- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

ఓ వాషింగ్ మెషీన్లో తరలిస్తున్న 1.30 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన విశాఖలో కలకలం రేపింది. NADజంక్షన్లో గతరాత్రి పొద్దుపోయిన తర్వాత విజయవాడకు వెళ్తున్న ఓ మినీ వ్యాన్లోని వాషింగ్ మిషన్లో కరెన్సీ నోట్ల కట్టలు, 30 సెల్ఫోన్లను గుర్తించిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ఆ వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సరైన ఆధారాలు లేనందున CRPC41,102 సెక్షన్ల కింద... కేసు నమోదు చేశారు. అయితే ఆ నగదు, సెల్ఫోన్లు తమవేనని సోనోవిజన్ వ్యాపార సంస్థ తెలిపింది. ఇందులో పన్ను ఎగవేత, నల్లదనం, హవాలావంటి అంశాలు లేవని... ఆ సంస్థ ఎండీ భాస్కరమూర్తి స్పష్టంచేశారు. పండగ సెలవుల్లో బ్యాంకులు పరిమితులు విధించినందున నగదును తప్పనిసరి పరిస్థితుల్లో స్టాక్తోపాటు విజయవాడ బ్రాంచికి తరలించాల్సి వచ్చిందని భాస్కరమూర్తి వివరించారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లో కారు నదిలో పడి ఆరుగురు ఆది కైలాస యాత్రికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో ఆది కైలాస దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారు నదిలో పడిపోవడంతో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో మంగళవారం కారు లఖన్పూర్ సమీపంలో కాళీ నదిలో పడిపోవడంతో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. ఆది కైలాస దర్శనం తర్వాత బాధితులు తిరిగి వస్తుండగా ధార్చులా-లిపులేఖ్ రహదారిపై మంగళవారం రాత్రి ఆలస్యంగా ఈ ఘటన జరిగిందని పితోర్ఘర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) లోకేశ్వర్ సింగ్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు బెంగళూరు, ఇద్దరు తెలంగాణ, ఇద్దరు ఉత్తరాఖండ్కు చెందిన వారని సమాచారం. మృతుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి సంతాపం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం రేపిన కోడికత్తి ఘటన జరిగి అయిదేళ్లయింది. విశాఖ విమానాశ్రయంలో 2018 అక్టోబరు 25న నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి జరిగింది. ఈ దాడిని 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రచార అస్త్రంగా మార్చుకుని లబ్ధిపొందింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీను నేటికీ విచారణ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నాడు. జగన్ విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశించినా, ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి విశాఖ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానానికి చేరింది. కేసులో కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని జగన్ ఈ నెల 17న హైకోర్టును ఆశ్రయించారు. దళిత యువకుడి హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబు 6 నెలల్లోపే బయటకొచ్చారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్రెడ్డి అరెస్టయిన 5 నిమిషాల్లో బెయిల్ పొందారు. కానీ కోడికత్తి కేసులో అయిదేళ్లయినా బెయిల్ రాకపోవడం విచిత్రంగా ఉందని హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు తుది అంకానికి చేరుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని కూటగుళ్లలో యర్రదొడ్డి గంగమ్మను రకరకాల పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వాసవి కనకపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఉయాలోత్సవం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడెకల్లో అమ్మవారి ఊరేగింపులో యువకులు వినూత్నరీతిలో విన్యాసాలు చేశారు. నెల్లూరులో అమ్మవార్ల ఊరేగింపు అట్టహాసంగా సాగాయి. ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మిగా దర్శనమిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కోటదుర్గమ్మ అమ్మవారు సూర్యప్రభ సింహ వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల్లో దేవతామూర్తుల వేషాలు,బాణాసంచా కాల్పులు అట్టహాసంగా జరిగాయి. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో జమ్మి వేట మహోత్సవం వైభవంగా జరిగింది.

