- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ట్రైనీ IPS దేవేంద్ర కుమార్ను పెళ్లాడారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. నిరాడంబరంగా వివాహం చేసుకున్న అపరాజిత సింగ్, దేవేంద్ర కుమార్ లకు కలెక్టరేట్ ఉద్యోగుల అభినందనలు తెలిపారు.

వరంగల్ లోని AJ మిల్స్ కాలనీ CI వీరంగం సృష్టించాడు. చిరు హోటళ్ల నిర్వాహకులపై ప్రతాపం చూపారు.రాత్రి 10 గంటల తరువాత హోటళ్లు తెరిచి ఉంచారన్న నెపంతో..లాఠీతో రెచ్చిపోయాడు. తన పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 10 గంటల తర్వాత హోటళ్ళు తెరిచి కనపడొద్దు అంటూ..వీరంగం సృష్టించాడు. బార్లు, వైన్ షాపులు అర్ధరాత్రి వరకు బార్లా తెరిచుకొని తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నా పట్టించుకోలేదు. సదరు సీఐ తీరుపై బాధితులు పోలీస్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యేకు కు ఫిర్యాదు చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి హర్యానా, చత్తీస్ఘడ్ నుంచి భక్తులు పోటెత్తారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిబాబా మహా సమాధిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. భక్తుల సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం హోరెత్తింది.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగు గంగ కాలువ పనులను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరిశీలించారు. కాలువలకు నీళ్లు విడుదల చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కమీషన్లు తీసుకోవడం, కబ్జాలు చేయడం, తప్పుడు కేసులు పెట్టి ఆనందం పొందడంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యేకు రైతుల కష్టాలు పట్టవా అంటూ మండిపడ్డారు. పంటలకు నీళ్లు వదలకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు అఖిలప్రియా. గంగుల కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చినా ఆళ్లగడ్డ నియోకజవర్గానికి ఎలాంటి ఉపయోగంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలప్రియ.

కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం విడదీయరానిదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ ఆరోపించారు. కవితపై ఉన్న కేసుల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గల్లీలో, ఢిల్లీలో కలిసి నడవడమే ఈ పార్టీలకు తెలుసని ఎద్దేవా చేశారు. కేకే, నామాలు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రం మొత్తాన్ని రాష్ట్ర సర్కార్ మత్తులో ముంచింది అని విమర్శించారు. మద్యంపై ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుందని అన్నారు. ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం కొద్ది నెలల్లోనే ఉందని NVSS ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

విజయవాడలో వాంబే కాలనీలో రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఆందోళనకు దిగారు లబ్దిదారులు. డిస్నీ లాండ్ వద్ద ఉన్న కార్పోరేషన్ స్థలాన్ని పేదలకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వీరికి సీపీఎం మద్దతు పలికింది. వైసీపీ నేతలకు దోచిపెట్టేందుకే నగరపాలక సంస్థ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు సీపీఎం కార్యవర్గ సభ్యులు బాబురావు. ఈ భూముల్ని పేదలకు పంచేవరకు తమ పోరాటం ఆగదన్నారు.

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మైచర్లపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. చేపలచెరువు వేలంపాట విషయంలో నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. వేలంపాట ద్వారా వచ్చిన రెండు లక్షల రూపాయల్లో.. యాభై వేల రూపాలయలను పంచాయతికి తక్కువగా కట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. లెక్కలు చూపాలన్న టీడీపీ వర్గీయులపై వైసీపీ సర్పంచ్ మాణిక్యం దాడి చేశాడు. దీంతో ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలో విపక్షాల కూటమి ఇండియాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు బీజేపీ ఎంపీలు.పార్లమెంట్ ముందు ఉన్న గాంధీ విగ్రహాం ముందు... నిరసన తెలిపారు. క్విట్ ఇండియా అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. కాంగ్రెస్ తో పాటు విపక్షాల తీరును ఖండించారు బీజేపీ ఎంపీలు. అవినీతికి కేరాఫ్ గా ఉన్న కాంగ్రెస్ ....ఇప్పుడు అవిశ్వాసం పేరుతో.. రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు.

ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలోఇళ్ల పట్టాల డొల్లతనంపై కలెక్టర్ను వైసీపీ నేతలే నిలదీశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఎక్కడ ఉందో తెలియదంటున్నారు లబ్ధిదారులు. వారితో కలసి గుంటుపల్లిలో కలెక్టర్ను అడ్డకున్నారు అధికార పార్టీ నేతలు. ఉత్తుత్తి పట్టాలు మాకు వద్దంటూ జగనన్న ఇళ్ల పట్టాలను కలెక్టర్ కాళ్ల దగ్గర పడేసిన లబ్ధిదారులు. అసలైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. లబ్ధిదారులతో కలిసి వైసీపీ నేతలే కలెక్టర్ను ఘెరావ్ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.

విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లే అవుట్లోని అపార్టుమెంట్ నీటి సంపులో ఇద్దరు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతులు తల్లి సంధ్య, పిల్లలు ఆలేఖ్య, గౌతమ్ లుగా గుర్తించారు. కంచరపాలెం సీఐ సాయి ఆధ్వర్యంలో సంపులోని నీరు తోడి ముగ్గుర్ని బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు. మృతురాలు సంధ్య భర్త లక్ష్మణ్ 9 నెలలుగా అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తున్నారు.

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా శంభుని రెడ్లను ఎస్సీలో చేర్పిస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శంభునిరెడ్ల కులస్తులు వారి వాగ్దానాన్ని గుర్తు చేశారు. శంభుని రెడ్ల కులస్తును ఎస్సీ కేటగిరీలో చేర్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నానని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎస్సీలో కలిపేందుకు న్యాయం చేస్తానని మీడియా ముఖంగా అనడంతో సమస్య మొదలైంది. దీంతో దళిత సంఘాలు ఉద్యమబాట పట్టాయి.

అంగళ్ల ఘటనలో చంద్రబాబు సహా టీడీపీ నాయుకులపై కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఖండించారు. ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఏ పరిస్థితుల్లో కేసు పెట్టాలో.. పెట్టకూడదో అన్న విచక్షణ పోలీసులకు ఉండాలన్నారు. రాజ్యాంగ పరిధిలో ఉన్నవారిపై కేసులు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. చంద్రబాబుకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.

కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. డౌన్ డౌన్ కొడాలి నాని... జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ.... పట్టణ పురవీధుల్లో అభిమానులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చిరంజీవి అభిమానుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, చిరంజీవి అభిమానుల మధ్య జరిగిన తోపులాట వాగ్వాదానికి దారితీసింది. పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షిరాభిషేకం చేశారు. చిరంజీవికి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ సర్కార్పై టీడీపీ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. అంగళ్లు ఘర్షణలకు అసలు కుట్రదారులు జగన్, పెద్దిరెడ్డి,ఎస్పీ రిశాంత్రెడ్డినే నని అన్నారు. కేసులు మాపై కాదు..అసలైన కుట్రదారులపై పెట్టండని పోలీసులకు సూచించారు.తప్పుడు కేసులతో టీడీపీ నేతలు ఏం చేయలేరని అన్నారు. టీడీపీకి చెందిన 13 కార్లు ధ్వంసం చేసి తిరిగి తమ పైనే కేసులా..? అని ప్రశ్నించారు.ఎస్పీ రిశాంత్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..20 మందిపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే తమను అరెస్ట్ చేసుకోవచ్చన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి. చంద్రబాబుతో పాటు తామంతా విజయనగరంలోనే ఉన్నామని, ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామన్నారు. వైసీపీ వాళ్లు దాడులు చేస్తే ... కేసులు మాత్రం తమపై పెడతారా? అంటూ ప్రశ్నించారు. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందన్న ఆయన.... కేసుల్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు

జగన్ దురాగతాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టిన పెన్నా టు వంశధార యాత్రకు ప్రజాదరణ లభిస్తోందన్నారు. అది చూసి ఓర్వలేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. రాయలసీమ పర్యటనకు విశేష ఆదరణ వచ్చిందన్నారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారన్నారు పల్లా శ్రీనివాస్.

తూర్పుగోదావరి జిల్లా బిక్కవొలు మండలం తొస్సిపూడిలో.....ఓ బాణాసంచా గోడౌన్లో పేలుడు జరిగింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమీపంలో ఉన్న రైస్ మిల్లు, పెట్రోల్ బంక్ పాక్షికంగా ధ్వంసమయ్యాయి. తొస్సిపూడిలోని ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర ఓ గదిలో అక్రమంగా బాణాసంచాను నిల్వ చేశారు. ఒక్కసారిగా బాణాసంచా పేలడంతో చుట్టుపక్కలవారు భయభ్రాంతులకులోనయ్యారు. ఈ ఘటనలో సుమారు 20 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూదొంగలు రెచ్చిపోతున్నారు. విలువైన భూములను మాయం చేస్తున్నారు. ఇప్పటికే 40 వేల కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతల భూదోపిడీపై చార్జిషీట్ పేరుతో టీడీపీ ఆందోళన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల భూదందాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు దోచుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామంటున్నారు.

