- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏడాదికి ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు లభించింది.భారత్ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కగా వారిలో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంలో నిలిచారు. నిర్మలా సీతారామన్ తర్వాత భారత్ నుంచి HCL కార్పొరేషన్ ఛైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా 60వ స్థానంలోనూ, సెయిల్ ఛైర్పర్సన్ సోమా మోండల్ 70వ స్థానంలో నిలిచారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్ షా.. 76వ స్థానంలో ఉన్నారు. శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాది ఆమెకు 34వ ర్యాంక్ దక్కింది. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం సాధించిన ఆమె 2022లో 36వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు 32వ స్థానంలో ఐదోసారి చోటు దక్కించుకోవడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ తొలి స్థానంలో నిలిచారు.రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉన్నారు.

ఇప్పటి వరకు బైక్, ఆటో రైడ్ సేవలు అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్ సేవల విభాగంలోకి కూడా అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో ఇకపై ర్యాపిడో పోటీపడనుంది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ , హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో దాదాపు 1.2 లక్షల క్యాబ్లతో ఈ సేవలను ర్యాపిడో ప్రారంభించింది. 2024 సెప్టెంబర్ నాటికి క్యాబ్ సేవలను 35 నగరాలకు విస్తరిస్తామని ర్యాపిడో సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు అందించి, మార్కెట్ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. సున్నా కమీషన్ మోడల్తో చోదకుల ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామన్నారు.

లంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వ్యవహారం ఢిల్లీ చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపిన ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి డీకే అందజేశారు. సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే నివాసం నుంచి రాహుల్, కేసీ వేణుగోపాల్ వెళ్లిపోయారు. మరికాసేపట్లో డీకే శివకుమార్ హైదరాబాద్కు బయలుదేరి రానున్నారు. అధిష్టానం నిర్ణయించిన సీఎం అభ్యర్థి పేరును డీకే హైదరాబాద్లో ప్రకటించనున్నారు. ఇప్పటికే సీఎం అభ్యర్థిపై హైకమాండ్ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో, డీకే శివకుమార్ ఈ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ సీఎం పేరును ప్రకటించనున్నారు. మిగిలిన పదవుల కేటాయింపుపైనా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఖర్గేతో భేటీకి ముందు ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కతో డీకే, ఠాక్రేలతో వేర్వేరుగా చర్చలు జరిపారు.

దేశానికి ఆదర్శంగా కొండగల్ ని తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొండగల్ నుంచి భారాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఘన విజయం సాధించిన ఆయన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆత్మగౌరవజెండాను కొడంగల్ ఆకాశమంత ఎత్తున ఎగరేసిందని ట్విట్టర్ లో పేర్కొన్న ఆయన కొనఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తానని పునరుద్ఘాటించారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోశారు: రేవంత్ ..కష్టపడిన ప్రతిఒక్క కార్యకర్తను కడుపులో పెట్టుకుంటానని వివరించారు. ఈగడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి దిశగా వెళ్లడంపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘భారాసకు వరుసగా రెండుసార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి నేను బాధపడటం లేదు. కానీ.. అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందాను. మేము దీన్ని ఒక పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి విజయం సాధించారు. సిద్దిపేట నుంచి హరీశ్ రావు గెలుపొందారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, మధిర నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క గెలుపొందారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి పలువురు అధికారులు తరలివెళ్తున్నారు. డీజీపీ అంజనీకుమార్, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ , అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన్ను మద్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో పలువురు మంత్రులు ఎదురీదుతున్నారు. మరికొందరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
వెనుకంజలోని మంత్రులు
నిరంజన్రెడ్డి (వనపర్తి)
ప్రశాంత్రెడ్డి (బాల్కొండ)
ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి)
కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి)
ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్)
పువ్వాడ అజయ్ (ఖమ్మం)
ముందంజలో ఉన్న మంత్రులు
మంత్రులు జగదీశ్రెడ్డి (సూర్యాపేట)
చామకూర మల్లారెడ్డి (మేడ్చల్)
సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం)
హరీశ్రావు (సిద్దిపేట)
కేటీఆర్ (సిరిసిల్ల)
తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్నగర్)
శ్రీనివాస్గౌడ్ (మహబూబ్నగర్)

ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహిస్తున్నాయి. గాంధీభవన్ కి పెద్దసంఖ్యలో వచ్చినకార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబురాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసించారన్న నేతలు.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారం చేపడతామన్ని స్పష్టం చేస్తున్నారు. రెండుసార్లు అధికారం ఇచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటివద్దకు పెద్దసంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ రెండో విజయం నమోదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియానాయక్పై 25వేలకు పైగా మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించారు. 2014లో హరిప్రియనాయక్పైనే గెలిచిన కోరం కనకయ్య.. 2018లో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇప్పుడు హరిప్రియపైనే కనకయ్య జయకేతనం ఎగురవేశారు. ఇటు.. రామగుండంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్పై రాజ్ఠాకూర్ గెలిచారు. మరోవైపు చార్మినార్లో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీ గెలిచారు. ఈ గెలుపుతో ఎంఐఎం బోణీ కొట్టింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా హస్తం జోరు కొనసాగుతోంది. మొత్తం పది నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పినపాకలో -పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు - కోరం కనకయ్య, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు -పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధిర- భట్టి విక్రమార్క ఆధిక్యంలో ఉన్నారు. వైరా - మాలోతు రామ్ దాస్ , సత్తుపల్లి - మట్టా రాగమయి, అశ్వారావుపేట – ఆదినారాయణ ముందంజలో ఉన్నారు. కొత్తగూడెంలో సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భారాస నుంచి భద్రాచలంలో తెల్లం వెంకట్రావు ముందంజలో ఉన్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 49 ప్రాంతాల్లో ఉన్న ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం దూసుకెళ్తోంది. దేవరకొండలో - బాలు నాయక్ నేనావత్ , నాగార్జునసాగర్ - కుందూర్ జయవీర్ , మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి, హుజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ - ఉత్తమ్ పద్మావతి ముందంజలో కొనసాగుతున్నారు. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి -కుంభం అనిల్ కుమార్ రెడ్డి దూసుకెళ్తున్నారు. నకిరేకల్ - వేముల వీరేశం, తుంగతుర్తి- మందుల శ్యామ్యూల్ , ఆలేరు - బీర్ల ఐలయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భారాస నుంచి సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి ముందంజలో ఉన్నారు..

తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. అధికారం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మొదటి విజయం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 20వేలకు పైగా ఆధిక్యంతో ఆదినారాయణ జయకేతనం ఎగురవేశారు. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు అక్కడ విజయం సాధించారు. అనంతరం మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ విజయం సాధించారు.

తెలంగాణలో ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. గెలుపు తమదే అంటే తమదే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్కు సూట్ కేసును గిఫ్ట్గా పంపించారు. కేసీఆర్ పాలనకు ఎండ్ కాడ్ పడబోతుందన్నారు. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకునే టైం వచ్చిందని... ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నామని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో 71 మంది పదివేల మెజార్టీతో గెలిచారు. పదివేల మెజార్టీ అయినా కూడా ముఖ్యం కాబట్టి.. తాము పోటీ చేసి ఒకవేల 5,000 ఓట్లు చీల్చినా తేడా వస్తుందని.. కేసీఆర్ను ఓడించాలని కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని అన్నారు. ఇన్నాళ్లు బీజేపీ , బీఆర్ఎస్ కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. కేసీఆర్ అవినీతి మీద బీజేపీ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదని విమర్శించారు. వీళ్లిద్దరు తోడుదొంగలు అయి కలిసే ఉన్నారని ఆరోపించారు.

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పాదయాత్ర యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి పాదయాత్రగా బయలుదేరిన లోకేష్ కు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. తెదేపా-జనసేన నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి లోకేష్ వెంట నడుస్తున్నారు. తెలుగుదేశం నాయకులు చినరాజప్ప, వర్మ, నవీన్, లోకేష్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. సామర్లకోట మండలం పవర మీదుగా పిఠాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో ఈ సాయంత్రం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతారు. అనంతరం కొండెవరం, కొత్త ఇసుకపల్లి మీదుగా యండపల్లి వరకు యాత్ర కొనసాగనుంది.

ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా తల్లయిన ఆమె ఆఫ్రికాలోనే అత్యంత పెద్దవయసులో తల్లయిన మహిళగా రికార్డు సృష్టించారు. కంపాలా నగరంలోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఆమె సిజేరియన్ ద్వారా ఓ బాబు, పాపకు జన్మనిచ్చారు. వృద్ధురాలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇన్విట్రో ఫలదీకరణ చికిత్స ద్వారా ఆమె సంతానభాగ్యం పొందినట్టు పేర్కొన్నారు. 2020లో కూడా సఫీనా ఈ చికిత్స ద్వారానే ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. కాగా, 2019లో భారత్లో దక్షిణాదిన ఓ వృద్ధురాలు 73 ఏళ్ల వయసులో పిల్లల్ని కన్నట్టు అప్పట్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రముఖ దేవాలయాల సందర్శన పూర్తి చేసుకున్న అనంతరం పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేయడంపై ఏపీ పంచాయతీరాజ్ చాంబర్, ఏపీ సర్పంచ్ల సంఘం నిర్వహించే సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించారు. ఈనెల 10న శ్రీకాకుళం,11న కాకినాడ, 14న నరసరావుపేట,15న కడపలో నిర్వహించే సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఏపీలో వ్యవస్థలు గాడి తప్పిన తీరును పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కరవు, పేదరికం, నిరుద్యోగం, మహిళలకు భద్రత లేకపోవడం, అక్రమ కేసులు, విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి 13 అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని సూచించారు.

సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భగ్నం చేశారు భద్రతా దళ అధికారులు. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రదాడుల సమాచారం నేపథ్యంలో భద్రతా దళాలు జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లా అరిహాల్ ప్రాంతంలోని న్యూకాలనీలో గురువారం భద్రతా దళ అధికారులు మిలిటెన్సీ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిని గుర్తించి అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉగ్రవాది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాది ఏ సమూహానికి చెందినవాడో ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు.

ఏపీలో ఫైబర్నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ మేరకు గురువారం సుప్రీం కోర్టులో విచారణ రాగా జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును డిసెంబర్ 12కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ గత నెల 12న చంద్రబాబు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై కేసులు నమోదు చేయడాన్ని కొట్టేయాలంటూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణలో ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు. పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ ఓబుల్రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. సినీనటుడు అల్లు అర్జున్..జూబ్లీహిల్స్లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అందరితో పాటూ లైన్లో నిలబడి ఓటు వేసి వెళ్లారు. షాద్ నగర్లో సినీనటుడు ప్రకాష్ రాజ్ ఓటేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కీరవాణి, సుమంత్.. ఇలా ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ కి చేరుకొని తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు.

మహారాష్ట్ర ముంబై లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెంబూర్లోని గోల్ఫ్ క్లబ్ ప్రాంతానికి సమీపంలో గల ఓల్డ్ బ్యారక్ వద్ద బుధవారం ఉదయం పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండ్ పేలడంతో పక్కపక్కనే ఉన్న ఐదు ఇళ్లు కూలిపోయినట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 11 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను 50 ఏళ్ల వికాస్ ఆంబోర్, 27 ఏళ్ల అశోక్ ఆంబోర్, 47 ఏళ్ల సవితా ఆంబోర్, 29 ఏళ్ల రోహిత్ ఆంబోర్గా గుర్తించారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల ముందు ఇలా అనుమతి ఇవ్వడంపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఇలా చేయడం ఓటర్లను ప్రలోభానికి గురి చేయడం లాంటిదేనని ధ్వజమెత్తాయి. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అనడానికి ఇదే నిదర్శనమంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. యాసంగి సీజన్ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి అనుమతించింది. ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు అయిదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

కాకినాడలో ఓ యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. వైసీపీ నేతల భూదాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అశోక్ నగర్లోని నేతాజీ వీధికి చెందిన 32 ఏళ్ల నున్న శ్రీకిరణ్ రష్యాలో నాలుగేళ్ల పాటు వైద్య విద్య అభ్యసించారు. చదువు మధ్యలో ఆపేసి స్వస్థలం వచ్చారు. వీరికి కాకినాడ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వివాదంలో మనస్తాపానికి గురైన శ్రీకిరణ్ పురుగుల మందు తాగారు. కాకినాడ G.G.Hకు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకిరణ్ మృతిచెందారు. భూమి విషయంలో స్థానిక వైసీపీ M.L.A. కన్నబాబు సోదరుడు, అనుచరుడు పెదబాబు తన కుమారుడిని మోసం చేశారని మృతుడి తల్లి ఆరోపించారు. వివాదం పరిష్కారం కోసం వైసీపీ నేతలను ఆశ్రయిస్తే భూమి పత్రాలు తీసుకుని డబ్బు రాదని చెప్పారని తెలిపారు. MLA కన్నబాబు సోదరుడి దౌర్జన్యాలు భరించలేకే శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. భూ ధ్రువపత్రాలు తన వద్దే ఉంచుకుని MLA సోదరుడు శ్రీకిరణ్ని వేధించారని మండిపడ్డారు. శ్రీకిరణ్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులంతా కలిసి.. వైసీపీ నేతల దందాలు, కబ్జాలను ఎదిరించాలని లోకేష్ పిలుపునిచ్చారు.

