చిట్టి న్యూస్

జేడీకి అంతర్జాతీయ పురస్కారం

నటుడు జేడీ చక్రవర్తికి నైజీరియా ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. దహిణి ది విచ్ అనే సినిమాలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు లభించింది. ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జేడీ చక్రవర్తికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జేడీ చక్రవర్తికి అవార్డు లభించిడంతో సినీ ప్రబుఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జేడీ చక్రవర్తి హీరోగా, విలన్‌గా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

పాక ఇడ్లీ పై మాజీ ఉప రాష్ట్రపతి మమకారం

విజయవాడలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ట్రిపుల్ ఎస్ ఇడ్లీ సెంటర్‌లో టిఫిన్ చేశారు. మాజీమంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి పాక ఇడ్లీ తిన్నారు. ట్రిపుల్ ఎస్ ఇడ్లీ సెంటర్‌లో ఇడ్లీ తినేందుకు ప్రత్యేకంగా గన్నవరం నుంచి విజయవాడ వచ్చిన వెంకయ్యనాయుడు.. నాణ్యమైన ఇడ్లీ అందిస్తున్నారని హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్‌ను అభినందించారు. సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని తెలిపారు.

హెలీకాఫ్టర్ ను ఢీకొన్న పక్షి

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొంది. అప్రమత్తమైన పెలెట్లు బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ జక్కూర్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. కోలార్ సమీపంలోని ముల్బాగిలు మార్గంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హోస్కోట్‌ సమీపంలో గాలిలో ఒక డేగ హెలికాప్టర్‌ ను ఢీకొనగా.. విండ్‌షీల్డ్‌ అద్దం పగిలిపోయింది.

కేరళ స్టోరీకి గ్రీన్ సిగ్నల్

ద కేరళ స్టోరీ' అనే సినిమా ఎట్టకేలకు విడుదల కానుంది. మే 5న విడుదల కానున్న ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా నుంచి 10 సన్నివేశాలను తొలగించింది. కేరళ నుంచి 32 వేల మంది యువతులను నమ్మించి పెళ్లిచేసుకుని మతం మార్చి తీవ్రవాదులుగా మార్చారన్న కథనంతో ఈ సినిమా తెరకెక్కినట్లు చిత్ర యునిట్ తెలిపింది. దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ.. నిజ జీవితాల ఆధారంగానే సినిమాను తెరకెక్కించినట్లు స్పష్టం చేశారు. 

తండ్రి పేరు అవసరంలేదు

బాధ్యత లేని తండ్రి పేరు కుమారుడి పాస్ పోర్టులో ఉండనవసరం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. బిడ్డ తల్లి కడుపులోనే ఉండగా విడాకులు ఇచ్చి తనదారి తాను చూసుకున్న తండ్రి పేరు కుమారుని పాస్ పోర్టునుంచి తొలగించాలని అధికారులను ఆదేశించింది గౌరవ కోర్టు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తండ్రి పేరును మార్చుకునే అవకాశం ఉందని, ఇంటిపేరును కూడా మార్చుకోవచ్చని పేర్కొంది. 


NCP అధ్యక్ష పదవికి  శరద్ పవార్ రాజీనామా

మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  పవార్ దేశంలోని అగ్ర ప్రతిపక్ష నాయకులలో ఒకరు, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన్, కాంగ్రెస్ మరియు ఎన్‌సిపి మధ్య అప్పటికి సాధ్యం కాని కూటమిని కుట్టడంలో పెద్ద పాత్ర ఉంది. ఆయన తర్వాత పార్టీ అధినేత ఎవరనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

రూ. 13కోట్లు విలువైన విషం

ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో పశ్చిమ బెంగాల్ నుంచి రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు స్వాథీనం చేసుకున్నారు.  బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు రూ.13 కోట్ల విలువైన పాము విషంతో అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. దీనిపై బీఎస్ఎఫ్ బలగాలకు సమాచారం అందించి నిఘా పెట్టారు. పశ్చిమ బెంగాల్‌ హిలి ప్రాంతంలోని పహన్‌పరా గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత స్మగ్లర్లు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరపారు. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

టీచర్లకు సెలవులు లేవ్....

