చిట్టి న్యూస్

లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ ప్రారంభ‌ం

లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ ప్రారంభ‌మైంది. కాంగ్రెస్ పార్టీ నేత గౌర‌వ్ గ‌గోయ్ ఆ చ‌ర్చను ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసి వచ్చిందన్నారు. ఇది సంఖ్యా బలానికి సంబంధించినది కాదని, కేవలం మణిపూర్ రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని కోరుతూ తాను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించానని తెలిపారు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని మణిపూర్ రాష్ట్రం కోసం తీసుకొచ్చిందని, మణిపూర్ న్యాయం కోరుతోందని తెలిపారు.  

ఏపీ మంత్రి అంబటిపై చిరంజీవి పరోక్ష విమర్శలు

ఏపీలో పరిస్థితులపై మెగాస్టార్‌ చిరంజీవి హాట్‌ కామెంట్‌ చేశారు.వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో పాల్గొన్న చిరు..ఏపీ మంత్రి అంబటిపై చిరంజీవి పరోక్షంగా సెటైర్లు వేశారు.నేతలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి,ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలన్నారు. పేదల కడుపు నింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టిపెడితే అందరూ తలవంచి నమస్కరిస్తారని అన్నారు.అన్ని విషయాలు వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి? అంటూ కాస్త ఘాటుగానే అన్నారు.ఇదేదో పెద్ద సమస్యలా చూపించొద్దని విజ్ఞప్తి చేశారు.  

తెలంగాణ ప్రజల వికాసాన్ని కేంద్రం విస్మరించింది- నామా

తెలంగాణ అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల వికాసాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందు వల్లే ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని తెలిపారు. సభలో చర్చ సందర్భంగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ఎండగడుతామన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నేర్చకుండా అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. 

పల్నాడు జిల్లాలో జోరుగా లోకేష్‌ పాదయాత్ర

పల్నాడు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు బ్రహ్మరధం పడుతున్నారు. ప్రస్తుతం గురజాల నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెయ్యిమంది మహిళలతో లోకేష్‌కు స్వాగతం పలుకుతున్నారు. కేరళ డప్పులు, సంప్రదాయ నృత్యాలతో పాదయాత్ర ఓ పండుగలా కొనసాగుతోంది.  

పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన వాలంటీర్

ఏపీలో వాలంటీర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగుంపేటకు చెందిన శివప్రసాద్ అనే వాలంటీర్‌ ఒంటరి మహిళలను టార్గెట్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను గర్భవతి చేశాడు. మూడేళ్లగా తన అవసరం తీర్చుకుని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ గొలుగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు FIR కూడా నమోదు చేయలేదు.

నెల్లూరులో హై టెన్షన్‌

నెల్లూరులో హై టెన్షన్‌ నెలకొంది. ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సమి హుస్సేనిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేసినందుకే సయ్యద్ సమీ ని ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయనకు మద్దతుగా నిలిచారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.సమీకి ఇంటికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

ఐఐటీ హైదరాబాద్లో ఆగని ఆత్మహత్యలు

ఐఐటీ హైదరాబాద్ లో విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎంటెక్ చదువుతున్న విద్యార్ధిని మమైత నాయక్... ఆత్మహత్య చేసుకుంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌లో తెలిపింది మమైత నాయక్. నెలలోనే ఇది రెండో ఆత్మహత్య!. ఇటివల కార్తీక్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఓ విద్యార్ధిని సైతం సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. 

Yuvagalam: 178వ రోజుకు చేరిన లోకేష్ పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుోతంది. ఇవాల్టితో పాదయాత్ర 178వ రోజుకు చేరింది. ఇప్పటివరకు లోకేష్ 2354 కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ జూలకల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం పందిటివారిపాలెం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమవుతారు. భోజన విరామం అనంతరం జూనపాడు నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగిస్తారు. సాయంత్రం ఆరుగంటలకు పిడుగురాళ్ల కన్యాకపరమేశ్వరి గుడి వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.

మహబూబాబాద్  లో రోడ్డు ప్రమాదం.. ఒకరు  మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న ఓ అంబులెన్స్ కలక్వర్ట్‌కు ఢీకొనింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా బయ్యారం మండలం ఇస్తాళ్లపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు. 

విజయవాడలో 144 సెక్షన్ అమలు

ఇవాళ విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మహాధర్నాకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు విజయవాడలో 144 సెక్షన్‌ అమలు చేస్తోంది. అయితే మహాధర్నా విరమించుకున్నామని ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఇవాళ వర్క్ టు రూల్ పాటించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. అయినా విజయవాడలో భారీగా పోలీసులను మోహరించారు. అటు విద్యుత్ సౌధ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం విద్యుత్ సౌధ పూర్తిగా పోలీసులు నిఘా నీడలో ఉంది.  