నారా లోకేశ్ ప్రారంభించిన కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యువగళం 208రోజుల పాటు అప్రతిహతంగా కొనసాగి 2852.4 కిలో మీటర్ల మేర పూర్తయింది. ఇప్పటివరకు 9 ఉమ్మడి జిల్లాల్లో 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. 208రోజుల పాదయాత్రలో యువనేత లోకేష్కు 4 వేలకు పైగా వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. యువగళం పాదయాత్రలో కోటిమంది ప్రజలు యువనేతతో వివిధ మార్గాల్లో అనుసంధానమయ్యారు. ప్రతిజిల్లాలోనూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది. యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న స్పందన తట్టుకోలేక అధికార పక్షం పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగింది. లోకేష్తో పాటు స్థానిక నేతలపైనా పోలీసులు అనేక కేసులు పెట్టారు. 40మంది యువగళం వాలంటీర్లు జెలుకెళ్లారు. వాటన్నింటిని అధిగమించిన లోకేష్ యాత్రను విజయవంతంగా కొనసాగించారు. ఇప్పుడు విరామం తర్వాత సైతం మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి... వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టనున్నారు.

అవినీతి సొమ్ముతో జగన్ ఇంకెంతో కాలం వ్యవస్థలను మేనేజ్ చేయలేరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. చట్టం, న్యాయం తన పని తాను చేయడం మొదలు పెట్టిందని హెచ్చరించారు. 10 ఏళ్లుగా జగన్ వ్యవస్థలను మేనేజ్ చేశాడని సుప్రీంకోర్టు నోటీసులతో జగన్, అతని ముఠా పనైపోయిందని లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ ఇక తన ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలన్నారు.

ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ట్రైన్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు వంద కి.మీ.వయాడక్ట్, 230 కిలోమీటర్ల పీర్ వర్క్ పనులు పూర్తి చేసినట్లు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్-N.H.S.R.C.L. ప్రకటించింది. 40మీటర్ల పొడవైన ఫుల్స్పాన్ బాక్స్ గిర్డర్లు, సెగ్మెంటల్ గిర్డర్ల ద్వారా 100 కి.మీ. వయాడక్ట్ల నిర్మాణం పూర్తి చేసినట్లు NHSRCL వెల్లడించింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్....ఈ పనులకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్లో షేర్ చేస్తూ ఓ వీడియాను కూడా ట్యాగ్ చేశారు. గుజరాత్లోని వల్సాద్, నవసారి జిల్లాల్లోని పార్, ఔరంగ, పూర్ణ, మింధోలా, అంబికా, వెంగానియా 6నదులపై వయాడక్ట్లు పనులు చేపట్టినట్లు NHSRCL ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి గిర్డర్ను నవంబర్ 25, 2021 ప్రారంభించిన NHSRCL....వయాడక్ట్ తొలి కి.మీ.ను 6నెలల్లో జూన్ 30 2022న పూర్తి చేసినట్లు పేర్కొంది. 50కి.మీ. వయాడక్ట్ల నిర్మాణం ఈ ఏడాది ఏప్రిల్ 22న పూర్తి కాగా....ఆ తర్వాత 6నెలల్లో వంద కి.మీ. మైలురాయిని చేరినట్లు NHSRCL వెల్లడించింది.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. శ్రీకాకుళంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖులు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశానికి పురందేశ్వరి హాజరయ్యారు. దేశాభివృద్ధికి బీజేపీ పెద్దపీట వేస్తోందన్న పురంధేశ్వరి... ఏపీకి సంపూర్ణమైన సహకారాన్ని మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేందుకు అన్నిరకాల సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో అభివృద్ధి... కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని పురందేశ్వరి వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అభివృద్ధికి తిలోతకాలు ఇస్తూ... ప్రజా ధనాన్ని దండుకునే ఆలోచన చేస్తోందని ఆమె విమర్శించారు. రోడ్లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులను కేటాయిస్తుంటే... గుంతల రోడ్లు ఉన్నాయన్నారు. గుంతల రోడ్లలో ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తున్నా జగన్ సర్కారు పట్టించుకోవట్లేదని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటా రైతుల ఖాతాల్లో పడుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మద్యానికి బానిసైన వారి కుటుంబాలు రోడ్డున పడుతుంటే... వైసీపీ పాలనలో అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని పురందేశ్వరి మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై . పర్యవేక్షణ ముసుగులో రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కార్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సహా ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు, విడిది అవసరాలకు 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా విభాగాలకు క్యాంపు కార్యాలయాల స్థలాలు అందుబాటులో లేకపోతే విశాఖలోని మిలీనియం టవర్లు, సమీపంలోని A, B బ్లాక్ భవనాలు కేటాయిస్తున్నట్లు. ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, గ్రామ వార్డు సచివాలయశాఖ, ఇంధనశాఖలు మినహా మిగతా 35 శాఖలకు కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం, రుషికొండ, చినగదిలి, ఎండాడ, హనుమంత్వాక తదితర ప్రాంతాల్లో భవనాల కేటాయింపు పూర్తి చేసింది. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు వివిధ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం..ఎక్కడ ఏర్పాటు చేస్తారనే అంశాన్ని ప్రభుత్వం... ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BSP అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి రెండు రోజులు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న మాయావతి సూర్యాపేటలో జరగనున్న ర్యాలీ, బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభ అనంతరం హైదరాబాద్ చేరుకోని హోటల్లో బస చేస్తారనిముఖ్య నేతలతో ఆమె ప్రత్యేకంగా భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 107 స్థానాల్లో BSP అభ్యర్థులు బరిలో నిలిచిన దృష్ట్యా సింగిల్ డిజిట్ సీట్ల గెలుపు లక్ష్యంగా నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో భారీ ర్యాలీ, బహిరంగసభలో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇందిరమ్మ రాజ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ పాలన సాగిందని వివరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కావాలో దొరల రాజ్యం కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టిన కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్, పరకాల సభల్లో రేవంత్ పాల్గొన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపే సమయం వచ్చిందన్న ఆయన ఎన్నికల్లో బీఆర్ఎస్ను వంద కిలోమీటర్ల లోపల పాతిపెట్టాలని పిలునిచ్చారు. పదేళ్లలో ఏమి చేశారో చెప్పకుండా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ను తిడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ నమూనా అంటే కుంగే బ్యారేజీలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారంటీలు సహా సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తామని వివరించారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ....ఇంటింటి ప్రచారాలు, రోడ్షోలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రధానంగా ఆరుగ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా....భాజపా అభ్యర్థులు కేంద్రప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు.

పల్నాడు జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు కొండలు కరిగిపోతున్నాయి. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ....అధికారపార్టీ నేతలు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో పల్నాడు జిల్లా త్రిపురాపురం కొండ గుండుకొట్టిన చందంగా మారింది. గతంలో పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండే కొండ నేడు బోసిపోయింది. ఇదేవిధంగా అక్రమరవాణా కొనసాగితే కొండ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది.
నకరికల్లు మండలంలోని త్రిపురాపురం పరిధిలో అద్దంకి-నార్కట్పల్లి రహదారి సమీపంలో త్రిపురాపురం కొండ ఉంది. ఇక్కడ నాణ్యమైన ఎర్రగ్రావెల్ లభిస్తోంది. మొదట అనుమతులు తీసుకుని కొండ కిందిభాగంలో కొంత విస్తీర్ణంలో తవ్వకాలు చేశారు. అనంతరం అనుమతులే లేకుండా అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు. భారీ పొక్లయిన్లు పెట్టి టిప్పర్లతో నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారు. మట్టి మాఫియా వెనుక వైకాపా ముఖ్యనేత అండ ఉండటంతో యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.

తవ్వకాల వల్ల భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రైవేటు సంస్థ రాయల్టీ వసూలుచేస్తోంది. ఈక్రమంలో ప్రైవేటు సంస్థ తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి లారీకి సొమ్ము వసూలు చేస్తోంది. మూడేళ్ల కిందటి కొండ చిత్రాన్ని తాజా చిత్రాన్ని పోల్చి చూస్తే కొండను ఎలా కొల్లగొట్టారో స్పష్టమవుతుంది. అడ్డఅదువులేని తవ్వకాలతో కొండ కరిగిపోతోంది

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని.. బెయిల్పై విచారణ జరుగుతున్న సందర్భంలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని లూథ్రా వాదించారు. ఈ కేసుకు సంబంధించి 2018 నుంచి విచారణ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని వాదించారు. సీమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్ అంతా వెరిఫై చేయలేదని రాశారని.. ఈ ఫోరెన్సిక్ రిపోర్టు చంద్రబాబును ఇరికించడం కోసమే తయారు చేశారని లూథ్రా బలంగా వాదనలు వినిపించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదని ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన వారే రిపోర్టులో చెప్పారని లూథ్రా వాదించారు.