ఏపీలో టీచర్ల సెలవులకు జగన్‌ సర్కార్‌ నో చెప్పేసింది. దీంతో ఇప్పటివరకూ వెకేషన్‌ ఎంప్లాయిస్‌గా ఉన్న టీచర్లు ఇప్పుడు నాన్‌-వెకేషన్‌ ఎంప్లాయిస్‌గా మారిపోనున్నారు. ఈ సమ్మర్‌ హాలీడేస్‌లో వారికి అనేక పనులు అప్పగిస్తూ షెడ్యూల్‌ను రిలీజ్‌ చేసింది. అయితే ఇందుకోసం టీచర్లు స్కూళ్లకు రావాలా వద్దా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ టాస్క్‌లను మాత్రం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో టీచర్లు మండిపడుతున్నారు. 

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్‌.. 20 ప్రాంతాల్లో 40 బృందాలు ఏకకాలంలో సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్, గచ్చిబౌలిలో సోదాలు జరుగుతున్నాయి, ప్రముఖ వస్త్ర వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కళామందిర్, కాంచీపురం, వరమహాలక్ష్మి షాపింగ్‌ మాల్స్, ఆఫీస్‌లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో మొత్తం 20 ప్రాంతాల్లో... 40 ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి.

ఏ.కొండూరు కేశినేని చిన్ని పర్యటన..300 మంది కిడ్నీ బాధితులకు ఆర్థిక సాయం

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో టీడీపీ నేత కేశినేని చిన్ని పర్యటించారు. 21 గ్రామాల్లో 300 మంది కిడ్నీ బాధితులకు ఆర్థిక సాయంతోపాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. తొలుత చీమల పాడు పెద్దతండాలోని కిడ్నీ బాధితులకు మెడిసిన్‌ కోసం మూడువేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ శావల దేవదత్, టీడీపీ నాయ కులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Hyderabad:నత్త నడకన నాలా పనులు

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నాలా పనులు నత్త నడకన సాగుతున్నాయి. ముషీరాబాద్‌లోని నాగమయ్యకుంటలో నాలా పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో ప్రారంభమైన నాగమయ్యకుంట నాలా పనులు నేటికి కూడా పూర్తి కాకపోవడంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. వేసవిలో కురిసే ఆర,కొర వానలకే నగరంలో కొన్ని ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వరదలో కార్లు, బైక్‌లు కొట్టుకుపోతున్నాయి. ఒక్క నల్లకుంట నాలాలోనే 10 కార్లు,30 బైక్‌లు కొట్టుకుపోయాయి. 

భట్టి పాదయాత్రకు సీతక్క సంఘీభావం

యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జోరుగా సాగుతోంది. భట్టి పాదయాత్రను సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే సీతక్క.. నేతలతో కలిసి ఉత్సాహంగా నడిచారు. రఘునాథపురంలో కార్నర్ మీటింగ్ నిర్వహించగా.. రఘునాథపురంను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తీహార్ జైలులో గ్యాంగ్‌ వార్..టిల్లు తాజ్‌పురియా మృతి

తీహార్ జైలులో గ్యాంగ్‌ వార్ జరిగింది. ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న టిల్లు తాజ్‌పురియాను ప్రత్యర్థి యోగేష్ తుండా కొట్టి చంపాడు. జైలు సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే జైలు నుంచి ఆస్పత్రికి తరలించే లోపే టిల్లు తాజ్‌పురియా మృతి చెందాడు. అటు ఖైదీల మధ్య ఘర్షణపై జైలు అధికారులు విచారణకు ఆదేశించారు.

నిలకడగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆరోగ్యం

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డిశ్చార్జి చేయాలని భావించినప్పటికి పరిశీలనలోనే ఉంచామన్నారు వైద్యులు. పొత్తి కడుపు ఎగువభాగంలో నొప్పి రావడంతో.. ఆయన్ను ఆదివారం రాత్రి ఎయిమ్స్‌లో చేర్పించారు.

సీఎం కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుంది: షర్మిల

సీఎం కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్య క్షురాలు షర్మిల. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మం డలాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను ఆమె పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన షర్మిల.. రైతుబంధు ఇచ్చి నష్ట పరిహారం ఇవ్వకపోతే ఎ లా అంటూ ప్రశ్నించారు. తరుగు పేరుతో పెద్ద దోపిడీ జరుగుతుందని మం డిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్న పట్టించు కోవడం లేదని ఫైర్ అయ్యారు.

