాలు తొలగిపోతాయి. అలాగే మానసిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

Maldives President: భారత పర్యటనకు  మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు భారత్‌లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం భారతదేశానికి చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌ ఆయన వెంట ఉన్నారు. నాలుగు నెలల్లో ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి అయినా, తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. జూన్‌లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్టోబరు 10 దాకా కొనసాగనున్న ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ముయిజ్జు సమావేశమవుతారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలకు తోడు ఉభయులకూ ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై వీరి మధ్య చర్చలు జరుగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ముంబయి, బెంగళూరు నగరాల్లో జరిగే వ్యాపార కార్యకలాపాలకు ముయిజ్జు హాజరవుతారు. హిందూ మహాసముద్రంలో మాల్దీవులు భారత్‌కు కీలకమైన పొరుగు దేశం. ప్రధాని మోదీ దృక్పథమైన ‘సాగర్‌’ (ప్రాంతీయంగా అందరికీ భద్రత, అభివృద్ధి) విధానంలో దీనికి ప్రత్యేస్థానం ఉంది’’ అని పేర్కొంది.  

delhi: ఇదేం చిత్రమో.. ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన మంత్రి

ఏకంగా ఒక మంత్రి.. ఎమ్మెల్యే కాళ్లు మొక్కడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీలో అచ్చంగా ఇదే జరిగింది. ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌, బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా కాళ్లపై పడ్డారు. ఎమ్మెల్యే కదలకుండా కాళ్లను గట్టిగా పట్టుకున్నారు. మార్షల్స్‌ పునరుద్ధరణ కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దగ్గరకు వెళ్లాలని కోరారు. వెంటనే మంత్రి తన కాళ్లమీద పడటంతో, ఎమ్మెల్యే షాక్‌ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కారులోనే మంత్రి భరద్వాజ్‌, లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్లారు. ఢిల్లీలోని బస్సుల్లో మార్షల్స్‌ను పునరుద్ధరించాలంటూ ఆమ్‌ఆద్మీ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే కాళ్లు పట్టుకొని లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ప్యాసింబర్‌ బస్సుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వం – సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్స్‌ అనే వ్యవస్థను రూపొందించింది. ఒక్కో బస్సులో ఒక్కో మార్షల్‌ ఉంటారు. ఇలా 10వేల మంది మార్షల్స్‌ అందుబాటులో ఉన్నారు. అయితే, ఆర్థిక భారం అవుతోందంటూ LG ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనిపైనే రోజుకోరకంగా ఆమ్‌ఆద్మీ ఆందోళన చేస్తోంది.

DELHI: నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదివారం డిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోం శాఖ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ వరద పరిహారం విషయమై కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలవొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మంత్రివర్గ విస్తరణ అంశంపై అధిష్టానంతో క్లారిటీ తీసుకుంటారని తెలుస్తోంది. సోమవారం జరిగే కేంద్ర హోంశాఖ సమావేశానికి హాజరై, తిరిగి మంగళవారం హైదరాబాద్ చేరుకోనున్నారు.