అసెంబ్లీ స్పీకర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించాడంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం రూమ్ కూడా ఇవ్వకపోతే.. గన్ మెన్స్ రూమ్లో కూర్చొని నోట్స్ రాసుకున్నామన్నారు.ఒక సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది కేవలం 14 రోజులేనన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేకు కన్వెన్షన్ ఉంటాయని.. వాటిని ఎక్కడా స్పీకర్ పాటించలేదన్నారు. అసెంబ్లీలో ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేరాలేదని.. ఎంఐఎం అడిగితే మాత్రం లేచి లేచి సమాధానాలు చెప్పారని విమర్శించారు.

హిందూధర్మం అనుసరించేవాళ్లనే టీటీడీ చైర్మన్గా నియమించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. హిందూధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లైతేనే టీటీడీ చైర్మన్ పదవికి న్యాయం చేస్తారని చెప్పారు. గతంలో ప్రభుత్వం 80 మందితో ధర్మకర్తల మండలిని నియమించిందని.....దీనిపై విమర్శలు రావడంతో 52 మంది నియామకాలను నిలిపివేసిందన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ పదవులను ప్రభుత్వం రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తుందని పురందేశ్వరి ఆరోపించారు.

జగన్ సర్కారు ఉక్కుపాదం మోపినా ఏపీ విద్యుత్ ఉద్యోగులు ఎక్కడా తగ్గడం లేదు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కాకినాడలో ఆందోళన చేపట్టారు. పాదయాత్రలో జగన్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే మాట తప్పి.. మడమ తిప్పిన నాయకుడు జగన్ అని ఆరోపించారు. ప్రభుత్వం మాట తప్పడం వల్లే తాము ధర్నాకు దిగామని తెలిపారు. సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, డీఏలు తక్షణమే ఇవ్వాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్పంచ్లను జగన్ సర్కారు ఉత్సవ విగ్రహంలా మార్చిందని ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తోందని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో గ్రామ పంచాయతీలకు కేంద్రం 8 వేల 600 కోట్లకు పైగా నిధులు ఇచ్చిందన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక ఎంతో మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 10న సర్పంచ్లకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపడుతుందని పురందేశ్వరి అన్నారు.

కేసీఆర్ సర్కారు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరును బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పుబట్టారు. ఏడాదిలో కేవలం 14 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 60 రోజుల పాటు సభను నిర్వహించేవారని గుర్తుచేశారు. అంశాలపై చర్చించకుండా, ప్రశ్నలకు అధికారపక్షం సమాధానం చెప్పకుండా వెకిలి మాటలతో అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీఏసీ సమావేశానికి బీజేపీని పిలవకుండా స్పీకర్ అవమాన పరిచారన్న ఆయన.. సభను నడుపుతున్న తీరు, బీజేపీకి సమయం ఇవ్వకపోవడాన్ని తప్పబట్టారు.

గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీసీ బంధు పథకంలో భాగంగా ఖమ్మంలో 290మంది లబ్దిదారులకు చెక్కులు అందజేసిన పువ్వాడ... గతంలో ఏ స్కీమ్ పెట్టినా కంటితుడుపుగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని పారదర్శకంగా అమలు అవుతున్నాయని చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని ఫౌండేషన్ సేవలు కొనసాగుతున్నాయి. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కేశినేని ఫౌండేషన్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది. మెడికల్ క్యాంపును టీడీపీ నాయకులు, కేశినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు. పేద ప్రజలకు సేవలు అందించడంలో కేశినేని ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుందని అంటున్న కేశినేని చిన్ని అన్నారు.

మూడో విడత వారాహి యాత్రకు పవన్ సిద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి విశాఖలో ఆయన పర్యటించనున్నారు. మూడోవిడత వారాహి యాత్రకు సంబంధించి మాడుగుల నియోజకవర్గం జనసేన నేతలు పోస్టర్లను విడుదల చేశారు. పవన్ యాత్రకు భారీగా అభిమానులు, జనసైనికులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. చలో విశాఖను జయప్రదం చేయాలన్నారు. వారాహియాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పవన్ ఆర్జీలను స్వీకరిస్తారని జనసేన నేత రాయపురెడ్డి వెల్లడించారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో ఇసుక దోపిడీ, భూ కబ్జాలను పవన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