సచివాలయం వద్ద టెన్షన్.. రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సచివాలయానికి బయల్దేరిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై రేవంత్ ఫైరయ్యారు. అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ 30 ఏళ్ల లీజులో అక్రమాలు జరిగాయని తొలి నుంచి రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇందులో బాగంగానే మున్సిపల్ అడ్మిననిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌ కుమార్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న రేవంత్ ని పోలీసులు అడ్డుకున్నారు.

కొడాలి నానిపై వెనిగండ్ల రాము ఆగ్రహం

కొడాలి నానిపై టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు భారీ జనసందోహంతో వెళ్లిన వెనిగండ్ల రాము.. కొడాలి నాని చేష్టలతో తమది గుడివాడ అని చెపుకోవాలంటే ప్రజలు సిగ్గుపడే పరిస్థితి వచ్చిందన్నారు. దిగజారుడు రాజకీయాలకు కొడాలి నాని నిలువెత్తు నిదర్శనమన్నారు. ఇక రజినీకాంత్‌పై కొడాలి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వెనిగండ్ల రాము.. పక్క రాష్ట్రాల్లో కూడా గుడివాడకు చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండ: మంత్రి పువ్వాడ

బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని గ్రైన్ మార్కెట్‌లో నిర్వహించిన మే డే కార్యక్రమంలో పాల్గొన్న పువ్వాడ.. కార్మికుల కష్టాలు తీర్చేది ఒక్క కేసీఆర్ మాత్రమేనన్నారు. ఇక గ్రైన్ మార్కెట్‌ అభివృద్ధి కోసం కేసీఆర్ 10 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. అంతకు ముందు మే డే పురస్కరించుని గ్రైన్ మార్కెట్‌ నుంచి ఇల్లందు క్రాస్‌ వరకు సుమారు 3వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు

Vishakapatnam: ఆందోళన బాటలో ఉపాధ్యాయులు

విశాఖలో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉమెన్స్ కాలేజీ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉప్పెన పేరుతో నిర్వహించిన సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావుతోపాటు అన్ని సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీ పీఎస్‌ విధానం రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించా రు.

సీఎం జగన్‌ పదితలల రాక్షసుడు: నక్కా ఆనందబాబు

జగన్‌ పదితలల రాక్షసుడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. జగనాసుర అవినీతి, నేర రాక్షసుడు అంటూ జగన్‌ పదితలల దిష్టిబొమ్మతో గుంటూరులో నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. క్రిమినల్ కేసులతో పట్టా అందుకున్న ఘనత జగన్‌కే దక్కుతుందని నక్కా అనందబాబు అన్నారు. భూమాఫియాకు జగన్‌ పెట్టింది పేరని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: భట్టి విక్రమార్క

యాదాద్రి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఆలేరు నియోజకవర్గంలో బీర్ల అయిలయ్యతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నామని.. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.

కారులో చిక్కుకుని, ఊపిరాడక చిన్నారి మృతి

కాకినాడ జిల్లాలోని కోలంకలో కారులో ఇరుక్కుపోయిన ఎనిమిదేళ్ల చిన్నారి అఖిలాండేశ్వరి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. పాల ప్యాకెట్‌ కోసం వెళ్లిన బాలిక.. పక్కింటివారు రోడ్డుపై నిలిపిన కారులోకి వెళ్లి కూర్చుంది. కారు డోర్‌ లాక్‌ కావడంతో ఆ పాప బయటి రాలేకపోయింది. ఊపిరి ఆడక మృతి చెందింది. బాలిక కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. చివరికి ఇంటి పక్కనున్న కారులో విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

మొత్తానికి చిక్కాడు

హైదరాబాద్‌కు చెందిన గ్యాంబ్లర్‌ చీకోటి ప్రవీణ్ థాయ్‌ పోలీసులకు చిక్కాడు. థాయ్‌ల్యాండ్‌ పోలీసులు అతి పెద్ద గ్యాంబ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించారు. పటాయాలోని ఆసియా హోటల్‌లో నిన్న రాత్రి నిర్వహించిన దాడుల్లో... గ్యాంబ్లింగ్‌ ఆడుతున్న 97 మంది పోలీసులు పట్టుబడ్డారు. వీరిలో 80 మంది భారతీయులే అని పోలీసులు వెల్లడించారు. ఇందులో గ్యాంబ్లర్‌ చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. వీరిందరూ కేవలం గ్యాంబ్లింగ్ కోసమే థాయ్‌కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్యాసినోలో దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు భావిస్తున్నారు.


