- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

కేశినేని నాని వైకాపా కోవర్టని తెలిపోయిందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడే మాటల్లో కేశినేనికి కూడా భాగం ఉందని తేలిపోయిందన్నారు. వెలంపల్లికి అనుకూలంగా పనిచేయడానికే..విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నారని వెంకన్న విమర్శించారు. చంద్రబాబు మాటపై గౌరవంతో ఇన్నాళ్లు నానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇప్పడు ఆయన నిజస్వరూపం అందరికీ తెలిసిందన్నారు. అలాగే కేశినేని కుటుంబంలో కలహాలతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత కేశినేని చిన్నీ తెలిపారు. మా కుటుంబంలో సమస్యలు దశాబ్దాలుగా ఉన్నాయని ఆయన వివరించారు. ఎంపీ టిక్కెట్ ఇచ్చి రెండుసార్లు ఆదరించిన నందమూరి, నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని ఆయన మండిపడ్డారు. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ చెంతకు నాని చేరడాన్ని విజయవాడ ప్రజలు హర్షించరన్నారు.

హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో పెనుప్రమాదం తప్పింది. చెన్నె నుంచి వచ్చిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ఐదో ప్లాట్ఫాంవద్ద డెడ్ఎండ్ గోడను ఢీకొట్టింది. ఈ క్రమంలో మూడు బోగీలు పట్టాలు తప్పి ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. స్టేషన్లో ఆగేందుకు నెమ్మదిగా వస్తున్న క్రమంలోనే గోడను ఢీకొట్టడంతో పెద్దగా నష్టంజరగలేదు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది...పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి, ప్రమాదానికి గురైంది. ఉదయం 8గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంది. సికింద్రాబాద్లోనే చాలావరకు ప్రయాణికులు దిగిపోగా మిగిలిన వారితో చివరి స్టేషన్ నాంపల్లికి వచ్చింది. ఐదోప్లాట్ఫాంపైకి వచ్చిన రైలు ఆగే సమయంలో డెడ్ఎండ్ గోడని ఢీకొట్టింది. ఒక్కసారిగా రైలు కుదుపునకు గురికాగా... మూడు బోగీలు "S-2, S-3, S-6” పట్టాలు తప్పాయి అప్పటికే దిగేందుకు సిద్ధమై, డోర్ల వద్ద నిలబడిన ప్రయాణికులు.... భయాందోళనకు గురై పరుగులు తీశారు. బోగీల కుదుపుతో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా.. ….ఇబ్రహీం అనే ప్రయాణికుడికి ఛాతి వద్ద గాయమైంది.
ప్రమాదాన్ని గమనించిన స్టేషన్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలుచేపట్టారు. గాయపడిన ఆరుగురిని లాలాగూడ రైల్వేఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటికి దిగటంతో అంతాఊపిరి పీల్చుకున్నారు. ఐదో ప్లాట్ ఫాంలో ప్రమాదంచోటుచేసుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేసి, పునరుద్దరణ పనులు చేపట్టారు నాంపల్లిస్టేషన్లో ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరాతీశారు. ఘటనకు గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో ప్రమాదంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.

బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది అక్కడికక్కడే మృతి చెందారు. బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళుతున్న మినీబస్సు ట్రక్కును ఢీకొనడంతోఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా – గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రి వేళ ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్పోస్ట్ ఒక ప్రకటనలో పేర్కొనింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది బాధితులు మినీ బస్సులో ఉన్నారని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బహియా సివిల్ పోలీసులు వెల్లడించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం... నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సహా ఇతర అధికారులు విజయవాడ చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం రాజకీయ పార్టీలతో భారత ఎన్నికల చీఫ్ కమిషనర్ బృందం సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదుల పై... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీల తో సీఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నద్ధత పై A.P C.E.O ముఖేష్ కుమార్ మీనా బుధవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్ర విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు సీఈసీ, ఎన్నికల కమిషనర్ లు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దిల్లీకి కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్, ఎన్నికల కమిషనర్ లు తిరిగి వెళ్లనున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో అన్న క్యాంటీన్ పైలాన్ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. కనిగిరిలో రెండో రోజు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఏడాది కాలంగా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే నియోజకవర్గ ఇంఛార్జి ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ..... ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని.... స్వయంగా ఆయన భోజనాలు వడ్డించారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను, ఇంఛార్జిలను తన బస్సులోకి పిలిపించి ముఖాముఖి మాట్లాడారు. కార్యకర్తలతో ఫొటోలు దిగి ఉత్సాహ పరిచారు. వైకాపాను వీడి తెలుగుదేశంలోకి వచ్చిన వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూపొందించిన పాటలు సీడీని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్కు పయనమై వెళ్లారు

విశాఖలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన 33వ డివిజన్ వెంకటేశ్వరమెట్ట కు చెందిన తెలుగుదేశం కార్యకర్త జాగరపు చిన్నా, 41వ డివిజన్ జ్ఞానాపురంలో మృతి చెందిన మలిశెట్టి రమణ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. 45వ డివిజన్ తాడిచెట్లపాలెం కనకరాజు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గాజువాక 66వ డివిజన్ అజిమాబాద్ కోరుకొండ మంగ, 65వ డివిజన్ భానోజి తోటలో సరోజిని, షీలానగర్లో కృష్ణమూర్తి కుటుంబాలను ఆమె ఓదార్చారు. ఆరు కుటుంబాలకు పార్టీ తరఫున ఆమె ఆర్థికసాయం అందించారు. భువనేశ్వరితో పాటు తెలుగుదేశం ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.TDP: కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర

రాజస్థాన్లోని కోటాలోప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోటా జంక్షన్లో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. రైల్వే సిబ్బంది ఆ మార్గంలో మరమ్మతులు చేస్తున్నారు. వీలైనంత తొందరగా రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని వెల్లడించారు. కాగా, ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్లైన్ నంబర్లను అధికారులు విడుదల చేశారు. ఈ సంఘటన బికనీర్లోని లాల్ఘర్ రైల్వే స్టేషన్లో జరిగింది. రైలు పట్టాలు తప్పడానికి కారణాలు తెలియలేదు. రైల్వే అధికారులు రైలు మార్గంలో మరమ్మతులు చేస్తున్నారు. అంతకుముందు డిసెంబర్ 2023లో రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది.

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని.. తప్పుడు చిరునామాతో ఓటుకు దరఖాస్తు చేశారంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో ఉన్న ఓటు హక్కును ఆమె ఇటీవల గుంటూరుకు మార్చుకున్నారు.ఈ క్రమంలో ఆమె తప్పుడు చిరునామా ఇచ్చారని ఆరోపించిన తెలుగుదేశం నాయకులు.... ఈ అంశంపై గుంటూరు వెస్ట్ ఓట్ల నమోదు అధికారికి ఫిర్యాదు చేశారు. శ్యామలా నగర్ లో ఉంటున్నట్టు.. మంత్రి ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి చూస్తే అక్కడ ఖాళీ స్థలం ఉందని తెలుగుదేశం నేతలు ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు చిరునామాతో దరఖాస్తు చేసిన మంత్రి ఓటు తొలగించాలని డిమాండ్ చేశారు.

కొత్త ఏడాది జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంషెద్పూర్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా ఆదిత్యపూర్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జంషెద్పూర్ పోలీసులు తెలిపారు.

గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతాన్నికి చెందిన సుమారు వందమంది మహిళలకు తన సొంత నిధులతో తయారు చేయించిన రాట్నాలను పంపిణీ చేశారు. పార్టీ నేతలు వాటిని లబ్ధిదారులకు అందజేశారు. అధికారంలో లేకపోయినా నారా లోకేష్ మంగళగిరి ప్రజలకు 20కి పైగా సంక్షేమ పథకాలను తన సొంత నిధులతో అమలు చేస్తున్నారని..... అదే ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే మంగళగిరిని ఇంకెంత అభివృద్ధి చేస్తారో ఒకసారి ప్రజలు ఆలోచించాలని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికలలో నారా లోకేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