తెలంగాణలో విజయదశమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఆలయాల్లో జమ్మి చెట్లకు పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రావణదహణాలను ఉత్సాహంగా నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రులు ముగింపు వేళ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దసరా పండుగు పురస్కరించుకొని ప్రజలు అనేక సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. జమ్మి చెట్లకు ప్రత్యేక పూజలు, వివిధ కళా ప్రదర్శనలు, రావణ దహనాలతో ఆనందంగా జరుపుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని ఆలయ మాడవీధిలో స్వామిని ఊరేగించిన అనంతరం స్వామి ముందు జమ్మికొమ్మను పెట్టి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాపూర్ణాహుతి, అవబృత స్మపనము, శమీ పూజ, నదీహారతి, తెప్పోత్సవము, ధ్వజఅవరోహణము వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

భద్రాచలం ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములకు మహా పట్టాభిషేకం వేడుక నిర్వహించారు. సాయంత్రం గజవాహనంపై శ్రీరాముడిని, అశ్వవాహనంపై లక్ష్మణ స్వామి దసరా మండపం వద్దకు తీసుకెళ్లి షమీ పూజ, స్వామి ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం శ్రీరామ లీలా మహోత్సవంలో భాగంగా ఆలయ EO రమాదేవి రావణాసుర దహనం నిర్వహించారు. దసరా వేడుకలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్లోని బేగంపేట్లో మహా నవరాత్రి ఉత్సవ్ ముగింపు సంబరాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన వేడుకల్లో గర్భా నృత్యాలతో హోరెత్తించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బాణాసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. బాణాసంచాతో స్వాగత తోరణం, స్వస్తిక్, సిరిమల్లె చెట్టు, పున్నమినాగు వంటి ఆకారాలు రూపొందిచారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనతో లేకుండా తొలిసారి తిరుమల వెళ్లానని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తీవ్ర భావోద్వేగాని గురయ్యారు. ఈ ప్రయాణం ఎంతో భారంగా ఉందని నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్ చేశారు. దేవుడి దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాని.. తన భర్త లేకుండా తొలిసారి తిరుమలకు వెళ్లానని ఆమె అన్నారు. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వచ్చే ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లెకు వెళ్లానని... ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించిందని భువనేశ్వరి అన్నారు. ప్రతి నిమిషం భారంగా గడిచిందని, ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాని, దానిలో భాగంగా నేడు చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నానని భువనేశ్వరి ట్వీట్ చేశారు.

దసరా ఉత్సవాల్లో చివరగా రావణ దహనం చేస్తారన్న విషయం తెలిసిందే . అయితే దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన దసరా ఉత్సవాల్లో కీలక ఘటన చోటుచేసుకోనుంది. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు. ఈ ఏడాది కంగనా రనౌత్ ఢిల్లీలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. సాధారణంగా ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుంటారు.
అయితే, ఎన్నికల కారణంగా మోదీ చాలా బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని చెయ్యలేకపోతున్నారు.. అలాగే ఈ ఏడాది మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ సారి మహిళా సెలబ్రిటీ కంగనా రనౌత్ ను రావణ్ దహన్ కార్యక్రమానికి రామ్ లీలా కమిటీ ఆహ్వానించింది. ఈ మెగా ఈవెంటుకు ఆమెతో పాటు పలువురు బాలివుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారని సమాచారం..రావణ్ దహన్ కార్యక్రమాన్ని మాత్రం కంగనా చేయనున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాంలీలా మైదానంలో రావణ్ దహన్ చేసిన మొట్టమొదటి మహిళగా కంగనా నిలవనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్ఎస్విపి నిర్మించిన తేజస్ టైటిల్ రోల్లో కంగనా రనౌత్ నటించింది. సర్వేష్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 27వతేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తన నివాసంలో ఉపవాస దీక్షకు దిగారు. దసరా వేడుకలకు దూరంగా ఉన్న ఆయన ఉపవాస దీక్ష చేశారు. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారని, జైల్లో కిరాతకులుండాలి కాని ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినవాళ్లు కాదని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారని, ఆయనను మానసిక క్షోభకు గురిచేస్తుంటే తల్లడిల్లిపోతున్నారని అన్నారు. జగన్ జైల్లో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా అని నిలదీశారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని, జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. జగన్.. ఇక మీ ఆటలు సాగవని... మీ కుట్రలను ప్రజలు సాగనివ్వరని స్పష్టం చేశారు. కడుపుమండి మాట్లాడుతున్నానని, ప్రజలు జగన్ ఆటకట్టిస్తారని మోత్కుపల్లి మండిపడ్డారు.

యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం ద్వారా బాగా డబ్బులు సంపాదించవచ్చు అని మభ్యపెట్టి, పలువురి నుంచి రూ.73 లక్షలు కాజేసిన ముఠా సభ్యుల్లో ఒకరైన 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్, మోజ్ యూప్ ల పేరుతో ఈ గ్యాంగ్ ఆన్ లైన్ మోసానికి పాల్పడింది. నిందితుడు హరియాణాకు చెందిన సోనేపట్ వాసి అజయ్ కుమార్ ను గురుగ్రాంలో అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమార్ అనే వ్యక్తి గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపాడు. యూట్యూబ్ కంటెంట్ ను లైక్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించవచ్చని నమ్మించాడు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలని మభ్యపెట్టాడు. ఈ విషయంలో మోసం వంటివి ఏవి ఉండవని నమ్మబలికాడు. దీంతో కుమార్ పలుమార్లు ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ విధంగా మరికొందరినీ మోసం చేసి పెద్ద మొత్తంలో బురిడీ కొట్టించాడు. ఈ కేసులో ఇతర నిందితుల బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బు చేరవేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమార్ నుంచి రికవరీ చేసిన మొబైల్, రెండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక కేసులో నేరస్తుడి కోసం వెతుకున్న పోలీసులు తప్పుగా మరో వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. పోలీసులు పేర్కొన్న వ్యక్తిని తాను కాదంటూ అతడు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో అతడు అకారణంగా పది రోజుల పాటు జైలులో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2021లో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ప్రమోద్ శంఖావార్ అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్పై విడుదలైన అతడు కేసు విచారణ కోసం కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్ట్ 24న కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, ఘటంపూర్ స్టేషన్ పోలీసులు ప్రమోద్ శంఖావార్కు బదులు వసంత్ విహార్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ సాహుకు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతడి మొదటి పేరుతోపాటు తండ్రి పేరు ఒకటిగా ఉండటంతో కోర్టుకు హాజరుకాని నేరస్తుడు అతడేనని భావించారు.
అయితే పోలీసులు చెబుతున్న వ్యక్తిని తాను కాదని, తన తండ్రి జీవించి ఉన్నారని, వారు చెబుతున్నట్లుగా తన భార్య పేరు ఉషా కాదని సాహూ మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో పది రోజులపాటు జైలులో ఉన్నాడు. చివరకు తన ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో సెప్టెంబర్ 22న బెయిల్పై విడుదలయ్యాడు.
మరోవైపు ఈ అంశం పబ్లిక్ టాక్గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రమోద్ సాహును అరెస్ట్ చేసి జైలులో ఉంచిన పోలీస్ సిబ్బందిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిని తప్పుగా గుర్తించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు.