ద్వారకా తిరుమలలో భారీ వర్షం..తీవ్ర ఇబ్బందుల్లో స్వామివారి దర్శనం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. చిన తిరుమలగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో భారీ వర్షం కురిసింది. ద్వారకా తిరుమల్లో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపధ్యంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. వెంకన్నను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడం, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం కావడంతో వర్షంలోనే తడుస్తూనే దర్శనం చేసుకున్నారు భక్తులు. క్యూలైన్ల లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘాట్‌ రోడ్డుకు ఇరువైపులా వరద ప్రవాహం పెరగడంతో ద్వారకా తిరుమల గ్రామం నీట మునిగింది.

మీ నోటి దురదకు సారీ చెప్పాల్సిందే: చంద్రబాబు

హీరో రజనీకాంత్‌పై వైసీపీ నేత విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. విజయవాడ పర్యటనలో జగన్ ప్రభుత్వంపై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నేతలు చేసిన నీచపు వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. తన అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర దాడిని ఖండిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


వైభవంగా త్రిసూర్‌లో పురం వేడుకలు

కేరళలోనిత్రిసూర్‌లో పురం వేడుకలు వైభవంగాజరిగాయి. వడక్కునాథన్‌ ఆలయం వేదికగా ఈ ఉత్సవాలు జరిగాయి. పది గ్రామాల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఏనుగులపై ఊరేగాయి. ప్రత్యేక పూజలు అనంతరం... ఆలయం సమీపంలోని థెక్కిన్‌కాడు మైదానంలో అంగరంగ వైభవంగా “పూరం” పర్వం జరిగింది. సంప్రదాయాలు, ఆచారాలకు పెద్దపీట వేసే కేరళలోని అన్ని ఆలయాలలో ఇలాంటి వేడుకలు జరుగుతాయి. కానీ, త్రిసూర్‌లోని జరిగే పూరానికి ఓ ప్రత్యేకత ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి... స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

కేసీఆర్‌ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయం: ఈటల

కేసీఆర్‌ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయం నిర్మించారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఈ మూడు, నాలుగు నెలల పాటు రోజూ కేసీఆర్‌ ఆఫీస్‌కు వస్తారా అని ప్రశ్నించారు. ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేయడానికే కొత్త సచివాలయమని ఆరోపించారు. తొమ్మిది సంవత్సరాలుగా పాలన అస్తవ్యస్తమైందని.. వ్యవస్థలు చట్టుబండలు అయ్యాయని అన్నారు. కొత్త సచివాలయంలోనైనా పాలన బాగుపడాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

ఎవరి బలం ఏంటన్నదానికి ఎమ్మెల్సీ ఫలితాలే సాక్ష్యం: కాల్వ శ్రీనివాసులు

ఏపీలో ఎవరి బలం ఏంటన్నదానికి మొన్నటి ఎమ్మెల్సీ ఫలితాలే సాక్ష్యమన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. సొంత కుటుంబ సభ్యులు కూడా జగన్‌ను నమ్మనప్పుడు.. ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారంలో గోబెల్స్‌ను మించిపోయారని అన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వం వ్యూహాత్మకంగా దివాళా తీయిస్తుంది: బండి

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వం వ్యూహాత్మకంగా దివాళా తీయిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చరిత్రను తిరగరాస్తామన్నారు. కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడే వరకు ఉద్యోగులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఐదు నెలల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలను సీఎం జగన్‌ టార్గెట్‌ చేశారు: సీపీఐ రామకృష్ణ

ప్రతిపక్షాలను జగన్‌ టార్గెట్‌ చేశారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సమస్యలపై మాట్లాడకుండా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కేంద్రం దిగి వచ్చే దాకా తాము వెనక్కు తగ్గబోమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం మే 3న రాస్తారోకో నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ నుంచి జగన్‌ పాలన సాగిస్తానంటే ప్రజలు అంగీకరించడం లేదన్నారు.