రేషన్కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందు కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది. అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 54.17% పూర్తయింది.
ఈ కేవైసీ తప్పకుండా పూర్తి చేసుకోవాలన్న అధికారుల సూచనతో రేషన్ దుకాణాల వద్దకు లబ్ధిదారులు భారీగా తరలివస్తున్నారు. అయితే కొత్త రేషన్కార్డులకు అర్హులైన లబ్ధిదారులను అధికారులే ఎంపిక చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆన్లైన్ వెరిఫికేషన్ ద్వారా తెల్ల రేషన్కార్డులు ఎవరికీ ఇవ్వాలో తేల్చాలని.. అనర్హులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లా తిరుచ్చి - రామేశ్వరం రహదారిపై ఈ తెల్లవారుజామున ఓ టక్కు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు రోడ్డు పక్కనున్న ఓ టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.TN: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని భావిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ రాష్ట్రంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ నిలవకుండా ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించగా తాజాగా మరో రాష్ట్రం ఆయనపై వేటు వేసింది. ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు మైన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. కొలరాడో తీర్పుపై రిపబ్లికన్ పార్టీ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్ చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్.. ట్రంప్ పేరును ప్రైమరీ బ్యాలెట్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్తర్వులపై ట్రంప్ కోర్టుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. అప్పటిదాకా ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. బెల్లోస్ నిర్ణయాన్ని రిపబ్లికన్ పార్టీ.. మైన్ రాష్ట్ర కోర్టుల్లో సవాల్ చేయనుంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఓ ఎన్నికల అధికారి ఇలా బ్యాలెట్ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ ఓడిపోయినప్పుడు బైడెన్ను అడ్డుకోవడానికి 2021 జనవరి 6న రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి దిగారు. వారిని ట్రంప్ సమర్థించారని, హింసను ప్రేరేపించారన్న అభియోగాలపై ఇటీవల కొలరాడో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశాధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని తేల్చింది.

కర్ణాటక చిత్రదుర్గలోని ఓ ఇంట్లో ఐదు అస్తిపంజరాలు బయటపడటం....కలకలం రేపింది. పాత బెంగళూరులోని జైలురోడ్డులో ఓ పాడుబడిన ఇంట్లో... అస్తిపంజరాలు ఉన్నట్లు మీడియా ప్రతినిధులు పోలీసులకు...సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన చిత్రదుర్గ పోలీసులు... ఇంటి లోపలికి వెళ్లి చూడగా దిగ్భ్రాంతికర దృశ్యాలు కనిపించాయి. ఒక గదిలో మంచంపై రెండు, నేలపై మరో రెండు అస్తి పంజరాలు కనిపించాయి. అవన్నీ నిద్రపోతున్న భంగిమలో.... ఉన్నాయి. మరో గదిలో ఐదో అస్తిపంజరాన్ని గుర్తించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అస్తి పంజరాల నమూనాలు... ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. అస్తి పంజరాలన్నీ ఆ ఇంటి కుటుంబ సభ్యులవే అని...ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆ ఇంటి సభ్యులంతా ఇతరులకు దూరంగా ఉండేవారని, అనారోగ్యంతో బాధపడేవారని ఇరుగు పొరుగువారు చెప్పినట్లు...పోలీసులు వెల్లడించారు.

వైసీపీ ఎమ్మెల్యేలతో దొంగపని చేయించిన జగన్ను మార్చకుండా, ఎమ్మెల్యేల్ని మారిస్తే సరిపోతుందా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సినిమా అయిపోయిందని, ఇంకా వందరోజులే మిగిలి ఉందని అన్నారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సొంత నియోజకవర్గం కుప్పంలో మూడురోజుల పర్యటనకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గుడిపల్లి మండలం బిసానత్తము వద్ద గజమాలతో ఆహ్వానించారు. గుడిపల్లిలో రైల్వే స్టేషన్ కూడలి నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. అక్కడ బహిరంగసభలో పాల్గొన్నారు. వైసీపీకి మరో వందరోజులే మిగిలి ఉందని, ఊరికో రౌడీని తయారు చేశారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఓ కథ చెప్పిన చంద్రబాబు.. వైకాపా నియోజకవర్గ ఇంఛార్జ్ల్ని మార్చడాన్ని ఎద్దేవా చేశారు. బస్సు సౌకర్యం తీసేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాలని చంద్రబాబు భరోసా ఇచ్చారు. యువతకు, మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు. రాత్రి కుప్పం ఆర్అండ్బీ అతిథిగృహంలో చంద్రబాబు బస చేశారు.

ఎన్నారై వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన చార్జ్షీట్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను ఈడీ చేర్చింది.
కేసు ఏమిటంటే.. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. దీంతో పాటుగా 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మటం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయనేది ఈడీ ఆరోపణ. విదేశాలకు చెందిన సీసీ థంపి(యూఏఈ), సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారని ఆరోపించింది.