Uppal: శిల్పారామంలో చేనేత భవన్‌ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

75 ఏళ్లు దాటిన చేనేతలకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్ కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని అన్నారు. నేతన్నలకు 16 వేలకుపైగా కొత్త మగ్గాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నేటి నుంచే తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలవుతుందన్నారు. ఇక చేనేత మీద ప్రధాని మోదీ 5 శాతం జీఎస్టీ వేశారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

అక్రమాల్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు- ఉండవల్లి అనూష

వైసీపీ అక్రమాల్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఐ-టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ఫైరయ్యారు. మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. త్వరలో నగిరి ఓటర్లు ఆమెకు తగిన బుద్ది చెబుతారని అన్నారు. నాలుగేళ్లలో అక్రమంగా ఎంతో సంపాదించారని ఆరోపించారు. నగిరి నియోజవర్గం ఇసుక, మట్టి దందాలకు నిలయంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాఫియా చెలరేగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఖమ్మంలో మంత్రి పువ్వాడకు ఘన స్వాగతం

ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులేనని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఖమ్మం వెళ్లిన పువ్వాడకు ఘన స్వాగతం లభించింది. మున్నేరు కరకట్ట కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో పరివాహక ప్రాంత వాసులు మంత్రిని గజమాలతో సత్కరించారు. ఇక ఆర్టీసీ కార్మికులు జీతాలు అందుకుంటారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని బెన్‌ఫిట్స్‌ లభిస్తాయన్నారు. ఇక ఆర్టీసీ విలీన బిల్లుకు ఎంతో మంది అడ్డుపడాలని చూశారని పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుంగనూరు ఘటనపై మండిపడుతోన్న టీడీపీ నేతలు

పుంగనూరు ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు చంద్రగిరి టీడీపీ నేతలు. ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. విధ్వంసానికి కారకులైన వైసీపీ నేతలపై ఒక్క కేసు పెట్టలేదని మండిపడ్డారు. టీడీపీకి చెందిన వంద మందిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు

ఏపీలో అంతకంతకు పెరుగుతున్న రైతు రుణ భారం

ఏపీలో రైతు రుణ భారం అంతకంతకు పెరిగిపోతుంది. రైతులపై రుణ భారంలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది. లోక్‌ సభా వేదికగా ఈ విషయాలను కేంద్రం వెల్లడించింది. వాణిజ్య, సహకార, ప్రాతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి ఏపీ రైతుల రుణాల మొత్తం 2లక్షల 43వేల 73 కోట్లుగా తెలిపింది. ఈ జాబితాలతో తమిళనాడు 3లక్షల కోట్లకు అప్పుతో తొలిస్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ రైతుల రుణ భారంలో లక్షా 12వేల 492 కోట్లతో ఎనిమిదో స్థానం దక్కించుకుంది. దేశంతో మొత్తం 9 రాష్ట్రాల్లో లక్ష కోట్లకు మించి రైతుల రుణ భారం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

లోకేష్‌ పాదయాత్ర చరిత్ర సృష్టిస్తోంది

పల్నాడు జిల్లాలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది.ప్రతి గ్రామాల్లో మహిళలు, యువత లోకేష్‌ను స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు టీడీపీ సీనియర్‌ నేత యరపతనేని శ్రీనివాస రావు. రేపు పిడుగురాళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, వేయి మంది మహిళలు బోనాలతో స్వాగతం పలకనున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక లేజర్‌ షో ఏర్పాటు చేశామని తెలిపారు. 5వేల మంది యువకులు యువగళం టీ షర్టులతో లోకేష్‌కు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.  

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన జరిగింది. అల్తాఫ్‌ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అల్తాఫ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు గుర్తు తెలియని దుండగులు. ఓ వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అల్తాఫ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

శ్రీకాకుళం కలెక్టరేటు వద్ద వీఆర్ఏల నిరసన దీక్ష

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేటు వద్ద వీఆర్ఏలు నిరసన దీక్షలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పేస్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించాలని, అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పనిచేస్తూ మరణించిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. రికవరీ చేసిన డీఏలను తిరిగి చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. 

Chandrababu Naidu: గుండగోల దగ్గర  ఘన స్వాగతం పలికిన మహిళలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబుకు బ్రహ్మరధం పట్టారు. ఉంగటూరు నియోజక వర్గం గుండగోల దగ్గర ఘన స్వాగతం పలికారు మహిళలు.టీడీపీ నేతలు గన్ని వీరాంజనేయులు, మాగంటి బాబు భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు టీడీపీ అధినేతకు స్వాగతం పలికారు.ఇవాళ గోపాల పురం, పోలవరంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందుకు సంబందించి భారీ ఏర్పాట్లును చేసింది టీడీపీ. పోలవరం నిర్వాసితులతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం దేవర పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు.  