స్పీకర్‌ తమ్మినేని ఫేక్‌ సర్టిఫికేట్‌పై  పీఎస్‌లో ఫిర్యాదు: కూన రవి

స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఫేక్‌ సర్టిఫికేట్‌పై పీఎస్‌లో ఫిర్యాదు చేస్తానన్నారు టీడీపీ నేత కూన రవికుమార్‌. ఫేక్‌ సర్టిఫికేట్‌పై విచారణ జరపకపోతే రాష్ట్రపతికి, గవర్నర్‌కి కంప్లైంట్‌ చేస్తానన్నారు. స్పీకర్ పదవిలో ఉండి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్‌ సమర్పించడం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. ఆదర్శంగా ఉండవల్సిన వ్యక్తులు విలువలను మం టగలుపుతున్నారంటూ కూన రవికుమార్ మండిపడ్డారు.

థానేలో కుప్పకూలిన పాత భవనం

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో రెండంతస్తుల గోడౌన్ కుప్పకూలింది. ఈ ఘటన శనివారం జరిగింది. గోడౌన్ కూలడంతో దాని పక్కనే నివసిస్తున్న వాళ్లు, అందులో పనిచేస్తున్నవాళ్లు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం, పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ అవినాష్ సావంత్ సంఘటన జరిగిన మంకోలిలోని వల్పాడ ప్రాంతాన్ని సందర్శించారు. రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపారు.



శంషాబాద్‌లో రెచ్చిపోయిన వీధికుక్కలు..చిన్నారి సహా నలుగురికి తీవ్రగాయాలు

తెలంగాణలో వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. రోడ్ల మీదకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. శంషాబాద్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. మధురానగర్‌లో నలుగురిపై దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కుక్కల దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. శంషాబాద్‌ మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫైరవుతున్నారు.

కటకటాల్లోకి ఐపీఎల్‌ నకిలీ టికెట్స్‌ విక్రయిస్తున్న ముఠా

ఐపీఎల్‌ నకిలీ టికెట్స్‌ తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఆరుగురిని అరెస్ట్‌ చేసి రెండు వందల నకిలీ టికెట్లు తయారు చేసినట్లు గుర్తించారు. అందులో 132 టికెట్లను విక్రయించారని.. 68 టికెట్లు సీజ్‌ చేశారు. ఇందులో అఖిల్‌అమద్‌ కీలక పాత్ర పోషించాడని రాచకొండ సీపీ చౌహాన్‌ తెలిపారు. నిందితులు ఎవరెవరికి టికెట్లు విక్రయించారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అక్రిడిటేషన్‌ కార్డు బార్‌కోడ్‌ను సెల్‌ఫోన్‌లో కాపీ చేసి.. అనంతరం జిరాక్స్‌ తీసి నకిలీలకు తెరలేపారని సీపీ చౌహాన్‌ వెల్లడించారు.

తెలంగాణలో ఉన్న ప్రగతి దేశంలో ఎక్కడా లేదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఖమ్మం జిల్లా కల్లూరులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పర్యటించారు. ఇందులో భాగంగా ఎం పీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మినీ స్టేడియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.. రాష్ట్రంలో గ్రామ గ్రామన ఉన్న ప్రగతి దేశంలో ఎక్కడా లేదన్నారు. కులం, మతం బేధం లేకుండా కేసీ ఆర్ పాలన కొనసాగుతుందన్నారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ క్రీడాకారులను, రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

ప్రమాదవశాత్తూ లోయలో పడిన సైనిక వాహనం

జవాన్లతో వెళ్తున్న ఆర్మీ మెహికిల్ లోయలోపడి ఇద్దరు సైనికులు మరణించారు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్ లోని రాజౌరిలో శనివారం జరిగింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ( LoC ) సమీపంలోని కేరి సెక్టార్ వద్ద ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న దుంగిగాలా గ్రామ సమీపంలోని ఓ మలుపు వద్ద ఆర్మీకి చెందిన అంబులెన్స్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్, ఓ జవాను మృతి చెందినట్లు చెప్పారు. వారి మృతదేహాలను వెలికితీస్తున్నారు.