TSPSC కొత్త బోర్డు ఏర్పాటయ్యాకే నియామకాలు చేపడతామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజావాణి పకడ్బందీగా అమలు చేస్తామన్న సీఎం... గత ప్రభుత్వ పాలనాతీరుపై విమర్శలు గుప్పించారు. ఉన్న భవనాలను కూల్చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. TSPSC ఛైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని తేల్చిచెప్పిన సీఎం...కొత్త బోర్డు ఏర్పాటు చేసి నియామకాలు చేపడతామన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 24 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సీఎం తెలిపారు. ఫిర్యాదులను స్థానిక అధికారులకు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
ప్రజావాణి విజయవంతమైనట్లేనని వ్యాఖ్యానించిన సీఎం...ఓ మహిళకు ఇటీవల కేటీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడంపైనా స్పందించారు. గత ప్రభుత్వం ఉన్న భవనాలను కూల్చడం వల్ల ఏం లాభం జరిగిందని ప్రశ్నించిన సీఎం.. కోట్ల రూపాయల విలువైన కార్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచి పెట్టారన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్న సీఎం... ఆరున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నిండా ముంచారని ఆరోపించారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.

రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 6.86 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయన్నారు. మహిళలపై 6.65 శాతం నేరాలు తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మంది అరెస్టు అయినట్లు తెలిపారు. గేమింగ్ యాక్ట్పై 188 కేసులు నమోదు కాగా, 972 మంది అరెస్టు అయ్యారు. ఈ ఏడాది 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు చేశామన్నారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని సీపీ తెలిపారు.

అయోధ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు అంతకుమించిన ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయాన్ని విభిన్న కళాకృతులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామ మందిరం తలుపులు హైదరాబాద్లోని బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపో ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. జూన్లో తలుపుల తయారీ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి 60మందికిపైగా కళాకారులు అయోధ్యకు వెళ్లారు. తలుపుల తయారీకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. మహారాష్ట్రలోని బలార్హకు చెందిన టేకు ఉపయోగిస్తున్నారు. బంగారు పూతతో కూడిన 18 ప్రధాన ద్వారాల తలుపులతోపాటు మరో 100 తలుపులను తయారు చేస్తున్నారు.

అయోధ్యలోని రామమందిర ప్రాంగణానికి అవసరమైన తలుపుల తయారీలో నాణ్యమైన కలపను ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ అధిపతి శరత్ బాబు తెలిపారు. నిపుణులైన కళాకారులతో రామాలయం తలుపులను తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు. అందుకోసం అయోధ్యలోనే ఓ ఫ్యాక్టరీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయోధ్య రామమందిరం ప్రారంభమైనా...ఏడాది వరకు పనులు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. తమ శిల్పకళ చాలా బాగుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందించారని పేర్కొన్నారు. ఇంతగొప్ప అవకాశం తమకు లభించటం గర్వంగా ఉందని తెలిపారు.

రాజధాని లేకుండా నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఘనత సీఎం జగన్దేనని... సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఒక్కఛాన్స్ అంటే నమ్మి జగన్కు అధికారం ఇచ్చారన్న ఆయన.... దోచుకోవడం, దాచుకోవడం తప్పితే ఏంచేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని పృథ్వీరాజ్ విశ్వాసం వ్యక్తంచేశారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వంపై పృథ్వీరాజ్ మండిపడ్డారు. వైసీపీలో సలహాదారుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం

కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలకు తెల్లరేషన్ కార్డే అర్హత అని... మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈనెల 28 నుంచి జనవరి 6వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని.... ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ఆ దరఖాస్తులు తీసుకుంటామని పొంగులేటి తెలిపారు. అర్హత ఉన్నవారు గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రసీదు ఇస్తారని.... ఇందిరమ్మ పాలనలో అధికారులే ఇంటి వద్దకు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారని వెల్లడించారు. 10 ఇళ్లు ఉన్నా .. అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించామన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారని వెల్లడించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్ట్ రిజర్వు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన లిఖిత పూర్వక వాదనలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అభ్యంతరాలను తెలుగుదేశం తరపు న్యాయవాదులు.. కోర్టుకు సమర్పించారు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన కోర్టు... చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేశారు. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ రూపకల్పనలో.. అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇరుపక్షాలు వాదనలు వినిపించారు.ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న లోకేశ్ దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ రెండు మెమోలు దాఖలు చేసింది. ఈ మెమోలపై తెలుగుదేశం న్యాయవాదులు అభ్యంతరం చెప్పగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు లోకేశ్ అభ్యంతరాలను లాయర్లు కోర్టుకు సమర్పించారు.