నవరత్నాల్లో భాగంగానే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని, మద్యం ధరలు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకెందుకని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డబ్బు మదంతో ఉన్న వాళ్లే మద్యం జోలికి వెళ్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుందని, నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బైజూస్ కంటెంట్ కోసం విద్యార్థులు, ప్రభుత్వం ఎటువంటి ఖర్చు చేయటం లేదని, దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా కుంభకోణాలు అని అంటున్న పవన్కు తెలియకపోతే.. తన వద్దకు వస్తే ట్యూషన్ చెబుతానని బొత్స ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామని తెలిపారు. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశగా 12రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఆయన..చంద్రబాబు విషయంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తాను దసరా పండుగ జరుపుకోవడం లేదని, ఉపవాస దీక్ష చేయనున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. తన రాజకీయ అనుభవంలో చంద్రబాబు ఏనాడూ.. కక్ష్య సాధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు ట్యాంక్బండ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశారు. సీఎం కేసీఆర్ను సమర్థించి తప్పుచేశానని మోత్కుపల్లి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దళితబంధు అమలు కావటం లేదని తనను చనిపోమని దళిత యువత తనకు మెసేజ్లు చేస్తున్నారని అన్నారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకోమని దళిత యువత కోరుతోంది. కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతాను. దళితులకు అన్యాయం జరిగితే గడ్డి మందు తాగి చచ్చిపోతానని కేసీఆర్ గట్టిగా ఉన్నాడు. ఆయన ఎలాగూ చావడు. నేనైనా చచ్చిపోతానని మోత్కుపల్లి అన్నారు. తన పెద్దన్న కేసీఆర్ మాటకు విలువే లేదన్న మోత్కుపల్లి మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అన్నారు. తమ ఇద్దరకీ మాటలు లేకున్నా.. దళితబంధు పెడ్తున్నాను రావాలని స్వయంగా కేసీఆర్ పిలిస్తే వెళ్లానని, దళితబంధుతో దళిత జాతికి మేలు జరుగుతోందని కేసీఆర్ను సమర్థించాని అలా సమర్థించి తప్పు చేశానని అన్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం 300 కోట్లు దాటింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఈ నెల 9 నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, మత్తు పదార్థాలు, బంగారం, వెండి, ఆభరణాలు, కానుకల విలువ 307 కోట్ల రెండు లక్షలకుపైగా ఉన్నట్లుతెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. గత 24 గంటల్లో 9.69 కోట్ల నగదు పట్టుబడగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు 105.58 కోట్ల రూపాయలు. గత 24 గంటల్లో కోటీ 35 లక్షల విలువైన మద్యం పట్టుబడగా స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ 13.58 కోట్లు. 24 గంటల్లో 72 లక్షల విలువైన..232 కిలోల గంజాయి పట్టుబడింది. ఇప్పటి వరకు మొత్తం 15.23కోట్ల విలువైన..3వేల 672 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం విలువ..145.67 కోట్ల రూపాయలు. 26.93 కోట్లు విలువైన ఇతర కానుకలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల చొక్కాలు విప్పించి దాడికి పాల్పడటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి.. టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని లోకేశ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్లు పెంచాలని ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోజుకు రెండు సార్లు లీగల్ ములాఖత్కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రోజుకు 3సార్లు లీగల్ ములాఖత్ ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరిగింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతున్నందున పిటిషన్లపై ఆయనతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుతో రోజుకు రెండు సార్లు లీగల్ ములాఖత్కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పోలాండ్లో ఓ యువకుడు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డాడు. షాపులో కొంతసేపు బొమ్మలా (మెనాక్విన్) నిలబడిన అతడు షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు. వార్సా నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇప్పటి వరకు చాలా వెరైటీ దొంగతనాలు చూసాం అందులో ఇది ఒక వింతైన రకం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఓ షాపింగ్ సెంటర్లోని జువెలరీ షాపులోకి వెళ్లాడు. అక్కడ ఎవరికీ తెలీకుండా నగల ప్రదర్శన కోసం పెట్టిన మెనాక్విన్ల మధ్య తనూ ఓ బొమ్మలా నిలబడిపోయాడు. కెమెరాల దృష్టి తనపై పడకుండా ఇలా చేశాడు. అతడు కొంచెం కూడా కదలకుండా మెదలకుండా ఉండిపోవడంతో షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించలేకపోయారు.
షాపింగ్ సెంటర్ మూసేశాక యువకుడు తీరిగ్గా తనకు కావాల్సిన నగలు చోరీ చేశాడు. ఆ తరువాత రోజు చక్కగా కస్టమర్స్ అందరితోనూ కలిసి బయటకు వెళ్ళిపోయాడు. దారిలో ఓ రెస్టారెంట్కు వెళ్లి సుష్టుగా తిని ఆపై మరో దుస్తుల షాపులో దుస్తులు కూడా చోరీ చేశాడు. కానీ అతని లక్ కలిసిరాక సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోకతప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు మరో షాపింగ్ సెంటర్లో కూడా ఇలాగే చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. నిందితుడికి 10 ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూలానక్షత్రం సందర్భంగా కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు.
భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే అంచనాతో అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి దర్శనానికి అనుమతి కల్పించారు.
భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. కొండపైకి, ఆలయ పరిసరాల్లోకి వాహనాలు రాకుండా పోలీసులు నిషేధించారు.

తెలంగాణలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సాగుతున్న అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షల నిర్వహణను నిలిపివేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలకు పోలీస్ నియామక మండలి సూచన చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే శారీరక సామర్థ్య, రాత పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్య పరీక్షలను నిర్వహించి శిక్షణకు పంపించేందుకు మండలి సన్నాహాలు చేస్తోంది.

అయితే తుది ఎంపిక సరిగా లేదని పలువురు అభ్యర్థులు కొద్దిరోజుల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రశ్నపత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కేసు వేశారు. ఈ క్రమంలో అభ్యర్థులకు నాలుగు మార్కులను కలిపిన అనంతరం మరోసారి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెలువరించాలని న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. అయితే మార్కుల్ని కలిపే ప్రక్రియపై కసరత్తు చేయకుండా పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్యపరీక్షలనూ నిర్వహిస్తోందంటూ పిటిషనర్లు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో మండలి ఈనెల 4న వెలువరించిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కోర్టు విచారణ జరిగేవరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

విజయవాడ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు,వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ శాఖల అధికారులు అమ్మవారికి మెుక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ తెలుగు దేశం అధినేత చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.
గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు పూర్తికానందున విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గీ తన వాదనలను కొనసాగిస్తారు. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి విన్నవించారు. ముకుల్రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తుందా? లేదంటే ఇంకేమైనా చెబుతుందా? అన్నది తేలుతుంది. హైకోర్టులో తాను దాఖలుచేసిన క్వాష్పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గత నెల 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత, ధర్మాసనం ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కేసును విచారించనుంది.

హైదరాబాద్ మియాపూర్లో భారీగా బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి ఆభరణలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వనస్థలిపురంలో ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. సైబరాబాద్ పరిధిలోని మాదాపుర్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. రూ.32 లక్షల నగదు పట్టుబడింది.

సాధారణంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. కానీ ఓటర్లు మాత్రం ముఖ్యంగా ఆడవాళ్లు ఇంట్లో పని చూసుకొని టిఫిన్లు చేసి , వంట కూడా ముగించుకొని తీరిగ్గా 10 గంటలు దాటాక పోలింగ్ బూత్లకు క్యూ కడుతుంటారు. అందుకే ఓటింగ్ మొదలు కాగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలు వచ్చేలా చేసేందుకు ఓ ఫుడ్ హబ్ వినూత్న ఆఫర్ చేసింది. ఉదయం తొమ్మిది గంటల లోపు ఓటు వేయటానికి వచ్చిన వాళ్లకు పోహా, జిలేబీలు ఫ్రీగా ఇస్తామని ఇండోర్లోని ‘56 దుకాణ్’ యజమానుల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దాంతో నవంబర్ 17న ఉదయం తొమ్మిది గంటలలోపు ఓటువేసి వచ్చిన వాళ్లకు ఫ్రీగా పోహా, జిలేబీలను ఇస్తామని ‘56 దుకాణ్’ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజన్ శర్మ తెలిపారు. తొమ్మిది గంటల తర్వాత ఓటేసి వచ్చిన వారికి పోహా, జిలేబీలను ఇస్తామని తెలిపారు. ఈ ఆఫర్ నవంబర్ 17 ఉదయం 9గంటల వరకు మాత్రమే ఉంటుందని ఈ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు.

