- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ముస్లింలను కేసీఆర్ కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పోటీ తమపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. 14 శాతం ఓటర్లున్న ముస్లింలకు ముస్లిం బంధు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీతో ముస్లిం మైనార్టీలకే నష్టమన్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో సంచలనం సృష్టిస్తున్న బాలిక హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. నేలటూరు గొల్లపల్లి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో బాలిక హత్యకు గురైంది. చెట్ల పొదల్లో బండరాయితో అతి కిరాతకంగా కొట్టిచంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 8న సాయంత్రం కనిగిరిలో గర్ల్స్ హైస్కూల్ నుంచి బాలికను తండ్రి తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.

తెలంగాణలో కేసీఆర్ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ఈసారి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు.కాంగ్రెస్పై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని..కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్కు తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్సేనన్నారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఉచిత కరెంట్ను వ్యతిరేకించిన వ్యక్తి కేసీఆర్ అని.. డబ్బుల కోసం మధ్యం టెండర్లు 3 నెలల ముందే వేశారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు.

కృష్ణా జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్నారు టీడీపీ నేత వెనిగండ్ల రాము. అభిమానులతో కలిసి కేకును కట్ చేసిన వెనిగండ్ల రాము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇండియాకే మెగాస్టార్ చిరంజీవి అన్నారు.చిరంజీవి పవర్ఫుల్ వ్యక్తి అని ఈమధ్య కొంతమందికి జ్ఞానోదయం అయిందని, చిరంజీవిపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారు ఈరోజు లెంపలు వేసుకుంటున్నారని అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శమని అన్నారు వెనిగండ్ల రాము.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. అమిత్ షా సభకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు సత్యనారాయణ రాజీనామా చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ను కలిశారు. కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని.. సంక్షేమ పథకాలు బాగున్నాయని కోనేరు సత్యనారాయణ తెలిపారు. అందుకే బీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నానని.. ఈ నెలాఖరులో పార్టీలో చేరతానన్నారు. కొత్తగూడెంలో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను కూడా కలిశారు సత్యనారాయణ.

కాంగ్రెస్ ఆశావహులు గాంధీభవన్కు క్యూ కడుతున్నారు. టికెట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. ఐదు రోజుల్లో 280 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. నిన్న ఒక్క రోజే 220 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండటంతో.. మరో 200 దరఖాస్తులు వస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న నేతలతో గాంధీభవన్లో సందడి వాతావరణం నెలకొంది.

బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్య బోరున వీలపించారు. సీఎం కేసీఆర్ లిస్ట్ ప్రకటించిన తరువాత తొలిసారి స్టేషన్ ఘన్పూర్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు వెళ్లిన రాజయ్యకు.. కార్యకర్తలు బాధాతప్త హృదయాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలను చూసిన రాజయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశానన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఇక దళిత బంధు 1100మందికి వచ్చేలా సిఫారసు చేసినట్లు తెలిపారు.

బీఆర్ఎస్ప్రజాప్రతినిధులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందని పబ్లిక్ సమస్యలు పరిష్కరించడం చేతకావట్లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండి పడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నా, మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రశ్నించాల్సిన అధికారులు బీఆర్ఎస్ నేతలకు వంత పడుతుండటం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యేల అభ్యర్థులపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారికే తిరిగి టికెట్టు కేటాయించడం ఏంటని ఆమె ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు.బీజేపీతో ఒప్పందంలో భాగంగానే..కేసీఆర్ వామపక్షాలను దూరం పెట్టారని ఫైర్ అయ్యారు. మునుగోడులో ఉప ఎన్నిక గెలుపు కోసం తమను వాడుకొని,తర్వాత దూరం పెట్టారని కూనంనేని అన్నారు.సీపీఎంతో కలిసి ఎన్నికలకు వెళ్తామని,ఉమ్మడి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే కాంగ్రెస్తో కలసి వెళ్లాలన్న చర్చలు జరగలేదని అన్నారు.

తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర ప్రపంచంగా పేరుగాంచిన CMR షాపింగ్ మాల్.. తన 23వ నూతన షోరూంను సూర్యాపేటలో ప్రారంభించింది. మంత్రి జగదీష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, స్థానిక కౌన్సిలర్లతో కలిసి షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ప్రపంచస్ధాయి షాపింగ్ అనుభూతిని కలిగిస్తోందని మంత్రి జగదీశ్ అన్నారు. జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంతరం చెందుతోందని అన్నారు. ప్రారంభోత్సవంలో సినీ నటి సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

విశాఖ జిల్లా తర్లువాడ భూబాగోతాన్ని టీవీ5 వెలుగులోకి తెచ్చింది.వరస కథనాలతో వాస్తవాలను బయట పెట్టింది.టీవీ5 కథనాలతో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు చెలరేగాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భూ కేటాయింపు ప్రతిపాదనలపై స్థానికులు ప్రజాసంఘాలు,ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.ఈ వ్యవహారం పై ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నేపధ్యంలో తర్లవాడ కొండపై టీడీపీ నేతల ఆందోళన చేపట్టారు.తర్లువాడ భూములు కాపాడాలంటూ నినాదాలు చేశారు భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రకృతి వనరుల దోపిడీ నిర్విరామంగా సాగుతోంది. అధికార పార్టీ అండతో ఇప్పటికే అడ్డూ అదుపు లేకుండా మట్టి, ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. తాజాగా చెట్లపై కూడా అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది వరుసగా చెట్ల నరికివేత కొనసాగుతోంది. అవనిగడ్డ గుర్రపు చెరువు, బందలాయి చెరువుల్లో భారీ వృక్షాలు ఇటీవల నరికి అమ్మేశారు. అవనిగడ్డలోని తంగిరాల వీర రాఘవయ్య గ్రామ పంచాయతీ పార్కులో భారీ వృక్షాలు అక్రమ నరికివేతకు గురయ్యాయి. అవనిగడ్డలో వాల్టా చట్టం పూర్తిగా ఉల్లంఘనకు గురవుతోంది.

KCRకి కొత్త భాష్యం చెప్పారు మంత్రి హరీష్ రావు.K అంటే కాలువలు,C అంటే చెరువులు,R అంటే రిజర్వాయర్లు అన్నారు. BRSకి కూడా కొత్త అర్ధం చెప్పారు. B అంటే భారత,R అంటే రైతు,S అంటే సమితి అని అన్నారు. రేపు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి హరీష్రావు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి మెదక్లో 10కి 10 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీ ఇంతస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదని,బీజేపీకి క్యాడర్, కాంగ్రెస్కు లీడర్ లేరని సెటైర్లు వేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క వైరా మినహా మిగిలిన తొమ్మిది స్ధానాల్లో సిట్టింగ్లకే మళ్లీ టికెట్లు దక్కాయి. వైరాతో పాటు కొత్తగూడెం, ఇల్లెందు విషయంలో మార్పు ఉంటుందని భావించినా అంచనాలకు భిన్నంగా వైరా మినహా మిగిలిన స్ధానాలకు పాతవారినే ఖరారు చేశారు. పాలేరు టికెట్ కోసం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడిచింది. చివరికి సీఎం కేసీఆర్ కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. తుమ్మలకు టికెట్ నిరాకరించడంతో అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ దక్కని నేతలు అధిష్టానాన్ని టార్గెట్ చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వేముల విరేశం, భేతి సుభాష్ రెడ్డి తోపాటు బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కంటోన్మెంట్ టిక్కెట్ ఆశించిన క్రిశాంక్ కూడా సందిగ్ధంలో ఉన్నారు. మెదక్ నుంచి టికెట్ ఆశించిన మైనంపల్లి రోహిత్ కూడా బంగపడ్డారు. ఇక మల్కాజ్గిరి టికెట్ ఇచ్చినా మైనంపల్లి హనుమంతురావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ఆయన.. అవినీతిలో, అప్పుల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమన్నారు. ఏపీలో వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్ అన్నారు.