AIIMS FIRE: దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని రెండన అంతస్తులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఎండోస్కోపీ గది నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ గది ఎమర్జన్సీ వార్డుపైన ఉంది. మంటలు చెలరేగిన గది నుంచి రోగులను వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేయటానికి ఆరు అగ్ని మాపక యంత్రాలు రంగంలోకి దిగాయి.

కాంట్రాక్ట్ కార్మికులను చితకబాదిన పోలీసులు

తిరుపతిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను చితకబాదారు పోలీసులు. శాంతియుత ర్యాలీని కొనసాగిస్తున్న వారిపై లాఠీ ఝుళిపించారు. పద్మావతి కల్యాణ మండపం ముందు కార్మికులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులను తోసుకుంటునే భారీ ర్యాలీగా ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పదివేల మందికిపైగా కార్మికులు ఎస్పీడీసీఎల్ కార్యాయాలన్ని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.

ప్రమాదకర వంతెన పై ప్రయాణాలు సాగిస్తున్న ప్రజలు

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం గ్రామ ప్రజలు ప్రమాదకర వంతెనపై ప్రయాణాలు సాగిస్తున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలు చేయాలన్నా కేబుల్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే. తాళ్లు తెగిపోవడంతో ప్రాణాలను పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. 2003లో బకింగ్ హమ్ కాలువపై 20 లక్షల వ్యయంతో టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. 2021లో వచ్చిన వరదలతో కేబుల్‌ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో తాళ్లు తెగిపోయాయి.అప్పటి నుంచి తిరిగి కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్న గ్రామస్తులు మండిపడుతున్నారు. 

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మురుగు కాలువలోని బురద తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందు వేశారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఈ నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. నెలరోజులుగా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు వస్తున్నారని తెలుసుకున్న అధికారులు మున్సిపల్ ఆఫీస్ కు గేట్లు వేశారు. దీంతో ఆ గేట్లు ముందు బురద జల్లి నిరసన తెలిపారు టీడీపీ నేతలు. 

పార్లమెంట్‌ కు రాహుల్ రీ - ఎంట్రీ

పార్లమెంట్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ. వాయిదా తరువాత మధ్యాహ్నం 12 గంటలకు సభకు హాజరు కానున్నారు. ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేసింది లోక్‌సభ కార్యాలయం. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.గతంలో పరువునష్టం కేసులో సురత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే సుప్రీంకోర్టులో మాత్రం రాహుల్‌కు భారీ ఊరట లభించింది. దీంతో ఆయన తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టే అవకాశం లభించింది. 

మహబూబాబాద్ లో కాంగ్రెస్  టికెట్ కోసం పోటాపోటీ

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ నేతలు పోటీపడుతుండగా... ఇప్పుడు భూపాల్ నాయక్ సైతం పోటీ పడుతున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ సారి కచ్చితంగా డోర్నకల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తామంటున్నారు భూపాల్ నాయక్. 

పోలవరం ప్రాజెక్టు దగ్గర హై టెన్షన్

పోలవరం ప్రాజెక్టు దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పట్టిసీమ,పోలవరం ప్రాజెక్టులు సందర్శించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈనేపధ్యంలో పోలవరం ప్రాజెక్టు దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడంచెల్లో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి కేవలం 14 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఉభయగోదావరి జిల్లాలో సీఎం,ప్రతిపక్ష నేతల పర్యటన ఒకే రోజు ఉండటంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ రాత్రికి రాజమండ్రిలోబస చేయనున్నారు జగన్,చంద్రబాబు. 

జగనన్న కాలనీల పేరుతో  విచ్చలవిడిగా అక్రమాలు

జగనన్న కాలనీల పేరుతో ఏపీలో యధేచ్చగా అక్రమాలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతల చేతివాటానికి ఓ మహిళా రైతు నిండా మునిగింది. వెంకన్నపాలెంకు చెందిన మహాలక్ష్మి జగనన్న కాలనీ కోసం తన 10 సెంట్ల భూమిని ఇచ్చింది. అయితే పరిహారంగా సుమారు 72లక్షలను  ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ నగదు వైసీపీ నేతల ఖాతాల్లో జమకావడంతో మహాలక్ష్మి కంగుతున్నారు. తనకు న్యాయం చేయాలని రెండేళ్లుగా పోరాటం చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడని కన్నీరుమున్నీరువుతున్నారు.  