అమరావతి అసైన్డ్ భూముల కేసుపై హైకోర్టులో విచారణ వచ్చే నెల 1కి వాయిదా పడింది. అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. అయితే కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలన్న C.I.D. పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను ధర్మాసనం పరిశీలించింది. కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాదులు ఆడియో ఫైల్స్ ను అందించారు. రేపు మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని తెలిపారు. సీఐడీ పిటిషన్ విచారణపై మాజీమంత్రి నారాయణ తరఫు లాయర్లు అభ్యంతరం తెలిపారు. తీర్పు ఇచ్చే సమయంలో మళ్లీ పిటిషన్ సరికాదన్నారు . వేరే కేసులోని ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. కేసు రీఓపెన్ కు అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలన్న ధర్మాసనం... విచారణను వచ్చేనెల 1కి వాయిదా వేసింది. ఇదే కేసులో మాజీమంత్రి నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్ పై విచారణను నవంబర్ 1కి ధర్మాసనం వాయిదా వేసింది

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు ఆదివారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, బరువు 67 కేజీలు ఉన్నారని పేర్కొన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు బ్యారక్లో టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు వీపు, నడుము, ఛాతీ, చేతులు, గడ్డం ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడ్డాయని, తీవ్రమైన దురద ఏర్పడిందని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ఛాతీ, వీపు, పొట్ట, నడుము భాగాల్లో ఎర్రటి దట్టమైన దద్దుర్లు, పొక్కులు, గడ్డంపై ఎర్రటి దద్దుర్లు ఉన్నట్లు గమనించామని తెలిపారు. రెండు అరచేతుల్లో చీము పొక్కులు చితికిపోవడం వల్ల దురద, శరీరమంతా తెల్లటి పొక్కులు, కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపుల వల్ల ఇబ్బంది పడుతున్నారని రాజమండ్రి జీజీహెచ్ చర్మ సంబంధ వైద్య నిపుణులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీత జైలు ఉన్నతాధికారులకు ఇటీవల నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. చంద్రబాబు ఉన్న బ్యారక్లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు.

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కాంగో వాయువ్య ప్రాంతంలో పడవ బోల్తా పడి 27 మంది మరణించారు. మరో 70 మందికి పైగా కనపడకుండా తప్పిపోయారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. మరోవైపు ప్రాణాలతో బయటపడిన వారి కోసం గజ ఈతగాళ్లు వెతుకులాట ప్రారంభించారు. పడవ ఈక్వేటూర్ ప్రావిన్స్లోని బండకా నగరంలో 100 మందికి పైగా ప్రయాణీకులను కాంగో నది వెంబడి బొలోంబా పట్టణానికి తరలిస్తుండగా బోల్తా పడిందని డిప్యూటీ ప్రావిన్షియల్ గవర్నర్ టేలర్ న్గాంజీ తెలిపారు.
ఇప్పటికే 27 మంది బాధితుల మృతదేహాలు నదీ జలాల నుంచి వెలికి తీశారు. మృతదేహాలను స్థానిక జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించామని ఆయన చెప్పారు, ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో దేశంలోని సరస్సులు, నదుల్లో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. అలాగే తరచుగా లిమిట్ కి మించి ప్రయాణికులు పడవలు ఎక్కడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలోని వాయువ్య ప్రాంతంలోని జనాభాలో అత్యధికులు మంచి రోడ్లు లేకపోవడం వల్ల తక్కువ ఖర్చుతో కూడుకున్నందున నదుల్లో పడవ ప్రయాణాలకు ప్రాధాన్యమిస్తున్నారు. పడవ ప్రమాదాలను నివారించడానికి కాంగో ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాత్రి ప్రయాణాలను నిషేధించింది.
తెలంగాణలో శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా పడింది. నవంబరు 20 నుంచి 30 వరకు జరగాల్సిన TRTని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 5వేల 89 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వరకు టీఆర్టీ పరీక్ష నిర్వహించేందుకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది. పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఆరు రోజులు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇదే సమయంలో ఎన్నికలున్నందున తర్జనభర్జనపడిన అధికారులు ఎట్టకేలకు వాయిదా వేయాలని నిర్ణయించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసిన YSR సంపూర్ణ పోషణ కిట్లలో పాడైపోయిన పదార్థాలు వస్తున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన కిట్లలో పాడైపోయిన ఖర్జూర పళ్లు దర్శనమిచ్చాయి. పుచ్చిపోయిన ఖర్జూరంలో పురుగులూ ఉండటంతో మహిళలు మండిపడుతున్నారు. గూడూరు గ్రామంలో మరో ఇద్దరికి పురుగుల ఖర్జూరాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