విశాఖలో భూముల వ్యవహారంపై ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. తర్లువాడ కొండకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇక్కడి ప్రజలు పవిత్రమైన కొండగా భావిస్తారని అన్నారు. అలాంటి తర్లువాడ కొండ కబ్జాకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.కొండను కాజేసేందుకు విజయసాయిరెడ్డి బంధువులు..ప్రభుత్వానికి దరఖాస్తు చేశారని 300 కోట్ల విలువైన భూమిని 20 కోట్లకు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.తర్లువాడ కొండపై భూమిని ఏ2 విజయసాయిరెడ్డికి. ఏ1 జగన్ అప్పనంగా అప్పగించే ప్రయత్నంచేస్తున్నారని ఆరోపించారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ.. మల్లెనవారిపేట వాసులను భయపెడుతున్నాయి. ఉదయం గ్రామశివారుల్లోని కొండల్లో ఉంటూ.. రాత్రి వేళ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. దొరికిన ఆహారం తింటూ రోడ్లపై తిరుగుతున్నాయి. వాటిని చూసి గ్రామస్తులు హడలిపోతున్నారు. రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు మల్లెనవారి పేట వాసులు భపడుతున్నారు. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఎలుగుబంట్లను బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి మిస్సింగ్ కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి శరణ్ చౌదరి బయటకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారులో ఎక్కినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శరణ్ చౌదరి ఫోన్ స్వీచ్ఛాఫ్ అయింది. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. ఆందోళ చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా శరణ్ చౌదరి కూకట్ పల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటనతో ఆ పార్టీలోని ఆశావహులతో పాటు వామపక్షాలకు కేసీఆర్ షాకిచ్చారు. కేసీఆర్పై సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నమ్మించి ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇరు పార్టీల నేతలు ఇవాళ సమావేశం కావాలని నిర్ణయించారు.కాసేపట్లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ తర్వాత రెండు పార్టీల నేతలు భేటీ అవుతారు. సమావేశంలో అందరితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వామపక్షాలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని ఇప్పటికే నిర్ణయించారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే బరిలో తాను ఉంటానని ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటాననేది త్వరలో ప్రకటిస్తానని అన్నారు. ఎమ్మెల్యేగా ఇంకా 49 రోజుల వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. తన భర్త మనోవేదనతోనే కాంగ్రెస్లో చేరారని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి చూపిస్తా అని రేఖానాయక్ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్ధుల ప్రకటనతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అభ్యర్ధుల పేర్లు ఖరారు కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్కసారిగా అసమ్మతి రాజుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాలు ఉండగా.. నర్సాపూర్ మినహా 9 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. జహీరాబాద్, మెదక్, పటాన్చెరు నియోజకవర్గాల్లో ఆశావాహులు నిరసన గళం వినిపిస్తున్నాయి.

ప్రత్యర్థులకు అంచనాలకు అందకుండా అభ్యర్థుల అనూహ్య మార్పులు చేర్పుల ప్రయోగాలు కూడా చేస్తుంటారు గులాబీ బాస్. ఇందులో భాగంగానే ఈ సారి ఆయన కామారెడ్డి పై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ పోటీపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.కామారెడ్డి నియోజకవర్గంతో కేసీఆర్ కు చాలా అనుబంధం ఉంది.ఈ జిల్లాలోని బీబీ పేట్ మండలం కొనాపూర్ లో జన్మించారు కేసీఆర్.కామారెడ్డి నియోజక వర్గంలో కేసీఆర్ పూర్వీకుల మూలాలు ఉన్నాయి.పైగా గంప గోవర్ధన్ పై కామారెడ్డిలో వ్యతిరేకత రావడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని సమాచారం.

మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇష్టానుసారం సీఐడీ సోదాలు, అరెస్ట్లపై హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ వేసింది. తనిఖీలు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పిటిషన్పై విచారించిన ఏపీ హైకోర్టు.. రెండు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. తక్షణమే అరెస్ట్, సోదాలు నిలిపివేయాలని ఆదేశించింది.. మార్గదర్శి విషయంలో తండ్రి బాటలోనే వెళ్తున్న జగన్.. ఆ సంస్థపై కక్షగట్టారని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కేసీఆర్ను ప్రజలు రెండు చోట్ల ఓడిస్తారని అన్నారు టీ. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా కేసీఆర్ ఓటమిని ముందే ఒప్పుకున్నారని అన్నారు. తన సవాల్ స్వీకరించకుండా పారిపోయారని కామెంట్ చేశారు. ఇంత మందిని గెలిపించిన నాయకుడు.. రెండు చోట్ల పోటీ చేయడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది.. ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అన్న రేవంత్... 2014 ముందు ప్రతి ఎన్నికల్లో పొత్తుతోనే పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తానని ప్రకటన చేయడంతో... కేసీఆర్ ముందు జాగ్రత్తగా రెండు చోట్ల పోటీకి దిగుతున్నారని అన్నారు. కామారెడ్డి నుంచి కాస్త ముందుకు వస్తే.. చిత్తు చిత్తుగా ఓడించేవాడినంటూ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ లిస్టును చూస్తుంటే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ...115 స్థానాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ సారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. అందులో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. మంచి ముహూర్తం ఉండడంతో సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్టు కేసీఆర్ తెలిపారు.

వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో చేరారు. విజయవాడలోని నిడమానూరు శివారులో క్యాంప్ దగ్గర యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు లోకేష్.. ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. వంశీ పోవాలి.. యార్లగడ్డ గెలవాలంటూ నినదించారు. ఆ తర్వాత లోకేష్తో యార్లగడ్డ వెంకట్రావు సమావేశమయ్యారు. రేపు గన్నవరంలో యువగళం భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. 2లక్షల మందితో టీడీపీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

యువతే ఈ రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అందరూ మాతృభాషలో మాట్లాడండి.. మాతృభాష మర్చిపోవద్దని విద్యార్ధులకు సూచించారు. గుంటూరులో భాష్యం విద్యాసంస్థల విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. భాష్యంలో చదవి జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో అఖిలభారత స్థాయి ఓపెన్ కేటగిరీ 5, 10వ ర్యాంకు సాధించిన విద్యార్థులను మాజీ ఉపరాష్ట్రపతి సన్మానించారు. ఇష్టపడి, కష్టపడి చదవాలన్నారు. కులాల కుమ్ములాటలో యువకులు దూరవద్దని సూచించారు. చదువు ర్యాంకులు కోసం కాదని... విజ్ఞానం, వివేకం పెంచుకోవడానికి అని వెంకయ్య నాయుడు అన్నారు.

హైదరాబాద్లోని DSE కార్యాలయం ముందు విద్యావాలంటీర్లు ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వాలంటీర్లు రెన్యూవల్ చేయాలని నినదించారు. 2020 సంవత్సరం నుంచి రెన్యూవల్ చేయలేదని మండిపడుతున్నారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యావాలంటీర్ల ఆందోళనకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మద్దతు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ మొదలైంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ్రా కొనసాగుతోంది. కలెక్టర్లు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు, పోలీసు, ప్రత్యేక అధికారుల సమక్షంలో అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ లక్కీడ్రా కొనసాగుతోంది. మండలాలు, దుకాణాల ప్రాతిపదికన బహిరంగంగా డ్రా తీస్తున్నారు. మొత్తం 2,620 షాపులకు 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. డ్రాలో వచ్చిన పేర్లు వెంటనే అధికారులు ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ హజరై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అలిపిరి-తిరుమల నడక మార్గంలో ఎలుగుబంట్ల సంచారం కొనసాగుతోంది. టీటీడీ అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డయింది. నడక మార్గంలో ఏడో మైలు వద్ద పెట్టిన కెమెరాల్లో శుక్రవారం, శనివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి కనిపించింది. ఆదివారం సాయంత్రం నరసింహస్వామి ఆలయం సమీపంలోనూ ఎలుగుబంటి సంచారం గుర్తించారు. సిబ్బందిని అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

తక్షణం అగనంపూడి టోల్ గేటును తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో టోల్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనేక ఏళ్లుగా అక్రమంగా, చట్టవిరుద్ధంగా అగనంపూడి టోల్ గేట్ కొనసాగుతుందని సీపీఎం నాయకుడు గంగారావు అన్నారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో టోల్ గేట్లు ఉండకూడదనే నిబంధనలను కూడా ధిక్కరిస్తూ కేంద్రం ప్రజలను నిలువుదోపిడీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 25 సంవత్సరాల నుంచి దారి దోపిడి చేస్తున్నారని.. ఇప్పటి వరకు సుమారు 700 కోట్లకు పైగా వసూలు చేశారని విమర్శించారు.

నెల్లూరు జిల్లా కావలి జనతాపేట సౌత్ సాంఘీక సంక్షేమ హాస్టల్ వద్ద షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామానికి చెందిన ఓ కుటుంబం కావలిలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. కారులోంచి దిగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడి పైన ఉన్న విద్యుత్ తీగలను తాకటంతో అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది విద్యుత్ను నిలిపివేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఇవాళ భారీ వర్షం కురిసింది. భక్తులు, స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న వెంకన్న ఆలయానికి వచ్చిన భక్తులు సైతం వర్షంలో తడిసిముద్దయ్యారు. మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.

విశాఖలో వైసీపీ పెద్దల భూ దాహంపై మండిపడుతున్నారు స్థానికులు తర్లుపాడు గ్రామంలోని కోట్ల విలువైన భూమిని కారుచౌకగా ప్రభుత్వం నుంచి పొందేందుకు మాస్టర్ ప్లాన్ వేశారన్న నేపధ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్లువాడ కొండపై ప్రసిద్ధ విష్ణుపాదాలు, దేవాలయం ఉందని వరాహ నరసింహ స్వామి మొదట ఇక్కడే వెలసి ఆ తర్వాత అడవివరం కొండపైకి వెళ్లినట్లు స్థానికులు అంటున్నారు. చారిత్రాత్మక నేపధ్యం ఉన్న ఈ విలువైన భూమి విజయసాయిరెడ్డికి కట్టబెడుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రైవేట్ వ్యక్తులు ఈ స్థలం ఆక్రమించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