యువతిపై దాడి చేసి వివస్త్రను  చేసిన కీచకుడు

మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్ లోని దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ యువతిపై దాడి చేసి వివస్త్రను చేశాడు ఓ కీచకుడు. మద్యం మత్తులో . అందరూ చూస్తుండగానే ఈ దారణానికి ఒడిగట్టాడు పెద్ద మారయ్య. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన మరో మహిళతో పాటు స్థానికులపైనా దాడి చేశాడు. ఈ తతంగమమంతా పెద్దమారయ్య తల్లి సమక్షంలో జరిగింది. తల్లి తన కొడుకుని సమర్ధించడంపై స్థానికులు మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. బాధిత మహిళను రక్షించి నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

చంద్రయాన్‌-3 తీసిన చంద్రుడి వీడియో విడుదల

చంద్రయాన్‌-3 తొలిసారిగా తీసిన చంద్రుడి వీడియోను ఇస్రో విడుదల చేసింది. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో స్పేస్‌క్రాఫ్ట్‌ ఈ దృశ్యాలను చిత్రీకరించింది. గుంతలు గుంతలుగా ఉన్న చంద్రమామ ఉపరితలం అందులో కనిపించింది. ఇక చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 తాజాగా మరో విన్యాసాన్ని పూర్తి చేసుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించడం ద్వారా దీని కక్ష్యను మరింత తగ్గించారు. ఫలితంగా అది జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది. మళ్లీ ఇలాంటి విన్యాసాన్ని ఎల్లుండి నిర్వహించనున్నారు. 

ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన


టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరానికి వెళ్తారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు పట్టిసీమకు చేరుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మీదుగా దేవరపల్లి చేరుకుని రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేస్తారు.

ధరణిలో అనేక లోపాలున్నాయి: భట్టి విక్రమార్క

ధరణిలో అనేక లోపాలున్నాయన్నారు భట్టి విక్రమార్క. దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని కోరారు. భద్రాచలం దగ్గర ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా శాసనసభలో తీర్మానం చేయాలని భట్టి డిమాండ్‌ చేశారు. మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలేసిందని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభ ఆమోదించింది. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ బిల్లుకు ఎంఐఎం, బీజేపీ శాసనసభ్యులు మద్దతు తెలిపారు. 

వైసీపీ  మళ్లీ అధికారంలోకి రాదు: పవన్ కళ్యాణ్

ఏపీలో ప్రభుత్వం మారబోతోంది.. వైసీపీ  మళ్లీ అధికారంలోకి రాదన్నారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌. అభివృద్ధి పేరుతో అన్యాయంగా భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్నవారు ఎక్కడికి పోవాలని పవన్‌ ప్రశ్నించారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులతో ఆయన సమావేశం అయ్యారు. రైతుల పక్షాన జనసేన బలంగా నిలబడుతుందన్నారు. హక్కులను అడగకపోతే.. బలమున్న ప్రతి ఒక్కడు అన్యాయమే చేస్తాడని అన్నారు. పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

ఎంఐఎం ఎప్పటికీ మాకు ఫ్రెండ్లీ పార్టీనే: కేసీఆర్

శాసనసభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్‌. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండాలు పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తెలంగాణను నిండా ముంచిన కాంగ్రెస్‌ నేతలా తమకు నీతులు చెప్పేది అంటూ ఫైర్ అయ్యారు. ఎవరేం చేసినా తెలంగాణలో మళ్లీ అధికారం తమదేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సీట్ల కంటే ఆరేడు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పారు.ఎంఐఎం ఎప్పటికీ మాకు ఫ్రెండ్లీ పార్టీనేనని అన్నారు. 

పోచారం బ్యాక్‌ వాటర్‌లో పంట పొలాలు

మెదక్‌ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో పోచారం బ్యాక్‌ వాటర్‌లో పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 300 ఎకరాలు ప్రాజెక్ట్ బ్యాక్‌ వాటర్‌లో మునిగిపోయాయి. మరికొన్ని చోట్ల పొలాలపై ఇసుక మేటలు వేశాయి.. రాజిపేట గ్రామంలోనే 100 ఎకరాలకు పైగానే సాగుకు వీలుకాకుండా పోయాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. 

విధ్వంసం తప్ప .. నిర్మించడం తెలియని జగన్‌

విధ్వంసం తప్ప .. నిర్మించడం తెలియని జగన్‌ రెడ్డి పాలనలో ప్రాజెక్ట్‌ల పనులన్నీ నిలిచిపోయాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 7న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. టీడీపీ నేతలతో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.. టీడీపీ హయాంలో 34 ప్రాజెక్ట్‌లను పూర్తిచేస్తే... వైసీపీ పాలనలో ప్రాజెక్ట్‌లన్నీ పడకేశాయని మద్దిపాటి వెంకటరాజు ఆరోపించారు.