ముఖ్యమంత్రి జగన్ మాటలను నిశితంగా పరిశీలిస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ విమర్శించారు. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయని, పనులు గడప దాటవని లోకేశ్ పేర్కొన్నారు. సొంత ఇలాకా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం మూడేళ్లలో పూర్తిచేస్తానని చెప్పి శిలాఫలకం వేసి ఇప్పటికి నాలుగేళ్లైందని లోకేశ్ గుర్తుచేశారు. 15వేల కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టే స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో పాతికవేలమందికి ఉద్యోగాలు వస్తాయని జగన్ చెప్పారన్న లోకేశ్ .... కనీసం తుప్పలు తొలగించేందుకు నిధులు కేటాయించక. లిబర్టీ స్టీల్స్ పారిపోయిందని ధ్వజమెత్తారు. తర్వాత JSW సంస్థను బతిమాలి మరోసారి భూమిపూజ చేసినా అదీ కార్యరూపు దాల్చలేదని గుర్తుచేశారు. మరో మూడు నెలల్లో పదవీకాలం పూర్తికావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని మండిపడ్డారు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వనందున కంకర వేసి తారువేయకుండా కాంట్రాక్టర్ పారిపోయారని లోకేశ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్’ (JBNP) పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. జాతీయ జెండా రంగులతో జేడీ ఫొటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కరించారు. సమస్య పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేడ్కర్ చెప్పారన్న లక్ష్మీనారాయణ ...ఆ దిశగానే అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే పార్టీ స్థాపించానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. వరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించానని... అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు.. బానిసత్వాన్ని రూపుమాపేందుకు పుట్టిందే జేబీఎన్పీ అని లక్ష్మీనారాయణ తెలిపారు.

లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇండియా కూటమిలోని భావసారూప్యమున్న పార్టీలతో సీట్ల సర్దుబాటు తదితర విషయాలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ-CWC ఇవాళ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన దిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మిగిలిన CWC సభ్యులు హాజరుకానున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కూడా ఇవాళ మధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సీడబ్ల్యూసీ చర్చించనుంది.
కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేవంత్రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డిలూ సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొననున్నారు. కాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నారు. ఢిల్లీకి వెళ్తున్నందున దానిని వాయిదా వేశారు.

యువగళం - నవశకం విజయోత్సవ సభకు జనం పోటెత్తడంతో పోలిపల్లి సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణానికి నలుదిక్కులా, కనుచూపుమేర ఎటుచూసినా జనమే కనిపించారు.

తెలుగుదేశం, జనసేనకు చెందిన వందలాది మంది నాయకులు...., లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు... సమరోత్సాహంతో సభకు తరలివచ్చారు.

చంద్రబాబు, పవన్ తో పాటు... నందమూరి బాలకృష్ణ, ఇతర ముఖ్యనేతలు సభా వేదికపై రాగానే.. ఇరుపార్టీల కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.

అటు విశాఖ నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారి మొత్తం పసుపుమయంగా మారింది. తమ అభిమాన నేతల రాకను స్వాగతిస్తూ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఎక్కడ చూసినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కటౌట్లు కనిపించాయి.


తెలంగాణలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతండీజీపీగా ఉన్న రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం...అంజనీ కుమార్ నురోడ్డు భద్రతా విభాగం ఛైర్మన్ గా నియమించింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరరీ కమిషనర్ గా అంజనీకుమార్ కు... అదనపు బాధ్యతలు అప్పగించింది. మహేశ్ భగవత్ ను రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీగా నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా రాజీవ్ రతన్ ను నియమించిన ప్రభుత్వం ఏసీబీ డీజీ బాధ్యతలను సీవీ ఆనంద్ కుఅప్పగించింది. ఏసీబీ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్ ను నియమించింది. పోలీసు అకాడమీ డైరెక్టర్ గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా నియమితులయ్యారు. సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్ ను నియమించిన ప్రభుత్వం.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించిన ప్రభుత్వం అదనంగా వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ విభాగం బాధ్యతలు అప్పగించింది. అబ్కారీ శాఖ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆదివారం రాత్రి 8.09 గంటలకు వద్దకు వస్తున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్లోని యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనంపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటన జరిగినప్పుడు జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండటా.. ప్రెసిడెంట్ బైడెన్ 130 అడుగుల దూరంలో ఉన్నారు. డెలావేర్లోని తన ప్రచార ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరిన బైడెన్ ఆశ్చర్యపోయారు. బైడెన్ నుండి 130 అడుగుల సమీపంలోని కూడలిలో ఉన్న సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని సెడాన్ కారు ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. భద్రతా సిబ్బంది బైడెన్ ను వెయిటింగ్ వాహనంలో డౌన్టౌన్ విల్మింగ్టన్లోని భవనం నుండి దూరంగా తరలించారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైట్హౌస్కు తరలించారు. దంపతులిద్దరు క్షేమంగా ఉన్నారని అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించారు. కాగా, ఘటనకు పాల్పడిన డ్రైవర్ను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్పైనే పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు. వివేకా హత్యకేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నేతల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని.. ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో కృష్ణారెడ్డి పిటిషన్లో వివరించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్ను కలిసి వినతి పత్రం అందచేశారు. రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజవర్గంలో వైసీపీ వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వర్గానికి చెందిన N.D.C.C.B ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. వ్యతిరేక వర్గానికి చెందిన దువ్వూరు రాకేష్ రెడ్డిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. N.D.C.C.B ఛైర్మన్ ను విమర్శించాడని తనని స్తంభానికి కట్టేసి కొట్టారని బాధితుడు వాపోయాడు. పోలీసుల ఎదుటే నిర్భందించి కొడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లె వైసీపీ నూతన సమన్వయకర్త నియామకం పై అసమ్మతి సెగలు ఎదరవుతున్నాయి. ఇంఛార్జ్ గా ఈవూరు గణేష్ ని నియమించటంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. వైసీపీ సమన్వయ కర్తగా నియామకంపై అధిష్టానం పునరాలోచన చెయ్యాలని వైసీపీ జెడ్పీటీసీ బొర్రా లక్ష్మి భర్త శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ పున పరిశీలన చేసి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని సూచించారు.

తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మద్ధతు తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు భారత్ మైకా మైన్స్ లో జరగుతున్న అక్రమమైనింగ్ ను నిలిపివేయాలంటూ శనివారం నుంచి సోమిరెడ్డి నిరసన చేపట్టారు. శనివారం భారత్ మైకా గనులను పరిశీలించిన సోమిరెడ్డి రాత్రి గనుల వద్దే బస చేశారు. సోమిరెడ్డి చెపట్టిన దీక్షలో టీడీపీ నాయకులు తాడిపర్తి, వరదాయపాలెం, పొదలకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు బందిపోట్ల కన్నా ప్రమాదకరంగా మారారని, ప్రకృతి సంపదను బరితెగించి దోచుకుంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కోట్ల విలువైన క్వార్ట్జ్ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన వెయ్యి టన్నుల క్వార్ట్జ్ను యంత్రాలతో తవ్వి అక్రమంగా తరలి స్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. తాటిపర్తి పంచాయతీ పరిధిలోని రుస్తుం, భారత్ మైకా గనుల్లో క్వార్ట్జ్ తవ్వకాలను ఆయన పరిశీలించారు. గనులకు సమీపంలోనే 50 గిరిజన కుటుంబాలు ఉన్నాయని పేలుళ్ల ధాటికి రాళ్లు ఎగిరి వారి ఇళ్లపై పడుతున్నా... అక్రమార్కులు పట్టించుకోవడం లేదన్నారు. భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ, గనులశాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలను నిలిపేయాలని ఈ నెల 7న హైకోర్టు ఆదేశాలిచ్చినా.. కలెక్టర్, గనులశాఖ అధికారులు స్పందించలేదన్నారు. 12 యంత్రాలు, 30 టిప్పర్లతో సుమారు వంద అడుగుల మేర తవ్వేశారని మండిపడ్డారు.

మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సొంత గ్రామానికి సమీపంలోనే ఇంత దారుణం జరుగుతున్నా.. ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి ఆరోపించారు. అక్రమ తవ్వకాల్లో A1, A 2లుగా మంత్రి కాకాణి, వైసీపీ నాయకుడు శ్యాంప్రసాద్రెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం మైన్ వద్దకు వెళ్లిన సోమిరెడ్డి.. అక్కడే బైఠాయించారు. అధికారులు వచ్చి అక్రమ మైనింగ్ను అడ్డుకుని, వాహనాలను సీజ్ చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. రాత్రి అక్కడే బస చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అక్రమంగా జరుగుతున్న రుస్తుం, భారత్ మైకా మైన్స్ దోపిడీ ఆపాలంటూ చిమ్మ చీకట్లోనూ సోమిరెడ్డి ఆందోళన కొనసాగించారు. అధికారులు రావాలని వచ్చేంత వరకు వాహనాలను బయటకు వదలబోమని... సోమిరెడ్డి క్వారీల వద్దే కూర్చున్నారు. అక్కడకు భారీగా చేరుకున్న స్థానికులు సోమిరెడ్డికి మద్దతుగా ఆందోళన చేపట్టారు. వైకాపా నేతలు 3 వారాలుగా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని.. రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్ ను దోపిడీ చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. అక్రమ మైనింగ్ ఆపాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఉత్తప్రదేశ్లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్పూర్ క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. జార్ఖండ్ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రక్కు కాన్పూర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్నదని ఎస్ఎస్పీ సంజయ్ వర్మా చెప్పారు. డ్రైవర్ను అరెస్టు చేశామని, అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామన్నారు. జేసీబీ, క్రేన్ సహాయంతో ట్రక్కును అక్కడి నుంచి తొలగించామని తెలిపారు. గాయపడిన వారిపరిస్థితి విషమంగా ఉందన్నారు.

భారాస అధినేత KCR యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి కేటీఆర్, హరీశ్ రావు తీసుకెళ్లారు. 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జారీపడిన కేసీఆర్.... వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అప్పట్నుంచి ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్... కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రతి రోజు యశోదా నుంచి వైద్యులు... కేసీఆర్ కు ఫిజియోథెరపీ చేయడానికి నందినగర్ లోని తమ నివాసానికి వెళ్లనున్నారు. . వారం రోజుల తరువాత మరో మారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని రివ్యూ చేస్తారు.
ఈ నెల 8వ తేదీన రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 9వ తేదీన కేసీఆర్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్ను వాకర్ సాయంతో వైద్యులు నడిపించారు. ఇక ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే.

ఆఫ్ఘనిస్తాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) సమాచారం ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది అక్టోబర్లో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ శక్తివంతమైన భూ ప్రకంపనల వల్ల వందలాది మంది మరణించారు. భవనాలు కూలిపోయాయి. తీవ్ర ఆస్తి నష్టం వాటిళ్లింది. గత కొన్ని సంవత్సరాలుగా భూకంపాలకు నిలయమైన ఈ ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ ప్రకంపనల ల్ల 2,000 మందికి పైగా మరణించారని తాలిబాన్ అడ్మినిస్ట్రేటివ్ వెల్లడించింది. ఈ ఘటనలో తొమ్మిది వేల మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.

గుంటూరు ( Guntur ) కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా అక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ను నడుపుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్లకు 25 లక్షలు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది. అయితే, ఆదేశాలు అమలు చేయకపోవడంతో గుంటూరు మునిసిపల్ కమిషనర్కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించింది హైకోర్టు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన... రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అవసరం ఎంతో ఉందని గుర్తుచేశారు. అంతర్గతంగా చేయించిన సర్వేల్లో ఎవరి పనితీరు బాగాలేకపోయినా ఉపేక్షించేది లేదన్నారు. పనితీరు బాగాలేని వారిని ప్రత్యామ్నాయo చూపించి పక్కన పెడతానని, పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టేది లేదని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ఓట్ల అవకతవకల విషయాన్ని నియోజకవర్గ ఇంఛార్జిలు బాధ్యతగా తీసుకుని పోరాడాలని... అన్నీ అధిష్టానం చూసుకుంటుందనే అలసత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దని స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