ఏపీ సీఎం జగన్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైరయ్యారు. జగన్ సీఎంగా ఉండగా పోలవరం పూర్తి కాదని విమర్శించారు. ఒక్కొక్క బాధితుడికి 10 లక్షలు ఇస్తానన్నారు కానీ.. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదన్నారు. గతంలో తానే పూర్తి చేస్తానన్న జగన్.. ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారన్నారు. 2025 నాటికి పూర్తి చేస్తామంటూ గడువు పెంచారని.. అయితే 2025 నాటికి జగన్ సీఎంగా ఉండరన్నారు. నిర్వాసితుల్ని నీళ్లలో ముంచి మాట మారుస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీ రైతు ప్రభుత్వమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతులకు ఏ కష్టం రాకుండా కేసీఆర్ అండగా నిలబడుతున్నారని చెప్పారు. వరంగల్ జిల్లాలో వ్యవసాయ యాంత్రికరణ కోసం 75 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. 50శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్ల అందజేస్తున్నామని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సీఎం జగన్ పర్యటనతో కోనసీమ లంక గ్రామాల ప్రజల కష్టాలు పడుతున్నారు. సీఎం సభ నేపధ్యంలో ఉదయం నుంచే వారిని సభాస్థలికి తరలించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంటి పిల్లలతో మహిళలు నానా అవస్థలు పడ్డారు. కనీసం మంచినీరు దొరక్క నీరసంతో సభా వేదిక వద్దే కూలబడ్డారు. ఆకలితో పిల్లలు ఏడుస్తున్నా.. ఆంక్షల పేరుతో వారిని పోలీసులు కదలనివ్వలేదు. ఆకలితో మరికొందరు పక్కనే కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోసుకు తిన్నారు.

మహబూబాద్ జిల్లా మరిపెడలో.. రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న ఓ అంబులెన్స్ కలక్వర్ట్కు ఢీకొనింది. ఈ ఘటనలో.. ఒకరు మృతి చెందగా... డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా..బయ్యారం మండలం ఇస్తాళ్లపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు.

విజయవాడలో విద్యుత్ సౌధావద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగులు.. ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకున్నా కూడా... పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు రోడ్లపై బారికేడ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో రెండు వేల మంది పోలీసులతో మోహరించారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తాటికోన గిరిజన విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని నిరసన చేపట్టారు. జగన్ అంకుల్ రోడ్డు వేయించండి ప్లీజ్ అంటూ వేడుకున్నారు. తాటికోన నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పాఠశాల ఉందని స్కూల్కు వెళ్లాలంటే మోకాళ్ల లోతు గుంతలు, దుమ్ము ధూళితో ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. గత వారం ఆటో బోల్తా పడి తమ పిల్లలకు గాయాలయ్యాయని తల్లిదండ్రులు అన్నారు.

మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ జనసేన నేతలు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ గురించి కొడాలి నాని అనుచితంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఆయన్ను హైదరాబాద్ కు తరిమి కొడతామన్నారు. తమ దెబ్బతో కొడాలి హైదరాబాద్ లో శాశ్విత నివాసం ఏర్పాటు చేసుకుంటాడంటూ మండిపడ్డారు. తమ అధినేత నీతి నిజాయితీతో పార్టీ నడుతుంటే, క్యాసినోలు నిర్వహించే కొడాలి తమకు నీతులు చెప్పడమేంటేని విమర్శించారు. వంగవీటి రాధాకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు నోరు విప్పలేదంటూ ఫైర్ అయ్యారు జనసేన నేతలు.

తెలంగాణ సర్కారుతో రేషన్ డీలర్ల చర్చలు సఫలమయ్యాయి. రేషన్ డీలర్లతో మంత్రులు హరీష్, గంగుల కమలాకర్ చర్చలు జరిపారు. కమిషన్ 70 రూపాయల నుంచి 140 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు కరోనా టైంలో చనిపోయి డీలర్ల స్థానంలో కుటుంబసభ్యులకు డీలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభమైంది. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రసంగించారు. మోదీ సర్కార్పై అవిశ్వాసం పెట్టారు... ఇంతకీ విపక్షాల కూటమిలో విశ్వాసం ఉందా? అని ప్రశ్నించారు. ఇండియా ఫుల్ఫామ్ కూడా ఆ కూటమిలోని సభ్యులకు తెలియదని విమర్శించారు. నేను సావర్కర్ కాను.. క్షమాపణలు చెప్పనని రాహుల్ అంటున్నారు.. ఆయన ఎప్పటికీ సావర్కర్ కాలేరని నిషికాంత్ దూబే అన్నారు.

లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ గగోయ్ ఆ చర్చను ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసి వచ్చిందన్నారు. ఇది సంఖ్యా బలానికి సంబంధించినది కాదని, కేవలం మణిపూర్ రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని కోరుతూ తాను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించానని తెలిపారు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని మణిపూర్ రాష్ట్రం కోసం తీసుకొచ్చిందని, మణిపూర్ న్యాయం కోరుతోందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