అప్పుడప్పుడు పాలూ బాగుండటం లేదని తెలిపారు. వేరుసెనగ చిక్కీలూ ప్యాకెట్లలో సగమే ఉన్నాయని వాపోయారు. ఈ విషయంపై సీడీపీవో గ్లోరిని వివరణ కోరగా కేవలం ఒకరిద్దరికి ఇచ్చిన ఖర్జూరే పాడైనట్లు తెలిసిందని, వెంటనే వారికి కొత్తవి ఇచ్చామన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో దాడి ఘటన కేసులో లోతైన దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్కు నంబరు కేటాయించే దశలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతో ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి వద్ద ఇవాళ(శుక్రవారం) విచారణ జరగనుంది. కోడికత్తితో తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని, లోతైన దర్యాప్తు జరపాలని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్ఐఏ అభియోగపత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా క్యాంటిన్ నిర్వాహకుడు విధుల్లోకి తీసుకున్నారన్నారు. కుట్ర కోణం తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఎన్ఐఏ కోర్టు జులై 25న ఈ పిటిషన్ను కొట్టివేయడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని లోకేశ్ పిటిషన్ వేశారు. ఈ కేసులో లోకేశ్ను ఇప్పటివరకూ ముద్దాయిగా చేర్చలేదని C.I.D. తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసులో పేరు లేనందున ఆయనను అరెస్ట్ చేయబోమని న్యాయమూర్తికి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో లోకేష్ పేరు చేర్చితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరిస్తామన్నారు. CID వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతం అరెస్టు అంశం లేనందున లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఈ నెల 4నే విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు లోకేశ్ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించిన న్యాయస్థానం.. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారని లోకేశ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే పిటిషనర్ను అరెస్టు చేసేందుకు అవకాశం ఉన్నందునే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. లోకేశ్ పిటిషన్ను డిస్పోజ్ చేసింది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్రెడ్డి ఈ పిటిషన్పై విచారణ జరపనున్నారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇప్పటికే తనను పోలీసు కస్టడీలోకి తీసుకొని సీఐడీ రెండు రోజులపాటు విచారించిందన్నారు. మరో అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందన్నారు. తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిలు పిటిషన్ను కొట్టేసిందన్నారు. ప్రజా జీవితంలో ఉన్నానని చట్టాన్ని గౌరవించే వ్యక్తినన్నారు. దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు.

అంగళ్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. అంగళ్లు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయవద్దని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఉదయమే చంద్రబాబు పిటిషన్లు న్యాయమూర్తి ఎదుటకు వచ్చాయి. అంగళ్లు కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సి ఉంటుందని... అసలు ఆ ఘటన జరగడానికి ఆయన వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. అమరావతి రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంటుందన్నారు. అయితే చంద్రబాబు తరపు లాయర్లు.. ఆయన విచారణకు సహకరిస్తారని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు ద్వారా ఆయన్ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. దీంతో సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నానానికి వాయిదా వేసింది. అనంతరం వాదనలు ప్రారంభం అవ్వగా.. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందని.. ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్........ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అనంతరం కోర్టు చంద్రబాబుకు స్వల్ప ఊరట అందిస్తూ హైకోర్టు మధ్యంతరం ఉత్తర్వులు వెలువరించింది.

తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. నవంబరు 2, 3న జరగాల్సిన గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత జనవరి 6, 7న గ్రూప్ టూ నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం... 5 లక్షల 51 వేల 901 మంది దరఖాస్తు చేశారు. ఆగస్టు 29, 30న జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను.. ఇతర పోటీ, గురుకుల నియామక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని... నవంబరు 2, 3కి వాయిదా వేశారు. నవంబరు 3న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున గ్రూప్ టూ పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని... TSPSC సమావేశంలో నిర్ణయించారు. అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో ఉంటుంది కాబట్టి.. పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. సీట్ల పంపకంపై స్పష్టత రాలేదని నారాయణ స్పష్టత ఇచ్చారు. సీట్ల అంశం మాత్రమే తేలాల్సి ఉందని ఇది కూడా 2 రోజుల్లో కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కమ్యూనిస్టులకు చెరో రెండు సీట్లు అన్నది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి ప్రతిపాదన తమకు ఇంకా రాలేదని, జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయని, ఇక్కడ తెలంగాణలోనూ ఆ తరహా రాజకీయ అవగాహనతో ముందుకెళ్తామని నారాయణ తెలిపారు. సీట్ల కేటాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయని నారాయణ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని బీఆర్ఎస్ వాళ్లకు కావాల్సిన అధికారులను రెండు రోజుల ముందే బదిలీ చేసుకుంటున్నారన్నారు. అప్పటిదాకా పనిచేసిన అధికారులను అవమానపరుస్తూ బదిలీ చేస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. అంతకుముందు సీపీఎం పార్టీకి భద్రాచలం, మిర్యాలగూడ.... సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

జమ్మూకశ్మీరులో మరోసారి హిమపాతం సంభవించింది. లడఖ్లోని కున్ పర్వతం వద్ద హిమపాతం సంభవించడంతో భారత ఆర్మీ సైనికుడు మరణించాడు. మరో నలుగురు సైనికులు గల్లంతు అయ్యారు. వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 40 మంది సిబ్బంది హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్, ఇండియన్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్కు చెందిన సైనికులు మౌంట్ కున్ సమీపంలో సాధారణ శిక్షణా కార్యకలాపాలలో నిమగ్నమై ఉండగా హిమపాతం సంభవించిందని ఆర్మీ తెలిపింది. శిక్షణ సమయంలోనే నలుగురు సైనికులు మంచు కింద చిక్కుకుపోయారు. భారీ నిక్షేపాల కింద చిక్కుకున్న సైనికులను వెలికితీయడం కోసం రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది. భారత సైనికులు సాధారణ శిక్షణా కార్యకలాపాల సమయంలో హిమపాతం లడఖ్లోని మౌంట్ కున్ పర్వతాన్ని తాకింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఆకాశవాణి భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన కేంద్రం ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు చెప్పారు. అలాగే నవంబర్ 30 న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణాలి నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ -నవంబర్ 30, కాగా , నామినేషన్ల పరిశీలన - నవంబర్ 13,నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ - నవంబర్ 13కాగా 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మళ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారా.. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా... కాంగ్రెస్ అధిష్టానం కూడా దానిపై సమాలోచనలు చేస్తుందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. బండ్ల గణేష్ కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ఒక టికెట్ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన పేరును కూకట్పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. గత ఎన్నికల్లో బండ్ల గణేష్ కాంగ్రెస్కు ప్రచారం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం బండ్ల గణేష్ ఈ విషయమై మాట్లాడినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