తమిళనాడు సిపిఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య (102) బుధవారం కన్నుమూశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ (ఎం) నాయకుడు ఎన్ శంకరయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో శంకరయ్యను ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు రాజధాని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శంకరయ్య జ్వరంతోపాటు జలుబు సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళనాడుకు చెందిన ఎన్ శంకరయ్య దేశ స్వాతంత్య్రపోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. కమ్యూనిస్టు నాయకుడిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. కాగా, శంకరయ్య భౌతికకాయాన్ని చెన్నైలోని సీపీఐ (ఎం) కార్యాలయానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ కొంతసేపు ఉంచి, అనతరం ఆయన నివాసానికి తరలించనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదిరేందుకు, వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు నేతలు ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎలమంచిలి నియోజవర్గ నేతలు, అనంతపురంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేతలు, విశాఖ భీమునిపట్నం తెలుగుదేశం కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

మరోవైపు తెలుగుదేశం, జనసేన నేతలు ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోను పలు నియోజకవర్గాల్లోని నేతలు ప్రజలకు వివరించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నేతలతో కలిసి అత్తిలిలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వరరావు కార్యకర్తలతో కలిసి ప్రధాన రహదారిలోని చిరువ్యాపారులకు కరపత్రాలను అందజేసి మేనిఫెస్టోను వివరించారు.

నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలోకేంద్రం నుంచి వచ్చిన 71వేల4వందల49 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్ర నిధులకు Y.S.R, జగన్ పేర్లను పెట్టడంపై కేంద్రం అభ్యంతరం తెలిపిందన్నారు. పేర్ల విషయంలో జగన్ ప్రభుత్వ తీరు మారకపోవటంతో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన 6 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్న యనమల పేర్ల కోసం జగన్ పేదలను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. 75 పథకాలకు జగన్, Y.S.R పేర్లు పెట్టడం...రాచరిక పోకడ కాదా..? అని నిలదీశారు. 94 కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల...B.C వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయని ఆరోపించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, స్ఖానిక సంస్థలకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారన్నారు. పేదల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 3వేల84 కోట్లని దారి మళ్లించారని యనమల ఆక్షేపించారు. రైతులకివ్వాలని కేంద్రం ఇచ్చిన కరవు సాయం 900 వందల కోట్లు...రైతులకు చేరలేదన్నారు. 8వేల 6వందల 60 కోట్ల మేర స్థానిక సంస్థల నిధులు రాష్ట్ర ప్రభుత్వం...పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీలకు చెందాల్సిన 7వేల 8వందల 79 కోట్లను దారి మళ్లించి, వలసలకు జగన్ ప్రభుత్వం కారణమవుతోందని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్నగర్ జాతీయ రహదారి -58పై మంగళవారం తెల్లవారుజామున కారు ట్రక్కు కింద పడిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముజఫర్నగర్ జాతీయ రహదారిపై 22 చక్రాల ట్రక్కు కింద ఈ ఆరుగురు ప్రయాణిస్తున్న కారు పడింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
కారు ఢిల్లీ నుంచి హరిద్వార్కు వెళుతుండగా చాపర్ ప్రాంతంలోని రాంపూర్ క్రాసింగ్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో కారు ట్రక్కు కింద ఇరుక్కుపోయి కొన్ని మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. మృతులు ఢిల్లీలోని షహదారా నివాసితులని ముజఫర్నగర్ జిల్లా పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రి మార్చూరీకి తరలించారు. ఈ ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు చెప్పారు. ప్రమాద సమాచారాన్ని మృతుల కుటుంబాలకు అందించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ ఆస్పత్రులు డిమాండ్ చేశాయి. ఆరు నెలలుగా రూ.వెయ్యి కోట్లు బకాయి పడినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. బకాయిలు రాక తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు లేఖలో వెల్లడించింది. అలాగే నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించే 3,200 చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచాలని కోరింది. ఈ లేఖపై జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


